Sunday 29 October 2017

తప్పొప్పులు ఎంచక

                                                        మనకు ఎక్కువ ఆశ్చర్యం,సంతోషము అనిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.ఇలా ఏకకాలంలో సంభ్రమాశ్చర్యం కలిగించే సంఘటనలు రోజూ ఎక్కువగా  ఎదురు కాకపోవచ్చు.అందుకే నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలోను తప్పొప్పులు ఎంచక ఏ చిన్న సంతోషకరమైన విషయాన్నైనా చిన్న పిల్లల్లా ఆనందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు,పెద్దల సూచన.ప్రకృతి సౌందర్యాన్ని, నచ్చిన స్నేహితులనో,బంధువులనో అకస్మాత్తుగా చూచినప్పుడు మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది.ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా వీలుకల్పించుకుని సాధ్యమైనంతవరకు అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ,తరచు ఆప్తులను కలిసి మాట్లాడుకుంటూ ఉంటే  మనసుకు హాయిగా ఉండి ఉత్సాహంగా పనిచేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.

Friday 27 October 2017

చలికాలంలో చర్మం

                                                   చలి మొదలవగానే చాలామందికి చర్మం పొడిబారి పోతుంటుంది.చలికాలంలో కూడా చర్మం మృదువుగా ఉండాలంటే రోజుకి మూడు లీటర్ల నీళ్ళు తప్పనిసరిగా తాగాలి.ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.స్నానానికి పది ని.లు ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసి గోరు వెచ్చటి నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి ఆ నీటితో  స్నానం చేస్తే తాజాగా బాగుంటుంది.రోజూ యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.ఈ కాలంలో సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పుల సమస్య బాధించదు.ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.వారానికి రెండు సార్లు ఒక స్పూను తాజా పెరుగు,తేనె,బాదంపొడి లేదా శనగపిండి కలిపి ముఖానికి,కాళ్ళకు,చేతులకు రాసుకుని 15 ని.ల తర్వాత కడిగేయాలి.సమయం ఉంటే కనీసం వారానికి ఒకసారైనా శరీరం మొత్తానికి ఈ మిశ్రమం రాసుకుని స్నానం చేస్తే చర్మం  మృదువుగా మెరుస్తూ ఉంటుంది.రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు బాదం నూనె రాసుకుంటే పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.ఇవన్నీ పాటిస్తూ ఈ కాలంలో దొరికే అన్నిరకాల పండ్లు,కూరగాయలు తాజాగా తీసుకుంటుంటే చలికాలంలో చర్మం పొడిబారే సమస్యను అధిగమించవచ్చు.

Thursday 19 October 2017

బొమ్మలాట

                                                                      ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట.ఇప్పుడు కొంత మందికి పెళ్ళంటే బొమ్మలాట అనడానికి ఇదొక ఉదాహరణ.బొమ్మలపెళ్ళి అనుకోవడానికి ఏమైనా చిన్న పిల్లలకి చేశారా?అంటే అదీ లేదు.ఇద్దరికీ పాతిక సంవత్సరాలు దాటి రెండు మూడేళ్ళు.ఇద్దరూ సాంకేతిక రంగంలో పట్టభద్రులు.నగరంలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.ఇద్దరి తల్లిదండ్రులు ఆకాశం అంత పందిరి,భూదేవి అంత అరుగు వేసి అన్నట్లు  ఒకరికొకరు పోటాపోటీగా డబ్బు ఖర్చుపెట్టి ఘనంగాపెళ్ళి చేశారు.పెళ్ళయిన మూడోరోజే అమ్మాయి,అబ్బాయి మేము ఇద్దరమూ విడిపోతామని ఖరాఖండీగా చెప్పేశారు.పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా?కారణం ఏమిటి?అంటే కారణం వాళ్ళకే తెలియదు.కలిసి బ్రతకలేము అంతే.మరో మాటకు ఆస్కారము లేదు.పెళ్ళి కుదిరి మూడు నెలలు అయింది.ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా?అంటే దానికి సమాధానం లేదు.వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకో జంటకు పెళ్ళయి పదేళ్ళయింది.ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు.ఇద్దరికీ పిల్లలు కావాలి.కానీ వాళ్ళు కలిసి బ్రతలేమని తేలికగా తేల్చి చెప్పేశారు.వీళ్ళు బిడ్డల మానసిక పరిస్థితి,తల్లిదండ్రుల పరిస్థితి  ఆలోచించటం లేదు.వాళ్ళు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవటం లేదు.విడిపోవడం కూడా బొమ్మలాటలో బొమ్మల పెళ్ళి చేసినంత తేలిగ్గా అయిపోయింది. 

Wednesday 18 October 2017

దీపావళి శుభాకాంక్షలు

ఇంటింట ప్రతి ఇంట ఘనంగా,ఆనందంగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు.

Monday 16 October 2017

సాయీశా ఓ సాయీశా

సాయినాధ శ్రీ సాయినాధ అంటూ ఎంతో భక్తితో మొదలుపెట్టి సాయీశా ఓ సాయిశా అంటూ మనకు అందించిన జానకమ్మ సాయినాధ సంకీర్తనా కుసుమం.
                                   సాయినాధా శ్రీ సాయినాధా మా దేవుడవు నీవేలే సాయినాధా
                                             మా పాపాలను పరిమార్చు సాయినాధా      "సా"
                                             గరళమంత  ఒక్క గుక్కలో మింగావంటా
                                       మోహినివై దేవతలకు అమృతం పంచావంటా
                                              రక్కసుల దర్పమును అణిచావంటా
                                   ఆ దేవతలను అమరులను చేశావంటా సాయీశా ఓ సాయీశా "సా"
                                                   దశరధ నోముల పంట నీవేనంటా
                                                    యశోదానందుల ఇంట పెరిగావంటా
                                                     కలియుగమున షిర్డీలో వెలిశావంటా
                                   నీ లీలలన్నీ చూసి మేము మురిసేమంటా సాయిశా ఓ సాయిశా "సా"
                                                        జగమంతా నిండినదీ నువ్వేనంటా
                                                              ఏకమైన నువ్వే అనేకమంటా
                                                        గోవిందుని నామాలను పలికితిమయ్యా
                                        గోపాలుడు నువ్వేనని ఎరిగితిమయ్యా సాయిశా ఓ సాయీశా   "సా"
                                                                     బాలుడై షిర్డీకి వచ్చావంటా
                                                           సాయీ రమ్మని మహాల్సా పిలిచాడంటా
                                                               నీ ఆకలి లక్ష్మీభాయి తీర్చేనంటా
                                        నవ నాణెములు ఆమెకు నువ్విచ్చావంటా సాయీశా ఓ సాయీశా"సా"

Thursday 12 October 2017

క్రమం తప్పకుండా ......

                                                                    మెడ,మోచేతులు,మోకాళ్ళు నలుపుదనం తగ్గాలంటే రోజూ క్రమం తప్పకుండా కలబంద గుజ్జు,నిమ్మరసం,తేనె ఒక్కొక్క అర చెంచా చొప్పున బాగా కలిపి పూత వేసి ఒక పది ని.ల తర్వాత నీటితో కడగాలి.ఈ విధంగా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు నలుపు పూర్తిగా తగ్గిపోతుంది.

Friday 6 October 2017

లక్ష్మమ్మ బుర్రకథ

                                                       లక్ష్మమ్మకు అరవై తొమ్మిది సంవత్సరాలు. భర్తకు ప్రభుత్వోద్యోగం.ఇంటా బయటా వంధిమాగదుల్లా క్రింది ఉద్యోగులు వుండేవారు.వయసులో ఉండగా భర్త ఉద్యోగ రీత్యా పలురకాల ఊళ్ళు తిరిగేవారు.ప్రభుత్వోద్యోగం కనుక కార్యాలయంలోని ఉద్యోగులు ఇంటికి వచ్చి వంటతో సహా అన్ని పనులు చేసి భోజనం పళ్ళెంలో పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు.హాయిగా సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకుని మహారాణిలా ఠీవిగా,దర్పంగా కుర్చీలో కూర్చుని అలలను చూస్తూ కాలక్షేపం చేసేది.భర్త ఉద్యోగ విరమణ అనంతరం వయసురీత్యా తోడబుట్టిన వాళ్ళు,బంధువులు గుర్తొచ్చారు.లక్ష్మమ్మకు నా భర్త,నేను గొప్ప అనే అహంకారంతో ఎవరితోను సరిగా సత్సంభంధాలు లేవు.ఇప్పుడు తన అవసరానికి అందరినీ కలుపుకుందామని చూస్తుంటే ఎవరికీ వారే అందరూ అంటీ ముట్టనట్లే ఉంటున్నారు.చివరికి తమ్ముడు,మేనకోడలు జాలిపడి మా అందరితో కలిసి పుట్టిన ఊరిలోనే ఉండమని చెప్పగా తనకు ప్రత్యేకంగా ఇల్లు కావాలంది.మేనకోడలు తన స్వంత స్థలంలో ఉండటానికి చిన్న ఇల్లు కట్టించి ఇచ్చింది.వంటమనిషిని,ఇంట్లో పై పనులకు ఒక మనిషిని మాట్లాడింది.మధ్యాహ్నం మూడు గంటలైనా వంట మనిషి వచ్చి పళ్ళెంలో భోజనం పెట్టేవరకు లక్ష్మమ్మ దర్జాగా కుర్చీలో కూర్చునే వుంటుంది.భర్తకు పెట్టదు.తను తినదు.పనిమనిషి రాకపోతే హోటలు నుండి తెప్పిస్తుంది లేదంటే మేనకోడలు పెట్టాలి అంతే కానీ ఆమె వండదు.లక్ష్మమ్మ ఊరికి వచ్చిందని ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం తన చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తన జీవితంలో ఎంత దర్జాగా బ్రతికిందో ఒక్క ముక్క వదలకుండా ఏకరువు పెట్టి ఎదుటి వారి బుర్ర తినేస్తుంది. బుర్రకథ చెప్పినట్లు అందంగా మధ్య మధ్యలో పిట్ట కథల్లా జోకులు వేస్తూ అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని విరామం లేకుండా తన కథ వినిపిస్తుంటుంది.