Wednesday 31 December 2014

ఒక్క 30 ని.లు

                            ఈ నూతన సంవత్సరం సందర్భంగానయినా ఉదయం,సాయంత్రం ఒక్క 30 ని.లు చొప్పున ఎవరికి వీలయిన సమయంలో వాళ్ళు తమకోసం తాము సమయం కేటాయించుకుని వ్యాయామం చేయాలనే దృఢసంకల్పంతో ఒక 30 ని.లు నడక,ఒక 30 ని.లు ఇతర వ్యాయామం చేయాలని,ఈసంకల్పాన్ని,నిర్విఘ్నంగా కొనసాగించాలని,తద్వారా ధృడంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.క్రమం తప్పకుండా వేగంగా నడవటం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాక,మేలుచేసే కొలెస్టరాల్ పెరిగి,పరోక్షంగా గుండెపనితీరు మెరుగుపడుతుంది.శరీరం వేగంగా కదలటం వల్ల పక్షవాతం దరిచేరదు.మధుమేహం,ఉబ్బసం,కాన్సర్ల ప్రభావం తగ్గుతుంది.నడక వల్ల బరువు తగ్గటమేకాక ఎముకల సాంద్రత పెరిగి ఆస్టియోపొరాసిస్,కీళ్ళనొప్పులు వంటివి దరిచేరవు.   

2015 - నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                  కొంగ్రొత్త ఆశలతో,కోటి దివ్వెల వెలుగుతో నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్ననాబ్లాగ్
వీక్షకులకు,నాతోటి బ్లాగర్లకు నూతనసంవత్సర శుభాకాంక్షలు.ఈ 2015లో అందరికీ తమ ఆశలకు,ఆశయాలకు అనుగుణంగా సంపూర్ణ విజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
                                                                                                       

Tuesday 30 December 2014

తేమ కోల్పోయి చర్మం కళ,కాంతి లేకుంటే.......

                                                             ఒక స్పూను  పెరుగు,ఒక స్పూను మెంతు పొడి.1/2 స్పూను తేనె కలిపి
ముఖానికి రాసుకుని 15 ని.లు తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.తేమ కోల్పోయిన చర్మం తిరిగి తాజాగా కళకళలాడుతూ కాంతివంతంగా మారుతుంది. 

Monday 29 December 2014

అందంగా,ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే.......

                      ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో మెత్తగా చేసుకుని దానిలో 1/4 కప్పు పెరుగు వేసి ఒకసారి త్రిప్పాలి.అప్పుడు చిక్కటి పేస్ట్ తయారౌతుంది.ఒక 15 ని.లు నాననిచ్చి ఈమిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ కాప్
పెట్టుకోవాలి.20 ని.లు తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే జుట్టు అందంగా,     ఆరోగ్యంగా  పెరుగుతుంది.చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

Sunday 28 December 2014

తాజాగా .......

                                      తరచూ చల్లని నీళ్ళతో ముఖం కడుగుతూ ఉంటే తాజాగా ఉంటుంది.చర్మం మెరుస్తూ
కాంతివంతంగా ఉంటుంది.

మునగాకుతో ఆవిరి కుడుములు

బియ్యం రవ్వ - 2 కప్పులు
 నీళ్ళు - 5 కప్పు
 మునగాకు - మూడు కప్పులు
 ఉప్పు - 1 1/2 స్పూనులు
 పెసరపప్పు - 5 స్పూనులు
 శనగపప్పు - 5 స్పూనులు
  పచ్చి కొబ్బరి - 5 స్పూనులు
  జీరా - 2 స్పూనులు
  నూనె- 2 స్పూనులు
   ఆవాలు - 1/2 స్పూను
   కరివేపాకు - కొంచెం
                                                    బాండీలో నూనె వేసి ఆవాలు,జీరా,కరివేపాకు వేసి వేగనివ్వాలి.అందులో శనగపప్పు,పెసరపప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి,మునగాకు వేసి అటుఇటు తిప్పి నీళ్ళు,ఉప్పు వేసి మూత పెట్టాలి.పొంగు వచ్చిన తర్వాత రవ్వ వేయాలి.ఉండ కట్టకుండా త్రిప్పాలి.సన్నని మంటపై 5 ని.లు మగ్గనివ్వాలి.బాగా రవ్వ దగ్గరపడిన తర్వాత చల్లార్చి కుడుముల్లాగా చేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి,ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి 10 ని.లు ఆవిరిపై వండితే రుచికరమైన మునగాకు ఆవిరి కుడుములు తయారవుతాయి.నచ్చిన చట్నీతో తినవచ్చు.  

చేమ ఆకు పప్పు

                                                       చేమదుంపలు కొనుక్కొచ్చి ఒక్కొక్కసారి వండటానికి వీలుపడకపోతే వాటిని   నిల్వఉన్నాయనో,ఎండిపోయినాయనో బయట పడేస్తుంటాము.అలా పడేయకుండా వాటిని భూమిలో పెడితే చక్కగా మొక్కలు వచ్చి ఆకులు అందంగా ఉంటాయి.ఈ మొక్కలు అందంగానూ ఉంటాయి.ఈఆకులు పప్పులో వేసుకుంటే చాలా  రుచిగా ఉండటమే కాక ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి.ఒకకప్పు కందిపప్పులోఒకఉల్లిపాయ,మూడు పచ్చిమిర్చి,రెండు చేమ ఆకులు,ఒక టొమాటో,కొద్దిగా చింతపండు చేర్చికారం,ఉప్పు, సరిపడా నీళ్ళుపోసి కుక్కర్లో మెత్తగా ఉడికాక కరివేపాకు,కొత్తిమీర,వెల్లుల్లి రెబ్బలు,తాలింపు దినుసులు వేసి కొంచెం నెయ్యి,కొంచెం నూనెతో తాలింపు పెడితే చాలా రుచిగా ఉంటుంది.
                     కొద్దిరోజుల తర్వాత భూమిలో చేమదుంపలు తయారవుతాయి.కుండీలో కూడా పెట్టుకోవచ్చు.

Saturday 27 December 2014

పిత్త పరిగెలు

                                           వసుమతీ దేవి గారి ఇంట్లో వంటమనిషి ఒకరోజు ఆలస్యంగా వచ్చింది.అమ్మా!ఈరోజు
కొంచెం ఆలస్యమైంది ఏమీ అనుకోకండి.మా ఆయన పిత్తపరిగెలు తెచ్చాడు.అవి బాగుచేసి కూర వండి వచ్చేసరికి ఆలస్యమైందిఅని చెప్పింది.చిటికెలో మీకు వంట చేస్తాను అలా కూర్చుని కబుర్లు చెప్పండి అనగానే పిత్తపరిగెలు అంటే ఏమిటో చెప్పు?అన్నారు.అంటే చిన్నచిన్న పిల్ల చేపల్నిమేము పిత్తపరిగెలు అంటాము.వాటిని శుభ్రం చేసి పులుసు పెట్టాను.మాఆయనకు అవంటే చాలా ఇష్టం.మేము ముల్లు తీయకుండా అన్నంలో కలిపి నమిలేస్తాము అంది.ముల్లుతోపాటు నమిలేస్తే గుచ్చుకుంటుంది కదా!అంటే వాటిని ముల్లుతోసహా తింటేనే రుచిగా  ఉంటుంది.అలవాటైతే గుచ్చుకోవు.మాకు చిన్నతనం నుండి అలవాటైపోయింది అని లొట్టలేస్తూ చెప్పింది.  

తానంటే తందానా

                                          సౌరబ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నపిల్లలు ఎప్పుడన్నా పొద్దెక్కి నిద్రలేస్తే బారెడు పొద్దేక్కేదాకా నిద్రపోవటమేమిటి?అసలు పొద్దుపోయేదాకా సినిమాలు చూడటమేమిటి?అని రంకె లేసేవాడు.తన పిల్లలు పెద్దయ్యేసరికి వాళ్ళు తానంటే తందానా అనటం మొదలుపెట్టాడు.ఏసినిమా సీడీ కావాలంటే అది తెచ్చివ్వటం వాళ్ళు తెల్లవారుఝాము 4 గం.ల వరకూ సినిమాలు చూడటం,తర్వాత రోజు 12 గం.లకు నిద్రలేస్తున్నా అదేమని అడగకుండా చూసీచూడనట్లుగా ఊరుకోవటం అలవాటైపోయింది.అన్నపిల్లలేమో కొంచెం ఆలస్యమైనా మమ్మల్నైతే మాట్లాడేవాడు ఇప్పుడు తనపిల్లలు 12 గం.ల వరకూ పడుకున్నా ఏమీ అనటంలేదు.తనకో న్యాయం ఎదుటివాళ్ళకో న్యాయమా? అలా ఊరుకోవటానికి వీల్లేదు అంటూ వాళ్ళనాన్న దగ్గర సణగటం మొదలెట్టారు.వాళ్ళ నాన్నేమో ఎవరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.గిల్లికజ్జాలు ఎందుకు?అలా అనటం వల్ల మీకు మంచే జరిగింది కదా! ఇక ఆవిషయం వదిలేసి మీ భవిష్యత్ ప్రణాళికలు గురించి ఆలోచించండి అని చెప్పారు.

శీతాకాలంలో వెల్లుల్లి

                                 శీతాకాలంలో వెల్లుల్లి ఎంత వాడితే అంత మంచిది.జలుబు,దగ్గు దరిచేరకుండాఉంటుంది.
ఒక స్పూను తేనెలో ఒక వెల్లుల్లి రెబ్బని ముంచి నమిలి తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.వెల్లుల్లి రెబ్బ పైపొట్టు
తీసి వేడివేడి అన్నంలో పెట్టి కొంచెంసేపు తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది.రక్తపోటు నియంత్రణలో వుంటుంది. 

Friday 26 December 2014

ఒత్తిడి తీవ్రంగా ఉంటే ..........

                                           ప్రతిచిన్నదానికి అరిచేయడం,చిరాకు పడటం,ఏచిన్నశబ్ధమైనా అతిగా స్పందించటం,
బాగా అలిసిపోవటం,తలచు తలనొప్పి,మెడ,వీపు నొప్పులు,వికారంగా వుండటం,పొట్టలో అసౌకర్యం,ప్రతి చిన్నదానికి అతిగా బాధపడటం,ఇలాంటివన్నీ ఒత్తిడికి గురవుతున్నామన్నదానికి సంకేతాలు.వీటిని ముందే గుర్తించి ఒత్తిడి తీవ్రరూపం దాల్చకముందే దానినుండి బయటపడగలగాలి.అదెలాగంటే కాసేపు పచ్చటి చెట్ల మధ్య తిరుగుతూ మనకు ఇష్టమైన సంగీతం వినడం,నవ్వు తెప్పించే సినిమాలు చూడటం,ఇష్టమైన పుస్తకం చదవటం,పొద్దున్నే వ్యాయామం చేయటం,ఇష్టమైన స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పటం,పిల్లలతో సరదాగా గడపటం,ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవటం లాంటి పనులు చేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి నుండి బయటపడగల్గుతాము. 

Thursday 25 December 2014

ఆరాలగత్తె

                              జయంతికి ఆరాలు తీయటం వెన్నతో పెట్టిన విద్య.ప్రక్కింటి విషయాలు,ఎదురింటి విషయాలు,
అన్నీ ఈమెకే కావాలి.మళ్ళీ అవితీసుకెళ్ళి కనిపించిన వాళ్లకల్లా చెప్పనిదే హాయిగా నిద్ర పట్టదు.ఒకరోజు ఎదురింటికి క్రొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది.పది సంవత్సరాల క్రితం కొద్దిపాటి ముఖ పరిచయం.వాళ్ళింటికి వెళ్ళి మీకెంత పొలం ఉంది?అది ఎంత రేటు చేస్తుంది?మీ వారేమి చేస్తున్నారు?మీపిల్లలు ఏమి చదువుతున్నారు?ఎన్నో యక్ష ప్రశ్నలు వేసి ఒక గంట సమయం వృధా చేసింది.ఈమె సంగతి తెలుసు కనుక వాళ్ళు వివరాలు ఏమీ చెప్పలేదనుకోండి అది వేరే విషయం.మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా వేరే ఇంటికి వెళ్ళింది.వాళ్ళు మాకూ బాగా తెలుసు వాళ్ళఇంటివిషయాలన్నీ  నాకు తెలుసుఅని నోటికి వచ్చినట్లు ఏకరువు పెట్టుద్దన్న మాట.అందరి ఇళ్ళకు వెళ్ళి తన పిల్లలు గొప్పవాళ్ళని చెప్పుకోవటం అలవాటయిపోయింది.అమ్మో ఆరాలగత్తె వస్తుంది.ఈమెతో జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది పని 
 ఉన్నట్లు తప్పుకుంటారు.తప్పించుకోవటానికి వీలుపడని వాళ్ళుఆమె వాగ్ధాటికి బలైపోతుంటారు.   

సంపెంగ పువ్వులు (స్వీట్)

                    గోధుమ పిండి - 3 కప్పులు
                    బొంబాయి రవ్వ - 1 కప్పు
                     పంచదార -8 కప్పులు
                      డాల్డా - 1 కప్పు
                       నూనె -  వేయించడానికి సరిపడా
                            గోధుమ పిండి,బొంబాయి రవ్వ జల్లించి దానిలో డాల్డా వేసి కలిపి అవసరమైనన్ని నీళ్ళు పోసి పిండి గట్టిగా కలపాలి.తడి వస్త్రం కప్పి ఒక అరగంట నాననివ్వాలి.తర్వాత కొంచెం పిండి తీసుకుని మొగ్గలాగా చేసి
దాన్ని గీతలు పెట్టి సంపెంగ పువ్వు రేకల్లా చేయాలి.కొన్ని చేసి ఒక ప్లేటులో పెట్టుకుని కాగే నూనెలో వేసి ఎర్రగా
కరకరలాడేలా వేయించాలి.అన్నీ ఇలాగే చేయాలి.1,2 ఆకారం రాకపోయినా అచ్చు సంపెంగ పువ్వు లాగా ఉంటాయి.
పంచదారలోనీళ్ళు పోసి తీగపాకం రానిచ్చి వీటన్నింటిని వేసి త్రిప్పాలి.తిప్పిన తర్వాత ఒకపెద్ద ప్లేటులో పోస్తే ఆరిపోయి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి.
గమనిక :ఈ పువ్వులు చెయ్యటం కుదరకపోతే కొంచే పిండిని చపాతీలాగా చేసి చాకుతో గీతలు పెట్టి అటుచివర,ఇటుచివర మెలిత్రిప్పి నూనెలో వేయించి పాకం పట్టాలి.. 

Wednesday 24 December 2014

చక్కటి వ్యాయామం

                                            రోజూ ఉదయం,సాయంత్రం నీరెండలో పచ్చటి చెట్లమద్య నడవటం,తోటపని చేయడం
చక్కటి వ్యాయామం.పచ్చటి చెట్ల మధ్య గడపటం వల్ల మనసు కెంతో ప్రశాంతంగా ఉండటమే కాక,ఉదయం సాయంత్రం నీరెండలో పని చేయటం వల్ల శరీరానికి విటమిన్ "డి" లభిస్తుంది.దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.స్వచ్చమైనగాలి,ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.అదీకాకమొక్కలకు నీళ్ళు పట్టటం,ఎండిన ఆకులు తీసేయడం,ఎప్పటికప్పుడు మొక్కలను కత్తిరించడంవంటి పనులు చేయటం వల్ల కాలొరీలు ఖర్చయి అధిక బరువు తగ్గుతారు. మనం పెంచుకున్న మొక్కలు,చెట్లు పువ్వులు పండ్లు ఇస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది.సంతోషమే సగం బలం.సంతోషంగా ఉంటూ ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఉంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. 

Tuesday 23 December 2014

దగ్గుకి ఔషధం

                                అల్లం పదిచిన్నచిన్న ముక్కలు తీసుకుని 3 కప్పుల నీటిలో ఇరవై ని.లు మరిగించాలి.కాస్త చల్లారాక ఒక స్పూను తేనె కలపాలి.దీనిలో ఒక నిమ్మకాయ రసం పిండాలి.బాగా ఘాటుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కలపాలి.రెండు పూటలు దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.ఇది దగ్గుకి మంచి ఔషధం.

తాగితే మనిషి ప్రవర్తన

                                              సరస్వతి భర్త ముఠా మేస్త్రి.సాయంత్రం రోజూ తాగేసి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు.పిల్లలమొహాలు చూచి ఎన్ని భాధలు పెట్టినా ఓర్చుకునేది.ఒకసారి బాగా తాగి ఇంటికి వచ్చి సరస్వతిని నానా మాటలు అని,కొట్టి ఆమైకంలో ఏమి చేస్తున్నాడో కూడా ఒళ్ళు తెలియని స్థితిలో చెయ్యి పట్టుకుని ముంజేతిని మెలితిప్పేశాడు.సరస్వతికి మొదట ఏమీ అర్ధం కాలేదు.ముంజేయి వేలాడిపోయిండి.ఎదిరించడానికి తగిన శక్తి లేక ఏడవటం మొదలుపెట్టింది.కాసేపటికి తలకెక్కిన మత్తు దిగి భార్య చెయ్యి వాచిపోయేసరికి మందుబిళ్ళ తెచ్చి వేశాడు.తర్వాత రోజు వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.ఎముక విరిగి లోపల నుజ్జు నుజ్జు అయింది.వెంటనే అయితే ఏమైనా చేయగలిగేవాళ్లము.ఇప్పుడు ఏమీ చేయలేము అని చెప్పారు.పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నాఇంకా అర్ధం చేసుకోకుండా తాగి కొట్టడం, పిచ్చిచేష్టలు ఎక్కువయ్యాయని విసుగొచ్చికన్నవారింటికి వెళ్ళిపోయి నాటు వైద్యం చేయించుకుంది.ఎముక సరిగ్గా అతకక ఇప్పటికీ పని ఎక్కువైతే నొప్పివస్తుంటుంది.భార్య దగ్గరకు వెళ్ళి బ్రతిమాలి,ఇంక తాగనని ఒట్లు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు.వచ్చింది కానీ సరస్వతి భర్తకు అన్నం కూడా పెట్టకుండా మాట్లాడటం మానేసింది.ఒక నెల పెద్దగా మార్పు లేదు కానీ తర్వాత తనంతట తానే తాగటం మానేశాడు.భార్యాబిడ్డలను బాగా చూచుకుంటాడని నమ్మకం కుదిరిన తర్వాత సరస్వతి మామూలైంది.అసలు మారతాడనుకోలేదు. నాచెయ్యి విరిచేస్తే కానీ మాఆయనకు జ్ఞానోదయమవలేదు.తాగితే మనిషి ప్రవర్తన ఎలాగుంటుందో నాకు మాఆయన సినిమా చూపించాడు అని సరస్వతి తెలిసినవాళ్ళకు చెప్తూఉంటుంది.          

Monday 22 December 2014

సతీ సమేతంగా

                                                    సతీసమేతంగా ఎక్కడకు వెళ్ళినా బాగానే ఉంటుంది.కానీ కొన్ని సందర్భాలలో ఇరువురికీ ఇబ్బందికరంగా ఉంటుంది.ఈమధ్య శంకర్ ప్రతిదానికి అవసరం ఉన్నా లేకున్నా భార్యను వెంటబెట్టుకుని
వెళ్ళటం మొదలుపెట్టాడు.అమ్మను తీసుకు వెళ్ళాల్సిన చోటుకు కూడా అమ్మను తీసుకెళ్ళకుండా,అమ్మపుట్టింటి వారింటికి కూడా భార్యను వెంటేసుకుని వెళ్తుంటే అమ్మను తీసుకురాలేదేంటి?అని ఎవరైనా అడిగితే అమ్మ రాలేనంది అని కథలు చెప్పటమో,మాట దాటవేయటమో చేస్తున్నాడు.అదేంటి శంకర్ అమ్మని,పిల్లల్ని తీసుకురాకుండా  మీ ఇద్దరే రావటమేమిటి? నువ్వేమీ మొయ్యాల్సిన అవసరం లేదుగా కారులో వస్తూ కూడా లింగు,లిటుకు అంటూ ఇద్దరూ వచ్చారు.ఇప్పుడే వెళ్ళి తీసుకురా?అని ఒక పెద్దావిడ చివాట్లేసింది.తర్వాత చచ్చినట్లు ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాడు.ముందే తీసుకెళ్తే బాగుండేది కదా! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే భార్యకు వాళ్ళిద్దరే వెళ్ళాలనే వింతకోరిక పుట్టిందట.అది భర్తగా శంకర్ శిరసావహిస్తున్నాడు.వెళ్ళాలనుకుంటే ఒక పదిరోజులు వాళ్ళిద్దరే ఎక్కడైనా గడిపిరావచ్చు.ఇదేమి వింత కోరికో?అని పెద్దావిడ అందరికీ పనిగట్టుకుని చెప్పింది.  

చలికాలంలో చర్మంపొడిబారకుండా..........

                                       పెరుగు మీద మీగడ తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు,కాళ్ళకు,వీలైతే శరీరమంతా చర్మం లోపలకు ఇంకే విధంగా సాయంత్రం కానీ,రాత్రికానీ రాయాలి.ఒకసారి రాసినతరవాత మళ్ళీ ఇంకొకసారి పైపైన చర్మం పైన రుద్దితే పూర్తిగా లోపలకు ఇంకుతుంది.తర్వాత శనగపిండితో స్నానం చేస్తే జిడ్డు లేకుండా ఉంటుంది.ఇలా చేయడం వల్ల చర్మం ఉదయానికి మెత్తగా,మృదువుగా అవుతుంది.కనీసం వారానికి 2 సార్లన్నా ఇలా చేయగలిగితే చలికాలంలో  చర్మం పొడి బారకుండా ఉంటుంది.
గమనిక : పెరుగు మీద మీగడ ఎంత మంచిదయితే చర్మం అంత మృదువుగా ఉంటుంది.

రోగనిరోధశక్తి పెరగాలంటే......

                                           తరచూ ఎన్నో పోషక విలువలు కలిగిన మినప్పప్పుతో చేసిన పిండివంటలు తినటంవల్ల క్రమంగా వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.ఈపప్పులో ఇనుము ఎక్కువగా ఉండటంవల్ల దీనితో తయారు చేసిన ఏ పదార్ధం తిన్నా తక్షణ శక్తి వస్తుంది.

Sunday 21 December 2014

మొటిమలు రాకుండా ఉండాలంటే ......

                      ఒక టేబుల్  స్పూను పచ్చిపాలు తీసుకుని,ఒక టీ స్పూను తేనె,చిటికెడు పసుపు తీసుకుని బాగా కలిపి దీన్ని మునివేళ్ళతో ముఖానికి,మెడకు రాయాలి.ఆరాక కడిగేయాలి.వారానికి 3 సార్లు ఈ పాక్ వెయ్యటంవల్ల
మొటిమలు రాకుండా ఉంటాయి.దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది.అదేమిటంటే పచ్చిపాలు కలపటం వల్ల
ముఖం మీద ముడతలు కూడా రాకుండా ఉంటాయి.

వంశపారంపర్యం

                                                         పిల్లలు తల్లిదండ్రుల నుండి,తాతముత్తాతల నుండి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిపాస్తులకు వారసులమై భోగభాగ్యాలను అనుభవించాలని కోరుకుంటున్నారు. కానీ వశపారంపర్యంగా వచ్చే
వ్యాధులు కూడా అనుభవించాల్సిందే అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఈరోజుల్లోఆస్తిపాస్తులంత తేలిగ్గా వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయి.ఇంతకు ముందు తెలిసేదికాదు ఇప్పుడు పెద్దలకు ఫలానా వ్యాధి ఉంది కనుక తమకు కూడా రావచ్చు అన్న అవగాహన ఏర్పడుతుంది.వైద్యులు కూడా ఈవ్యాధి మీపూర్వీకులు ఇచ్చిన బహుమతి అని జోక్ చేస్తున్నారు.ఎవరైనా ఇది నాకే రావాలా? అని తిట్టుకుంటే ఒరే ఆస్తులు తినగా లేనిది రోగం వస్తే అంత బాధ పడటమెందుకురా?అని పెద్దవాళ్ళు కూడా చివాట్లు పెడుతున్నారు.ఇదండీ ప్రస్తుతం వంశపారంపర్యాల గోల.

బుగ్గలు జారినట్లు లేకుండా ఉండాలంటే.......


                       కొంత వయసు వచ్చిన తర్వాత బుగ్గలు క్రిందికి జారినట్లుగా ఉంటాయి.అలా లేకుండా చర్మం బిగుతుగా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొన,చిటికెడు పసుపు,4 చుక్కల నిమ్మరసం మిక్సీలో వేసి బాగా నురగ వచ్చేలా చేయాలి.ముందుగా ముఖాన్నిశుభ్రంగా కడిగి ఫేస్ పాక్ బ్రష్షుతో ఆరగా ఆరగా 3సార్లు వేసి టిష్యూపేపరు అతికించాలి.మళ్ళీ టిష్యూపేపరుపై 2 సార్లు వేయాలి.చర్మం లోపలకు ఇంకాలంటే 20 ని.లు తప్పనిసరిగా ఉంచాలి.టిష్యూ పేపరు అంటించటం వల్ల తేలికగా వచ్చేస్తుంది.తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి.చల్లటి నీటితో కడిగితే వాసన వస్తుంది.ఈవిధంగా మొదట్లో వారానికి 3 సార్లు చేస్తే ఫేషియల్ చేయించినట్లుగా ఉంటుంది.తర్వాత వారానికి ఒకసారి చేస్తే బుగ్గలు జారినట్లుగా లేకుండా చర్మం బిగుతుగా మారి ముఖం అందంగా ఉంటుంది.     

Saturday 20 December 2014

చర్మానికి చక్కని రంగు

                                                    టేబుల్ స్పూను తేనెకు 1/2 స్పూను నిమ్మరసం,1/4 స్పూను పసుపు కలిపి ముఖానికి,మెడకు పట్టించాలి.ఆరాక కడిగేయాలి.ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ ,మచ్చలు లేకుండా చర్మం చక్కని రంగుతో నిగారింపుగా కాంతులీనుతూ ఉంటుంది.

జీర్ణాశయం శుభ్రపడాలంటే.........

                                            చిన్నకప్పు మినప్పప్పుకు ఒక గ్లాసు నీళ్ళు చేర్చి పప్పు ఉడికించి నీటిని వార్చి గోరువెచ్చగా అయినతర్వాత ఆనీటిని త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది.జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం.

Friday 19 December 2014

పెసరపిండి చక్రాలు

ఛాయ(పొట్టు లేనిది) పెసరపప్పు పిండి - 250 గ్రా.
బియ్యం పిండి - 400 గ్రా.
నూనె - తగినంత
వెన్న- 60 గ్రా.
కారం - 1 స్పూను
వాము పొడి - 3/4 స్పూను ఉప్పు -తగినంత
కరివేపాకు రసం -సగం కన్నా తక్కువ కప్పు
నీళ్ళు - తగినన్ని
బేకింగ్ పౌడర్ - చిటికెడు
                                               పెసర పిండి,బియ్యం పిండి కలిపి దానిలో ఉప్పు,కారం,వాము పొడి,కరివేపాకు రసం,బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి నీళ్ళు పోసి బాగా కలిపి గట్టి ముద్ద చేయాలి.ఒక గంటసేపటి వరకు తడి వస్త్రం కప్పి ఉంచాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత చక్రాల గిద్దలలో పిండి పెట్టి కారప్పూస వత్తుకుని బగరు రంగులోకి వచ్చేవరకు వేయించి తీస్తే ఛాయ పెసర పిండితో చక్రాలు రెడీ.

Thursday 18 December 2014

ఇడ్లీ - రకరకాలు

                             పిల్లలు ఇడ్లీ తినటానికి ఇష్టపడరు.ఈవిషయంలో నిర్మొహమాటంగా వద్దు అని చెప్పేస్తుం టారు.
అందుకే కొన్నిరకాల ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసుకుందాము.మామూలు ఇడ్లీ అయితే మినప్పప్పు- 1,ఇడ్లీరవ్వ-2
వేస్తాము.ఈపిండి తోనే రకరకాలు చెయ్యొచ్చు.అదెలాగంటే మామూలు గానే ఇడ్లీ వండేయాలి.
1)ఇడ్లీని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఉప్పు,సంబారుకారం(ఇంత ముందు పోస్ట్ లో ఎలా చేసుకోవాలో ఉంది) వేసి ఇడ్లీ ముక్కలు వేసి వేయించాలి.
2)మనకు అవసరమైనన్ని ఇడ్లీలను చిన్నగా చేతితో పొడిగా చేయాలి.స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి తాలింపు వేసి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేయించి కారట్ తురుమువేసి 2 ని.లు వేయించి ఇడ్లీలు పొడి వేసి సరిపడా ఉప్పు వేసి ,కొద్దిగా నిమ్మరసం కలపాలి.నిమ్మరసం నచ్చకపోతే ఉల్లి ముక్కలతోపాటు,టొమాటో ముక్కలు వేసుకోవచ్చు.ఇడ్లీ ఉప్మా రెడీ.
3 )ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి,కొత్తిమీర తరుగు కలిపి ఇడ్లీ వేస్తే కొత్తిమీర ఇడ్లీ తయారౌతుంది.
4)ఇడ్లీ పిండిలో కారట్ తురుము వేసి ఇడ్లీ వేస్తే కారట్ ఇడ్లీ రెడీ.
5)చిన్నపిల్లలకు కొద్దిగా పంచదార,నెయ్యి అద్ది పెట్టవచ్చు.
6)కొద్దిగా సంబారు కారం,వేడి నెయ్యి కలిపి వేడిగా ఇడ్లీ తింటే చాల రుచిగా ఉంటుంది.
7)ఇవే కాక 1-  మినప్పప్పు,2 - జొన్నరవ్వ వేసి జొన్నరవ్వ ఇడ్లీ వెయ్యవచ్చు.మినప్పప్పు 4 గా లు నానబెట్టి మిక్సీలో వేసి రుబ్బి పిండిలో 10 ని.లు నానబెట్టి కడిగిన జొన్నరవ్వను కలిపి రాత్రిపూట పులవనిచ్చి ఉదయం  ఇడ్లీ పిండి మాదిరిగానే ఇడ్లీ వేసుకుని వేడిగా మన ఇష్టం వచ్చిన చట్నీతో తినవచ్చు.
చిట్కా :ఇడ్లీ పిండి మిగిలితే వృధాగా పడేయకుండా కొంచెం మైదా కలిపి ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి నూనెలో పునుగులు వేసుకుంటే మెత్తగా,రుచిగా ఉంటాయి.ఇష్టమైతే కొంచే బొంబాయి రవ్వ వేస్తే కరకరలాడుతాయి.



































Wednesday 17 December 2014

పులిహోర పిండి

బియ్యపు రవ్వ -1 కప్పు
నీళ్ళు - 2 కప్పులు
ఉప్పు - తగినంత
మామిడి కోరు (లేక)చింతపండు పులుసు (లేక)నిమ్మరసం
తాలింపుకు:ఆవాలు,మినప్పప్పు,జీడిపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి,ఎండు మిర్చి
                                         ఒకగిన్నెలో నీపోసి మరిగించి ఉప్పు,బియ్యపు రవ్వ ఉడకబెట్టాలి.తర్వాత తాలింపు పెట్టి దినుసులు వేసి వేగాక పచ్చి మిర్చి,కరివేపాకు వేసి మామిడి కోరు అయితే కొంచెం వేయించాలి.చింతపండు పులుసు  అయితే చిక్కగా ఉడకబెడతాము కనుక తాలింపులో ఒకసారి త్రిప్పి ఉడికించిన రవ్వలో కలిపి వేయవచ్చు.        నిమ్మరసం అయితే ఉడికించిన రవ్వలో కలిపి తాలింపు వేసుకోవచ్చు.ఏరకంగా చేసినా బాగుంటుంది. 

Tuesday 16 December 2014

ఉసిరి - పచ్చిమిర్చి

                                  ఉసిరికాయలు - 1 డబ్బా
                                  పచ్చిమిర్చి - 1/4 కే.జి
                                  ఉప్పు - కొంచెం తక్కువ కప్పు
                                   పసుపు - కొంచెం
                                    జీరా పొడి,మెంతు పొడి కలిపి - 1 కప్పు
                                                          ఉసిరికాయలు కడిగి,తడి లేకుండా తుడిచి ఆరనివ్వాలి.ఉసిరికాయల్ని
పొడవు ముక్కలుగా చేయాలి.జీరా,మెంతులు వేయించి పొడి చేయాలి.పచ్చిమిర్చి నిలువుగా చీల్చాలి.ఇవన్నీ కలిపి మూడురోజులు రోజూ కలుపుతూ ఉంటే పాడవకుండా ఉంటుంది.పచ్చి మిర్చి కి పులుపు పట్టి రుచిగా ఉంటుంది.ఉసిరి ముక్కలకు కారం పట్టి ముక్క బాగుంటుంది.ఇష్టమైన వాళ్ళు కొంచెం నూనె కలుపుకోవచ్చు.

భూమ్మీద నూకలుండి బ్రతకటం

                             యశోధర్ గారు పెద్ద పేరుమోసిన వైద్యుడు.డెబ్బై సవత్సరాల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటారు.ఆయన హస్తవాసి అంటే ఉన్న నమ్మకంతో ఇప్పటికీ ఆయన ఆసుపత్రి కిటకిటలాడి పోతుంటుంది.ఒకరోజు స్నేహితుడిని పరామర్శించటానికి వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న దారి నుండి వస్తున్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.ముందు మాములుదే అనుకున్నాఅధిక చెమటలు పట్టేసరికి గుండె నొప్పి లక్షణాలని అర్ధం చేసుకుని
వెంటనే ఆసుపత్రికి ఫోనుచేసి వాహనాన్ని పంపమని కారులోనే పడుకున్నారు.ఇంతలో ఎవరో అటుగా వెళ్తుంటే సొమ్మసిల్లకుండా నీళ్ళు అడిగి త్రాగారు.అడపాదడపా తప్ప ఆదారిలో వాహనాలు కూడా రావు.వెంటనే ఫోను చేసినా రోగుల్ని తీసుకెళ్ళే వాహనం రావటానికి గంట పట్టింది.ఆసుపత్రికి వెళ్లేసరికి ఒక్క 5 ని.లు ఆలస్యమైతే వైద్యులు వెళ్ళి పోయేవాళ్ళు.వెంటనే పరీక్షలన్నీ చేసి అత్యవసరంగా గుండెకు వెళ్ళే రక్తనాళం మూసుకుపోయిందని ఆపరేషను చేయటంవల్ల బ్రతికారు.5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి తీవ్ర గుండెనొప్పి వచ్చింది.మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేయవలసి వచ్చింది.ఇంతకీ ఆయనకు ముందస్తుగా ఏ లక్షణాలు బయటపడలేదు.అదీ ఆయన వైద్యుడు కనుక తీవ్ర గుండేనొప్పి అని తెలుసుకోగలిగారు.సామాన్యులు అది తెలుసుకోలేరు కనుక చనిపోయేవాళ్ళు.ఆరోగ్యంగా ఉన్నా ప్రతి సంవత్సరం ఆరోగ్యపరీక్షలు చేయించుకోవటం తప్ప వేరే దారిలేదు.ఎంత వైద్యులైనా 5 ని.లు ఆలస్యమైనా  ప్రాణం పోయేది.ఆయనకు భూమ్మీద ఇంకా నూకలుండి సమయానికి వైద్యం అంది బ్రతకటం జరిగింది.      

Monday 15 December 2014

కేటుగాడు

                                       కిట్టు పెద్ద కేటుగాడు.అందర్నీ ఏదోరకంగా మోసంచేసి ఎలాగైతే రెండంతస్తుల ఇల్లు కట్టాడు.క్రింద అమ్మానాన్నా,మొదటిదానిలో కిట్టు,రెండవదానిలో కొడుకు ఉంటారు.కిట్టుని మించిన కేటుగాడు కొడుకు.అమ్మ,భార్యఏదైనా పని చేయమన్నప్పుడు పైన ఉన్నప్పుడు భార్య మాట విన్నట్లుగా భార్య చెప్పినదే వేదంలా చేస్తాడు.క్రిందికి వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట విన్నట్లుగా అమ్మ మాట జవ దాటని వాడిలాగా నటిస్తాడు.ఇద్దరి దగ్గర మంచివాడిననిపించుకోవటానికి ఎన్ని వేషాలు వెయ్యాలో అన్ని వేషాలు వేస్తాడు.చివరికి ఇద్దరి మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు.ఏదో ఒకసారైతే ఎవరైనా సర్దుకోగలరు కానీ ఎల్లప్పుడూ సర్దుకోలేరు కదా!అందుకే ఇద్దరూ కలిసి కిట్టుని కేటుగాడని అర్ధం  చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. 

Sunday 14 December 2014

మనుసు

                                    రాజ్యశ్రీ కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది.ఆఊరిలో కొన్నిపదాలు వేరేగా పలుకుతారు.
అది చలికాలం.అత్తగారింట్లో తెల్లవారుఝామునే అందరూ లేచే అలవాటు.అందరూ ఎవరిపనులు వాళ్ళు హడావిడిగా  చేసుకుంటుంటే తను నిద్రపోవటం బాగుండదని తప్పనిసరిగా లేచి వరండాలోకి వచ్చింది.ఇంతలో వాళ్ళ అత్తగారు కనిపించి ఆరుబయట బాగా మనుసు పడుతోంది కానీ ఇప్పటినుండి మనుసులో ఎందుకు తిరగటం?కాసేపు పడుకో అన్నారు.రాజ్యశ్రీకి మొదట మనుసు పడటమేమిటో అర్ధం కాలేదు.అడగటం బాగుండదు కదా!అందుకని ఆరుబయట మనుసు పడుతుంది అంటే మంచు కురుస్తోంది కాబోలు అని అర్ధం చేసుకుంది.తర్వాత భర్తనడిగి తన తన సందేహాన్ని నివృత్తి చేసుకుంది.

Saturday 13 December 2014

టన్ను బరువు

                                                మాన్య ఈమధ్యనే ఇల్లు కట్టుకుని క్రొత్త ఇంట్లోకి వచ్చింది.ఇంటినిండా ఎక్కడనుండి  వస్తున్నాయో కానీ ఎటు చూసినా అన్నీ నల్లచీమలే.ఏవస్తువు పెట్టినా నిమిషాల్లో చుట్టుముట్టేస్తున్నాయి.తీపి వస్తువులైతే సెకన్లలో వచ్చేస్తాయి.ఈచీమలేంటో విచిత్రంగా కాళ్ళు పైకి లేపి వేగంగా నడుస్తున్నాయి.మాన్య తులసి మొక్కకు పూజచేసి మిశ్రీబిళ్ళలు అంటే పటికబెల్లం చిప్స్ పెట్టడం అలవాటు.పెట్టినవి నిమిషాల్లో మాయమై పోతున్నాయి.ఖాళీ ప్లేటు ఉంటుంది.ఇది ఎలా సాధ్యం?అని ఒకరోజు అక్కడే కూర్చుంది.తన ముందే చీమల దండు లాగా వచ్చి4,5చీమలు కలిసి ఒక్కొక్క బిళ్ళను టన్ను బరువు లాగుతున్నట్లుగా వేగంగా లాక్కెళ్ళి ఒక్కొక్కదాన్ని నీళ్ళు వెళ్ళటానికి పెట్టిన రంద్రంలో భద్రపరిచినాయి.వాటిని చూస్తే మాన్యకు ముచ్చటేసింది.అంత చిన్న చీమలు అంతపెద్ద బిళ్ళను తమ శక్తికి మించి మోసుకెళ్ళి ముందుచూపుతో దాచుకున్నాయంటే మనం వాటిని చూచి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉందనిపించింది.రూపాయి ఉంటే ఏదో ఒకటి అవసరం లేకపోయినా అనవసరంగా కొని ఖర్చుపెట్టేస్తాం.వాటిలాగా పూర్తిగా కాకపోయినా కొంతైనా పొదుపుగా దాచుకుంటే భవిష్యత్తులో కొన్ని మంచిపనులు చేయటానికి ఉపయోగపడతాయని అనిపించింది..  

కొర్ర కిచిడీ

కొర్ర బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1/2 కప్పు
కందిపప్పు లేదా ఎర్రపప్పు - 1/2 కప్పు
కారట్ ముక్కలు  - 1/2 కప్పు
తరిగిన బీన్స్-1/2 కప్పు
ఉల్లిపాయ - 1
మిర్చి - 2
పాలకూర - 1 కట్ట
పల్లీలు - 10 గ్రా.
ఉప్పు - తగినంత
ఆవాలు - 1 టీ స్పూను
జీరా - 1 టీ స్పూను
కరివేపాకు - కొంచెం నీళ్ళు - 6 కప్పులు (1:3)
                                                                కొర్రబియ్యం అరగంట నానబెట్టాలి.కారట్,బీన్స్,ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.పాలకూర తరగాలి.బాండీలో నూనె వేసి కాగిన తర్వాతపల్లీలు,ఆవాలు,జీరా,కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.ఆతర్వాత కారట్,బీన్స్ వేసికోమ్చెం మగ్గిన తర్వాత పాలకూర వేయాలి.1ని.తర్వాత 6కప్పుల నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి కడిగి నానబెట్టిన కొర్రబియ్యం,పప్పులువేసి ఉడికించాలి.ఇగిరిన తర్వాత దించేయాలి.టొమాటో రసంతో తింటే రుచిగా ఉంటుంది. 

Friday 12 December 2014

బుడతడు

                                        తాన్య కొడుకు మూడు సంవత్సరాల బుడతడు.వాడికి ఎన్ని తెలివితేటలో.అన్ని పనులు ఒక పుట్టలో పెడితే వెయ్యి పుట్టల్లోకి వచ్చేట్లుగా చేస్తుంటాడు.వయసుని మించి మాట్లాడుతుంటాడు.ఇటీవలే వాడికి ఒక చెల్లి పుట్టింది.వాడికి ఒక్కడికే చెల్లి ఉన్నట్లు ఎవరినీ దగ్గరికి రానీయడు.ఈ ఇద్దరితో సతమతమైపోతూ తన గురించితాను పట్టించుకోవటానికి కుదరటం లేదని  తాన్య పార్లర్ నుండి ఇంటికి ఒకమనిషిని పిలిపించుకుంది.ఏపని చేసినా ఎందుకు?ఏమిటి ?అంటూ యక్ష ప్రశ్నలు వేస్తుంటాడు.అలాగే అడుగుతుంటే ఫేస్ పాక్ వేయించుకోవటానికి ఒకామెను రమ్మన్నానని చెప్పింది.ఆమె ఒక 1/2 గం.కు వచ్చింది.ఆమె ఎవరూ ?ఏంటి?అని చెప్పకుండానే అమ్మా!పేస్ ప్యాక్ ఆంటీ వచ్చిందోచ్ అంటూ కేకలు పెట్టి వచ్చేవరకు ఊపిరాడనివ్వలేదు.బుడతడికి ఫేస్ పాక్ అంటే  అర్ధం తెలిసినట్లుగా హడావిడి చేశాడు వాడికి ఫలానా అని చెప్పక్కర లేదు తెలివి గలవాడు అని వాడి నానమ్మ తెగ సంబరపడుతుంది.















/?   

Thursday 11 December 2014

జొన్న సూప్

                            శీతాకాలంలో సాయంత్రం వేడివేడిగా సూప్ తయారుచేసుకుని త్రాగితే బాగుంటుంది.దీనిలో మిరియాలపొడి వేస్తాం కనుక చలిలో కఫం పేరుకోకుండా  ఉంటుంది.ఎప్పుడూ ఒకేరకం ప్రయత్నించే కన్నా
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకుంటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందుతాయి.సరే,జొన్న సూప్ కి ఏమేమి కావాలో,ఎలా తయారు చేయాలో చూద్దామా?
                         జొన్నపిండి - 100 గ్రా.
                         పాలకూర - 1 కట్ట
                        బాదం పప్పు-  10 గ్రా.
                       పెసర పప్పు - 20 గ్రా.
                        మిరియాలపొడి - తగినంత
                         ఉప్పు - తగినంత
                         నీళ్ళు - 3/4 లీ.
                                                      పాలకూరను ఉడికించి మిక్సీలో వేసుకోవాలి.బాదం,పెసరపప్పు పొడి చేయాలి.ఒక గిన్నెలో పాలకూర రసం.బాదం,పెసరపొడులను జొన్నపిండి,తగినంత నీళ్ళు పోసి కలిపి మరిగించాలి.
3 పొంగులు రానిచ్చి ఉప్పు,మిరియాల పొడి వేసి బౌల్ లోకి తీసుకోవాలి.పైన కొంచెం కొత్తిమీర అలంకరించి సర్వ్ చెయ్యాలి. అంతే జొన్న సూప్ రెడీ.ఇది చాల రుచికర మైనది,బలవర్ధక మైనది.

పేలగాయి

                                         షమ్మీ కి 14 సంవత్సరాలు.స్కూలులో స్నేహితులతో మాట్లాడినట్లుగానే ఇంట్లో కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.ఏదైనా ఇంట్లో వాళ్ళు అడిగినా తురుతుగా సమాధానం చెప్తుంది.అక్కను కూడా చెలకొట్టనివ్వటంలేదు.ఎవ్వరినైనా పెద్దంతరం,చిన్నంతరం లేకుండా మాట్లాడేస్తుంది.ఏంటి?ఆరకంగా ఏదంటే అది   మాట్లాడుతున్నావు పేలగాయి పిల్ల మాదిరిగా అని వాళ్ళఅమ్మ అంటే హైపర్ టెన్షన్ అమ్మా!అర్ధం చేసుకో అంటుంది.
ఆమాటకు అర్ధమే సరిగ్గా తెలియదు కానీ ఏంటో ఈకాలం పిల్లలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకుంది.

నైలాన్ పూల్

                                      కరేబియన్ దీవుల్లో టొబాగో అనే దీవి ఒకటి.దీవి అంటేనే చుట్టూ నీళ్ళు ఉండి  మధ్యలో
భూమి ఉంటుంది.టొబాగో చాలా అందమైన దీవి.చూడటానికి వచ్చే పోయే యాత్రికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.దీవి అందాలను తిలకించడానికి యాత్రికులు క్రూజ్ లో వెళ్తుంటారు.సకల సౌకర్యాలతో విలాసవంతమైన   క్రూజ్ లో దీవి అందాలను తిలకించడం మర్చిపోలేని అనుభూతి.దీవి చుట్టూ ఉండే సముద్రంలో నైలాన్ పూల్ ఉంది. దీన్ని చూడటానికి ప్రత్యేకంగా వెళ్తుంటారు.నడి సముద్రంలో నైలాన్ పూల్  ఒక మీటరున్నర లోతు ఉంటుంది.చుట్టూ నీలంరంగు సముద్రపు నీరు ఉంటే ఇక్కడ మాత్రం నీళ్ళు నలుపుగా ఉంటాయి.ఇక్కడ వేడిగాలులు వీస్తుంటాయి.ఈ వేడి గాలులకు చూడటానికి వెళ్ళిన వాళ్ళుకూడా నల్లబడతారు.కర్రపట్టుకుని నడిచేవాళ్ళు కూడా దూకేసి ఈనీళ్ళల్లో ఈదుతుంటారు.ఇంకొక విచిత్రమేమిటంటే ఇక్కడి ఇసుకను శరీరానికి బుగ్గలకు రాసుకుంటే భార్యాభర్తలైతే కలకాలం ప్రేమగా కలిసిమెలిసి ఉంటారని,ప్రేమికులైతే పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారని స్థానికుల నమ్మకం. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళుతప్పనిసరిగా ఈ ఇసుకను ఒంటికి రాసుకుంటారు. 

Wednesday 10 December 2014

పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని ....

                                                           సౌరబ్ పొలాలు కొనుక్కోవటానికి వెళ్తూ చూడటానికి తమ్ముడిని కూడా రమ్మన్నాడు.తమ్ముడు ఇంకో ఇద్దరు తన శ్రేయోభిలాషులను వెంట తీసుకొచ్చాడు.సౌరబ్ భార్య పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్లుగా వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్తున్నారేమిటి?అంది.సౌరబ్ అదే సందేహాన్నివ్యక్తపరిస్తే సౌరబ్ తమ్ముడు వాళ్ళు చాలా మంచివాళ్ళు.మన మంచికోరతారు అని చెప్పాడు.సరే చూద్దామని వీళ్ళుకూడా ఏమీ మాట్లాడలేదు.పొలం చాలా బాగుందని నలుగురూ అనుకున్నారు.పొలం అతను మానాన్నగారిని కూడా పిలిపించి రేపు మాట్లడుకుందామని చెప్పాడు.ఆతర్వాతరోజు సౌరబ్ పొలం అతన్ని సంప్రదిస్తే మీతోవచ్చిన ఇద్దరూ ఈరోజు ఉదయమే వచ్చారని చెప్పాడు.మావాళ్ళేఅని సౌరబ్ చెప్పాడు కానీ బేరం చెడగొట్టడానికివెళ్ళారని ఊహించలేదు.మా నాన్న ఊరు నుండి రాలేదు మీకు ఏవిషయం రెండు రోజుల తర్వాత చెప్తానని చెప్పాడు.నిజమే కాబోలని రెండు రోజుల తర్వాత అడిగితే ఇంకా ఎక్కువ రేటు వస్తుందని ఇప్పుడు అమ్మొద్దని అనుకుంటున్నామని చెప్పాడు.ఇంతకీ విషయమేమిటంటే తమ్ముడి శ్రేయోభిలాషులు వెళ్ళికొన్నిరోజుల తర్వాతైతే నీకు ఇంకా రేటు ఎక్కువ వస్తుంది అనీ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పారని తెలిసింది.తమ్ముడికి నీతోపాటు తీసుకొచ్చిన వాళ్ళు బేరం చెడగొట్టారని చెప్పగానే నమ్మలేదు.వాళ్ళు అలా చేయరు అని సర్దిచెప్పి వెంటనే వాళ్ళను మీరెందుకు అక్కడకు వెళ్ళారని 100 కి.మీ ప్రయాణించి అక్కడకు వెళ్ళాల్సిన అవసరమేమిటి?అని అడిగితే నట్లు కొట్టి సరిగా సమాధానం చెప్పకుండా దాటేశారు.తమ్ముడికి అర్ధమైనా అర్ధంకానట్లునటించి మొదట ఒప్పుకోకపోయినా మీరు చెప్పినది   నిజమేనని ఒప్పుకోక తప్పలేదు. 

అనుకరణ - హితవు

                                       రామసుందర్,సోమసుందర్ అన్నదమ్ములు.రామసుందర్ అన్నయ్య సోమసుందర్.
రామసుందర్ కి స్వార్ధం పాళ్ళు ఎక్కువ.ప్రతిచిన్న విషయానికి అన్నను అనుసరిస్తూ ఉంటాడు.ఎందుకంటే అన్న
కన్నా తను,తన కుటుంబమే పైచేయిగా ఉండాలని దుర్భుద్ధితో ఆవిధంగా చేస్తుంటాడు.అన్న పిల్లలు ఏమి చదివితే తన పిల్లలు కూడా అదే చదవాలనుకుంటాడు.అంతే తప్ప తనకంటూ ఒక ప్రణాళిక ఉండదు.తన పిల్లలు అసలు చదవగలరా?లేదా?అనే ఆలోచన ఉండదు.గుడ్డిగా అనుసరిస్తాడు.చదవటమో,ఊరుకోవటమో అన్నది తర్వాత విషయం.సోమసుందర్ ఇలాటి విషయాలేమీ పట్టించుకోడు.తనపని ఏదో తను చేసుకోవటం తప్ప.వీళ్ళింట్లో ఏ నగ,వస్తువు కొంటే అది తర్వాతి రోజు వాళ్ళింట్లో ఉండాల్సిందే.ఎవరైనా మనల్ని అనుసరిస్తున్నారంటే సంతోషమే కానీ ప్రతి చిన్న విషయానికీ అనుకరించటమంటే మహా చెడ్డ చిరాకు.అన్నను అనుకరిస్తున్నట్లు తెలియకుండా తనే క్రొత్తగా చేసినట్లుగా వెధవ బిల్డప్పులు ఇస్తుంటాడు.ఇలా ప్రతిదీ కాపీ కొట్టడంతో సోమసుందరానికి విసుగుతో కూడిన  కోపమొచ్చింది.ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం లేకుండా ప్రయోజనం లేకుండా పోయింది.ఈవిధంగా కార్బన్ పేపరులాగా కాపీ కొట్టడం మంచి పద్ధతి కాదు.స్వతంత్రంగా ఏపనైనా  నీకు చేతనైనట్లుగా చేసుకోవటం నేర్చుకో  నన్ను,మరెవరినైనా  అనుకరించటం మానుకోమని హితవు చెప్పాడు.  
  

Tuesday 9 December 2014

స్వోత్కర్ష

                                              భువనేశ్వరికి అత్తింట్లో అందరూ తమగురించి తాము గొప్పగా చెప్పుకుంటూ ఎదుటి వారిని మీకేమీ తెలియదు మాకు అన్నీ తెలుసు.మేము ఏపనైనా చేయగలము ఆమంత్రి తెలుసు ఈ మంత్రి మేము ఎంత చెబితే అంత అంటూ చెప్పింది చెప్పకుండా స్వోత్కర్ష చెప్తూనే ఉంటారు.పిల్లాడి మొదలు పెద్దవాళ్ళ వరకూ అదే పని.ఇంతకు ముందు కన్నవారింటి వైపు ఆవిధంగా చెప్పేవాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు.ఇప్పుడు కొత్తగా ఒకాయన మొదలు పెట్టాడు.మీకేమీ మాట్లాడటము చేతకాదు.నేనొక్కడినే మీఅందరికన్నా తెలివిగలవాడిని అంటూ   ప్రగల్భాలు మొదలు పెట్టాడు.ఇంతకు ముందు ఒకవైపే అనుకుంటే ఇప్పుడు రెండోవైపు కూడా స్వోత్కర్ష(సెల్ఫ్ డబ్బా)మొదలెట్టారు అని భువనేశ్వరి తల పట్టుకుంటుంది.ఇంతకీ అక్కడ పనులయ్యేది ఏమీ ఉండదు గొప్పలు చెప్పుకోవటం తప్ప.చాటుకు వెళ్ళి అమ్మపుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు వీడి గొప్పలు వీడూ అని నవ్వుకోవటము మినహా ఉపయోగం ఉండదు.                      

గోరింటాకు ఎర్రగా పండాలంటే.....

                                                   గోరింటాకు పెట్టుకునే ముందు చేతికి జామాయిల్ అంటే యూకలిప్టస్ ఆయిల్ రాసుకుంటే ఎర్రగా పండుతుంది.ఒకవేళ ఇది లేకపోతే పెట్టుకున్న తర్వాత నిమ్మరసం,పంచదార కలిపి ఆరగా ఆరగా అద్దితే ఎర్రగా పండుతుంది.

నీకన్నా మీచెల్లెలే బాగుంది

                               లూసీ,జూలీ అక్క చెల్లెళ్ళు.హైస్కూలులో చదువుకుంటున్నారు.ఒకరోజు ఖాళీ సమయంలో లూసీ,స్నేహితురాలు రోజీ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.అప్పుడు రోజీ నీకన్నా మీచెల్లెలే బాగుంటుంది అనేసింది.స్నేహితురాలు దగ్గర ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చి నానమ్మ దగ్గరకు వెళ్ళి నానమ్మా!నేను బాగున్నానా?లేదా?చెప్పు రోజీ నీకన్నానీచేల్లెలే బాగుంది అంటుంది.అదే బాగుందా?నిజంగా చెప్పు అని అడిగింది.
ఇద్దరు బాగానే ఉన్నారంటే వినదు.ఇంతలో చెల్లి వచ్చింది.నువ్వుచేప్పవే మనిద్దరిలో ఎవరు బాగున్నారో?అంది .
ఏమో నాకు తెలియదు అని నానమ్మానువ్వే చెప్పు అని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చెరొకచెవి దగ్గర చేరి జోరీగల్లాగా
రొద మొదలెట్టారు.చివరకు నానమ్మకు విసుగొచ్చి అందానికి కొలబద్ద ఉండదు.ఎవరి అందం వారిది.ఒకరితో ఒకరు
పోల్చుకోవాల్సిన అవసరం లేదు.ఇద్దరూ బాగానే వున్నారు.ఇక ఈ సంభాషణ ఇంతటితో ఆపేయండి అని చెప్పింది.
స్నేహితురాలు ఏమైనా బాధ పడుతుందనే ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడిన మాట ఇంత గందరగోళం
సృష్టించింది.అందుకే మాట్లాడేముందే ఆలోచించి మాట్లాడాలి.మాటే కదా అనుకుంటే అదే ఒక్కొక్కసారి పెద్దపెద్ద గొడవలకు దారితీస్తుంది. 

తల వెంట్రుకలకు పోషణ

                                          పావుకప్పు ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేయటంవల్ల పొడిబారిన వెంట్రుకలకు పోషణ లభించి అందంగా కనిపిస్తుంది.  

Sunday 7 December 2014

మొటిమల మచ్చలు పోవాలంటే......

                                               ముఖం మీద మొటిమలు తగ్గి మచ్చలు ఉన్నప్పుడు చిక్కటి కొబ్బరిపాలు ఒక స్పూను,గులాబీనీళ్ళు ఒక స్పూను,నిమ్మరసం ఒక స్పూను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి.
ఇలా రోజుకొకసారి చేస్తే క్రమంగా తగ్గిపోతాయి. 

Saturday 6 December 2014

నానీ నోరుముయ్యి

                                         ఈశ్వరమ్మకు ఇద్దరు కొడుకులు.చిన్నకొడుక్కి ఇద్దరు పిల్లలు.పెద్దకొడుక్కి పెళ్ళయి పది సంవత్సరాలయినా పిల్లలు లేరు.కనిపించిన దేముడి కల్లా మొక్కారు.లేకలేక లోకాయ్ పుట్టినట్లు ఎట్టకేలకు ఒక కొడుకు పుట్టాడు.వాడిని  అతి గారాబంతో పెంచటంవల్ల వాడు మొండిగా తయారయ్యాడు.ఇంతలో ఇంకొక పిల్లవాడు పుట్టాడు.రామలక్ష్మణుల లాగా ఇద్దరు పుట్టారు అని సంబరపడ్డారు.పెద్దాడి మొండితనానికి విసుగొచ్చి చిన్న వాడిని మాములుగా పెంచారు.పెద్దవాడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు.ఎవరినీ లెక్క చేయడు.చిన్నవాడిని కూడా కొడుతూ ఉంటాడు.ఉదయాన్నే స్కూలుకు వెళ్ళాలంటే పెద్ద హడావిడి.చుట్టుప్రక్కల అందరికీ వాళ్ళ అల్లరి అలవాటయిపోయింది .అల్లరి చెయ్యకండిరా అని నాయనమ్మ చెబితే "నానీ నువ్వు నోరుముయ్యి" అంటూ ఉంటాడు.ఏమి చేస్తాము?అతి గారాబం వల్ల ఏదోఒకటి అంటూ ఉంటాడు.అందుకని నోరు మూసుకుని ఒక మూల కూర్చుంటాను అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది.

Friday 5 December 2014

పాదాలు నొప్పులు,అలసట తగ్గటానికి .........

                          మనం రోజంతా హడావిడిగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటాము.మనశరీరం బరువు
మొత్తం కాళ్ళతోపాటు పాదాలపై పడుతుంటుంది.కనుక కాళ్ళ నొప్పులతో పాటు,పాదాల నొప్పులు వస్తుంటాయి.
అందుకని మనకు వీలయినప్పుడు ఏదోఒక సమయంలో పాదాలకు విశ్రాంతినిచ్చికుర్చీలో కూర్చుని రెండు చిన్న
ప్లాస్టిక్ టబ్ లేదా బకెట్ లు తీసుకోవాలి.పాదాలు మునిగేలాగా ఒకదానిలో గోరువెచ్చనినీళ్ళు,ఒకదానిలోమామూలు నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో చారెడు ఉప్పు వేసి పాదాలు మునిగేలా పెట్టాలి.ఒక 5 ని.ల తర్వాత తీసేసి మాములు నీళ్ళల్లో ఒక 5 ని.లు పెట్టాలి.ఇలా మార్చిమార్చి రెండుసార్లు చేయాలి.ఇలాచేస్తే పాదాలకు అలసట లేకుండా,నొప్పులు తగ్గిపోతాయి.పాదాలనొప్పులు వచ్చిన తర్వాత ఇబ్బందిపడేకన్నారాకముందు నుండే ఇలా చేస్తుంటే పాదాలనొప్పులు రాకుండా ఉంటాయి.దీనిలో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. పది ని.లు ఉప్పునీళ్ళల్లో నానటంవల్ల పాదాలు పైన,అడుగున కూడా శుభ్రపడి పగుళ్ళు రాకుండా ఉంటాయి.        

మహర్దశ

సువర్ణాభరణాలను ధరిస్తే ఆయుర్వృద్ధి.
చక్కటి దుస్తులు ధరిస్తే తేజస్సు.
ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం.
ఎప్పుడూ ఆనందంగా ఉంటే లక్ష్మీప్రదం.
పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం.
ఒకరికి సహాయపడితే క్షేమం.
తృప్తి ఉంటే నిత్య యవ్వనం.
నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం.
మధురంగా మాట్లాడితే మంగళకరం.
మితంగా భుజిస్తే చక్కని రూపం.
                     ఇవన్నీ పాటిస్తే మహర్దశ మన సొంతం.

ఫ్లాస్కు తేలికగా శుభ్రంచేయాలంటే .....

                        ఉప్పుకలిపిన గోరువెచ్చటి నీటితో కడిగితే బాగా శుభ్రపడుతుంది.ఫ్లాస్కు తడిలేకుండా ఆరబెట్టి మూతపెట్టినా కూడా  అదొక రకమైన వాసన వస్తుంటుంది.అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా పంచదార వేసి మూతపెడితే వాసన రాకుండా ఉంటుంది.

చేతికి గాజులు వేసేటప్పుడు,తీసేటప్పుడు ......

                                చేతికి గాజులు వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే చేతికి కొంచెం సబ్బు లేదా  క్రీమ్ రాసి వేసుకుంటే తేలికగా వేసుకోవచ్చు.చేతి గాజులు తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఒక క్యారీ బాగ్ చేతికి తొడిగి లేదా పౌడరు రాసి ఆతర్వాత గాజులు నెమ్మదిగా తీస్తే సులువుగా వస్తాయి.

ముత్యాల నగలు - జాగ్రత్తలు

                                 ముత్యాల నగలు అంటే స్త్రీలందరికీ ఎంతో ఇష్టం.వీటిని భద్రపరిచేటప్పుడు,ధరించినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రంగు మారే ప్రమాదముంది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ముత్యాలతో చేసిన నగలను ధరించిన తర్వాత వాటిని పొడివస్త్రంతో తుడిచి పలుచని వస్త్రంలో చుట్టి పొందికగా భద్రపరచాలి. ముత్యాల నగలను గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టకూడదు.సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉంచాలి.అధిక చెమట కూడా ముత్యాల మెరుపుని తగ్గిస్తుంది.అందుకని మరీ ఎండలో వీటిని ధరించక పోవడమే మంచిది.తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎల్లకాలం మన్నికగా ఉంటాయి.

Thursday 4 December 2014

బిస్కట్లు,కేకులు ఓవెన్ లో చెయ్యాలంటే.........

                             బిస్కట్లు,కేకులు ఓవెన్లో చేసుకుంటే ఉష్ణోగ్రత సరిపడా ముందే పెట్టుకుంటాము కనుక తేలికగా ఉంటుంది. మైక్రో ఓవెన్ కన్వెన్షన్ మోడ్ అయితే వండుకోవటానికి,బిస్కట్లు,కేకులు తయారు చేసుకోవచ్చు.మైక్రో ఓవెన్ సోలో అయితే వండుకోవటానికి,వేడిచేసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది.గ్రిల్ అయితే బిస్కట్లు,కేకులకు, గ్రిల్డ్ రకాలకు పనిచేస్తుంది.  

చెక్కవస్తువులను శు భ్రం చేయాలంటే .......

                                       చెక్క బొమ్మలను,గోడలకు వేలాడదీసే చెక్క తైలవర్ణ చిత్రాలు,చెక్క వస్తువులు వేటినైనా శుభ్రం చేయాలంటే వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడిస్తే మరకలు మాయమై,దుమ్ము,ధూళి లేకుండా చక్కగా మెరుస్తుంటాయి.

సిద్దాంతుల పిచ్చి

                                    సమర్ ఎక్కడ కొత్త సిద్ధాంతి ఉన్నాడంటే అక్కడ ప్రత్యక్షమైపోతాడు.కనిపించిన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించానని ఆపని చెయ్యమన్నారు,ఈపని చెయ్యవద్దన్నారని చెప్తుంటాడు.వాళ్ళు ఎంత డబ్బుఇవ్వమంటే అంత డబ్బు ఇచ్చేస్తుంటాడు.వాళ్ళ చుట్టూ తిరిగి డబ్బు వృధాచేస్తుంటాడు.అరిచి గీపెట్టినా ఎంత 
అవసరమైనా ఎవరికీ పైసా కూడా ఇవ్వడు.అటువంటిది ఎవరైనా ఎందుకు వాళ్ళ చుట్టూ తిరగటం? అని అంటే తనకి వాళ్ళ కబుర్లు వినటం సరదా అని,కాసేపు కాలక్షేపమని చెప్తుంటాడు.మనిషికొక పిచ్చి. 

పెత్తనం

                                                యశోవర్ధన్ అందరిమీద పెత్తనం చలాయిద్దామనుకుంటాడు.అందరూ నామాటే
వినాలనుకునే మనస్తత్వం.తన తప్పున్నా కూడా ఎదుటివాళ్ళదే  తప్పని వాదిస్తుంటాడు.తన విషయాలన్నీభార్యకి మాత్రమే చెప్పి మిగతావాళ్ళ దగ్గర రహస్యంగా ఉంచుతాడు.ఎదుటివాళ్ళ విషయాలన్నీ కూపీ లాగుతున్నట్లుగా
ఆరాలు అడుగుతాడు.ఇంతకీ చిత్రాతిచిత్రమైన విషయమేమిటంటే ఇతను అందరి మీద పెత్తనం చేద్దామనుకుంటే
ఇతనిమీద  అతని భార్య పెత్తనం చేస్తుంటుంది.భార్య నంది అంటే నంది అనాల్సిందే.లేకపోతే ప్రళయం సృష్టిస్తుంది.

చేతులు,పాదాలు పొడిబారితే ........

                                 చలికాలంలో చేతులు,పాదాలు పొడిబారి తెల్లగా అవుతుంటాయి.అలా పొడిబారకుండా
ఉండాలంటే తేనె,ఏదైనా అందుబాటులో ఉన్న నూనె,నిమ్మరసం ఒక్కొక్క స్పూను చొప్పున తీసుకుని అన్నీబాగా
కలిపి చేతులకు,పాదాలకు,మోచేతులకు,మొకాలినుండి పాదాలవరకు రాసి పది ని.ల తర్వాత కడిగేస్తే పొడిబారి
చర్మం పొట్టు లేవకుండా,పగలకుండా ఉంటుంది. 

Wednesday 3 December 2014

ముఖంపై ఉన్న ముడతలు మాయమవ్వాలంటే........

                     అరస్పూను నిమ్మరసం,కోడిగ్రుడ్డు తెల్లసొన కొంచెం,బరకగా చేసిన బాదంపొడి కొంచెం అన్నీకలిపి
ముఖానికి పాక్ వేయాలి.ఇరవై ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి.
గమనిక:తెల్లసొన కలిపినప్పుడు చల్లటి నీటితో కడగకూడదు.వాసన వస్తుంది.అందుకని తప్పనిసరిగా గోరువెచ్చటి నీటితోనే కడగాలి.

మృదుత్వం కోల్పోయిన మోచేతులకు ......

                                                 మృదుత్వం కోల్పోయి మోచేతులు గరుకుగా ఉంటే నిమ్మచెక్కతో మోచేతులు రుద్దాలి.ఇలా రోజూ చేస్తూఉంటే క్రమంగా గరుకుదనంతో పాటు,నలుపుదనం పోయి మృదువుగా తయారయి చర్మం రంగులో కలిసిపోతుంది.

వారానికోసారి....

                                 అరకప్పు కొబ్బరిపాలలో ఒక పెద్ద నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి ఆరాక తలస్నానం చేయాలి.వారానికోసారి  ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
                                             వారానికోసారి ఉప్పులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పళ్ళు రుద్దితే పళ్ళు తెల్లగా మిలమిల మెరుస్తుంటాయి.

కార్పెట్ పై దుమ్ము వాసన పోవాలంటే ......

 కార్పెట్ పై దుమ్ము,ధూళి బాగా పేరుకుపోయి వాసన వస్తుంటే రాత్రిపూట సోడాఉప్పు కార్పెట్ పై చల్లి ఉదయం
వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే దుమ్ము వాసన పూర్తిగా పోతుంది.

వెనిగర్

                           వంటింటి సింక్ మనం ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత చెడ్డ వాసన వస్తుంటుంది.నాన్ వెజ్ అయితే మరీ వస్తుంది.ఉల్లిపాయలు,చేపలు,చికెన్,కోడిగ్రుడ్డు ఇలాంటివి వాడిన పాత్రలు కడిగినప్పుడు వంటింట్లో సింక్ అంతా అదోరకమైన చెడ్డ వాసన వస్తుంటుంది.ఇటువంటప్పుడు ఒక అరకప్పు వెనిగర్ ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి సింక్ దగ్గర పెడితే అది  చెడ్డ వాసనను పీల్చుకుంటుంది.

వంటిట్లో మంచి వాసన

    వంటిల్లు ఎంత శుభ్రం చేసినాఎంతో కొంత అదోరకమైన జిడ్డు వాసన వస్తుంటుంది.మంచి వాసనరావాలంటే ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళుపోసి కొద్దిగా దాల్చినచెక్క,ఎండిన నారింజ తొక్క కానీ కమలాతొక్క కానీ వేసి  నీళ్ళు మరిగిస్తే ఆవాసన వంటిల్లంతా వ్యాపించి వంటింట్లో ఉన్న జిడ్డువాసన,మరే ఇతర వాసనలున్నా పీల్చుకుంటుంది.అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వంటింట్లో అడుగుపెట్టగానే సువాసన వస్తుంటుంది. 

Tuesday 2 December 2014

ఏమో అక్కా

                                            రూపాలీ ఇంట్లో చిన్నాచితక పనులు చేయటానికి ఒక కుర్రాడు ఉంటాడు.ఒక అరగంట ఏదైనా పని చేస్తే 2 గం.లు మళ్ళీ కనిపించడు.అత్యవసరమై ఏదైనా చెయ్యాలన్నా పిలిచినా ఉలకడు పలకడు.పోనీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అని అడిగితే సమాధానం చెప్పడు.ఒకరోజు రూపాలీ కూతురు ఇంద్రనీల పుస్తకము అవసరమై కొట్టు నుండి తెప్పించుకుందామంటే 2 గంటలైనా ఇంటికి రాలేదు ఇంద్రనీలది ఉడుకు రక్తం కదా వాడికోసం 2 గంటలు ఎదురుచూచి విసుగొచ్చి వాడు రాగానే అరవటం మొదలుపెట్టింది.ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?అంటే సమాధానం చెప్పలేదు.ఆపిల్లకు పిచ్చి కోపమొచ్చి నేను ఇక్కడెందుకు కూర్చున్నాననుకున్నావు ?
పిచ్చెక్కి కూర్చున్నాననుకున్నావా?అనేసరికి ఏమో అక్కా !నాకు తెలియదు అన్నాడు?ఇంద్ర నీల తెల్లబోయి అంటే  పిచ్చెక్కిందేమో అనేకదా అర్ధం.మరీ ఆటగా ఉంది నీకు అనేసరికి సిగ్గుపడి ఒక్కసారి పెద్దగా నవ్వేశాడు.అంతకన్నా   చేసేదేముంది వాడితోపాటు అందరూ నవ్వేశారు.










భారతీయ చీరకట్టు

                  భారతీయ సంప్రదాయమైన చీరకట్టు అంటే వీదేశాలలో ఉన్న ఆడవాళ్లకు కూడా ఎంతో ఇష్టం.దేదీప్య
విదేశాలకు వెళ్ళిన మొదట్లో దీపావళి పండుగ వచ్చింది.వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎక్కువమంది తెలుగువాళ్ళు లేరు.
దీపావళి రోజు సాయంత్రమయ్యేసరికి స్త్రీలందరూ చీర కట్టుకోవటం అంతగా రాకపోయినా అందరూ చీరలు కట్టుకుని ఒకచోట సమావేశమయ్యారు.ఒకపెద్దావిడ చీర చుట్టుకున్నట్లుగా కట్టుకుంది.దేదీప్య కనిపించేసరికి చీర బాగా కట్టుకున్నానా?అని అడిగింది.నువ్వు చీర కట్టుకున్న విధానం బాగుంది.నాకు కూడా నేర్పించమని అడిగింది.సరేనని నేర్పించింది.మాకూ భారతీయ సంప్రదాయాలంటే చాలా ఇష్టం.గణేష్ ని కూడా ఇంట్లో పెట్టుకుంటాము.దీపావళికి తప్పనిసరిగా అందరమూ చీరలు కట్టుకుంటాము.మీ స్వ్వీట్లంటే  మాకు చాలా ఇష్టం అని చెప్పింది.ఈ విషయం
విన్న దేదీప్యకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగింది.            

Monday 1 December 2014

వేపకాయంత వెర్రి

                               వనజాక్షికి వేపకాయంత వెర్రి ఉంది.వాళ్ళింట్లో పనిచేసే వాళ్ళను ఇంకెక్కడా పని చేయనివ్వదు.
వేరే పనివాళ్ళతో మాట్లాడనివ్వదు.పోనీ తగినంత జీతం ఇస్తుందా అంటే ఇవ్వదు.వేరేవాళ్ళ ఇంట్లో పనిచేస్తే నీకు నీరసం వస్తుంది.మాఇంట్లో పనిచేసే శక్తి ఉండదు అందుకని ఎక్కడా పని చేయవద్దు అని వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మాట్లాడుతుంది.ఆమె మనుమరాలికి కూడా కొడుకు పుట్టి జేజమ్మ అయినా ఎవరైనా పిన్ని, ఆంటీ,అమ్మమ్మ అని అన్నారంటే వాళ్ళ పని అయిపోయినట్లే.పెద్ద తగువు పెట్టుకుంటుంది.నన్ను ఆంటీ,అమ్మమ్మ అనటమేమిటి? పిల్లలైనా వనజాక్షీ అని పేరు పెట్టి పిలవాలి కానీ అని పెద్ద నోరు పెట్టుకుని అరుస్తుంటుంది. ఆమె నోటికి దడిచి ఎవరూ ఆమె జోలికి వెళ్లరు.ఆమె అంతట ఆమె మాట్లాడితేనే ఆచితూచి మాట్లాడతారు. 

కేక్ తయారీలో ......

     కేక్ తయారు చేసేటప్పుడు విధిగా పాటించవలసిన చిట్కా ఏమిటంటే మైదా వేయకముందు బాగా బీట్ చేయాలి కానీ మైదా వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదు.మైదా పూర్తిగా కలిసేంతవరకు మాత్రమే కలపాలి.తెలియక మైదా వేసిన తర్వాత కూడా బాగా బీట్ చేస్తుంటాము.అలా చేయటం వలన కేక్ గట్టిగా వస్తుంది.బటర్ కూడా క్రీమీగా  ఉండాలి కానీ ఆయిలీగా ఉండ కూడదు.కేక్ మెత్తగా స్పాంజి లాగా రావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.