Sunday 29 December 2013

నమ్మకద్రోహం

                                                               పిచ్చయ్యకు ముగ్గురు పిల్లలు.ఇద్దరు మగపిల్లలు,ఒకఆడపిల్ల.ఆడపిల్ల కొంచెం అమాయకంగా ఉంటుంది.పెళ్లి అయిందికానీ భర్త మంచివాడు కాకపోవటంతో ఇంట్లోనే ఉంటుంది.ఇద్దరు మగపిల్లలు.పిల్లలను తాత,మేనమామలే చదివించారు.ఇరవై సంవత్సరాల తర్వాత పెద్ద మనవడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు.అక్కడ వాళ్ళ ఆస్తి తగాదాల్లో పెద్ద మనవడు చనిపోయాడు.చిన్నమనవడు స్వార్ధపరుడు.పిచ్చయ్య పెద్దకొడుకు,చిన్నకొడుకు కష్టపడి బాగా చదువుకున్నారు.పిచ్చయ్య పగలనక,రేయనక కష్టపడి వ్యవసాయం చేసి పొలాలు కొని డబ్బు సంపాదించాడు.పిచ్చయ్య భార్య భర్తకు తెలియకుండా ధాన్యం అమ్ముకొని వడ్డీకి డబ్బులు అప్పు ఇచ్చి స్వంతంగా ఆమెకు తోచినట్లు సంపాయించేది.పిచ్చయ్య పెద్దకొడుక్కి ఉన్నత కుటుంబంలోని అమ్మాయిని ఇచ్చారు.బుద్ధిమంతుడు,చదువుకున్నాడు వీళ్ళల్లో కొంచెం లోపాలున్నా ఏముందిలే అని ఇచ్చారు.రెండో కొడుకు తెలివి కలవాడే అయినా ఒక మోస్తరు సంబంధం వచ్చింది.పెద్దకోడలు ఫ్యామిలీకి తెలిసిన సంబంధమే అయినా గొప్పసంబంధం అని డప్పు కొట్టిమరీ చెప్పుకున్నారు.పిచ్చయ్య కొడుకుల్నిచదివించాను కనుక ఇంటికింద డబ్బులు ఇవ్వాలని వసూలు చేశాడు.అవి కావాలి ఇవి కావాలి అని తినుబండారాలు  పంచి పెట్టుకోవటానికి అని ఉత్తరాలు రాయించి మరీ అందరికీ పంచకుండా ఇష్టమైనవాళ్లకు ఇచ్చి తిన్నన్ని రోజులు తిని చెత్తకుప్పలో పారబోసుకునే వాళ్ళంట.ఇంతోటి దానికి ఎదుటి వాళ్ళను ఇబ్బందిపెట్టి అడక్కోవడమేమిటో?అప్పట్లో మిఠాయిలు ఊరిలో పంచిపెట్టేవాటి దగ్గర గొడవలు జరిగి ఒకళ్ళు,ఇద్దరువిడాకులు తీసుకున్నారు.లేకిగావాళ్ళు నోరు తెరిచి అడగగాలేనిది చిన్నచిన్న వాటికీ గొడవలు ఎందుకులే?పోనీ వాళ్ళు అడిగినవి పంపిద్దాములే అని పెద్దకోడలు తరపు వాళ్ళు అడిగినవి అన్నీఇచ్చారు.చిన్నకోడలుకి వీళ్ళ గొంతెమ్మకోర్కెలు తీర్చలేక ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోనేవాళ్ళు.పంచిపెట్టడానికి పంపలేకపోయారని చెప్పుకోలేక వాళ్ళ అమ్మకు పెద్దజబ్బు చేసింది అని చేప్పేవాళ్ళు.చిన్నకోడలుకూడా ఒకమాదిరి తెలివితేటలు కలది.పెద్దకోడలు తెలివికలది,పిల్లలు తెలివి కలవాళ్ళు అని మురిసేవాళ్ళు.చిన్నకొడుక్కి అన్న భార్యను,పిల్లలను పొగడటం ఎంత మాత్రం నచ్చలేదు.తగిన అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు.ఇదిపెద్దకొడుకు వాళ్ళు గమనించారు కానీ అంత కక్ష ఉంది అనిఊహించలేదు.చిన్నమనవడు బైక్ మీద తాతను ఎక్కించుకొని కుక్క అడ్డువచ్చిందని తనుదూకేసి తాతను వదిలేశాడు.కొంతదూరం బైక్ ఈడ్చుకెళ్ళి తలలో రక్తం గడ్డకట్టి,కోమాలో కెళ్ళి మూడు రోజుల తర్వాత బ్రతికాడు.పెద్దకోడలు తరపు వాళ్ళు బంధువుల ఆస్పత్రిలో చేర్చి మంచి వైద్యం చేయించటం వల్ల బ్రతికాడు.రెండు నెలల తర్వాత ముందే పది రోజులు విహార యాత్రకు వెళ్ళటానికి పెద్దకొడుకు వాళ్ళు ఏర్పాటు చేసుకోటం వల్ల వెళ్ళక తప్పలేదు.వెళ్లి వచ్చిన తర్వాత పిచ్చయ్య భార్య మీరు అనవసరంగా మామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించటం వల్ల నేను చాకిరీ చెయ్యలేక చచ్చిపోతున్నాను.నా పసుపుకుంకుమలు కోసం మీరు చూశారు ఇప్పుడు నాకు ఇబ్బంది అయింది అని కోపంగా పెద్ద కోడలుతో అంది.ఇదేమిటి?ఈమె ఇలా మాట్లాడుతున్నది అనుకుంది పెద్దకోడలు.భర్తని బతికించినందుకు రోజూ ఆయనకు చాకిరీ చేయాల్సి వచ్చిందని పెద్దకొడుకు,కోడలిపై కక్షకట్టి పిచ్చయ్యభార్య,చిన్నకొడుకు,మనవడుతో  కలిసి పిచ్చయ్యతో ఆస్థి మొత్తం పెద్దకొడుక్కి తెలియకుండా విహార యాత్రకు వెళ్ళినప్పుడు చిన్నకొడుక్కి,మనవడికి దొంగ చాటుగా రాయించింది.చిన్నాడు అక్కని అన్నకు,ఒదినకు ఈవిషయం  చెపితే చంపేస్తానని బెదిరించాడు.పెద్ద కొడుకు కుటుంబం విహార యాత్రకు  వెళ్ళి వచ్చేసరికి కన్నవాళ్ళు,తోడబుట్టిన వాళ్ళు అయిన తన స్వంతవాళ్ళే మోసంతో నమ్మకద్రోహం చేశారు.       
  

Saturday 28 December 2013

14 సంవత్సరాల తర్వాత

    కృష్ణప్రియ చుట్టాల్లో ఒకామె స్వంత బావను పెళ్ళిచేసుకుంది.అతను పొడవు,ఆమె పొట్టి.అతనికి అంతగా ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళు చేశారు కనుక బానే ఉంటున్నాడు.అతని ఉద్యోగంలో భాగంగా పార్టీలకువెళ్ళాల్సివచ్చేది
తప్పేకానీ కొంచెం తాగటం నేర్చుకున్నాడు.ఈమె అతన్ని పట్టించుకోకుండా నగలు,చీరలు అని మార్కెట్లో వచ్చిన
ప్రతిదీ కొని చుట్టాలదగ్గర గొప్పలు పోయేది.ఎప్పుడంటే అప్పుడు ఊళ్ళుపట్టుకుతిరుగుతూ అర్థరాత్రి12గంటలకు
కృష్ణప్రియ ఇంటికివచ్చి వండించుకునితినేది.ఆమెనాన్న,అమ్మ,కూడాఅలాగే ఎప్పుడుపడితేఅప్పుడు వీళ్ళింటికి
వచ్చి ఇబ్బంది పెడుతున్నామనే ఆలోచన లేకుండా వచ్చేవాళ్ళు.అతని డబ్బుతో బంగారం చాలా కొనుక్కుంది. ఈమె ఇంట్లో లేకుండా,పట్టించుకోకుండా ఉంటే అతను తాగుడుకు బానిసయ్యాడు.దానికితోడు వీళ్ళకు పిల్లలు
 కూడా పుట్టలేదు.14సంవత్సరాల తర్వాత వాడు అసలు మగాడే కాదు అని చుట్టాల్లో ప్రచారంచేసి విడాకులు
తీసుకుంది.తర్వాతఇద్దరూ వేరేపెళ్ళిళ్ళు చేసుకున్నారు.ఈమె తనకన్నాచిన్నవాడిని,అతను అందమైనఆమెను
పెళ్లి చేసుకున్నారు.బావదగ్గర ముందేడబ్బుఅన్నీతెచ్చుకుంది.అతను ఈమెగురించి ఒక్కమాటకూడా తప్పుగా
మాట్లాడలేదు.అంతా దోచుకుంది గదాఅని ఎవరయినా అంటే పోనీలే నాదగ్గర ఉందికనుక తీసుకుంది అనేవాడు.
తర్వాత ఇద్దరికీ పిల్లలు పుట్టారు.అతని భార్య ప్రేమతో తాగుడు మాన్పించింది.తర్వాత ఈమెకన్నాఅతని జీవితం
బాగుంది.గురువింద గింజలాగాతన క్రింద ఉన్న నలుపు సంగతి మర్చిపోయి అందంగా ఉన్నానని విర్రవీగినట్లు
ఈమె తనుచేసింది మర్చిపోయి అందరినీ హేళనచేస్తూ తనేగొప్పఅని చెప్పుకుంటుంది.     

హుందాతనం

                                                                   హుందాతనం అనేది పుట్టుకతోనే రావాలి కానీ మధ్యలో నేర్చుకునేది కాదు.ఎందుకంటే అది మధ్యలోఎక్కడో ఒక్కళ్ళకి తప్ప అలవడేది కాదు.శాలిని ఇంటి ప్రక్కన ఒక పెద్దాయన ఉన్నాడు.చిన్నా చితకా వయసు కాదు.పైగా ఆయనకు  డెభై ఏళ్ళు.ఆయన సరదాగా మాట్లాడుతాను అనుకుంటాడో ఏమో? కానీ శాలినికి అయితే వెకిలిగా మాట్లాడుతున్నాడని అనిపించి చికాకు వస్తుంది.ఒకరోజు శాలిని తన భర్తతో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుందో?అన్నట్లు దొంగ చూపులు చూస్తున్నాడు.వయసుకు తగినట్లుగా చక్కగా హుందాతనంతో ప్రవర్తిస్తే ఎంత బాగుంటుందో?అని శాలిని అనుకుంది.పెద్దాయన ఒకరోజు పిలిచి మరీ ఏమండీ మామీద అలిగారా ఏమిటి?మాట్లాడటంలేదు అన్నాడు.మీ మీద అలగాల్సిన అవసరం మాకేమిటండీ?అని శాలిని దీర్ఘం తీసింది.శాలిని వాళ్ళ అమ్మ అయితే బాబాయిగారు మాకు మీమీద అలగాల్సిన అంత  అవసరం ఏముంటుంది?అనిఅనకపోయావా!అన్నారు.అవునమ్మా!మొదటే బాబాయి గారు,పిన్ని గారు అని పిలవాల్సింది తప్పు చేశాను అని శాలిని చెప్పింది.

100%=50%

                                                               మాధవీలత డిజైనరు డ్రెస్సులుకుట్టటం నేర్చుకుందామని ఒక ప్రకటన చూచివెళ్ళింది.మాదగ్గరనేర్చుకుంటే 100%  గారంటీగా మీకు వస్తుంది.అందరిదీవేరు మాదివేరు అని డబ్బులు ముందే కట్టాలి అంటే అప్పతెచ్చిమరీ నేర్చుకుందామనే ఆశతో డబ్బు కట్టింది.కొన్నిరోజులు వచ్చిరావటానికి వీలుకాకపోతే ఆరునెలల తర్వాత వచ్చినా మీకు వచ్చేవరకూ నేర్పుతాము అని చెప్పింది.నిజమేనని నమ్మింది.అత్యవసర పరిస్థితుల్లో మానేయాల్సివచ్చి కొన్ని రోజులు మానేసింది.మూడు నెలల తర్వాత వెళ్ళింది.వెళ్ళిన తర్వాతనుండి మీరు ఇక వెళ్లిపోవాలి సంవత్సరాల తరబడి చెప్పాలా?అని మాట్లాడటం మొదలెట్టింది.అందరిలాగా ఇన్ని రోజులకు ఇంతఫీజు మీరు నేర్చుకున్నంత  అంటే మొదటే ఏ సమస్యా ఉండదు.ఇష్టమయిన వాళ్ళే చేరతారు.100 % గారంటీ అని చెప్పుకోవటం ఎందుకు? వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయస్సు వారికయినా నేర్పుతాము అని ప్రకటనలు ఇస్తుంటారు.చిన్న వయస్సు వాళ్లకు ఒకరకంగా,పెద్ద వయస్సు వాళ్ళకయితే భాద్యతలు ఉంటాయి కనుక ఒక రకంగా శిక్షణ ఇవ్వాలి.కొంచెం తెలివి ఉన్నవాళ్ళకు 70% మాత్రమే,మధ్యరకం వాళ్ళయితే 50% అదీ లేనివాల్లకయితే 30% మాత్రమే నేర్చుకోగలరు.దీన్ని బట్టి ఏమి అర్థమవుతుందంటే 100%=50%.ఎంతటి మొద్దులకు అయినా నేర్పగలిగిన వాళ్ళే సరయిన గురువులు.తెలివిగల వాళ్ళకు నేర్పటంలో వింత ఏమున్నది?పెద్ద వాళ్ళని చూడకుండా వాళ్ళకు రాదు వాళ్ళది  మట్టి బుర్ర అనటం మొదలెట్టింది.దయచేసి అప్పులు చేసి మరీ మోసపోకండి.ఏదో నేర్చుకుందామని ఆమె చెప్పిన తియ్యటి మాటలు నమ్మి నిజమేననుకొని నలుగురిని తీసుకెళ్ళి మరీచేర్చింది.ఈమె నష్టపోయిందికాక నలుగురు నానా మాటలు మాట్లాడుతుంటే ఆమె వలన మాధవీ లత  తల దించుకోవాల్సి  వచ్చింది.పక్కవాళ్ళను కూడా ఉద్దరిద్దామనే ఆలోచనలో ఒక్కొక్కసారి మనం మాట  పడవలసి వస్తుంది.అందుకే ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం.     

సర్వం వ్యాపారం

                                                 మాలతి,మాధురి ఏదయినా స్వంతంగా పెట్టుకుందామని  శిక్షణకు వెళ్లారు.ఫీజు తీసుకోవటానికి చూపినంత ఆసక్తి శిక్షణ ఇవ్వటానికి చూపలేదు.ఒకసారి వెళ్ళినవాళ్ళు ఎవరికయినా అక్కడ శిక్షణ బావుంది  ఫలానా చోట శిక్షణ తీసుకోండి అని వేరే వాళ్ళకు ఎలా చెప్పగలరు?అమాయకంగా నేతిబీరకాయలో నెయ్యి ఉందని అనుకున్నట్లు ఏదో నేర్చుకుందామని వస్తూనే ఉంటారు.వీళ్ళు వెళ్లి ఎంత మందికి చెపుతారులే అనుకొంటారో ఏమోగానీ,సరిగ్గా శిక్షణ ఇస్తే మంచి పేరు వస్తుందన్నఆలోచనే ఉండదు.ఇప్పుడు డబ్బు చేతిలో పడింది అన్నఉద్దేశ్యం తప్ప మంచి ఆలోచనలేదు.తీసుకున్న డబ్బుకు న్యాయం చేద్దామన్నఇంగిత జ్ఞానం ఉండటం లేదు.సర్వం వ్యాపారంగా ఉంది.దానికి శిక్షణ ఇస్తాము,దీనికి శిక్షణ ఇస్తాము అని ప్రకటనలు ఇవ్వడం,బోర్డు పెట్టుకోవటమే కానీ వాటివల్ల ఉపయోగం లేకుండా ఉంది.మొదటి నాలుగు రోజులు రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచినట్లు కబుర్లు ఆ తర్వాత ఎందుకు వచ్చిన ఖర్మ అన్నట్లు ఉండటం మళ్ళీ కొత్తవాళ్ళను వెదుక్కోవటం పాతవాళ్లు విసుగు వచ్చి మానెయ్యడం యధా రాజా తధా ప్రజా అన్నట్లు ఉంటుంది పరిస్థితి.ఏది నేర్చుకోవాలనుకున్నా సరయిన శిక్షకులు దొరికితే డబ్బు ఖర్చు పెట్టినా నేర్చుకున్నామన్న తృప్తితోపాటు ఉపయోగం ఉంటుంది.మా వల్ల ఇంతమంది జీవితాలు బాగున్నాయన్న సంతోషం నేర్పే వాళ్ళకు కలుగుతుంది.ఇప్పుడు వీటన్నిటి కన్నా డబ్బే ముఖ్యం. 

Friday 27 December 2013

ఎగతాళి

                                                       మనీష ఒకరోజు వ్యాపారరీత్యా హిందీలో మాట్లడాల్సివచ్చింది.పక్కింటివాళ్ళు హిందీవాళ్ళు.అందుకని వాళ్ళను పిలిచి మాట్లాడమంది.మనీష అంతకుముందు హిందీ గలగలా మాట్లాడతానని అనుకుని హిందీ నేర్చుకోవటానికి వెళ్ళింది.మూడు బస్సులు మారి కష్టపడి ఎండలు మండిపోతున్నా రెండు నెలలు వెళ్ళింది.అక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బలాగా అయింది.ఊహించినది ఒకటి జరిగినది ఒకటి.మీరు హిందీ అనర్గళంగా మాట్లాడదామని ఎక్కడికో వెళ్లారు కదా నన్ను పిలుస్తున్నారేమిటి? అని ఎగతాళిగా మాట్లాడింది.అప్పుడు ఏమి మాట్లాడాలో తెలియక,నిజం చెప్పలేక నేను సరిగ్గా వెళ్ళలేదు కదా నాకన్నా నువ్వు బాగా మాట్లడతావని నిన్ను పిలిచానులే అని కప్పిపుచ్చుకుంది.ఆమె అలా దెప్పి పొడుపుగా మాట్లాడటంతో డబ్బు ఖర్చు అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.డబ్బు పోయి శని పట్టినట్లుగా ఇలాంటి వాళ్ళందరితో  ఎగతాళిగా మాట్లాడించుకోవాల్సి వచ్చిందే అని మనీష మనసులో చాలా బాధ పడింది.


నువ్వు నాకు తగవు

                                                          శోధన విదేశాలలో ఉంటుంది.శోధన  స్నేహితుల ఇంటికి భారతదేశం నుండి దివ్య,కొడుకును తీసుకుని వెళ్ళింది.ఆమె వైద్యురాలు.ఆమె భర్త దివ్యకు చదువంటే ఇష్టమని అతను ఉద్యోగం చేస్తూ ఆమెను చదివించాడు.దివ్య వైద్యవృత్తి  అయిన తర్వాత విదేశాలకు  వెళ్తాను అంటే భర్తే పంపించాడు.దివ్య పిల్లాడిని తీసుకుని విదేశాలలో బంధువుల ఇంటికి వచ్చింది.అక్కడ ఉద్యోగంలో చేరింది.తర్వాత నువ్వు నాకు తగవు అంటూ భర్తకు విడాకులు,మనవర్తి కావాలని నోటీసు పంపింది. ఏమిటి శోధనా?దివ్య తన భర్తను విడాకులు,డబ్బు కావాలని అడిగిందట.భర్త డబ్బుతో చదువుకుని విదేశాలకు వెళ్ళిఅదేం పోయే కాలం? భార్యను నమ్మి చదివించినందుకు ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా అలా చేసిందేమిటి?ఇప్పుడు భారతదేశం లో ఇది ఒక క్రొత్త పోకడ అట కదా?అని అడిగారట.శోధనకు మొదట ఏమి  సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.తర్వాత తేరుకుని అందరూ ఆవిధంగా ఎందుకు చేస్తారు?ఎక్కడో దివ్య లాంటి వాళ్ళు కొద్ది  మంది ఉంటే భారత దేశం మొత్తాన్ని అనుకోవడం సబబు కాదు కదా!అంది.చివరకు స్నేహితులు అదీ నిజమేలే!అని శోధనను సమర్ధించారు.

నంగనాచి తుంగబుర్ర

                                                     పద్మిని చదువుకున్నది కానీ ఇంగ్లిషు బాగా మాట్లాడగలిగితే బాగుంటుందని నేర్చుకోవటానికి వెళ్దామని పక్కింటి ఆమెతో అంటే మాఅమ్మాయికి కూడా సెలవలు అందుకని మాఅమ్మాయిని కూడా తీసుకెళ్ళండి.ఇప్పుడు నాదగ్గర డబ్బులు లేవు.ఊరునుండి రాగానే ఇస్తాను అంటే నిజమే అనుకొని తనతో తీసుకెళ్ళి డబ్బులు కట్టింది.తర్వాత రోజు పక్కింటి వాళ్ళ అమ్మాయి నేను రానని భోరుభోరున ఏడవటం మొదలు పెట్టింది.చిన్నపిల్ల కూడా కాదు ఇంటరు చదువుతుంది.పిల్ల రాకపోతే మీరు ఏమి చేస్తారు? వదిలేయండి అని వాళ్ళఅమ్మచెప్పింది.మరి డబ్బులు సంగతి ఏమిటి?అంటే చెప్పే ఆమెకి పిల్ల రానంటుంది అని డబ్బులు తీసుకోండి అని తేలిగ్గా చెప్పింది.డబ్బులు ముందే తీసుకున్నామెకు డబ్బులు తిరిగి ఇవ్వటం ఇష్టం లేక పద్మినికి,వాళ్ళ స్నేహితురాలికి మీకు అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను అని కథలు చెప్పింది.ఆవిడ నేర్పలేదు.ఈవిడ డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ నష్టపోయారు.తన్ను మాలిన ధర్మం చేయగూడదని డబ్బు దగ్గర మొహమాటం పనికిరాదని స్నేహితురాళ్ళకు అర్ధమయింది.వాళ్ళిద్దరూ నంగనాచి తుంగబుర్రల్లాగా కూర్చున్నారు.  

మీరే వెతుక్కోండి

     సౌమ్య బంధువులలో ఒకతను అమెరికాలో ఉంటాడు.మాపిల్లలని మీరే మీకు నచ్చినవాళ్ళను వెతుక్కుని
పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పాను.మీపిల్లలను కూడా వాళ్ళనే వెతుక్కుని  పెళ్ళిళ్ళు చేసుకోమను అని చెల్లెలికి చెప్పాడట.చెల్లెలంటే అన్నకు చాలా ప్రేమ.అయినా అన్నఇలాఅన్నాడు అని అందరికీ చెప్పి భాదపడేది.అందరూ నువ్వు డబ్బులు ఇస్తానననిదే ఏమి కుదర్చాలి అని ఎగతాళిగా మాట్లాడారని,నాన్న లేకపోవటంవల్లే ఇలా మాట్లాడారని నాన్న ఉంటే అతనే వెతుక్కునేవాడు  కదా అని ఒకరోజు
సౌమ్య వాళ్ళింటికి కూడా వచ్చి తెగ భాదపడింది.వీళ్ళు జాలిపడి ఆ భారం నెత్తినవేసుకుని చాలా సంబంధాలు
చూచి ఖర్చులన్నీ భరించి ఎక్కడంటే అక్కడ పిల్లను హోటలులో చూపించి,ఫోనుల్లో మాట్లాడి కష్టపడి ఒక
సంభందం కుదిర్చారు.పిల్ల పొట్టిది.ఎలాగో కష్టపడి కుదిర్చితే మాఅమ్మాయి అదృష్టం కనకే కుదిరింది అనిచెప్పేది.
మీరు తొందర పడుతున్నారు అని కుదిర్చినవాళ్ళను లక్షా తొంబై ప్రశ్నలు వేసాడు.ఇంతకీ ఏమిటంటే వాళ్ళ అమ్మాయి తెల్ల అబ్బాయిని వెతుక్కుందని చెప్పకుండా ఇండియాలో ఉన్నవాళ్ళను కూడా మీరే వెతుక్కోండి
చెప్పాడు.   

Thursday 26 December 2013

ఇల్లు కన్నా ఆసుపత్రి మిన్న

       ట్రినిడాడ్&టొబాగో చాలా అందమైన ద్వీపం.పోర్ట్ ఆఫ్ స్పెయిన్ రాజధాని.అక్కడి ప్రభుత్వం ప్రజలకోసం

చక్కటి  సదుపాయాలు కల్పిస్తుంది.అక్కడి ప్రభుత్వాసుపత్రులలో ఎవరైనా చేరితే చాలు భోజనం,ఆసుపత్రి

సేవలన్నీఉచితం.

అందుకే అక్కడివాళ్లు పెద్దవాళ్ళను ఆసుపత్రిలో చేర్చి వెళ్ళిపోతారు.కొంతమంది కొన్నిరోజుల తర్వాత ఇంటికి

తీసుకుని వెళ్తారు.కొంతమంది అలా వదిలేస్తారు.అప్పుడు సోషల్ సర్విసువాళ్ళు తీసుకెళ్ళి సర్వీసు హోమ్ లో

 ఉచితసేవలందిస్తారు.క్రిస్మస్,నూతనసంవత్సరం సందర్భంగా వాళ్ళు సంతోషంగా ఉండటానికి పెద్దవాళ్ళను

ఆసుపత్రిలో చేర్చి వెళ్తారు.ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రులన్నీకిటకిటలాడిపోతుంటాయి.డాక్టర్లకు అసలు

 విశ్రాంతి ఉండదు.డాక్టర్లు,నర్సులు కూడా చక్కటి సేవలందిస్తారు.ఇల్లు కన్నా ఆసుపత్రి మిన్న అని అక్కడి

వాళ్ళు ఆసుపత్రిలో చేర్చి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు.  














 

Tuesday 24 December 2013

ఇనప్పెట్టె

  పూర్వం అందరి ఇళ్ళల్లో ఇనప్పెట్టెలు అబ్రకంతో తయారుచేసినవి ఉండేవి.ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు
కొనుక్కొనేవాళ్ళు.బాగా డబ్బున్నవాళ్ళ ఇళ్ళల్లో చాలా మందంగా ఉండేవి.ఎవరూ పగలగొట్టటానికి కూడా
వీలుకానంత బలంగా ఉండేవి.ఇప్పటికీ జాహ్నవి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంది.ముందు తరాలవారికి
చూపించటం కోసం కాణి,అర్దణా,బేడ,పైసా,రెండు పైసలు,ఐదుపైసలు,పదిపైసలు,పావలా,అర్దరూపాయి,
రూపాయి,రెండురూపాయిలు,ఐదురూపాయిలు,పదిరూపాయిలు నాణేలు దాచి ఉంచారు.కాణి అంటే బెజ్జం
ఉండి రాగితో తయారయి ఉండేది.ఇత్తడి నాణేలు కూడా ఉండేవి.ఇనప్పెట్టెతాళాలు ఇంటిపెద్దవద్ద మాత్రమే ఉండేవి.

      2 కాణీలు-1 అర్దణా
      2 అర్దణాలు -1 అణా
      4 కాణీలు -1 అణా
      8 కాణీలు -1 బేడ
       2 బేడలు -1 పావలా
       4 అణాలు -1 పావలా
       2 పావలాలు -1 అర్ద రూపాయి
       2 అర్ద రూపాయిలు -1 రూపాయి

జుట్టు రాలకుండా-పెరగటానికి

1 )ఉల్లిపాయ మిక్సీలో వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఉల్లిపాయ,పెరుగు సమపాళ్ళల్లో తీసుకుని దాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
2 )అలొవెరా(కలబంద),అరటిపండు సగం కలిపి మిక్సీలో వేసి తలకు పట్టించి బాగాఆరేవరకూ ఉంచి తలస్నానం
చేయాలి.
3 )అలోవెరా మిక్సీలో వేసి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
4 )కుడి,ఎడమ చేతి గోళ్ళు ఎనిమిదింటిని ఒకదానిపై ఒకటి ఉంచి ఉదయం,రాత్రి పడుకోబోయేముందు
5,6 ని.లు రుద్దాలి.
5 )మెంతులు,జీరా సమానంగా తీసుకుని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి మరునాడు పాలతో మెత్తగా రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
6 )కుంకుడుకాయలు కొంచెం ఉడికించి దానిలో మందార ఆకులు తుంచి కొంచెం చేతితో నలిపితే చిక్కటి రసం
వస్తుంది. దానితో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,నల్లగా పెరుగుతుంది.

పరాన్నజీవి -మాట నిలబెట్టుకోనలేకపోవటం

జ్యోత్స్న ఇంటి ఓనర్ ఒక పరాన్నజీవి(పారాసైట్).ఒక ఆమె కదా ఇండిపెండెంట్ ఇల్లు అని ఎక్కువ అయినా ఆ
ఇంటికి అద్దెకు వెళ్ళింది.ఆ తర్వాత కానీ అది ఎంత తప్పో అర్థం కాలేదు.ఉదయం జ్యోత్స్న భర్త,పిల్లలు వెళ్ళగానే
పైనుండి దిగి జ్యోత్స్నదగ్గరకువచ్చి మళ్ళీ భర్త,పిల్లలు ఇంటికి వచ్చేవరకూ సోదిచెపుతూ టిఫిను,కాఫీ,భోజనం,
టీ అన్నీ ఇక్కడేతినేది,తాగేది.తింటూ అందులో ఉప్పు తగ్గింది,కారం తగ్గింది అంటూ  పేర్లు పెడుతూతినేది.వచ్చి
కూర్చుని తినేదికాక పేర్లు పెట్టకపోతే వండుకుని తినవచ్చు కదా అని జ్యోత్స్నకు అరికాలి మంట నెత్తికి ఎక్కేది.
కొంచెంసేపయినా విశ్రాంతిగాఉండనిచ్చేది కాదు.ఆమెకు కాస్త పిచ్చి ఉంది .అందుకే అలాచేస్తుంది.ఎవరువచ్చినా
అలాగే విసిగించేస్తుంది.అందుకే ఎవరూ ఎక్కువ రోజులు ఉండరు అని తెలిసినవాళ్ళు చెప్పారు.ఇంటిఓనరు ఇలా
ఉదయంనుండి విసిగిస్తుంది అనివాళ్ళ అమ్మతోచెప్పటం విన్నది.అప్పటినుండి నీళ్ళురాకుండా వాల్వ్ కట్టేసేది.
వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడతన్నారు అని అందరికీ చెప్పేది.తను వచ్చివీళ్ళ ఇంట్లోపడి మేస్తన్నానని చెప్పేదికాదు.
         
       మొదట ఇంట్లోకి వచ్చేటప్పుడు నీళ్ళ బిల్లు చెరిసగం అని చెప్పింది.తర్వాత నేను ఒక్క దాన్నేగా అని జ్యోత్స్న వాళ్ళతో మొత్తం బిల్లు కట్టించేది.ఇలా మాటమీద నిలబడకుండా మాట మార్చేవాళ్ళంటే జ్యోత్స్నకు చిరాకు.ఒక మాటఅంటే ఆమాట మీద నిలబడాలి.అలామాట నిలబెట్టుకొనలేని వాళ్ళు మొదటే మాట్లాడకూడదు.ఇది ఆమెకే
కాదు ఇలాటివాళ్ళందరికీ వర్తిస్తుంది.ఆమెకంటే మతిస్థిమితం లేదనిఅనుకొందాం.ఇలాంటిమాట నిలబెట్టుకోలేని
వాళ్ళ పరిస్థితి ఏమిటి?జ్యోత్స్న దృష్టిలో ఇది చాలా పెద్ద తప్పు.నష్టం వచ్చినా,కష్టంగాఉన్నా జ్యోత్స్నమాటఅంటే
ఆ మాటమీదే ఉంటుంది.ఒక్క జ్యోత్స్నేకాదు ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు.అదే మంచి జరుగుతుందని
జ్యోత్స్ననమ్మకం.మాట తప్పినవాళ్ళకి భాధ వుండదేమో కానీ ఎదుటివాళ్ళు ఎంత భాధ పడతారు.వాళ్ళు అలా
బాధపడితే వీళ్ళకి కలిసి వస్తుందా?అని ఆలోచిస్తే ఎవరూ అలా చేయరు.ఇది చదివిన తర్వాత అయినా కొంత  మందిలో అయినా మార్పు వస్తుందని నా ఆశ.దయచేసి మొదటే సరిగ్గా మాట్లాడుకోవటం నేర్చుకోండి. 

Monday 23 December 2013

ఇరుగు-పొరుగు

     ఇరుగు చల్లన,పొరుగు చల్లన అని శాస్త్ర్హం.ఇరుగు,పొరుగు బాగా ఉంటేనే మంచిదని పెద్దలు చెప్తారు.
వసుమతికి మంచి ఇరుగు,పొరుగు లేదు.దక్షిణం తలుపు తీస్తే ఆ ఇంట్లో ఉన్నతను ఇంట్లోకి తొంగి చూస్తాడు.
ఆడవాళ్ళు కన్పిస్తే చాలు నోరు తెరుచుకుని చూస్తాడు.ఉత్తరం వైపు వాళ్ళు ఆవిడ మాట్లాడుతుంటే వాళ్ళాయన వచ్చేసి కల్పించుకుని మాట్లాడతాడు.ఈలోపు మనం అటువైపు చూస్తే టవల్ తెచ్చి వాళ్ళాయన మీద కప్పుతుంది.
ఆయన తాతయ్యలాగా ఉంటాడు.ఇద్దరి ప్రవర్తన విచిత్రంగాఉంటుంది.అదిఏంటో వాళ్ళకే తెలియాలి.ఇక తూర్పున
ఎవరూ ఉండరు కానీ ఎప్పుడో ఒకసారి వస్తారు.వాళ్ళు వింతగా చూస్తారు .ఆ పక్కిన్టివాడు రొజూ మూడు అంతస్తులు ఎక్కిమరీ చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిచేసుకొనే పనివాళ్ళను,రోడ్డున వెళ్ళే ఆడవాళ్ళను వెకిలిగా చూస్తూ ఉంటాడు.
ఇక పడమర ఒక గయ్యాళి ఆమె ఉంది.ఎప్పుడు చూసినా అందరినీ అరుస్తూ ఉంటుంది.ఇదండీ పరిస్థితి.ఎంతో
ఖర్చు పెట్టి కట్టుకోవటమో,కొనుక్కోవటమో చేస్తే ఇలాంటి ఇరుగు,పొరుగు ఉంటే ఏమి చెయ్యాలి? సలహా ఇవ్వండి.

బాడకోవ్

     స్నిగ్ధ పెళ్ళి అయిన కొత్తలో తెలుగు వచ్చేది కాదు.ఇంటి ప్రక్కన ఆమె వాళ్ళ అబ్బాయిని బాడకోవ్ అంటూ ఉండేది.ఆ అబ్బాయి అసలు పేరు భార్గవ్.స్నిగ్ద్ధకు ఆవిషయం తెలియదు. ఒకసారి ఏయ్,బాడకోవ్ ఇలా రా అని
పిలిచిందట.అక్కడ చాలా మంది ఉండగా అలా పిలవటం నామోషీగా ఫీలయ్యాడు.భార్గవ్ కి బాగా కోపం వచ్చి
మాట్లాడటం మానేసాడు.ఈవిషయం తన భర్తకు చెప్పింది.అది తిట్టు.అలా పిలిస్తే ఎవరికయినా కోపం వస్తుంది.
ఇంకెప్పుడూ అలా పిలవకు అని చెప్పారు.స్నిగ్ధ ఆ పిల్లవాడ్ని పిలిచి సారీ,మీఅమ్మ పిలుస్తుంటే అది నీ పేరు
అనుకుని పిలిచాను.నాకు తెలుగు రాదు కనుక అర్ధం తెలియదు అని చెప్పినా వాడి కోపం తగ్గలేదు సరికదా
ఇప్పటికీ మాట్లాడడు.ఇప్పుడు కొంచెం తెలుగు మాట్లాడుతుంది.అయినా స్నిగ్ధ భర్త నువ్వు పక్కింటి వాళ్ళ
 మాటలు విని ఏదో ఒకటి మాట్లాడకు.నిన్ను తెలుగు,ఇంగ్లీష్,హిందీ నేర్పించే ఇన్స్టిట్యూట్ లో చేర్పిస్తాను.
చక్కగా నేర్పిస్తారు,నేర్చుకున్దువుగాని అని చెప్పారు.స్నిగ్ధ ఇన్స్టిట్యూట్ లో చేరి చక్కగా నేర్చుకుని ఇప్పుడు
బాగా మాట్లాడుతుంది.

Sunday 22 December 2013

కుసంస్కారి

     రేవతి ఇంటికి రెండిళ్ళ అవతల ఒక మూడంతస్తుల ఇల్లుంది.ఆ ఇంటిఓనరు పైకివెళ్లి ఆచుట్టుప్రక్కల ఇళ్ళల్లో
పనివాళ్ళు పని చేసుకుంటుంటే చూస్తూఉంటాడు.ఎవరయినా గమనించారని అనుకొంటే వెనక్కి వెళ్ళటమో లేక
ఫోనులో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు.ఈ విషయం రేవతి వాళ్ళ పనిమనిషి గమనించింది.వాడు కుక్కపిల్లలని
అమ్ముకుంటూ ఉంటాడు.నల్లగా ఉంటాడు.అమ్మా!పైన ఒక నల్లకుక్క ఉంది.పనిచేసుకుంటుంటే ఆదే పనిగా చూస్తుంది.దాన్ని పైనుండి కిందికి తోసేయాలన్నంత కోపంగా ఉంది అనిచెప్పింది.రేవతికి ఒక్క క్షణం అర్ధంకాలేదు.
తర్వాత వివరంగా చెప్పింది.పైకి చూస్తే ఏమీ కనిపించలేదు.వాడు మనం చూస్తే కనిపించడుఅని చెప్పింది.ఇలా
అయితే పని ఎలా చేయాలమ్మా?అంది.రేవతి కి ఏమి మాట్లాడాలో తెలియలేదు.అతను అలా చూడడం
సంస్కారం లేకా?మానసిక జాడ్యమా?మనుషులు ఇంత కుసంస్కారులుగా ఉంటారా ? 

Saturday 21 December 2013

వెయ్యేళ్ళు ధనవంతుడవై వర్ధిల్లు

అనిరుద్ తాతగారికి కాస్త చాదస్తం.పిల్లలు అల్లరి చేస్తుంటే వెధవల్లారా,బడవల్లారా అని అనేవారు.అలా అనటం
పిల్లలకు నచ్చేది కాదు. మీతాతగారు ఎప్పుడు చూసినా అలా అంటారేమిటి ?అని అనిరుద్ ని సతాయించేవారు.
అనిరుద్ వాళ్ళ తాతగారి దగ్గరకు వెళ్లి మాస్నేహితులకు,నాకు మీరు అలా అనటం ఇష్టం లేదు అని చెప్పాడు.
అప్పుడు వాళ్ళ తాతగారు తన అలవాటు కప్పిపుచ్చుకుంటూ నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అనిచెప్పారు.
ఎలా అంటే వెధవ అంటే వెయ్యేళ్ళు ధనవంతుడవై వర్ధిల్లు అని అర్ధం.బడవ అంటే బాగా డబ్బున్నవాడివై వర్ధిల్లు
అని అర్ధం అన్నారు.సరేలే తాతగారూ  అలాగే మమ్మల్ని దీవించండి అని అనిరుద్ ఆటలకు వెళ్ళిపోయాడు.
హమ్మయ్య పిల్లల బెడద వదిలింది అని తాతగారు సంతోషించారు.

మరకలు పోవాలంటే

1 )దుస్తులమీద అంటుకున్న చూయింగ్ గమ్ తొలగించాలంటే ఆ దుస్తులను ప్లాస్టిక్ కవరులో ఉంచి ఫ్రిజ్ లో
పెట్టాలి.గట్టిపడిన గమ్ సులభంగా తీసివేయవచ్చు.
2 )తెల్లని బట్టలపై పసుపు మరకలు పోవాలంటే బాగా ఎండలో ఆరేసి చాలాసార్లు నీళ్ళు చల్లుతూ ఎండనిస్తే
పసుపురంగు పోతుంది.
3)వంటింట్లో ఉండే టైల్స్ మీద మరకలు పోవాలంటే నిమ్మచెక్కతో రుద్ది 15 ని.ల తర్వాత మెత్తటి బట్టతో
తుడవాలి.
4)బట్టలపై బాల్ పెన్ మరకలు పోవాలంటే నిమ్మరసం పొడిబట్ట మీద వేసి రుద్దాలి.

రక్తనాళాలలో అవరోధాలు తొలగాలంటే

ధనియాలు,జీలకర్ర సమపాళ్ళల్లో తీసుకుని పొడిచేసి ఉదయం పరగడుపున ఒకస్పూను నోట్లో వేసుకుని

మంచినీళ్ళు తాగాలి.ఒక అరగంట వరకూ ఏమీ తినకూడదు,తాగకూడదు.ఇలా ఒక 45 రోజులు చేయాలి.

ఇలాచేస్తే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలోని అవరోధాలు తొలగిపోతాయి.సంవత్సరానికి ఒకసారి

చేస్తే సరిపోతుంది.గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Friday 20 December 2013

చిన్ని చిట్కాలు

1 ) 2 యాలకులు పొడిచేసి ఒక స్పూను తేనెతో కలిపి తీసుకొంటే జలుబు,దగ్గు తగ్గుతాయి.
2 )మరుగుతున్న నీళ్ళల్లో యూకలిప్టస్ ఆకులు కానీ,ఆయిల్ కానీ వేసి ఆవిరి పట్టుకొంటే జలుబునుండి ఉపశమనం లభిస్తుంది.
3 )అలసట,మానసిక ఒత్తిడితో బాధపడేవారికి తేనె దివ్యఔషధం.పాలలోకానీ,నిమ్మరసంలో కానీ కలుపుకుని
తాగితే ఎంతో ఉపశాంతిని ఇస్తుంది.
4 )చర్మం మీద దద్దుర్లు వస్తే వేపాకుల్ని నూరి రాయాలి.

హార్మొనీ పెట్టె

   కమల తాతగారు ఊరిపెద్ద .ఒక సంగీతం మాస్టారు తనకు ఉపాధి చూపించమని కమల తాతగారి వద్దకు
వచ్చారు.అప్పుడు ఆయన తన మనుమరాలు కమలకు చుట్టుప్రక్కల వారి పిల్లలకు సంగీతం నేర్పించమని
చెప్పారు.అలా కమలతోపాటు ఒక పదిమంది పిల్లలకు సంగీతం నేర్పించటం మొదలు పెట్టారు.కమల తాతగారు
ఒక హార్మొనీ పెట్టె కొనిచ్చారు.స,రి,గ,మ,ప,ద,ని,స అంటూ పిల్లలు నేర్చుకొనేవారు.కొన్నిరోజులు నేర్పిన తర్వాత
మాస్టారి ఆరోగ్యం సరిగా లేక వాళ్ళ పిల్లల ధగ్గరకు వెళ్ళిపోయారు.తర్వాత పిల్లలు సంగీతం నేర్చుకోవటం మానేసారు.
 ఒకతను హార్మొనీ పెట్టె మేడలో వేలాడేసుకొని పాటలు పాడుకొంటూ బియ్యము,డబ్బులు కోసం వచ్చేవాడు.
తనకు ఐదుగురు పిల్లలని ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పాడు.అతని పెట్టె పాతది అయిసరిగా పనిచెయ్యడంలేదు.
అందుకని కమల తాతగారు కమల హార్మొనీ పెట్టె అతనికి ఇప్పించారు.తన భుక్తి కోసం కొత్తపెట్టె ఇచ్చారనే
కృతజ్ఞతతోనో ఏమో అతను చుట్టుప్రక్కల అందరి ఇళ్ళకు వచ్చినా కమల వాళ్ళింటికి మాత్రం వచ్చేవాడు కాదు.
అలా హార్మొనీ పెట్టె అతని భుక్తికి ఉపయోగపడింది.    
   

Thursday 19 December 2013

త్వరగా నిద్ర పట్టాలంటే

1 )రాత్రి నిద్ర పట్టక అవస్థ పడేవారు పడుకొనేముందు గోరువెచ్చటి నీటితో స్నానంచేసి,వేడిపాలలో కాస్త తేనె,

పంచదార కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుంది.

2 )రాత్రి నిద్రపోయేముందు మనకు నచ్చిన  పుస్తకం చదువుకుంటూ పడుకొన్నా నిద్ర బాగా పడుతుంది.

3 )రాత్రి పడుకోబోయేముందు  నచ్చిన సంగీతం వింటూఉంటే  ప్రశాంతంగా ఉండి హాయిగా నిద్ర పడుతుంది.

4 )నిద్రకు ఉపక్రమించే ముందు ధ్యానం చేసుకొంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో నిద్ర బాగా పడుతుంది. 

Wednesday 18 December 2013

పొట్టి పొట్టి చిట్కాలు

1 )నిమ్మరసం,ఉల్లిరసాల మిశ్రమం ఒక టీ స్పూన్ పుచ్చుకొంటే ప్రయాణంలో అనారోగ్యం కలుగదు.
2 )పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో చిన్న కొబ్బరిముక్కను వేసి చూడండి.
3 )బంగారు వస్తువులను ముందుగా షాంపు నీటిలో కడిగి,ఆరబెట్టి,పసుపులో ముంచిన బట్టతో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
4 )ఇత్తడి వస్తువులు మెరవాలంటే నిమ్మఉప్పు,నీరు రుద్ది 15 ని.లు తర్వాత మెత్తటి బట్టతో తుడవాలి.
5)దువ్వెనలు 2స్పూన్ల వాషింగ్ సోడాలోవేసి 30 ని.లు ఉంచితే మురికిపోతాయి.
 6 )దుస్తులమీద పడిన టీ మరకలు పోవాలంటే ఒక టొమాటోముక్కను మరకమీద గట్టిగా రుద్ది సబ్బుతో ఉతకాలి.
7 )ఇడ్లీలు మృదువుగా,రుచిగా ఉండాలంటే వెన్న చిలికిన మజ్జిగను పిండి రుబ్బేటప్పుడు పోయాలి.
8 )కస్టర్డ్ తయారు చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడే కాస్త పంచదార చల్లితే పైన పొర ఏర్పడకుండా ఉంటుంది.
9 )మెంతులు,జీలకర్ర సమాన కొలతతో తీసుకొని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి మరునాడు పాలతో మెత్తగా రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
10 )పుదీనా,పసుపు సమపాళ్ళల్లో తీసుకొని మెత్తగా నూరి ముఖానికి రాసుకుని 10 ని.ల తర్వాత కడిగితే మొటిమలు,మచ్చలు తగ్గుతాయి.

సీతమ్మ మజాకా

        లావణ్య అపార్ట్ మెంట్ లో సీతమ్మగారు ఉండేది.ఆవిడ మంచిదే కానీ పనివాళ్లకు మాత్రం ఆమె అంటే భయం.
పూజలుచేస్తూ అపార్ట్ మెంట్ లోభోజనాలు పెడుతూఉండేది.పనివాళ్లకు కూడాఅన్నీపెట్టేది.ఏది కావాలంటే అది
ఇచ్చేది.గురువారం,శుక్రవారం వచ్చిందంటే2టబ్ లనిండా ఇత్తడికుందులు వేసి తోమించేది.ఇదిగో శ్రీను ప్రసాదం
పెడతాను ఒకసారిరా అనిపిలిస్తే వచ్చేవాళ్ళు.ఇక వాళ్ళపని అయిపోయినట్లే.ఇదిగో శ్రీనుబాబు కొంచెంఅక్కడనూనె
పడిందిగానీ తుడిచెయ్ అనేది.శ్రీనుబాబు కొంచెం కొట్టుకు వెళ్లిరాఅనేది.అలా ఒక2గంటలు వాళ్ళను విసిగించేది.
ప్రసాదంమాట దేముడెరుగు ఇకరెండోసారి రాకూడదు అనుకొనేవాళ్ళు.ఇలా2,3సార్లు జరిగినతర్వాత ఆమెపిలిస్తే
ఇప్పుడే వస్తాను ఉండండి అని వాళ్ళావిడ లక్ష్మి గానీ,శ్రీనుగానీ వెళ్ళేవాళ్ళుకాదు.ఊరువెళ్ళినా వాళ్ళపిల్లలకు
బట్టలు,స్వీట్స్ తెచ్చేది. ఈమె విసిగిస్తుందని వెళ్ళడం మానేస్తే వాళ్ళింటికివెళ్లి నీకుఅదిఇచ్చాను,ఇదిచ్చాను అని
సతాయించేది.సీతమ్మా మజాకా ఈమెకు ఒక నమస్కారం పెట్టి అక్కడనుండి వెళ్ళిపోయేవారు.  

పప్పులు,బియ్యం నిల్వలు-చిట్కాలు

1 )కందిపప్పు ఎండుకొబ్బరి చిప్పలతో కలిపి పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది.
2 )పప్పులు నిల్వ ఉంచే డబ్బాలో కొద్దిగా ఎండుమిర్చి వేస్తే పురుగు పట్టదు.
3 )పప్పులు వేసవిలోతెచ్చి బాగా ఎండబెట్టి డబ్బాలో పోస్తే సంవత్సరమంతా నిల్వ ఉంటాయి.
4 )కర్పూరం మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచితే పురుగు పట్టదు.
5 )బియ్యంలో వేపాకు కొంచెం ఎండబెట్టి కలిపితే పురుగు పట్టదు.
6 )బియ్యంలో ఎండుమిర్చి కలిపి నిల్వ ఉంచితే పురుగులు రావు.
7 )బోరిక్ పౌడర్ కలిపినా పురుగు పట్టదు.కానీ నీళ్ళతో వండే ముందు శుబ్రంగా కడగాలి.
8 )పప్పులు,బియ్యం నిల్వ ఉంచిన డబ్బాల చుట్టూ చీమలమందు చల్లితే చీమలు రాకుండా వుంటాయి. 

Tuesday 17 December 2013

కోమలాదేవి గారి పూదోట

      కోమలాదేవి గారి ఇల్లు రంగురంగుల పూలతోటతో అందంగా కళకళలాడుతూ ఉండేది.ఒకపువ్వు ఉండి ఇంకొకటి లేదుఅని అనుకోకుండా అన్నిరకాలు ఉండేవి.గులాబీలు,మందారాలు అన్నిరంగులూ ఉండేవి.
ఒక్కొక్క మొక్కకు పాతిక పువ్వులు పూసేవి.ఎక్కడెక్కడి నుండో తెప్పించి మరీ తోటలో నాటించేవారు.
సన్నజాజి,విరజాజి,మల్లె పందిరికి పూసేవి.మల్లెలో బొడ్డుమల్లె అర్ధరాత్రికి విచ్చేవి.ఇవి పూలజడకు బావుండేవి.
వేసవి సెలవుల్లో వాళ్ల పాపతోపాటు అందరు పిల్లలు తలా ఒకరోజు పూలజడ వేసుకోనేవాళ్ళు.మొగ్గ పొడవుగా
ఉండడంవలన జడ చాలా బావుండేది.ఇంకొకరకం మల్లె చిన్నగులాబి అంత పూసేది.ఈరెండు వీళ్ళింట్లో మాత్రమే
ఉండేవి.నాటుమల్లె,గుండ్రనిమల్లె,సెంటుమల్లె పూసేవి.అందరికీ పంచేవాళ్ళు.బంగాళాబంతి,బంతి,చామంతి
చాలారంగులు పూసేవి.40సంవత్సరాల క్రితం ఎవరింట్లో ఇన్నివెరైటీలు ఉండేవికాదు.ఆలిక్స్ రంగురంగులవి పూసేవి.
ఈవిత్తనాలు మధ్యప్రదేశ్ నుండి తెచ్చి వేసారు.ఇవేకాక మరువం,ధవనం,మాచుపత్రిఉండేవి.ఇవికొద్దిమంది వద్ద
మాత్రమే ఉండేవి.ఇవి పూలతో కలిపి మాల కట్టుకుంటారు.పూదానిమ్మ కూడాఉండేది.క్రోటన్స్ అయితే చాలా
ఉండేవి.ఇంట్లో అందరూ శ్రద్ధగా ఎక్కడ క్రొత్త వెరైటీ కనిపించినా తెచ్చేవారు.అలాగే తెగుళ్ళు రాకుండా చూసేవాళ్ళు.
బాగా పోషణ చేయటం వలన పెద్దపెద్ద పువ్వులు పూసేవి.వాళ్ళ అమ్మాయి డ్రెస్ కి తగిన మాచింగ్ పువ్వు
పెట్టుకొనేది.ఎవరూ అడిగినాపువ్వులు ఇచ్చేవాళ్ళు.ఇలా రంగురంగులపూలతో, పచ్చగా,కళగా కోమలాదేవిగారి
పూదోట వెలిగిపోయేది.  

Monday 16 December 2013

ఆలివ్ ఆయిల్ -ఉపయోగములు

1)ఆలివ్ ఆయిల్ తో వంటచేసుకొంటే గుండె ఆరోగ్యంగా ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.
2)ఒక్కొక్క మనిషికి 1/2 కేజి మాత్రమే వాడుకోవాలి.
3)బరువు అదుపులో ఉంటుంది.
4)కనుబొమలు వత్తుగా,నల్లగా ఉండాలంటేఆలివ్ ఆయిల్ రాస్తుండాలి.
5)వారానికి ఒకసారి గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ లో గోళ్ళను కొద్దిసేపు ఉంచాలి.గోళ్ళు పెళుసుబారకుండా
ఆరోగ్యంగా ఉంటాయి.
6)ఆలివ్ ఆయిల్ తో దోసె వేస్తే రుచిగా ఉంటుంది.
7)ఆలివ్ ఆయిల్ శరీరమంతా,ముఖానికి రాసుకొంటే మెరుస్తూ ఉంటుంది.
8)రాత్రి పడుకోబోయే ముందు పెదవులకు రాస్తే పగలకుండా వుంటాయి. 

వసుంధరాదేవి గారి పెరడు

      వసుంధరాదేవి గారి ఇల్లు చూడముచ్చటగా వుండేది.ఇంటిముందు పెద్ద పూలతోట ,ఇంటి వెనుక పెద్ద పెరటితోట ఉండేవి.ఇంటి పెరట్లో రకరకాల కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు,పాదులు ఉండేవి.ఒకటి ఉంది,
ఒకటి లేదు అనుకోకుండా అన్నిరకాలు ఉండేవి.విత్తనాలు కొనుక్కొచ్చి మరీ ఇంట్లో అందరూ శ్రద్దగా
పెట్టేవారు.బీర,నేతిబీర,కాకర,చిక్కుడు,సొర,తమ్మపాదు,దోస,ఇలా అన్నిరకాలు ఉండేవి.పందిళ్ళు వేసి
కాయించేవారు.ఇది 50సంవత్సరాల క్రితం సంగతి.ఇలా ఎందుకు చెప్పానంటే ఆరోజుల్లో ఇంత శ్రద్ధగా అన్నీ
పెట్టేవాళ్ళు కాదు.ఇక ఆకుకూరలు అయితే ఆరోజుల్లోకూడా పాలకూర,చుక్కకూర,తోటకూర,పెద్దబచ్చలి,
చిన్నబచ్చలి,గోంగూర,పుదీనా,కొత్తిమీర,మెంతుకూర,చామఆకు మొదలయినవి ఉండేవి.కూర అరటి
అయితే 150 కాయలతో పెద్దగెలలు వేసేవి.
      ఒకప్రక్కన అమృతపాణి,కర్పూరఅరటి,చక్రకేళి,పచ్చఅరటి ,అన్నిరకాలతో అరటితోట ఉండేది.ఇంకొక
ప్రక్కన జామ,దానిమ్మ,నిమ్మ,గజనిమ్మ,నారింజ,బత్తాయి,సపోటా,ద్రాక్షపందిరి ఉండేవి.అన్నీకూడా విరగ
కాసేవి.బెండ,దొండపాదు,గోరుచిక్కుడు,వంగ,టొమాటో,మిర్చి,సీమమిరప ఉండేవి.వాళ్ళింట్లో వాడుకొని
మిగతావన్నీ చుట్టాలకి ,ఇరుగు,పొరుగు,ఊరందరికీ పంపేవారు.అవన్నీ పంచిపెట్టటానికి ఒకమనిషి
ప్రత్యేకంగా ఉండేవాడు.ఎప్పుడయినాఎవరింట్లో అయినా కూరగాయలు లేకపోతే అడిగి తీసుకెళ్ళేవాళ్ళు.
పలానా వాళ్ళఇల్లు ఎక్కడ అని ఎవరయినా అడగగానే తీసుకొచ్చి మరీ పంపేవారు.ఆమె అంటే అంత గౌరవం.
       
       


  

Sunday 15 December 2013

త్రిమూర్తులు

     త్రిమూర్తులు అంటే విష్ణు,బ్రహ్మ,మహేశ్వరులు.సజల,సఫల,సువ్రత ముగ్గురూ మంచి ఫ్రెండ్స్.ఎప్పుడు,
ఎక్కడ ఎవరికి కనిపించినా ముగ్గురూ కలిసే కనిపించేవారు.ఎక్కడకు వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు.అందుకని
స్నేహితులు,వాళ్ళ క్లాస్ లో  చదివేవాళ్ళు,కాలేజ్ లో  అందరూ,బయటి వాళ్ళు కూడా వీళ్ళముగ్గురినీ
 త్రిమూర్తులు అని పిలిచేవాళ్ళు.షాపింగ్ చేస్తే ముగ్గురూ ఒకేకలర్ శారీస్ సెలెక్ట్ చేసుకొనేవారు.ముందురోజే
ఒకరికొకరు చెప్పుకొని ఒకేవెరైటిడ్రెస్సెస్ వేసుకొనేవారు.వీళ్ళ ముగ్గురేకాక అందరితో ఫ్రెండ్లీ గ ఉండేవారు.ఒక
పెద్దావిడ ఎవరిదగ్గర ఊరికే ఏమీ తీసుకకొనేదికాదు.అందువల్ల ఆమెకు సహాయం చేయటం కోసం అవసరం
లేకపోయినా ఆమెదగ్గర ఏదోఒకటి కొనేవారు.అవి అవసరం ఉన్నవాళ్ళకు ఇచ్చేవాళ్ళు.సజల,సఫల ఒకేచోట ఉండేవాళ్ళు.సువ్రత దూరంనుండి వచ్చేది.కాలేజ్ లోఒక్కొక్కసారి క్లాసెస్ లేకపోతే ముందే పంపించేవారు.
అలాంటప్పుడు సువ్రతను వాళ్ళింటికి తీసుకెళ్ళి బస్ టైం కి బస్స్టాప్ దగ్గరకు వచ్చి బస్ ఎక్కించి తిరిగి ఇంటికివెళ్ళేవాళ్ళు.15సంవత్సరములతర్వాత మొన్నీమధ్యఒక షాపతను సజలకు కన్పించి మీరు ముగ్గురూ
కలిసి మా షాప్ కి వచ్చేవాళ్ళు కదా!అందరూబావున్నారా? అని అడిగాడట.ఇన్నిసంవత్సరాల తర్వాత కూడా
అతను గుర్తుపెట్టుకుని అడగటం భలేథ్రిల్లింగ్ గాఉంది అని సజల ఫోన్చేసి సువ్రత కుచెప్పింది.ఇప్పటికీముగ్గురూ
ఫ్యామిలీ ఫ్రెండ్స్.

Friday 13 December 2013

నొప్పులు-నివారణ

మోకాళ్ళ నొప్పులు :తులసిఆకులు ,ఆముదంఆకులు,సైంధవలవణం కలిపి పేస్టులాగాచేసి మోకాళ్ళమీద రాయాలి.
కళ్ళు నొప్పులు :కళ్ళునొప్పులుగా ఉన్నప్పుడు కీరదోసకాయను గుండ్రంగా కట్ చేసి కళ్ళమీద పెట్టుకోవాలి.కళ్ళను
నాలుగు వైపులా గుండ్రంగా త్రిప్పినా కళ్ళు నొప్పులు తగ్గుతాయి.
కీళ్ళ నొప్పులు:ఆముదం ఆకులు వేడిచేసి నొప్పి ఉన్నచోటపెడితే నొప్పి తగ్గిపోతుంది.

కండరాల నొప్పులు :తులసి గింజలు పొడిచేసి తేనెతో తీసుకోవాలి.
చెస్ట్ నొప్పి ,దగ్గు :తులసి రసం ,పటికబెల్లం పొడితో తీసుకోవాలి.
అరికాళ్ళ నొప్పులు: గోరువెచ్చటినీటిలో కొంచెంఉప్పువేసిపాదములు మునిగేటట్లుగా 10 ని.లు పెట్టాలి.తర్వాత
మళ్ళీ చల్లటి నీటిలో 10 ని.లు పెట్టాలి.అలా ఉదయం,సాయంత్రము చేయాలి.
తలనొప్పి :తలనొప్పిగా ఉన్నప్పుడు 10సార్లు గాలి లోపలకు పీల్చి,బయటకువదిలివేయాలి.ఇలాచేస్తే తలనొప్పి
మాయమౌతుంది.

Thursday 12 December 2013

హెర్బల్ టీ

తులసి టీ : 1/4 లీటర్ నీళ్ళల్లో 10 గ్రా .తులసిఆకులు వేసి మరిగించాలి. నీళ్ళు బాగామరిగిన తర్వాత పాలు 
పోసి పంచదార వేయాలి.ఇలా తయారయిన టీ త్రాగితే జలుబు,జ్వరం,కడుపులోమంట తగ్గుతుంది.
 
హెర్బల్ టీ :1/4 లీటర్ నీళ్ళల్లో కొంచెం పుదీనా,కొత్తిమీర,కరివేపాకు,ధనియాలు,అల్లం,కొంచెం టీ పొడి,జీర వేసి
మరిగించిన తర్వాత కొంచెం బెల్లం వేసి కలపాలి.ఇలా తయారయిన టీ త్రాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
అల్లం,జీరా,ధనియాలు వేయటం వలన తల త్రిప్పుట  కూడా తగ్గుతుంది.ఇది భోజనం తర్వాత త్రాగటం మంచిది.

గ్రీన్ టీ :ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం గ్రీన్ టీపొడి వేసి మరిగించాలి.వీటిని చల్లార్చి 1/4 నిమ్మచెక్క రసం ,పంచదార కొంచెం కలిపి త్రాగాలి.ఈ టీ గోరువెచ్చగా మాత్రమే త్రాగాలి.లేకపోతే కడుపులో మంట వస్తుంది.ఈ టీ త్రాగితే
బరువు తగ్గుతారు.గ్రీన్ టీ భోజనం తర్వాత త్రాగితే మంచిది.

Wednesday 11 December 2013

గురువింద గింజ

        గురువింద గింజ చిన్నగా కోడిగ్రుడ్డు షేప్ లో ఉంటుంది.పైన మంచి ఎరుపు రంగులో,క్రింద నలుపు రంగులో చూడటానికి చాలాఅందంగా ఉంటుంది.అందుకని గురువిందగింజకు చాలాగర్వం.ఎందుకంటే తనక్రింద ఉన్ననలుపు తనకు తెలియదు కనుక  నేనే గొప్ప అందగత్తెను అని అన్నింటికన్నా గొప్పదానినని ఫీల్ అవుతుందట.
         గ్రీష్మ చుట్టాల్లో ఒకామెకు75 ఏళ్ళు వుంటాయి.ఆమె ఎక్కడ ఫంక్షన్ ఉన్నా అక్కడకు వెళ్లి తనొక్కటే గొప్ప
దానిలాగా అందరూ ఎందుకూ పనికిరాని వాళ్ళలాగా గొప్పలు పోతుంటుంది.ఆమె ముందే ఫంక్షన్ వాళ్ళఇంటికి
వెళ్లివాళ్ళతో మంచిగామాట్లాడి బంగారం,డబ్బు ఎవరికీ తెలియకుండా తీసుకొస్తుంది.పెళ్ళికివెళ్తే వాళ్ళకు,వీళ్ళకు
కూడా ఉన్నవి,లేనివి చెప్పితగువులు పెడుతూఉంటుంది.తర్వాత అసలువిషయం తెలుస్తుంది.ఈమె వస్తుందంటే చాలుఅందరికీ భయం.ఎక్కడ తగువులు పెట్టేస్తుందో,ఏమిదొంగిలిస్తుందోనని జాగ్రత్తపడేవాళ్ళు.అయినాఏదోఒకటి
చేస్తూనేఉంటుంది.ఆమెకుఎన్నోఇబ్బందులున్నాయి.అయినాఎదుటివాళ్ళకు ఏమీలేకున్నాగోరంతలుకొండంతలు చేసి చెప్తుంటుంది.
         ఆమె వయస్సు వాళ్ళల్లో 100మందిలో 10మంది ఉంటే ఈ రోజుల్లో 100మందికి 75మంది ఆమెలాగే వుంటున్నారు.చదువుకున్నవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.ఎవరిగురించి వాళ్ళు గొప్పచెప్తున్నారంటేనే
వాళ్ళెంత గొప్పవాళ్ళో అర్థంచేసుకోవచ్చు.సరే స్వోత్కర్ష  చెప్పుకొన్నాఎదుటివాళ్ళ గురించి తక్కువచేసిచెప్పటం
ఫ్యాషన్ అయిపోయింది.అది ఎంత తప్పోఅర్థం చేసుకోవటంలేదు.ఎదుటివాళ్ళువిన్నంతసేపువిని ప్రక్కకు వెళ్లి
నవ్వుకుని ఇంకొంతమందికి చెపుతుంటారని వాళ్లకు అర్థం కాదు.వినేవాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళను
ప్రోత్సహిస్తున్నామని అనుకోవట్లేదు.
              ఇలా గొప్పలు చెప్పుకొని ఎదుటివాళ్ళను అవమానించేవాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు.
గురువింద గింజ తన క్రింది నలుపు ఎరగదు అని తరతరాలుగా ఉన్నశాస్త్రం.   

Tuesday 10 December 2013

ఆవిరి పట్టుట -ఉపయోగం

1 )ఒకగిన్నెలో నీళ్ళు పోసి 1/2 నిమ్మచెక్క రసం,గుప్పెడు తులసిఅకులు,ఒక గుప్పెడు పుదీనాఆకులు వేసి మరిగించాలి.ముఖానికి మాత్రమే ఆవిరి పట్టాలి.తర్వాత చల్లటి నీటితో మొహం కడగాలి.ఇలా చేయటంవలన
జలుబునుండి ఉపశమనం కలగటమే కాకుండా మొటిమలు రాకుండా వుంటాయి.
2)ఒకగిన్నెలో నీళ్ళు తీసుకుని కొంచెం విక్స్ వేసి పిల్లలకు ఆవిరి పట్టిస్తే జలుబు చేసినప్పుడు ముక్కు
బాగా ఊపిరి ఆడుతుంది.
3)నీళ్ళల్లో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది.

పొన్నాయి పూల మాల

           సౌమిత్రి ఇంటికి కొంచెం దూరంలో పొన్నాయి చెట్టు ఉండేది.అది చాలా ఎత్తుగా ఉండేది.పువ్వులు చెట్టు
క్రింద రాలేవి.పిల్లలుఅందరూ సాయంత్రంవెళ్లి అవిఏరుకోనేవాళ్ళు.పొన్నాయిపువ్వంటే పొడవుగాగొట్టంతోతెల్లగా
చివర చిన్న పువ్వు ఉండేది.చివర గొట్టం కొంచెం తుంచి ఊదితే హారన్ వేసినట్లు సౌండ్ వచ్చేది.మంచి వాసన
కూడా వచ్చేవి.పిల్లలు పోటీపడి దారం లేకుండానే రెండు పువ్వులు కలిపి మెలిక వేసి ఆ రెండు గొట్టాల మధ్యలో
ఇంకొక పువ్వు పెట్టి మాల లాగా చేసేవాళ్ళు.చూడటానికి ఎంతో బావుండేది.ఎవరు పెద్ద మాల అల్లితే వాళ్ళుఅంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు.ఎవరు ముందుగా పెద్దగా కట్టగలిగితే వాళ్ళు గుళ్ళో దేవుడి దగ్గర పెట్టటానికి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇసుకలో కాలు పెట్టి ఇసుక పిచ్చుక గూళ్ళు కట్టేవారు.

ఉన్నమాట

          ప్రజ్ఞ బంధువుల ఇంట్లో పార్టీకి వెళ్ళింది.దారిలో దూరపుబంధువు కలిసింది.ప్రజ్ఞ చదువుకొనేటప్పుడు
గురువు,బంధువు కనిపిస్తే బావున్నారా?అని మాట్లాడుతూ ఉండగానే అంతకు ముందామె వచ్చేసి చేయి
పట్టుకొని మరీ పరామర్శించి మీరు నల్ల లక్ష్మి కదా!అని అడిగింది.ఔను ,నేనే కానీ నల్ల అనకూడదు అని
చెప్పింది.మళ్ళీ ఊరుకోకుండా ఎర్ర లక్ష్మి బావుందా?అనిఅడిగింది.ఆమె ఇప్పుడు లేదు .మా కజిన్ అని
ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడూ అనకు అని వెళ్లిపోయింది.ఇంతకుముందు రోజుల్లో ఎర్ర,నల్ల
అంటూ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు.ఆవిడ అసలే సెన్సిటివ్ అలామాట్లాడటం ఏంబావుంటుంది ?అని ప్రజ్ఞ అంటే
ఉన్నమాట అన్నాను అంది.అసలు ఇలాంటివాళ్ళతో మాట్లాడి ప్రయోజనం ఉండదు.ఆవిడ ఎంత హర్ట్
అయ్యుంటుంది.అయ్యయ్యో నేను మాట్లాడించటంవలన ఇలా జరిగింది అని ప్రజ్ఞ ఫీల్ అయింది.ఇది
చదివినతర్వాత అయినా ఇలా ఎదుటివాళ్ళను దేనికోఒకదానికి హర్ట్ చేయకుండా ఉంటే బావుంటుంది
అని నా అభిప్రాయం.

పాలతో ఫేస్ పాక్స్

1)పాలు,3 చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి కొంచెంసేపు తర్వాత చల్లటి నీటితో కడగాలి.బ్లీచ్ చేసినట్లుగా ఉంటుంది.
2 )చల్లటి పాలతో మాత్రమే పాక్  వేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
3 )బాదం పప్పులు మెత్తగాపొడి చేసి పాలతో కలిపి పాక్ వేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4)పాలల్లో ఉప్పు కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి.10 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి.ఇలా తరచు చేస్తూఉంటే చర్మం మృదువుగా ఉంటుంది.
5 )స్ట్రాబెర్రీ గుజ్జు పాలల్లో కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేసుకోవాలి. జారినట్లుగా ఉన్నచర్మం దీనివల్ల
బిగుతుగా అవుతుంది.

ఆరోగ్యానికి - చిట్కాలు

1) కొలెస్టరాల్: రోజు 2 స్పూన్లు ధనియాలు 4 గ్లాసులునీళ్ళు,  గ్లాసులు అయ్యేవరకూ మరిగించాలి.ఆ  నీటిని రోజూ 30 రోజులపాటు త్రాగితే కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది.ఇలా సంవత్సరంలో ఒకసారి చేస్తే సరిపోతుంది.
2 )మధుమేహం: పసుపు,ఉసిరిపొడి కలిపి రొజూ తింటే షుగర్ అదుపులో ఉంటుంది.
3 )జుట్టు రాలకుండా: కుడి,ఎడమ చేతి గోళ్ళు ఎనిమిదింటిని ఒకదానిమీద ఒకటి ఉంచి  ఉదయాన్నే 5,6 ని.లు రాత్రి పడుకోబోయే ముందు 5,6 ని.లు రుద్దాలి.
4)ముఖ వర్చస్సు :పసుపు,గంధంపొడి,నూనెతో కలిపి ముఖానికి  పూతలాగా రాయాలి.15,20 ని.లు ఉంచి నీళ్ళతో కడగాలి.20 రోజులు అలా చేస్తే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
5 )శరీర వర్చస్సు :పాలు,శనగపిండి,పసుపు నిమ్మరసం,కొబ్బరినూనె కలిపి శరీరమంతా రాసి 5 ని.ల తర్వాత స్నానం చేయాలి.   

తులసి-ఉపయోగములు

1)పెరుగుతో తులసి ఆకులు తింటే బరువు తగ్గుతారు.
2)తులసి రసం ,తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
3)10 గ్రా . తులసిరసం ,5 గ్రా తేనె,5 గ్రా.నల్ల మిరియాలపొడి కలిపి తింటే అజీర్ణం తగ్గుతుంది.
4)10 గ్రా .తులసిపొడి ఉదయం,సాయంత్రం నీళ్ళతో కలిపి త్రాగితే మొలలు తగ్గుతాయి.
5 )తులసిరసం,అల్లంరసం సమానంగా కలిపి గోరువెచ్చగా చేసి త్రాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
6 )4,5 తులసిఆకులు భోజనం తర్వాత నమిలితే నోటి దుర్వాసన పోతుంది.
7)తులసిరసం నల్లమిరియాలపొడి,సాల్ట్ అన్నీ కలిపి పళ్ళు రుద్దితే పంటినొప్పులు తగ్గుతాయి.
8 )తులసిరసం ,తేనె కలిపి నాలుకకు రాసి నిదానంగా మ్రింగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
9)1/2 స్పూన్   తులసిరసం 1/2 స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగితే తలనొప్పి తగ్గుతుంది.
10 )తులసిరసం ,తేనె కలిపి రొజూ క్రమం తప్పక తీసుకుంటే అదనపు క్రొవ్వు కరుగుతుంది.










Friday 6 December 2013

చర్మ సంరక్షణ చిట్కాలు

1)నువ్వుల నూనెతో శరీరమంతా మర్ధనచేసి శనగపిండితో గానీ,పెసరపిండితోగానీ నలుగు పెట్టుకొంటే చర్మం
మెరుస్తూ ఉంటుంది.
2)కమలా తొక్కలను ఎండబెట్టి మిక్సీలోవేసి మెత్తగా పొడి చేసుకొని రుద్దుకొంటే చర్మానికి స్క్రబ్ లాగా  పనికొస్తుంది.
3)వేప ఆకులు నీళ్ళల్లో నీళ్ళల్లో మరిగించి వారానికి ఒకసారి స్నానంచేస్తే ఎలర్జీస్ రావు.
4)బొప్పాయి పండు గుజ్జు తో ముఖం,మెడ చేతులు రుద్దితే చర్మానికి క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుంది.
5)పుచ్చకాయ జ్యూస్ తో ముఖం,మెడ,చేతులు రుద్దితే చర్మానికి ఉన్నమురికి తొలగిపోయి శుబ్రంగా ఉంటుంది.
6)శనగపిండి పెరుగు కలిపి బాడీమొత్తం రుద్దితే చర్మం నున్నగా మెరుస్తూ ఉంటుంది.
7)పెరుగు మీద మీగడ రాసి,తర్వాత శనగపిండి ,నిమ్మకాయ రసం కలిపి రుద్దుకొంటే చర్మంకాంతులీనుతూ
ఉంటుంది.
8)పాలమీద మీగడ రాస్తే కూడా చర్మం బాగా ఉంటుంది.
9)అరటి పండు మెత్తగా చేసి రుద్దినా స్కిన్ చాలా బాగుంటుంది.
10)అలోవేరా జెల్ రాస్తే కూడా చర్మం మీది మచ్చలు పోయి చర్మం ముడతలు లేకుండా చక్కగా ఉంటుంది.

Thursday 5 December 2013

ఊటీ ప్రయాణం

         షాలినికుటుంబం వేసవిలో ఊటీలోఒక వారంరోజులు గడపటానికి వెళ్లారు.అక్కడ ఉండటానికి ఏర్పాట్లన్నీ
స్నేహితులు చూశారు.కూనూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారు.వెళ్ళినరోజు వర్షం బాగా పడింది.అక్కడ వేసవిలో కూడా
వర్షం పడుతుంది.బొటానికల్ గార్డెన్ లో 90సంవత్సరాలనాటివి రకరకాలచెట్లు వున్నాయి.ఎన్నో రకాల పువ్వుల
మొక్కలు వున్నాయి.చాలా పచ్చగా ,అందంగా,నీట్ గా  ఉంది.
           రోజ్ గార్డెన్ లో అయితే చిన్నవి,పెద్దవి.,మధ్యరకంగులాబీలు,రంగు రంగులవి చాలా వున్నాయి.నలుపు ఆకుపచ్చ,2,3రంగులు కలిసిన గులాబీలు ఎన్నో వున్నాయి.చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.పిల్లలు
బాగా సంతోషంగా ఆడుకొన్నారు.
          డాల్ఫిన్స్ నోస్ ,ఊటీ లేక్ ,బోటు హౌస్,అన్నీ చూశారు.అందరూ బోటు రైడింగ్ ఎంజాయ్ చేశారు.
అందమయిన వాటర్ ఫాల్స్ ఎన్నో వున్నాయి.ట్రైన్ లో వెళ్లి ఊటీ అందాలను తిలకించారు.దొడబెట్ట పీక్
సౌత్ ఇండియాలోనే ఎత్తయినది.దొడ బెట్ట అంటే ఇక్కడ తరచుగా మేఘాలు కలుస్తూవిశ్రాంతిగా ఉంటాయనిఅర్ధం.
ఇక్కడ మంచు తో  దట్టమయిన మేఘాలు వుంటాయి.తమిళనాడు పర్యాటకశాఖ టెలిస్కోప్ లు ఏర్పాటు చేశారు.అక్కడనుండి చూస్తుంటే కొండలు,లోయలు అడవిఆకుపచ్చ తివాచీ పరిచినట్లు ఎంతో అందంగా ఉంది.
అక్కడమేఘాలు మనకు దగ్గరలో వున్నట్లు అనిపిస్తుంది.టీ గార్డెన్స్ .టీ ఫ్యాక్టరీ చాలా బావున్నాయి.ఎక్కడ
చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది.పిల్లలు,పెద్దలు కూడా చాలా సంతోషంగా గడిపారు.అందరూ
తప్పక చూడదగిన ప్రదేశం .
           

బస్సు లో కోతి హంగామా

           షర్మిల కుటుంబం ,ఫ్రెండ్ కుటుంబం కలిసి పదిరోజులు టూర్ వెళ్లారు.ఒకఊరి నుండి ఇంకొక ఊరు వెళ్ళటానికిబస్ లో వెళ్లారు.అది కొంతదూరం అడవిలోనుండి వెళ్ళాలి.దారిలో ఏనుగు,నెమళ్ళు,జింకలు కన్పించాయి.పులిగాండ్రింపు వినిపించింది.బస్ కొంతదూరం వెళ్ళిన తర్వాత స్లోగావెళ్తుంది.అప్పుడుఒకపెద్దకోతి
ఎక్కడనుండి వచ్చిందో కానీ బస్ లోకి దూకింది.అందరూ కంగారు పడ్డారు.ఒకబాబు చేతిలో నుండి గభాల్న
లేస్ ప్యాకెట్ లాక్కుంది.ఒక పాప చేతిలోనుండి బిస్కట్ ప్యాకెట్ లాక్కుంది.పిల్లలందరు బాగా భయపడ్డారు.
డ్రైవర్ బస్సు ఆపేశాడు.అందరూ కలిసి కోతిని బయటకు పంపారు.ఈలోగా కోతి నానాహంగామా సృష్టించింది.    

Wednesday 4 December 2013

భోషాణం

             సుదీప్తి జేజమ్మ ఇంట్లో భోషాణం ఉండేది.భోషాణం అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉండే పెద్దచెక్కపెట్టె.
పూర్వకాలంలో బీరువాలు, అలమారాలు,లాకర్స్ఏమీ ఉండేవి కాదు కదా అందుకని భోషాణంనే అన్ని
రకములుగా ఉపయోగించేవారు.నగలు,పట్టుచీరలు ,ఖరీదుకలవి అన్నీ దాచేవారు.ఆరోజుల్లో పిల్లలు కూడా
ఎక్కువమందే ఉండేవారు కనుక వండిన పిండివంటలన్నీ త్వరగా తినేయకుండా దానిలో దాచిపెట్టేవారు.
భోషాణం చిన్నపిల్లలకు అందకుండా ఎత్తుగా ఉండేది.ఆరోజుల్లో దొంగలు దోచుకోకుండా,ఎవరూ దాన్ని
తెరవకుండా పెద్ద తాళం వేసేవారు .ఆతాళంచెవి ఇంటిపెద్దల దగ్గర మాత్రమే ఉండేది.సుదీప్తికి కొంచెం జ్ఞాపకం
ఉంది.సుదీప్తి అమ్మమ్మ ఇంట్లో పురాతనవస్తువులు దాచే అలవాటు.అందుకని ఇప్పటికీ ఉంది. 

దొంగ భక్తి

  స్వరూప ఊరిలో శివాలయంలో భారీగా యజ్ఞం చేసారు.అందులోభాగంగా 108 దంపతులతో 108 చిన్నచిన్న యజ్ఞకుండములవద్ద కూర్చోపెట్టి పూజ చేయించారు.సువాసినిపూజ అలారోజుకొకరకంపూజ చేసేవారు.చివర రోజు పూర్ణాహుతి చేసారు.చుట్టుప్రక్కలనుండి చాలామంది పూర్ణాహుతి చూడటానికివచ్చారు.స్వరూప,వాళ్ళ అమ్మ,బాబుని తీసుకొని వెళ్లారు.బాబుకి 8నెలలు.నోట్లో రెండువేళ్ళు వేసుకొని నిద్రపోతున్నాడు.ఇంతలోఒకామె వీళ్ళవెనుక నిలబడింది.పూజ చూడటానికి వచ్చింది కాబోలు అనుకొన్నారు.బాబుచేతికి బంగారువత్తులు, గొలుసులు ఉన్నాయి.ఆ అమ్మాయి బాబుచేతిని గట్టిగాలాగేసింది.స్వరూప వెనక్కితిరిగిచూసింది.బాబుచేయి
బోసిగా ఉంది.వెనకనిలబడిన అమ్మాయి చెంపమీద ఒకటివేసి నువ్వే బాబుచేతికి ఉన్నవాటిని లాగావుఅని
గట్టిగా అడిగేసరికి క్రిందపడేసి వాటిమీద నిలబడింది.అంతలో అక్కడివాళ్ళు ఏమిటి?ఏంటి?అని అడిగేసరికి
అక్కడినుండి పారిపోయింది.స్వరూప క్రిందనుండి వాటిని తీసుకొంది.పూజకోసం వచ్చి ఈపనిచేసింది.
ఇలాంటివారు ఇంకెందరో?

Monday 2 December 2013

వంటింటి చిట్కాలు

1) పసుపు చిటికెడు పాలల్లో కలిపి త్రాగితే జలుబు తగ్గుతుంది.
2) సాల్ట్ ఒక స్పూన్ గ్లాస్ నీళ్ళల్లో కలిపి గోతులోవరకు పోనిచ్చి 4,5సార్లు పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గుతుంది.
3) పసుపు ,ఉప్పు కలిపి ఆకుకూరలు కడిగితే క్రిములు పోతాయి.
4) కూరగాయలు ,ఆకుకూరలు వదిలిపోతే ఉప్పునీళ్ళల్లో నానపెడితే ఫ్రెష్ గా  వస్తాయి.
5) ద్రాక్ష పళ్ళు గోరువెచ్చటి ఉప్పు నీళ్ళల్లో కొంచెంసేపుఉంచితే మురికి,క్రిములు పోతాయి.
6) ఒక యాలుక్కాయ భోజనం చేసినతర్వాత నోట్లో వేసుకొంటే త్వరగా జీర్ణమవుతుంది.
7) దగ్గు వస్తుంటే లవంగాయ ఒకటి బుగ్గన కొంచెంసేపు పెట్టుకొంటే దగ్గు తగ్గిపోతుంది.
8) మెంతులు ఒకస్పూన్ రాత్రిపూట నానపెట్టి ఉదయం పరగడుపున తింటే రక్తశుద్ధి అవుతుంది.
9) భోజనం చేసేముందు ఒకస్పూన్ మెంతుపొడి తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
10) నాన్-వెజ్ వండే ముందు ఉప్పు,పసుపు నీటితో కడిగితే మంచిది.       

సంజీవని

           స్మిత ఇంటిముందు ఒకపెద్దవేపచెట్టు ఉండేది.చెట్టుమీద చాలాపక్షులు నివసించేవి.వాటిలోజెముడుకాకి
ఒకటి.జెముడుకాకి కాకికన్నాచాలాపెద్దది.చూడటానికి అందంగా ఉంటుంది.బ్రౌన్,నెమలిపింఛం రంగుల ఈకలు
కలిసివుంటాయి.దాని అరుపు విచిత్రంగా ఉంటుంది.స్మిత చిన్నప్పుడు పక్షులను గమనిస్తూఉండేది.స్మితకూడా
దానిలాగే అరవటం ప్రాక్టీస్ చేసింది.అదిఎలాగంటే నోరుతెరవకుండా గొంతుతో మాత్రమే ఆసౌండ్ చేసేది.స్మిత
ఆసౌండ్ చేస్తుంటే జెముడుకాకి కూడాఅరిచేది.పిల్లలుఎంతమంది ట్రై చేసినాఎవరికీరాలేదు.రొజూపిల్లలుఅందరూ
ఆడుకోవటానికి వచ్చినప్పుడు స్మిత అరుస్తుంటే జెముడుకాకి కూడా అరుస్తూ ఉండేది.
           జెముడుకాకి గూడు పెట్టినప్పుడు రకరకాల పుల్లలతో పాటు" సంజీవని"పుల్ల కూడా ఉంటుందట.
సంజీవని అంటే చనిపోయినవాళ్ళను బ్రతికించేది అని అర్ధం.ఈసంజీవనిని సాధించాలంటే జెముడుకాకి
గూడు తీసికెళ్ళి ప్రవాహంలో వేస్తే అన్నికోట్టుకుపోగా సంజీవని మాత్రం పాములాగా పడగవిప్పి గూడు
వేసినవాళ్ళమీదకు వస్తుందట.అప్పుడు డేర్ గా పట్టుకోగలిగితే సంజీవని దక్కుతుందని,లేకపోతేపాముకాటు
వేస్తే ప్రాణాలు పోతాయని పెద్దవాళ్ళు చెప్పేవారు.

Sunday 1 December 2013

స్టార్ ఫిష్

         ఆర్తి కుటుంబము,స్నేహితుల కుటుంబముకలిసి ఒకసారి మచిలీపట్నం మంగినపూడిబీచ్ చూడటానికి
వెళ్లారు.పిల్లలు,పెద్దవాళ్ళు నీళ్ళల్లో రెండు గంటలు ఆడుకొన్నతర్వాత వచ్చేటప్పుడు స్టార్ ఫిష్ కనిపించింది.
స్టార్ ఫిష్ సముద్రంనీళ్ళల్లో మాత్రమే బ్రతుకుతుంది.మంచినీళ్ళల్లోబ్రతకదు.ఆర్తి కూతురు స్నిగ్ధ ఇంటికితీసుకుని
వెళ్దామని గొడవచేసింది.అందుకని ఆర్తితమ్ముడు శిరీష్ కారులో బకెట్ ఉంటే సముద్రంనీళ్ళు కొంచెంపోసి
ఒక స్టార్ ఫిష్ వేసాడు.ఎప్పుడయినా సముద్రస్నానానికి వెళ్తేనీళ్ళల్లోనుండి వచ్చినతర్వాత కొంచెంఇసుకచేతిలో
తీసుకుని సముద్రమా మాఊరు రావద్దు అనిఇసుకను నీళ్ళల్లోవేసి నమస్కారం చేయాలట.
          మచిలీపట్నంలో పాండురంగస్వామిగుడి,శివాలయం,కొంచెందూరంవెళ్ళగానే సచ్చిదానంద ధత్తపీటం
 తప్పక చూడదగినవి.ఇప్పుడు ఇంకా చాలా చూడదగిన ప్రదేశములు వున్నాయి.
          బకెట్ లోవేసిన స్టార్ ఫిష్ ని కార్ లో పెట్టుకొని విజయవాడ దగ్గరలో ఊరికి తెచ్చారు.రెండురోజులు
బాగానే ఉంది.తర్వాత చెరువులో వదిలేశారు.       

తుమ్మ చెట్టు

            అమృత ఇంటిముందు ఒకపెద్దతుమ్మచెట్టు ఉండేది.ఆచెట్టుమీద రకరకాలపక్షులు ఉండేవి.పిచ్చుకలు
చక్కగాగూళ్ళుముక్కుతో చకచకాఅల్లేసేవి.సాయంత్రంఅయ్యేటప్పటికి బోలెడన్నికొంగలువచ్చేవి.కాకులుగూళ్ళు
పెట్టుకోనేవి.కాకులుగూటిలో గ్రుడ్లుపెట్టేవి.వాటికితెలియకుండా కోయిలలుగ్రుడ్లు పెట్టేసివెళ్లిపోయేవి.
           కోయిల గ్రుడ్లనుపొదగదు.కాకి పొదిగిపిల్లలనుచేస్తుంది.కోయిల,కాకిపిల్లలు రెండూనల్లగానే వుంటాయి.
అందుకని పిల్లలకుఅరవటం వచ్చేవరకు కాకితనపిల్లలే అనుకొంటుంది.అరవటం మొదలుపెట్టినతర్వాత తేడా
గమనించి తోసేస్తాయి.కోయిలగానం వినసొంపుగా ఉంటుందికదా.
           సాయంత్రానికి అన్నిపక్షులు తుమ్మచెట్టుమీదకు చేరుకోనేవి.పిల్లలందరు ఆడుకొంటూవాటినిచూస్తూ
ఉండేవారు.అమృతవాళ్ళకయితే ఉదయమే పక్షులకిలకిలారావాలతో మెళుకువవచ్చేది.వర్షంపడినప్పుడు
కొంచెంఇబ్బందిగా ఉండేది.తుమ్మచెట్టు జిగురు(తుంబంక)పుస్తకాలు,పేపర్లు అతికించుకోవటానికి
ఉపయోగించేవారు.

Saturday 30 November 2013

నాటీ బాయ్

                                                            సంయుక్త వాళ్ళ బాబు పేరు  షానోజ్. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు.ఐదు నెలలకే అత్త,తాత అంటూ చిన్నచిన్నమాటలు చెప్పేవాడు.కూర్చోవటం వచ్చినప్పటి నుండి అందరూ  భోజనం చేసేటప్పుడు బాబుని భోజనాల బల్ల మీద కూర్చోపెట్టి తినటం అలవాటు అవుతుందని చిన్న వెండి పళ్ళెంలో కొంచెం పెట్టి ఇచ్చేవాళ్ళు.అన్నప్రాశన అయిన దగ్గర నుండి కూడా టొమాటోచారు కొత్తిమీరతో ఘుమఘుమలాడితేనే తినేవాడు.పెరుగు ప్రక్కన ఎవరైనా తింటున్నా వాంతి చేసుకునేవాడు.ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా పెరుగు అన్నం తినేవాడు కాదు.నడకవచ్చిన దగ్గరనుండి కుర్చీలకు ఉన్ననట్టులు,బోల్టులు ఎక్కడ కనపడితే అక్కడ చేత్తోనే ఊడతీసి ఎక్కడో ఒకచోట పడేసేవాడు.సంయుక్త వాళ్ళు మొదటి అంతస్తులో ఉండేవాళ్ళు.ఇంటితాళాలు  క్రింద మొక్కల్లో పైనుండి క్రిందికి పడేస్తుండేవాడు.ఒకసారి రెండురోజులు వెతుక్కుంటే కానీ ఆవిషయం   అర్ధంకాలేదు.ఒకరోజు సంయుక్త లోపల ఉండగా మెట్లుదిగి రోడ్డు మీదకు వెళ్ళాడు.బంగారు మొలత్రాడు, చేతులకు వత్తులు,గొలుసులు ఉండేవి.వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల వాళ్ళు ఎవరి బాబో నగలు ఉన్నాయి అని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేశారు.లేకపోతే మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోయేవాడు.అప్పుడు ఎవరోఒకరు బాబును చంకన వేసుకుని ఎత్తుకెళ్ళిపోయేవారు.ఎక్కడ పంపు కనిపిస్తే అక్కడ పంపు వదిలేసి నీళ్ళతో ఆటలాడి బట్టలు తడుపుకోనేవాడు.కొంచెం పెద్దయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి అల్లరి చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని అందరూ మనింట్లోనే ఆడుకోండి అని సంయుక్త చెప్పటంతో పొలోమంటూ ఆ వీధిలో ఉన్న పిల్లలు,ప్రక్క వీధిలో పిల్లలు అందరూ వచ్చి ఆటలాడి బాగా అల్లరి చేసేవాళ్ళు.పిల్లలు అందరూ బాట్ లతో ఆటలు ఆడి పిల్లర్లు,పువ్వుల కుండీలు అన్నింటిని పగలకొట్టేవాళ్ళు.ఏడవ తరగతికి వచ్చేటప్పటికి అల్లరి తగ్గింది.చిన్నప్పుడు పిల్లలు చేసిన అల్లరి పిల్లలకు,పెద్దలకు కూడా మధుర జ్ఞాపకాలుగా ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి.తలచుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.

క్యూట్ గర్ల్

                                                 సృజన వాళ్ళ పాప క్యూట్ గా ఉండేది.పాప పుట్టినప్పుడు సృజనకు సిజేరియన్ చేసారు.పాపను బయటకు తీయగానే డాక్టర్ సృజనా!పాపను చూడు చాలా బావుంది అని బుగ్గ మీద తట్టి చెప్పారు.పాప తెల్లగా నల్లటి జుట్టుతో బొద్దుగా,ముద్దుగా ఉంది.సృజన బావుంది అని తలాడించింది.సృజన వాళ్ళ అమ్మ,అమ్మమ్మ పాపను చాలా నీట్ గా రకరకాల గౌనులు వేసి,అప్పట్లో అరుదుగా దొరికే అందమైన పిల్లల దుప్పట్లు వేసి ఉయ్యాలలో పడుకోపెట్టేవారు. రోజూ డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ముద్దుగా ఉన్న పాపను ఒకసారి ఎత్తుకుని ఉయ్యాలలో పడుకోపెట్టేవారు.పాప పేరు రేష్మ అని పెట్టారు.సృజన అమ్మమ్మ మొదటి నెల దాటిన దగ్గర నుండే అత్త,తాత అని చెప్పటంతో పాటు ఎన్నో రకరకాల కబుర్లు చెపుతూ ఉండేది.ముందుగా పిల్లలు అమ్మ అనకూడదు అని అంటే అమ్మ దూరమవుతుందని పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు కాదు.పాపకు పదేపదే మాటలు చెప్పటం వలన ఐదు నెలలకే అత్త,తాత అనేది.సమిష్టి కుటుంబం కనుక రేష్మకు అన్నిమాటలు చాలాతొందరగా వచ్చినాయి.అమ్మమ్మ,తాతయ్య,జేజమ్మ,జేజితాతయ్య,మేనమామ,నాయనమ్మ,తాతయ్య,మేనత్త,అందరూ అసలు క్రింద నేల మీద  దించేవాళ్ళు కాదు.రేష్మ నాన్న ఇంట్లో ఉన్నంతసేపు రేష్మను చంకనెత్తుకుని క్రింద దించేవాళ్ళు కాదు.చిన్నప్పటి నుండి తనకు ఇష్టమయిన బట్టలు బూట్లు,చెప్పులు తనే ఎంపిక చేసుకొనేది.రేష్మ అమ్మమ్మ పట్టులంగాలు ఎక్కువగా కుట్టిస్తుండేది.రేష్మకు చిన్నతనం నుండి పట్టు పరికిణీలు అంటే చాలా ఇష్టం.రోజుకొకటి చొప్పున వేసుకుని తనకు ఇష్టమైన అరవంకీలు,పాపిట బిళ్ళ గాజులు,ఉంగరాలు,కాలికి బంగారు పట్టీలు అన్నీరోజు కొంచెంసేపు పెట్టేవరకు ఊరుకునేది కాదు.పింకీ,సోనీ అనే కుక్కపిల్లలు వెంట తిరుగుతూ ఉండేవి.నాన్నరకరకాల బొమ్మలు తెచ్చిస్తే వాటితోను,కుక్కపిల్లలతోను నవ్వుతూ,త్రుళ్ళుతూ హాయిగా ఆడుకొంటూ బాల్యాన్ని ఆనందంగా గడిపేది.

                                               


పింకీ సోనీ

                                                   సుష్మిత వాళ్ళింట్లో రెండు పమేరియన్ కుక్కపిల్లలు ఉండేవి.వాటిని పింకీ,సోనీ అని పిలిచేవాళ్ళు.అవంటే వాళ్ళింట్లో అందరికీ చాలాఇష్టం.ముద్దుగా ఉండేవి.మొదట సుష్మిత తమ్ముడు శ్రీకర్ పింకీని తీసుకొచ్చాడు.కొన్నిరోజులకు పింకీకి సోనీ పుట్టింది.సోనీ పుట్టినప్పుడు సుష్మిత ఉదయం,సాయంత్రం పనివాళ్ళు ఉన్నాసరే తనే స్వయంగా తుడిచి తెల్లటి వస్త్రంపై పడుకోపెట్టేది.అలాకళ్ళుతెరిచేవరకు చేసేది.వాక్సిన్ వేయించటానికి శ్రీకర్ బుల్లి ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకుని వెళ్ళేవాడు.పింకీ అయితే ఎగిరి జంట మంచం పైకి  ఎక్కి సుష్మిత వాళ్ళ ప్రక్కన నిద్రపోయేది.సోనీ,పింకీ చుట్టుప్రక్కల వాళ్ళను గేటుదాటి లోపలకు రానిచ్చేవికాదు.కనీసం రోడ్డుమీద కూడా ఎవరినీ నడవనిచ్చేవి కాదు.బాగా అరుస్తుంటే అందరూ భయపడేవాళ్ళు.చాలా ప్రేమగా ఉండేవి.సుష్మితకు పాప పుడితే సోనీ ఎవరినీ దగ్గరకు రానీయకుండా బెడ్ దగ్గరే పడుకోనేది.ఒకసారి ప్రక్కింటావిడ పాపను చూడటానికి వచ్చింది.పాపను  చూద్దామని ముందుకు వంగింది.అంతే సోనీ ఒక్కసారి ఆవిడ మీదపడింది.ఆవిడ చాలా భయపడింది.అప్పటినుండి పాపను ఎత్తుకోవటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు.పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత తన ప్రక్కన అటు పింకీ ఇటు సోని పడుకునేవి.ఎక్కడకు వెళ్తే అక్కడకు పాప వెంటే వెళ్ళేవి.పాప కూడా పింకీ,సోనీ అంటూ వాటితో చక్కగా ఆడుకొనేది.ఇంతకీ పాప పేరు స్వీటీ అని చెప్పలేదు కదూ!స్వీటీ అని సుష్మిత పిలవగానే స్వీటీతోపాటు  ఒకవైపు  పింకీ మరోవైపు సోనీ ప్రేమగా,బాధ్యతాయుతంగా పాపకు రక్షణగా వస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది.


Friday 29 November 2013

పంచారామక్షీత్రములు

             పంచారామములు అంటే అయిదుప్రశాంతతనుకలిగించే ఆలయములుఅని అర్ధం.అవి ఏమిటంటే
అమరారామం (అమరావతి),కుమారారామం(కోటిపల్లి),క్షీరారామం(పాలకొల్లు),భీమారామం(భీమవరం),
ద్రాక్షారామం(ద్రాక్షరం).
            అమరారామంలో అమరేశ్వరుడుగానూ,కుమారారామంలో కుమరేస్వరుడుగాను,క్షీరారామంలో
క్షీరారామేస్వరుడుగాను,భీమారామంలో భీమేస్వరునిగాను,మరియు ద్రాక్షారామంలో ద్రాక్షారామేశ్వర
స్వామిగాను శివుని రకరకాల పేర్లతో పిలుస్తారు.
           ఈఅయిదుక్షేత్రాలు తూర్పు,పశ్చిమగోదావరిజిల్లాలలోనూ,గుంటూరుజిల్లాలలో నెలకొనివున్నాయి.
కార్తీకమాసంలో ఈఐదింటిని ఒకేరోజులో చుట్టిరాగాలిగితే పంచారామయాత్ర సఫలీకృతం అవుతుంది.      

శీర్షాసనం వేసిన శివుడు

         యనమదుర్రుగ్రామం శివాలయంలో శివుడు శీర్షాసనంవేసినట్లుగాఉంటాడు.శివుడుశీర్షాసనంవేసి తపస్సు


చేసుకొంటూఉండగా సూర్యోదయం అయిపోయిందట.అందుకని స్వామిఅలా ఉండిపోయారని స్థానికుల కథనం.

స్వామి ఈ భంగిమలో ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.ఈగ్రామం పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం
 
దగ్గర ఉంది.కార్తీకమాసంలో స్వామిని దర్శించుకోవటం చాలా మంచిది.
  

తెల్లగా మారే శివలింగం

             పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం దగ్గర గునిపూడిలోసోమారామం సోమేశ్వరస్వామిఆలయంఉంది.
ఈక్షేత్రం పంచారామాలలో ఒకటి.ఈఆలయం ప్రత్యేకత ఏమిటంటే శివలింగం పౌర్ణమికి తెల్లగాను,అమావాస్యకు
నల్లగానూ మారుతుంది.అమ్మవారిని అన్నపూర్ణమాత అంటారు.
             కార్తీకమాసంలో ఈస్వామిని దర్శనం చేసుకోవటం చాలామంచిదనిచెపుతుంటారు.అలాగేదిరుసుమర్రు
అనేఊరిలోకూడాశివలింగం ఇలాగేరంగులు మారుతుంటుందిఅని అక్కడివాళ్లు చెపుతుంటారు.కార్తీకమాసంలో
పంచారామాలను ఒకేరోజు దర్శనం చేసుకోవటం మంచిదని,చాలా పుణ్యమని పెద్దల ఉవాచ. 

జాలీగా స్కూలుకు

               శ్రుతి ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది.ఆరు,ఏడు తరగతులు చదవాలంటే వేరే ఊరు
నడిచి వెళ్ళాల్సి వచ్చేది.ఒక పదిమంది పిల్లలు కలిసి వెళ్ళేవారు.దారిలో కబుర్లు చెప్పుకుంటూ,ఆడుకుంటూ
మధ్యమధ్యలో పరుగులు పెడుతూ వెళ్తూఉండేవారు.
                  దారిలో రకరకాల మొక్కలు,చెట్లు ఉండేవి.తంగేడుపువ్వులు కనిపించినప్పుడు పెట్టుకోకపోతే
మొక్కతిడుతుందని అందరూ అనేవారు.అందుకని ఆడపిల్లలు ఒకపువ్వు కోసి పెట్టుకోనేవాళ్ళు.జమ్మిచెట్టు
కనిపిస్తే ఆకుకోసి పుస్తకాలలోపెడితే టీచర్ తిట్టదని అందకపోయినా కష్టపడిమరీ కోసేవాళ్ళు.
                బలుసుకాయలు,బుడందోసకాయలు,చిన్నకామంచి,పెద్దకామంచి మొదలైన రకరకాలకాయలు
దొరికేవి.వాటికోసం అందరూ పరుగెత్తుకుంటూవెళ్లి ఎవరూ ముందువెళ్తే వాళ్ళు గొప్పగా ఫీలయ్యేవాళ్ళు.వాళ్ళే
కోసి కొన్నితీసుకుని మిగిలినవి అందరికీ ఇచ్చేవారు.అవి తినటానికి బావుండేవి.
                కొంచెం ముందుకు వెళ్తే పంటపొలాలు వచ్చేవి.ఒకఅమ్మాయి బెండకాయలు కోసుకుని తినేది.
కొంతదూరం వెళ్లినతర్వాత తుమ్మచెట్లు వచ్చేవి.తుమ్మలలో ఏదో వుందని భయపెట్టేవాళ్ళు.అందరూ కలిసి
ఒకటే పరుగు.తర్వాత పెద్ద చెరువు వచ్చేది.వర్షాకాలంలో రోడ్డుమీదకు నీళ్ళు వచ్చేవి.ఆనీళ్ళల్లోఆడుకుంటూ
జాలీగా స్కూలుకు వెళ్ళేవాళ్ళు.
               వచ్చేటప్పుడు చెరువులోచేపపిల్లలు ఉండేవి.వాటికి ఏదయినా వేస్తేఅన్నీ ఒక్కచోటకు వచ్చేవి.
వాటితో కాసేపు ఆడుకోనేవాళ్ళు.చెరువులో తామరపువ్వులు ఉండేవి.తామరపువ్వులంటే శ్రుతికి చాలా ఇష్టం.
అందరికన్నా శ్రుతి చిన్నపిల్ల.అందుకని ఏదయినా అడగగానే చేసేవాళ్ళు.శ్రుతికి వరుసకు అన్నయ్య చెరువులో
దిగి కోసిచ్చేవాడు.తుమ్మలదగ్గరకు రాగానే ఒకటే పరుగు.చెరకుతోట దగ్గరకు రాగానే మగపిల్లలు చెరుకులుతీసి
ఇచ్చేవాళ్ళు.అందరూ తినేవాళ్ళు.కందితోట దగ్గరకు రాగానేకందికాయలు కోసుకుని తినేవాళ్ళు.అలా ఆడుకుంటూ
సాయంత్రం ఇంటికి వెళ్ళేవాళ్ళు.



Tuesday 26 November 2013

పిచ్చుక గూడు

             సౌజన్య ,ధాత్రి ,సుధీర కాలేజీలోఉండగా మంచి ఫ్రెండ్స్.చాలా సరదాగా అందరితో స్నేహంగా ఉండేవారు.
కాలేజిలో క్లాసులు లేనప్పుడు గ్రౌండ్ లో కొబ్బరిచెట్ల క్రింద కూర్చుని నిక్నేమ్స్ పెడుతూ కామెంట్స్ చేస్తూ ఉండేవారు.వాళ్లక్లాస్ లో ఒక అమ్మాయికి గిరజాలజుట్టు పొట్టిగా గుబురులాగా ఉండేది.అందుకని ఆ అమ్మాయిని
''పిచ్చుక గూడు "అని పిలిచేవాళ్ళు.చివరికి ఆ అమ్మాయి అసలుపేరు కూడా మర్చిపోయారు.
             పొట్టిగా బొద్దుగా ఉంటే గుమ్మడికాయఅని,పొడవుగా సన్నగా ఉంటే వాసం అంటే పొడవుకర్ర అని అర్ధం
అమాయకంగా ఉంటే పిస్క్వేర్  అంటే పిచ్చిపిల్ల అనిపిలిచేవాళ్ళు.అలా రకరకాల పేర్లు పెట్టి సరదాగా అల్లరి చేస్తుండేవాళ్ళు.అలా అని చదువుని అశ్రద్ధ చేసేవారు కాదు.కాలేజీ లైఫ్ అన్న తర్వాత చిన్నచిన్నచిలిపిపనులు
చేస్తుంటే సరదాగా ఉంటుంది.వాళ్ళను ఎవరినీ ఏడిపించేవారు కాదు.వీళ్ళు ముగ్గురూ మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు.
          ఎవరినీ హర్ట్ చేయకుండా  అల్లరి శ్రుతి మించకుండా ఉన్నంతవరకు మనకు అందరికీ మంచిదని
నా మనవి. 

సుందరాంగి

            సంజన ఇంటి ప్రక్కన ఒక భార్యాభర్తలు ఉంటారు.వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు.మంచివాళ్ళే ఎదుటి
వారికి అవసరమయితే సహాయం చేస్తారు.వాళ్ళ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.అది ఎలా అంటే భార్య ఎవరితో
అయినా మాట్లాడుతుంటే హాయ్ అంటూ చేతులు ఊపుతూ వచ్చేస్తాడు.చిన్నపిల్లలకు చెప్పినా అదొకరకం.అది ఎదుటివారికి ఇబ్బంది అని ఆలోచించడు.అలా చెయ్యటం వాళ్ళావిడకు కూడా ఇష్టం ఉండదు.ఆవిడే చెప్పుకోవాలి.
అలా ఆడవాళ్లు మాట్లాడుకొంటూ వుండగా రావటం పద్దతిగా ఉండదు కనుక రావద్దు అని చెప్పాలి.
           వాళ్లపిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు.వాళ్ళు విదేశాలకు వెళ్లి వచ్చినరోజు ఉదయమే సంజనను పిలిచి మీ
సుందరాంగిని చూశానుఅని చెప్పాడు.సంజన అయోమయంగా చూసి అంటే ఎవరు అని అడిగింది.మీ పనిమనిషి
అని చెప్పాడు.వాళ్ళు సంజనవాళ్ళ ప్రక్కింటి పనిమనిషిని మాట్లాడుకున్నారు.
          వాళ్ళావిడ ఊరు వెళ్ళినప్పుడు రొజూ  సంజన ఏ పనిలోవున్నాసరే పిలిచిమరీ మాసుందరాంగి  వచ్చినదేమో
కనుక్కోండి అనేవాడు.సంజన ప్రక్కనవాళ్ళను పిలిచిమరీ అడిగి మళ్ళీ ఆయనకు చెప్పాలన్నమాట.సంజన ఇబ్బందిపడి ప్రక్కనవాళ్ళను ఇబ్బందిపెట్టి అడగటం అంత అవసరమా?అది ఎంతవరకూ సమంజసం?
         ఉదయం అందరూ హడావిడిగా ఉంటారు.ఆయనకు పనిలేదని అందరినీ ఇబ్బందిపెట్టటం పద్ధతేనా?
ఆడవాళ్లయినా మగవాళ్లయినాఎదుటివారు బిజీగా ఉన్నప్పుడు పిలిచిమరీ చిన్నచిన్న విషయాలకు ఇబ్బందికి
గురిచేయటం సరికాదు కదా.ఆలోచిస్తే అలా చేయరుకాని కాలక్షేపానికి కూడా కొంతమంది చేస్తారు.ఇది చదివిన
తర్వాత కొంతమందిలో అయినా మార్పు వస్తే బావుంటుందని నా ఆశ.

                       
     
                                         
 

నారదమ్మ

       శ్యామల వాళ్ళ బంధువులలో ఒక పెద్దావిడ ఉండేది.ఆవిడ ఉన్నవి లేనివి ఒకళ్ళమీద ఒకళ్ళకి చెప్తుండేది.
ఆవిడకు ఆరుగురు పిల్లలు.అందుకని ఎప్పుడూవాళ్ళ కోసం పిండివంటలు చేసేది.వాళ్ళు ఎప్పుడూఏదో ఒకటి
పెట్టమని అడిగేవాళ్ళు.పిండివంటలు వండటం అంటే ఇద్ధరోముగ్గురో ఉండాలికదా.
          అలా వాళ్ళతో చాకిరి చేయించుకుంటూ వాళ్లకాలక్షేపం కోసం ఎవరో ఒకరి గురించి చెప్తుండేది.ఒకసారి ఆ
సమయంలో శ్యామల వెళ్ళింది.సరిగ్గా ఆ సమయంలో శ్యామల వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతుంది.
శ్యామల చిన్నపిల్లే అయినా కానీ ఇంటికివచ్చి అన్నీ ఇంట్లో చెప్పేసింది.అలా రెండుమూడు సార్లు జరిగింది.
ఈ విషయం పెద్దావిడకు అర్థమయింది.ఇక అప్పటినుండి శ్యామల వచ్చిందంటే భయం.చెప్పేదికూడా ఆపేస్తుంది.
ఎక్కడ ఇంటికి వెళ్లి చేప్తుందోనని.ముసలితనం వచ్చింది అయినా ఆవిడమాత్రం మారలేదు.అందుకని తనను  "నారదమ్మ"అంటారు. అంటే తగువులు పెడుతుందని శ్యామల ఆ పేరు పెట్టింది.
          నారదుడు లోకకల్యాణం కోసం తగువులు పెడితే ఈవిడ కాలక్షేపం కోసం లేనిపోయినవి సృష్టిస్తుంది.
అందుకని నారదమ్మ అయింది. 

కోటి దీపోత్సవం

         శ్రేష్ట వాళ్ళఊరిలో  ఒక శివాలయం ఉంది.ఆ శివాలయంలో 28సంవత్సరాల క్రితమే లక్ష దీపాలు వెలిగించారు.
అప్పటినుండి దాదాపుగా ప్రతిసంవత్సరము లక్షదీపోత్సవం చేస్తారు.ఆ ఊరివాళ్ళు కానీ ప్రక్కఊరివాళ్ళుకానీ ఎవరో
ఒకళ్ళు కార్తీకమాసంలో వెలిగిస్తారు.ఈసారి కోటి దీపాలు వెలిగించారు.
        అంతకుముందు365వత్తులు ఒక్కొక్కదానిలో వేసి వెలిగించేవారు.ఇప్పుడు పెద్దప్రమిదలలోలక్ష చొప్పున
వెలిగిస్తున్నారు.ఊరిలో ఒకతనికి బొమ్మలువేయటం వచ్చు.అతను గుడిలో బయట ధ్వజస్తంభం ప్రక్కన గుడిచుట్టు ప్రక్కల శివలింగం,ఓంకారము రకరకాల బొమ్మలు వేశాడు.ఆ ఆకారాలలో దీపాలు వెలిగించారు.చూడటానికి కన్నులపండుగగా ఉంది. 

Monday 25 November 2013

ముడి వేయటం -ముడి తీయటం

                చేతన వాళ్ళ ఊరిలో రామకృష్ణ అని ఒకతను ఉండేవాడు.అతను అందరితో ఏమి  చెప్పేవాడంటే
తెల్లవారితే లేచిన దగ్గరనుండి నా పని ఏమిటంటే ఇద్దరికి ముడి వేయటం అంటే తగువు పెట్టటం ఇద్దరికి 
వేసిన ముడి తీయటం అంటే ఇద్దరి మధ్య పెట్టిన తగువు తీర్చటం అని అర్ధం.ఇలాగే డబ్భు సంపాదించేవాడు.

               తన స్వార్ధం ఎంత మంచి స్నేహితులమధ్య అయినా బంధువులమధ్య అయినా తగువు పెట్టేవాడు.
అతని సంగతి తెలిసి కూడా మాటల మాయాజాలంలోపడిపోయేవారు.అలా సంపాదించిన డబ్బుతో కుటుంబం
సంతోషంగా ఉంటుందని అనుకొనేవాడు.కానీ అలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి సంపాదించటం వలన డబ్బు
వచ్చినా కూడా సుఖపదలేరు కనుక వాళ్ళ కుటుంబంలో ప్రశాంతత లేదు.అయినా అతనికి అర్ధం కాదు.చేసే
పనులు మానడు.అతను బాధ పడుతున్నాడు అయినా ఎదుటివాళ్ళదగ్గర ప్రేమగా నాన్నా,నాన్నాఅంటూ
డబ్బు తీసుకునే వరకూ నటిస్తాడు .
              డబ్బు ఇచ్చేవాళ్ళు ఆ మాయాజాలంలో పడి ఇస్తారు.అతను ఎంత వినొద్దు అనుకున్న వాళ్ళనయినా
తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.ఎంతోమందిని నష్టపెట్టాడు.వీళ్ళు ఎప్పుడు మారతారో అతను ఎప్పుడు
మారతాడో వేచి చూడాలి.ఇలాటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.



Sunday 24 November 2013

ఊర్వశి

        శర్వాణి చాలా అందంగా ఉండేది.వాళ్ళ ఇంటి ప్రక్కన నందిని అని బంధువులు ఉండేవారు.ఆమె చాలా నల్లగా ఉండేది.పోలికలు బానే ఉండేవి .కళ్ళు మాత్రమే తెల్లగా ఉండేవి .తల్లిదండ్రులను పోలి పిల్లలు ఉంటారు.దేముడు
ఇచ్చిన రూపాన్ని ఎవరూ ఏమీ  చేయలేరు.ఈ రోజులలో అంటే ప్లాస్టిక్ స ర్జరీలతో  రూపాన్ని   మార్చేస్తున్నారు.
          అందరితో తెల్లగా ఉంటే సరిపోయిందా నల్లగా ఉన్నాపోలికలు బాగా ఉన్న వాళ్ళే అందగత్తెలు అని చెప్పేది.నేనే అందగత్తెను అని ఆమె మా అమ్మాయి అందంగా ఉంటుందని వాళ్ళ నాన్న మాట్లాడేవారు .వాళ్ళ ఆయన కూడా వాళ్ళు  బావుండలేదు వీళ్ళు బావుండలేదని అందరినీ  విమర్శించేవాడు .
           అందుకని ఆమెను అందరూ ఊర్వశి అంత అందగత్తె లాగావాళ్ళు  ఊహించు కుంటున్నారని " ఊర్వశి"
అని పిలిచేవాళ్ళు.ఇంతకీ ఎవరూ ఆమెను విమర్శించక పోయినా చిన్న పిల్లల దగ్గరకు ఎత్తుకుంటానికి వెళ్తే
మాత్రం పిల్లలు పెద్దగా ఏడ్చేవాళ్ళు. ఫై గా పిల్లల ధగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు పెద్దగా చేసి భయపెట్టేది.
శర్వాణి కూతురు దగ్గరకు వెళ్లి కూడా అలాగే చూస్తే ఆ పాప భయపడి ఏడ్చింది .కొంచెం పెద్ద అయ్యే వరకూ 
కూడా అలాగే ఏడ్చేది.

           



Saturday 23 November 2013

చిట్టి చిట్కాలు


1)మందార నూనె తలకు రాస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది .
 2)   కొంచెం కుంకుడు కాయలు కొట్టకుండా ఉడికించి దానిలో కొంచెం  మందార ఆకులు వేసి చిక్కగా రసం తీసి
తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా వత్తుగా పెరుగుతుంది.
3)ఒక రేఖ వున్న ఎర్ర మందార పువ్వుతో తల మీద వెంట్రుకలు లేని చోట రుద్దితే వెంట్రుకలు వస్తాయి.
4)మెంతులు రాత్రిపూట నానపెట్టి ఉదయం మెత్తగా మిక్సీ లో వేసి రుబ్బి తలకు పట్టించి అరగంట తర్వాత
  తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
5)అలోవేరా జెల్ తినగలిగితే నున్నగా ఉంటారు.తెల్లగా ఉన్నవాళ్ళయితే ఇంకా చాలా బావుంటారు.
6)ఎక్కడయినా కట్ అయితే అక్కడ అలోవేరా జెల్ పెట్టి రుద్దితే రక్తం రావటం ఆగిపోతుంది.ఇది అందరి ఇళ్ళల్లో
ఉండదగిన మొక్క .
7)మిరియాలపొడి కొంచెం పాలల్లో వేసుకుని తాగితే జలుబు చేసినప్పుడు తగ్గిపోతుంది .
8)తులసిఆకులు రోజు తొమ్మిది తింటే బి.పి.కంట్రోల్ లో ఉంటుంది.
9)భోజనం చేసిన తర్వాత గ్రీన్ టీ ఒక పెద్ద కప్ త్రాగినట్లయితే బరువు తగ్గుతారు .
10)పుదీనా ఆకులు పేస్ట్ లాగాచేసి మొటిమలు వున్నా చోట రాస్తే తగ్గుతాయి .

శ్వేత గులాబీ

              శ్వేత చిన్నప్పుడు  చాలా అందంగా ఉండేది .పట్టుకుంటే మాసిపోయేటట్లుగా ఉండేది.అందుకే వాళ్ళ
అమ్మమ్మ గ్లాస్కో క్లాత్ తో పోల్చేది .గ్లాస్కో క్లాత్ అంటే ఒకప్పుడు బాగా ఇష్టపడేవారు .నల్లటి వత్తయిన జుట్టు
తెల్లగా హుషారుగా ఉండడం వలన అందరూ ఎత్తుకోవటానికి పోటీ పడేవారు .
            వాళ్ళ అమ్మ అయితే అమూల్ బేబీ లాగా ఉండేదానివి అనేది .ఎందుకంటే అమూల్ పాలతో ముద్దుగా
బొద్దుగా అందంగా ఉండేదని అలా అనేది .కొంచెం పెద్దయిన తర్వాత అంటే సంవత్సరం దాటినడక వచ్చేటప్పటికి
లల్లీ -పప్పీ క్రాఫ్  వేసేది .వాళ్ళ అమ్మే స్వయంగా అందంగా కట్ చేసేది .
          శ్వేతకు వాళ్ళ ప్రక్క ఇంటి అమ్మాయి అపర్ణకు ఒక మాస్టర్ ని పెట్టి ఇంట్లోనే చదివించేవారు.ఇద్దరూ కూడా
బాగా చదవటం వలన ఒక సంవత్సరంలోనే రెండు తరగతులలో  నేర్చుకునే అంత నేర్చుకున్నారు .మాస్టారు
కూడా అలాగే పిల్లలు బాగా చదువుతున్నారని అన్నీ చక్కగా నేర్పించారు .
         అలా మూడవ తరగతిలో స్కూల్లో చేర్చారు .తొమ్మిదో సంవత్సరానికి ఆరవ తరగతికి వచ్చేసింది .
పదమూడుకి టెన్త్ అయిపోయింది .పద్దెనిమిది వచ్చేటప్పటికి డిగ్రీ అయిపోయింది .ఈలోపు పెద్దగా వత్తుగా
ఉండటం వలన వాళ్ళ అమ్మకు స్కూల్ కి రెండు జడలు ,కాలేజి కి ఒక జడ వేయటానికి చాలా టైం పట్టేది.
         తెల్ల గులాబీ పువ్వంటే శ్వేతకు బాగా ఇష్టం. అందుకని ఫ్రెండ్స్ శ్వేతగులాబీ అని పిలిచేవారు .

Thursday 21 November 2013

ఆడండి -ఆకలి తీర్చండి

                    మీ ఖాళీ సమయాలలో ఆన్ లైన్లో ఒక్క పది నిమిషాలు నేను చెప్పేదాని కోసం కేటాయించండి .
అది ఏమిటంటే ఒక ఆన్ లైన్ గేమ్.దీన్ని ఆడితే  మీకు పిల్లలకు కూడా మంచి కాలక్షే పము మరియు
ఆకలితో ఉన్నవాళ్ళకు ఆహారం పెట్టినట్లుగానూ ఉంటుంది.
                అదెలాగంటే www.free rice.com కు వెళ్ళండి .అక్కడ ఒక ఇంగ్లీష్ పదము ఇస్తాడు .క్రింద 4 ఇంగ్లీష్
పదాలు ఇస్తాడు .వాటిలో మనకు కరెక్ట్ అనిపించిన పదాన్ని ప్రక్కన వున్న సర్కిల్లో క్లిక్ చేయాలి .అది కరెక్ట్
అయితే 10 బియ్యపు గింజలు ఇస్తాడు .అలా మనకు వీలయినంత సమయము చేయవచ్చు.ఒకవేళ తప్పు
అయితే కొంచెముసేపు తర్వాత మళ్ళీ వస్తుంది .
                  దీని వలన మనము ఆకలి తీర్చిన వాళ్లము అవుతాము .కొత్త కొత్తవి నేర్చుకున్న వాళ్లము అవుతాము.మనము చేసేదాన్ని బట్టి మన లెవెల్ పెంచుకోవచ్చు .ఒకవేళ మనకు కొత్త పదము లాగా
అనిపిస్తే ఎలా పలకాలో కూడాప్రక్కన నొక్కితే వస్తుంది.మనము ఇలాచేసేదంతా కూడాWFP ద్వారా
అంటే ప్రపంచ ఆహార పధకం ద్వారావాళ్లకు ఇస్తారు .
                 దీని కోసం మనం ఏమీ ఖర్చు పెట్టనక్కరలేదు .కొంచెము సమయము కేటాయిస్తే సరిపోతుంది.
మరీ చేస్తారు కదా .ప్రయత్నించండి. 

శివాలయం

                 అమ్మమ్మ వాళ్ళ వీధి చివర ఒక పెద్ద శివాలయం ఉండేది .వినాయకుడు ,శివుడు ,పార్వతీదేవి
     విగ్రహములు ఉండేవి .ఒక ప్రక్కన నాగేంద్రుని పుట్ట ఉండేవి.పుట్టలో పాలు పోసి ఆడపిల్లలకు చెవులకు
      పోగులు   కుట్టిచ్చేవారు .

                  ఇప్పుడు ఆంజనేయస్వామి ,నాగేంద్రస్వామి నవగ్రహ మండపము కట్టారు .చాలా ప్రశాంతముగా
     ఉంటుంది .అక్కడ పూజారి గారు కూడా చాలా బాగా   పూజ చేస్తారు .పూజారి గారి భార్య కూడా చాలా
     బాగా వండి నివేదనలు పెట్టడానికి ఇచ్చేవారు.మా ఇంటి ప్రక్కనే ఉండేవారు.
                   నవరాత్రులప్పుడు ఏ రోజు ఏ నివేదన పెట్టాలో వాళ్ళు చెప్పేవారు.ఎవరు ఏ రోజు చేయించుకోవాలి
      అనుకుంటే ఆ రోజు అన్నీ పంపిస్తే బాగా చేసేవారు.అమ్మవారికి చీర జాకెట్టు ముక్క ఇస్తే చక్కగా కట్టి
    అలంకరించేవారు .మేము వెళ్ళి అక్కడ కూర్చుని పూజ చే పించుకునేవారము.
               
                   ఇంతకీ ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే  రాత్రిపూట నాగేంద్రస్వామి శివలింగానికి చుట్టుకుని ఉండటం.
దేవతా  సర్పమని మంచి సువాసన వస్తూ ఉండేదని పూజరిగారికి కనిపించేదని చెప్పేవారు .అందుకనే రాత్రి
గుడికి  వెళ్ళాలంటే గంట మ్రోగించి మరీ లోపలకు వెళ్ళేవారు.

           ఎవరయినా ఈ గుడికి వెళ్ళి ఏదయినా మొక్కుకుంటే ఆ పని తప్పకుండా పూర్తి అవుతుంది.ఇది మా
అందరి నమ్మకము .నిజము .ఈ గుడి విజయవాడకు 10-12 కి .మీ దూరంలోఉంటుంది.

   

Wednesday 20 November 2013

సుడిగుండం

               నాకు ఐదు సంవత్సరములు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు  వెళ్ళాము. చాలా అందమైన ఊరు .
అమ్మమ్మ వాళ్ళ రోడ్డులో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ప్రక్కన వాళ్ళ అమ్మ ,నాన్న ఉండేవారు. కొంచెం అవతల అన్నయ్య ,తమ్ముడు వాళ్ళ ఇళ్ళు ఉండేవి .ఇరుగు పొరుగూ అందరూ కూడా చుట్టాలే .చాలా సరదాగా సందడిగా
ఉండేవారు.
               ఊరికి ఇంకొక ప్రక్కన అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉంది .వాళ్ళ ఇంటి వెనుక చిన్న కట్ట ఉంది
.దాని ప్రక్కన ఒక కాలువ ఉంటుంది .అప్పట్లో బల్లకట్టు ఎక్కి ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వెళ్ళేవాళ్ళం.కాలువ
దాటగానే పెద్ద కట్ట ఉంది.పెద్ద కట్ట నుండి క్రిందకు దిగి కొంత దూరం పొలాలు ఉండేవి .అవి దాటిన తర్వాత
కొంతదూరం ఇసుకలో నడిచి వెళ్తే కృష్ణానది వస్తుంది .
              ఏటికి స్నానానికి వెళ్తున్నాం అనేవాళ్ళం. ఆ రోజు రధసప్తమి .ఊరిలో అందరూ చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళతో సహా చాలా మంది వెళ్ళాము .అప్పట్లో మగవాళ్ళు కూడా కొంతమంది రక్షణగా వెళ్ళేవాళ్ళు .ఏటిలో దిగి సూర్యునికి
నమస్కరించి ఆడవాళ్లు పసుపు సూత్రానికి మొహానికి రాసుకుని మూడుసార్లునీళ్ళల్లో మునిగి తర్వాత ఈత
వచ్చినవాళ్లు ఈత కొట్టేవాళ్ళు.
                తర్వాత ఒడ్డుకి వచ్చి ఇసుకతో గౌరీ దేవిని చేసి బియ్యపు పిండి,పసుపు ,కుంకుమ ,పువ్వులు పెట్టి
 సాంబ్రాణి కడ్డిలు వెలిగించి అరటి పళ్ళు నివేదన పెట్టి హారతి వెలిగించి శివుని మేడలో నాగరాజా .....అనే పాట
పాడేవాళ్ళు.బొట్టు పెట్టుకొని తలా ఒక పువ్వు తలలో పెట్టుకొని కొంచెం ప్రసాదం తీసుకొని చేతులు కడిగి
గౌరీదేవిని అందరూ పట్టుకొని నీళ్ళల్లో వదిలేవారు .
               వీళ్ళు ఇలా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండగానే నలుగురు పిల్లలు కనిపించలేదని గమనించారు.
వాళ్ళు అందరూ పదిహేను సంవత్సరములు వయస్సు వాళ్ళే .వాళ్ళు రేగుపండ్ల కోసం  వెళ్లి ఉంటారని అనుకొని
వెతకడానికి మగవాళ్ళు వెళ్లారు .లంకలో రేగుపండ్లు చాలా బావుండేవి.అక్కడ కూడా పిల్లలు లేకపోయేసరికి
అందరూ ఏడవడం మొదలు పెట్టారు.
             కొంచం సేపటికి నీళ్ళల్లో కొంచెం దూరంలోగులాబీ రంగు కనిపించింది.ఈత వచ్చినవాళ్లు అక్కడకు
వెళ్లి చూస్తే అది ఒక సుడిగుండమనీ అందులో వాళ్ళు పడిపోయారని తెలిసింది.నలుగురిలో ఫై న వున్న
అమ్మాయి మాత్రమే బ్రతికింది .మిగతా ముగ్గురూ చనిపోయారు.అందరూ ఏడుస్తుంటే నేను తమ్ముడు
భయపడతామని అమ్మమ్మ మమ్మల్ని  తీసుకుని ఇంటికి వెళ్ళింది .ఇది  ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన.
  

Tuesday 19 November 2013

ఒక్క క్షణం ఆలోచిస్తే.....

                    వార్తాపత్రికలో ఒక వార్త చదివాను.నాకు చాలా భాధ కలిగింది.అందుకే ఇలా మీ అందరితో
పంచుకోవాలనిపించింది.అది ఏమిటంటే ఒక వైధ్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకోన్నాడనే వార్త.విద్య పూర్తి
చేసుకొని ఎంతోమందికి ప్రాణ భిక్ష పెట్టవలసినవాడు అలా ప్రాణం తీసుకోవటం చాలా భాదాకరంగాఉంది .

                   కారణంఏదయినా కానివ్వండి అలా చేయాల్సింది కాదు.ఎన్నో ఆశలతో కొడుకు డాక్టరు
అయితే బాగుంటుందని తల్లిదండ్రులు అనుకోని ఉంటారు .ఏదయినా సమస్య వుంటే తల్లిదండ్రులతో
కానీ స్నేహితులతో కానీ పంచుకోవాల్సింది.
                                
               పేపరులో ఫోటో వేసారు .చక్కగా ఉన్నాడు.తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే వాళ్లకు
ఒక్కడే పిల్లవాడనిచెప్పారు.నేను ఇలా చేస్తే తల్లిదండ్రులు ఎంత భాద పడతారు ఇలా చేయడం
ఎంతవరకు సమంజసం అని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బావుండేది.ఇలా జరిగివుండేది
కాదు .విన్న నాకే ఇంత భాధగా వుంటే తల్లిదండ్రులకు ఎంత భాధగా వుండి ఉంటుంది .

          ఏదయినా సమస్య వస్తే చిన్నప్పటినుండే అన్నికోణముల నుండి ఆలోచించి  సరిఅయిన నిర్ణయం
తీ సుకోగ లిగేటట్లు ధయిర్యంగా సమస్యను   ఎదుర్కోగలిగే టట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శిక్షణ
ఇవ్వాలి.
            ఇంతకు ముందు రోజులలో తాతయ్యలు ,అమ్మమ్మలు ,నానమ్మలు ,మేనమామలు,అత్తలు
వాళ్ళ పిల్లలు అందరూ కలసి మెలసి ఉండడం వలన చిన్న చిన్న వాటికి సర్దుబాటు తత్వం అలవడేది.
           
        సూచన:తల్లిదండ్రులుగా మనమందరమూ, ఉపాధ్యాయులుగా కోప్పడకుండా భాధ్యతగా
పిల్లలను ,విధ్యార్ధులను   తీర్చిదిద్దుదామనినా సూచన.  

సంపెంగ పువ్వులు

                                        నాకు చిన్నప్పుడు  సంపెంగ పువ్వులంటే చాలా ఇష్టం.మా చిన్న తాతయ్య గారింట్లో
     ఒక సంపెంగ  చెట్టు ఉండేది. మిగిలినవాటిలాగా ఎక్కువ పూసేది కాదు.అప్పుడప్పుడు పువ్వులు పూసేది.
    ఆకుపచ్చగా ఉన్నప్పుడు వాసన రావు.పసుపుపచ్చగా  అయినా తర్వాత మాత్రమే మంచి వాసన వస్తాయి.
    అవే నాకిష్టం .నా కోసం ఎవ్వరినీ కోసుకోనీయకుండా పసుపుపచ్చగా అయ్యేవరకూ చెట్టునే ఉంచేవాళ్ళు.
    చెట్టున రంగు వచ్చి పండితేనే పువ్వు మంచి వాసన వస్తుంది.మా తాతగారు నాకిష్టమని వాళ్ళ ఇంటికి వెళ్లి
    తెచ్చేవారు .నే  ను మన ఇంట్లో కూడా ఒక చెట్టు పె డదామని గొడవ చేసేదాన్ని.సంపెంగ చెట్టు వుంటే  పాములు
వస్తాయి.అందుకని మనింట్లో వద్దు అని అమ్మ ,అమ్మమ్మ చెప్పారు .వాళ్ళింటికి కూడా అప్పుడప్పుడు వస్తాయట.
కానీ నాకిష్టమని వాళ్ళు ఆ చెట్టుని కొట్టేయకుండా అలాగే వుంచి నా కోసం పువ్వులు ఇచ్చేవారు.మా తాతగారు
ప్రత్యేకించి ఆ ఊరు వెళ్లి పువ్వులు తెచ్చి నాకు ఇచ్చేవారు.కొన్ని సంవత్సరాల క్రితం అంత ప్రేమగా ఉండేవారు.














 
   







   
           



   

చేపలకు ఆహారం

                                                       చేపల అక్వేరియం ఇంట్లో పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు.ఎవరి
   అభిరుచికి తగినట్లు వారు రకరకముల రంగురంగుల చేపలు పెంచుకోవచ్చు.రోజు వాటికి ఆహారం అందించటం
   ఒక కాలక్షేపం.అక్కడక్కడ వాటికి ఆహారం వేస్తుంటే అవి పరుగెత్తుతుంటే చూడటానికి చాలా సరదాగా
ఉంటుంది.అప్పుడప్పుడు అక్వేరియం కడగటం కష్టమే అనుకోండి. అయినా అభిరుచి ఉన్నప్పుడు కష్టంగా
 అనిపించదు కదా.అందుకనే మీకు ఇబ్బంది కలగకుండా నా  బ్లాగ్ కి వచ్చినప్పుడు మీకు బోర్ కొట్టకుండా
చదువుతూ  అప్పుడప్పుడు క్లిక్ చేస్తూ చేపలకు ఆహారం అందించటానికి ఏర్పాటు చేశాను.తప్పకుండా
వేయండి.







 












Monday 18 November 2013

అమ్మో నీళ్ళు పడిపోతానేమో

                                              మేము    అలహాబాద్ లో ఉన్నప్పుడు  ఒకసారి త్రివేణి సంగమం చూడడానికి
వెళ్ళాము. అప్పుడు నాకు మూడు సంవత్సరములు.త్రివేణిసంగమము అంటే మూడు నదుల కలయిక .గంగ
యమున,సరస్వతి నదులు కలిసిన  ప్రదేశాన్నే త్రివేణిసంగమం అంటారు. సరస్వతీనది అంతర్వాహిని.గంగానది,
యమునానది మామూలుగా ప్రవహిస్తాయి. అమ్మ,నాన్నగారు,నేను రావు మామయ్య అందరము కలసి పడవ
ఎక్కడానికి వెళ్ళాము.రావు మామయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా ఎత్తుకొనే వెళ్ళేవాడు.పడవలో ఎక్కి
మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు భయం  వేసింది .ఒకటే ఏడుస్తూ నేను నీళ్ళల్లోపడిపోతానేమో వెళ్ళిపోదాముఅని గొడవ చేస్తుంటే అలా అనకూడదు అని చెప్పారు .ఒక అరవై సంవత్సరాల క్రితం నీళ్ళల్లో ప్రయాణం చే స్తూ అలా అంటే ఎక్కడో నిజంగానే పడవ మునిగిపోయిందట .అందుకని అలా చిన్నపిల్లలు మాట్లాడకూడదు అని చెప్పారు.కానీ  
వాళ్లకి కుడా భయం వేసింది. పడవను వెనక్కి తీసుకునివెళ్ళమని చెప్పారు. ఒడ్డుకు వచ్చేవరకూ ఒకటే నమస్కారములు చేసుకొన్నారు. చల్లగా ఒడ్డుకుచేర్చండి  అమ్మా మమ్మల్ని అంటూనమస్కరిస్తూనే ఉన్నారు.
ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తిరిగి మరల కృతజ్ఞతతో నమస్కరించి ఇంటికివచ్చారు.
కానీ నాకు మాత్రం అంత ఎక్కువగావున్నా పెద్ద ప్రవాహాలను చూస్తే ఒక్క క్షణం ఒళ్ళుజలధరించినట్లు అవుతుంది.
చాలా సంవత్సరాల వరకూ  ఆ భయం పోలేదు.తర్వాత మామూలైపోయింది.కానీ ఇప్పటికీ సముద్రం కానీ ,పెద్ద నదులను కానీ చూడగానే అలాగే అనిపిస్తుంది .అంతగా మనసులో ముద్ర పడిపోయింది. 






































Sunday 17 November 2013

నా ఊహ-శునకం అపోహ

                                                  మా చిన్నప్పుడు మేము అలహాబాద్ లో ఉండేవాళ్ళము .అప్పుడు నాకు రెండున్నర సంవత్సరములు.మా ప్రక్కన వున్న ఇంటిలో ఒక పెద్ద కుక్క వుండేది .ఒక రోజు నేను దానికి బ్రెడ్ పెడదామని  వెళ్ళాను . కొంచం పెడితే తినేసింది .ఇంకా కొంచెం వేసాను.అది దానికి అందలేదు .దానికి అందేలా వేద్దామని ముందుకు వెళ్ళాను.నేను మరల తిసేసుకోవటానికి వచ్చానని అపోహతో నన్ను కరిచింది. అప్పుడు బాగా  రక్తం వచ్చింది .బాగా ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళు వచ్చి చూచి  డాక్టర్ దగ్గరకితీసుకునివెళ్ళి ఇంజక్షన్ చేయించారు.ఇంకెప్పుడు అలా చేయొద్దు అని మందలించారు. దాని పన్నుగుర్తు ఇప్పటికీ వుంది.



Thursday 7 November 2013

నాగులచవితి

                                                                నాగులచవితి
                               
                                     
                       నాగులచవితి శుభాకాంక్షలు.నాగులచవితి సందర్భంగా ఈ యదార్ధసంఘటనను మీతో పంచుకోవాలని అనిపించింది.విజయవాడకు15-20కి.మీ దూరంలో చోడవరం అనే గ్రామం ఉంది.అక్కడ
నాగేంద్రస్వామి ఆలయం ఉంది.అక్కడ ఈ రోజు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి.ఈరోజు ఉదయం నుండి
చుట్టుప్రక్కల ఊరిప్రజలందరూ పుట్టలో పాలు పోయడానికి వెళ్తారు.పుట్టలోబియ్యప్పిండి కొర్రలపిండి నువ్వులు
బెల్లం అరటిపండు అన్నీ కలిపి ఆవుపాలతో పుట్టలోని కలుగులో వేస్తారు.ముందుగా పుట్ట దగ్గరికి వెళ్లికలుగు
చుట్టూ నీళ్ళు చల్లి బియ్యప్పిండి చల్లి వరుసగా పసుపు,కుంకుమ వేసి పువ్వులు అలంకరించి సాంబ్రాణికడ్డిలు
వెలిగించి హారతి ఇస్తారు.తర్వాత పుట్టలోఫైన చెప్పినవన్నీమూడుసార్లు ఇంట్లోఅందరి పేర్లు,అటు ఏడు తరాలు
ఇటు ఏడు తరాలవాళ్ళవిఅని చెప్పి పాలు పోస్తారు.
                  ఉదయం12 గం.లకు నాగేంద్రస్వామి ఆలయం ఫైకి వచ్చిఅందరికీ దర్శనం ఇస్తారు.ఈ సమయం
కోసం భక్తులందరూ ఎంతో ఎదురు చూస్తారు.స్వామి ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఒకే సైజులోపడగ విప్పి
భక్తులందరినీఆశీర్వదిస్తారు.ఇది  అద్భుతం.మేము అందరమూ ఒక సంవత్సరము వెళ్లి దర్శనం చేసుకొన్నాము.
అప్పుడు ప్రక్కన ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము ఇలాగే12గం.లకు దర్శనం ఇస్తారు అని చెప్పారు.
                     ఈరోజు ఉదయం నుండిసాయంత్రం వరకూ ఎంతమంది వచ్చినాకూడా ఉచితంగా ఆవు పాలు
కావాల్సిన వాళ్ళకు ఇస్తారు.అక్కడ అందరూ స్వచ్ఛందసేవ చేయడానికి పోటీ పడతారు.ఆ ఊరివారందరూ
 కూడా బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తారు. స్పెషల్  బస్సులు ఆర్.టి.సి వాళ్ళువేస్తారు.సాంస్కృతిక
కార్యక్రమాలు జరుగుతాయి.నాగులచవితి రోజున కొన్ని వేల మంది స్వామి దర్సనానికి వస్తారు.అయినా కూడా
చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఈ విషయాన్నిమీ అందరితో  పంచుకోవాలన్పించింది.













.
.





















Wednesday 6 November 2013

స్వాగత సుమాంజలి

                                                           సుస్వాగతం
                                             

                                                 
,


                                 తెలుగు వారి బ్లాగ్ దర్శించ వచ్చినవారందరికీ స్వాగతం -సుస్వాగతం.

      ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన తెలుగువారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో

                           ప్రశాంతంగా ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

.                                                         ధన్యవాదములు