Sunday 21 February 2021

నా మాటే శాసనం

                                                                           డెబ్భై సంవత్సరాల రవీంద్ర గారు అంత నాకే తెలుసు అనుకుంటారు.నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అనుకుంటారు .దీనికి తోడు భార్య ఒక నెరజాణ.జ్ఞాని  అనబడే అజ్ఞాని.ఆమె చెప్పిందే వేదం అంటారు రవీంద్రగారు.భర్తను గుప్పెట్లో పెట్టుకుని ఆమెకు ఎవరిపై కోపం ఉంటే వాళ్ళను పోట్లాడమని తను రోట్లో రోటి పచ్చడి చెయ్యడం అలవాటు.వయసు పెరిగినా ఆమెలో ఆ చెడ్డ గుణం పోలేదు. పెద్దవాళ్ళనే  గౌరవంతో ఫోను చేసి మరీ తిట్టినా ఎవరూ ఎదురు చెప్పరు.పెద్దవాళ్ళను ఏమీ అనకూడదు కనుక ఎదురుగా ఏమీ అనలేక  తర్వాత చాటున అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటారు.అది వేరే విషయం.కాలం మారింది మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అని అర్ధం చేసుకోవడం లేదు.పెద్దవాళ్ళుగా మంచి సలహాలు ఇవ్వడం ఎవరికైనా బాగానే ఉంటుంది.ఒక్క రవీంద్ర గారే కాదు పెద్దవారు ఎవరైనా  ప్రతి విషయంలో తలదూర్చి నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అని అనుకోకూడదు.ఎవరికి వారికి వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలూ ఉంటాయి కదా!అందువలన పెద్దలు కూడా ఈ తరం వాళ్ళను అతిగా విసిగించి ఉన్న విలువ పోగొట్టుకోవటం కన్నా అడిగిన వాళ్ళకు సలహాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎదిగితే చివరి దశలో ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు.అప్పుడు అందరూ మనస్పూర్తిగా ఇష్టపడతారు.లేకపోతే వీళ్ళ గోల ఏమిటో?వీళ్ళు ఎప్పుడుపైకి పోతారురా బాబూ? అని కొంతమంది ఎదురు చూస్తుంటారు.కనుక ఈరోజుల్లో పెద్దలే కాదు ఎవరైనా వారి పరిధిలో వారు ఉండడం మంచిది.

జీవితం మన చేతిలోనే

                                                                 పునర్నవి  చిన్నప్పటి నుండి  అతిగా గారాబం చేయడంతో  మొండితనంతో పాటు గర్విష్టి అయింది.ఇంట్లో ఆడింది ఆట,పాడింది పాట కావడంతో అమ్మా నాన్నలకు మా చిట్టి (ముద్దు పేరు) చెప్పిందే వేదం అని డు డు బసవన్నలా తలలు ఊపడం అలవాటు అయిపోయింది.చదువుతోపాటు అదృష్టం కూడా  కలిసి రావడంతో వయసుతో పాటు మహా గర్వం కూడా పెరిగింది.తన స్వార్ధం తన ఎదుగుదల తప్ప వేరే ధ్యాస ఉండదు.ఈ క్రమంలో ఎవరినైనా అణగతొక్కేయ్యడానికి వెనకాడదు.పైకి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించడంతో మంచి అమ్మాయి అనుకుని బుట్టలో పడిపోతారు జనం.ఆమెలో ఉన్న ఇంకొక కోణం అర్ధం చేసుకునేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది.ఎప్పుడూ కాలం ఒకే రకంగా మనకు అనుకూలంగా ఉండదు కదా!అదృష్టం మన ముందు,మన వెన్నంటే ఉంటుందని విర్రవీగి కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుంటే ఆ తలుపు తట్టిన అదృష్టం ఒక్కొక్కసారి వెనక్కు వెళ్ళిపోతుంది. పునర్నవికి ఇప్పుడు  అదే పరిస్థితి ఎదురైంది.  ప్రేమించానంటే మా కూతురు తెలివిగలది కనుక మంచి అల్లుడు వెదకకుండా దొరికాడని అమ్మానాన్న మురిసిపోయారు.పెళ్ళై అత్తవారింటికి వెళ్ళినా నా ఇష్టం నాది నేను ఎప్పుడూ లేచినా ఏమి చేసినా మా ఇంట్లో ఏమీ అనరు అందరూ నేను  చెప్పినట్లు వింటారు మీరు కూడా విని డుడు బసవన్నల్లా తలలు ఊపాలి,నన్ను మా అమ్మా నాన్నలను సవరదీయాలి  అన్నట్లు ప్రవర్తిస్తుండడంతో అత్తింటి వారు సంస్కారవంతులు కావడంతో  కొడుకు ఇష్టపడ్డాడు కనుక మనసు బాధ పెట్టకూడదని,గొడవలు పడకూడదని తనే పద్దతులు తెలుసుకుంటుందిలే అని ఊరుకున్నారు.ఎన్నాళ్లున్నా ఆమెలో మార్పు రాలేదు.దానితో పునర్నవి అత్తింటి వారి మనసులో స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది.అదే అణకువతో ఉంటే ఆమె తలుపు తట్టిన అదృష్టాన్ని  సఫలీకృతం  చేసుకుని అందరి గుండెల్లో నిలిచిపోయేది.ఇది ఒక పునర్నవి విషయమే కాదు.ఈరోజుల్లో నూటికి అరవై మంది గొడవలు పడి విడాకుల వరకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంస్కారవంతులు కాకపోతే తల్లిదండ్రుల పెంపకాన్నే వేలెత్తి చూపుతారు.పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు దానితోపాటు చిన్నప్పటి నుండి బంధాలు,బాంధవ్యాల విలువలు క్రమశిక్షణ,సంస్కారం నేర్పితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.జీవితం అంటే భర్త,భార్య,పిల్లలు మాత్రమే కాదు. భర్త  తరపువారు,భార్య తరపువారు మనమంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతుంది.కుటుంబంతో సంతోషంగా ఉంటే ఆరోగ్యం,డబ్బు కూడా పుష్కలంగా ఉంటాయి.జీవితం ఆనందంగా ఉండాలన్నా,నిస్సారంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది.