Sunday 26 September 2021

స్నేహం అనే ముసుగు

                                             ఒకరోజు మిహిత భర్తతో కలిసి సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళింది.దారిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తే చీకటి పడిపోతుంది కనుక నువ్వు వాళ్ళ ఇంటి వైపు చూడకుండా వచ్చెయ్యమని ముందే హెచ్చరించడంతో తల దించుకుని వచ్చేస్తుండగా స్నేహితురాలి భర్త చరవాణిలో మాట్లాడుతూ వీళ్ళను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.చిన్ననాటి స్నేహితురాలు కావడంతో కాదనలేక మిహిత,భర్తతోసహా తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.వెళ్ళిన కాసేపటికి అమ్మా కూతుళ్ళు ఇద్దరూ చేతితో సైగలు చేసుకుని అమ్మ వంటగదిలోకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకుని వచ్చి నీకోసం ఒకటి చెట్టు నుండి రాలింది.రసం తీసుకుని త్రాగమని బలవంతంగా అరచేతిలో పెట్టి వద్దని చెప్పినా వినకుండా చెయ్యి మొత్తం నిమ్మకాయతో రుద్దింది.అంతకు ముందు రోజు గుంటూరు జిల్లా 'కాకాని' వెళ్లి రాహుకాల పూజ చేయించుకుని వచ్చింది.సంకల్పం ఆరోగ్యం బాగుండాలని చెప్పుకుంటే పూజారి అందరూ డబ్బు కావాలని కోరుకుంటారు.నువ్వేంటి?ఆరోగ్యం కావాలంటున్నావు?అని అడుగగా రెండు సంవత్సరముల నుండి ఆమె,ఆమె కుటుంబం మానసిక సమస్యతో బాధ పడుతున్నామని చెప్పిందట.ఆదివారం సాయంత్రం రాహుకాలంలో ఒక పరిహారం చెయ్యమని చెప్పాడట.ఆ విషయం మిహితకు చెప్పకుండా నిన్ను బాబాగారే నా దగ్గరకు పంపి ఉంటారు అంది.అప్పటికీ మిహితకు అనుమానం రాలేదు.అమ్మ నిమ్మకాయ చేతిలో బలవంతాన పెట్టి రుద్దింది.కూతురు రవికల ముక్క పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి చేతిలో పెట్టింది.అసలే మిహితకు రాహుకాలం అంటే పట్టింపు.నిమ్మకాయ మేజాబల్ల పై పెట్టి వస్తుంటే అమ్మా కూతుళ్ళు మొహం మాడ్చుకున్నారని బయట పడేయవచ్చులే అని తెచ్చి ఎవరూ తొక్కని స్థలంలో పడేసింది మిహిత.ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే చెయ్యి జిగురుగా దురదగా అనిపించింది.అప్పుడు మిహితకు అనుమానం వచ్చింది.పూజారి దోష పరిహారం చెప్పి ఎవరికైనా ఇస్తే మీ దోషాలు పోతాయని చెప్పి ఉంటాడని మిహిత వెంటనే సిద్ధాంతికి కబురు చేసి విషయం చెప్పగా ఒక నిమ్మకాయ తెచ్చి బలవంతంగా పెట్టడమనేది అనుమానాస్పదంగా ఉంది.మీకు ఏమైనా తేడాగా ఉంటే రాహుకాలంలో రాహుకేతువుల పూజ చేసి,అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి అని చెప్పారు.స్నేహం అనే ముసుగులో తన బాధలు పోవడం కోసం చిన్ననాటి స్నేహితురాలు అలా చేసేసరికి మిహితకు చాలా బాధ అనిపించింది.పైగా బాబాను అడ్డుపెట్టుకోవడం తెలివితక్కువతో  కూడిన మూర్ఖత్వం అని మిహిత భావించి ఆవిధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని స్నేహితురాలిని తిరిగి  అడగాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేసింది.స్నేహంలో కూడా ఇంత స్వార్ధం  దాగి ఉండదాన్ని మిహిత మొదటిసారి  చవిచూసింది. 

సూచన:ఏదైనా దోష పరిహారం చేసుకోవాలంటే అవి చెయ్యడానికి,తీసుకోవడానికి వేరే వాళ్ళు గుడిలో అందుబాటులో ఉంటారు.వాళ్ళను సంప్రదిస్తే ఏర్పాటు చేస్తారు.దయచేసి తెలిసో తెలియకో ఎవరో చెప్పారని స్వార్ధంతో ఇటువంటి పనులు చేసి స్నేహం అనే ముసుగులో స్నేహితులను,బంధువులను ఎవరూ ఎవరినీ ఇబ్బందుల్లో పడేయకండి. అంతకన్నా దోషం మరొకటి ఉండదు.పాత ఇబ్బంది తొలగే బదులు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడమే  కాక  స్నేహం, బంధుత్వాలు చెడిపోతాయి.ఉన్న విలువ,గౌరవం పోగొట్టుకుంటారు.స్నేహితులైనా,బంధువులైనా ఎవరైనా ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త.