బంధాలకు విలువ ఇచ్ఛేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటున్నారు. ఎక్కవమంది డబ్బు కాంక్షతో బ్రతుకుతున్నారు.ఆ కోవకు చెందినవాడే శ్రీకర.వయసు అరవై ఏళ్ళు.కష్టపడి సంపాదించుకుంటే ఎవరికీ సమస్య ఉండదు. అందరికీ సంతోషం. చిన్నప్పటి నుండి చదువుకోకుండా పెద్దవాళ్ళ కష్టం అర్థం చేసుకోకుండా సైకిలు కొంటె పాఠశాలకు వెళ్తానని, మోటారు సైకీలు కొంటేనే కళాశాలకు వెళ్తానని, కారు కొంటేనే బ్రతుకు అని మొండిగా ప్రవర్తించేవాడు. పెళ్లి చేస్తేనన్నా సరిగ్గా ఉంటాడని అనుకుంటే వఛ్చిన అమ్మాయి బాధ్యత తెలియనిది.పునుగులు, బజ్జీలు రోడ్లమీద కొనుక్కుని తినేది. రోజూ ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని అమ్మానాన్న కారు కొనిస్తే ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్పి ఎక్కడో ఒకచోట తిని అర్ధరాత్రికి తిరిగి వఛ్చి ఇద్దరు బిడ్డలను కానీ వాళ్ళను కూడా బాధ్యత తెలియకుండా చదువు సరిగా అబ్బకుండా పెంచారు. బంధాలకు విలువలు తెలియదు.భార్య ముంగి లాగా చూస్తూ కూర్చుంటుంది.దొందు దొందే. పక్కవాళ్ళ ఆస్థి మేద్దామనే ఇద్దరి ఆలోచన.భర్త నోరు వేసుకుని గట్టిగట్టిగ అరిచి ఏదో సాధించానని భ్రమలో ఉంటాడు. సంపాదించుకోవడం చేతకాక మేనమామ ఆస్థి కొట్టేశాడు. అది చాలదని అక్కకు పసుపుకుంకుమల క్రింద ఇఛ్చిన ఆస్థిలో కొట్టేసి పొలాల కొలతల్లో మోసం చేసి నాకు పోరంబోకు కలిసిందని అబద్దం ఆడడమేకాక మీ ఆస్థి నాకు అక్కరలేదనిఅది నాదే అని పోట్లాడడం మొదలెట్టాడు. నగరం నడిమధ్యలో పోరంబోకు లేదన్నది జగము ఎరిగిన సత్యం.తాత్కాలికముగా బాగుపడినా అక్రమాస్థులు ఎన్నాళ్ళో నిలవవు ఆన్నది అందరికీ తెలిసినదే. ఆందరికీ పంచాయితీ చెప్పేవాడు తనవరకు వచ్ఛేసరికి బంధాలకన్నా డబ్బు కాంక్ష ఎక్కువై కళ్ళు మూసుకుపోయాయి.మేనమామ అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చోబెట్టాడు.అక్క, బావ పని చేయకపోయినా దర్జాగా ఉండడానికి ఎంతో చేశారు. బంధాల విలువలు తెలుసు కనుక కుటుంగా గౌరవం రోడ్డుకీడ్చడం ఎందుకు అని మేనమామ, అక్క వదిలేయడంతో బ్రతుకుతున్నాననే విషయాన్నీ విస్మరించి నా నోటి ధాటికి తట్టుకోలేక ఏమీ అనలేదని విర్రవీగుతున్నాడు.ఇంట్లో ఇంట్లోనే మోసం చేసి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకేనా? అనుకుంటే అన్నం కూడా తినలేడు. బంధాల కన్నా డబ్బు కాంక్ష ఎక్కువై పోయింది. ఎవరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు మోసగాడిగా ముద్ర వేసుకుని గొప్పగా బ్రతికి కుళ్ళికుళ్ళి చచ్ఛేకన్నా నిజాయితీగా సామాన్య జీవితం గడిపినా ప్రశాంతంగా చనిపోతారు.ఇదంతా సోది నాకు డబ్బే ముఖ్యం అంటాడు వెధవ.వెధవ అంటే వెయ్యేళ్ళు ధనవంతుడువై వర్ధిల్లు అని తోడబుట్టినది కదా చెడుచేసిన మంచే కోరుకుంటుంది.
తెలుగు వారి బ్లాగ్
Tuesday, 5 May 2026
Monday, 4 May 2026
వేసవిలో చల్లచల్లగా బార్లీ
బార్లీ వలన అనేక ఉపయోగాలున్నా కూడా దీనిని వాడడానికి అందరూ ఇష్టపడరు. బార్లీ గింజలు ఉడికించి వడకట్టి ఆ నీటిని త్రాగడం వలన శరీర వేడి తగ్గి చలువ చేస్తుంది అని ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అమ్మ చెప్పింది..మూత్రపిండాలు,మూత్రనాళ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.బార్లీ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం రానివ్వదు. గర్భిణీ స్త్రీలకు కాళ్ళు వాపులు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిల్ని నియంత్రిస్తుంది.బరువు తగ్గాలనుకకునేవారు సైతం బార్లీ ఏదో ఒక రూపంలో వాడితే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గుతారు.చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. బార్లీ నీళ్లతో ముఖం కడిగితే మొటిమలు,మచ్చలు పోతాయి. బార్లీ గింజలు ఉడికించి నీళ్లు త్రాగి ఆ గింజలతో ఉప్మా, కిచిడీచేసుకోవచ్చు.ఉడికిన గింజలు మిక్సీలో వేసి కొద్దిగా బియ్యప్పిండి,ఉల్లి, పచ్చిమిర్చి,అల్లం, కరివేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి అన్నీ కలిపి వడలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. అమ్మ బార్లీ వడలు వేస్తుంది.పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.ఇంకెందుకు ఆలస్యం బార్లీని ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యం స్వంతం చేసుకుందాము.
Sunday, 3 May 2026
కంటి సమస్యలకు జేజి చిట్కా
ఈ రోజుల్లో కంటి సమస్యలు పిల్లల నుండి పెద్దల వరకు సర్వ సాధారణము అయిపోయింది.దీన్ని అధిగమించడానికి జేజి ఒక చిట్కా చెప్పింది. అది ఏమిటంటే చెట్టునుండి మునగాకు కోసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి.కొద్దిగా ఎండిన తర్వాత వేయించి పొడి చేసుకోవాలి. ఒక 90 గ్రా. పొడికి 10 గ్రా. వేయించిన కరక్కాయ పొడి కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఒక 1/4 చెంచా పొడి,ఒక కప్పు పాలల్లో తాటి బెల్లం కలిపి త్రాగాలి. క్రమంగా కంటి సమస్యలు తొలగిపోతాయి.దీనితోపాటు పొన్నగంటి ఆకుకూర తినండి. కంటి చూపు మెరుగు పడుతుంది.
Saturday, 2 May 2026
నవ్వుతూ బ్రతకాలి
ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని బిగ్గరగా నవ్వితే పిల్లల్ని కోప్పడేవాళ్ళు పెద్దవాళ్ళు.ఇప్పుడు నవ్వు నవ్వించు అని చెప్పడం అలవాటు చేసుకున్నారు.ఈమధ్య నవ్వడమే మర్చిపోతున్నాము.నవ్వడం వలన మనస్సు తేలికగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.నవ్వడం వలన మనలో సానుకూలత పెరుగుతుంది. నవ్వుకి భాషతో సంబంధం లేదు.ఒక చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించవచ్చు.నవ్వుతూ బ్రతకాలిరా అని సినీ రచయిత అన్నట్లు బ్రతికినన్నాళ్ళు నవ్వుతూ హాయిగా, ఆనందంగా బ్రతకాలి. ఎన్ని సమస్యలున్నా ముఖంపై నవ్వు చెదరనీయకూడదు.జీవితం అంటే పరుగు కాదు.జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడం.నవ్వు నలుగురిని నవ్వించు.ఈ రోజుల్లో ఎంత ఆస్తి ఉన్నదనో, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నదనో కాదు లెక్క ఎంత ఆనందంగా ఉన్నామనేదే లెక్క.చనిపోయేటప్పుడు కూడా నవ్వుతూ చనిపోయేవాళ్ళు అదృష్టవంతులు.అలాగే సానుకూలంగా ధృక్పదంతో ఉంటే తప్పకుండా సాధ్యపడుతుంది.ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక్కరోజే కాదు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
బియ్యం లేకుండా దోశ
ఉలవలు - 1 కప్పు
ఏదైనా ఒక చిరు ధాన్యం - 1 కప్పు
మినపగుళ్ళు - 1/2 కప్పు
మెంతులు - 1చిన్న చెంచా
వీటన్నింటిని శుభ్రంగా కడిగి విడివిడిగా 8 గం. నానబెట్టి మెత్తగా పిండి రుబ్బాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.5,6 గం.నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటాయి.మనకు ఏ రకంగా నచ్చితే ఆలా వేసుకోవచ్చు.ఈ పిండిలో మనకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవచ్చు.కొద్దిగా సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారట్ తురుము దోశపై వేసుకుంటే బాగుంటుంది.టమాటో, చట్నీ లేదా వేరుశెనగ చట్నీ, అల్లం పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దోశ చాలా బాగుంటుంది.
నిద్రలేమి,ఒత్తిడికి అమ్మ చిట్కా
ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అన్నది సర్వసాధారణమై పోయింది. రోజూ 6 నుండి 8 గంటలు నిద్ర పట్టినట్లయితే ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీనితోపాటు కొద్దిపాటి వ్యాయామం, అదే పనిగా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతోపాటు మతిమరుపు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈమధ్య జరిపిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.అందుకోసం అమ్మ ఒక చిట్కా చెప్పింది అదేంటంటే సోంపు -50 గ్రా., మిరియాలు - 5 గ్రా., జాజికాయ - 2 1/2 గ్రా., యాలకులు - 10 గ్రా., బాదాంపప్పు 40 గ్రా., గసగసాలు - 30 గ్రా., పటికబెల్లం 20 గ్రా., బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ఉ, సా. భోజనం తర్వాత 1 చెంచా చొప్పున నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 20 రోజులు చేస్తే మంచి నిద్ర పట్టి ఒత్తిడి దరిచేరదు.మంచి అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యంతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది.
Thursday, 23 April 2026
పుస్తకం
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం గురించి వ్రాయాలని అనిపించింది.పుస్తకం ఒక స్నేహితురాలు లేకపోతే స్నేహితుడు.కొంతమంది స్నేహితులతో అయినా మాట్లాడకుండా ఉండగలరేమో కానీ పుస్తకం చదవకుండా ఉండలేరు.నేను కూడా అంతే.బహుశా ఆ అలవాటు మా తాతగారి నుండి వచ్చింది. ఆయన ఒక పుస్తకం చదవడం మొదలు పెడితే అది అయిపోయేవరకు చుట్టుప్రక్కల ఏమీ జరుగుతుందో పట్టించుకోనంతగా పుస్తక పఠనంలో లీనమైపోయేవారు. ఇ - పుస్తకాలు రావడంతో ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గినా కూడా పుస్తక ప్రియులు ఉండబట్టే పుస్తక మహోత్సవాలు కళకళలాడుతున్నాయి.రోజు ఒకే పుస్తకం చదివినా ఒక్కోరోజు ఒక్కొక్క రకంగా అర్థం స్పురిస్తుంది. రోజూ పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.మన ఆలోచనల్లో మార్పుతోపాటు జ్ఞానం వస్తుంది. ఈరోజు నుండి పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.రోజులో కొద్దిసేపైనా చదవడానికి ప్రయత్నించండి.