Saturday 31 December 2016

స్వార్ధ ధోరణి

                                                                   ఒకప్పుడు చాలా కుటుంబాలలో అన్నదమ్ముల పిల్లలు,అక్కచెల్లెళ్ళ పిల్లలు అందరూ కలిసి కట్టుగా ఉండేవారు.ఈరోజుల్లో ఒకళ్ళు ఇద్దరే సంతానం ఉంటున్నాఎవరికి వాళ్ళు నేను బాగుంటే చాలు తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉన్నా నాకు అనవసరం అన్నట్లు కొందరు మితిమీరిన స్వార్ధంతో ఆలోచిస్తున్నారు.తల్లిదండ్రులు కూడా నన్ను మాత్రమే చూడాలి నాకు,నా పిల్లలకు చాకిరీ చెయ్యాలి వాళ్ళను మాత్రమే చూచి మురిసిపోవాలి అనుకుంటున్నారు.కొంతమంది చిన్నవాళ్ళ బాగోగులు ప్రేమతో బాధ్యతగా చూస్తున్నారు.కానీ ఎక్కువమంది చిన్న వాళ్ళు లేకపోతే ఆస్తి మొత్తం మేమే తినే వాళ్ళం అన్నట్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.చదువు సంస్కారం నేర్పుతుంది అన్నది ఒకప్పటి మాట ఇప్పుడు  చదువుకుని ఎవరి సంపాదన వారికి  ఉన్నా అదే స్వార్ధ ధోరణి. 

హారతులీయండి

                                               జయంతమ్మ హారతి పాట
                                     హారతులీయండీ సాయికి హారతులీయండీ      "హా"
                                          పాటలు పాడుచు భజనలు చేస్తూ
                                          గజ్జలు కట్టుకుని నాట్యము చేస్తూ             "హా"
                                          పరిమళమ్ముల లిల్లీ మాలతో
                                               గుబాళించే గులాబీలతో                      "హా"
                                           పంచదార పాయసమ్ముతో
                                               పసందైన పాలకోవాతో                         "హా"
                                                పల్లకిలోన ఊరేగిస్తూ
                                           పండుగ లాగా అందరూ కలిసి                   "హా"

తచ్చట్లాడుతూ.....ఏకు మేకై

                                                                                  సుహాసిని ఇంట్లో పనితోపాటు వంట చేయడానికి తెలిసిన ఆమెను పనికి పెట్టుకుంది.మొదట్లో అమాయకంగా ఉంటూ మీరే గురువు,దైవం అన్నట్లు ఉండేది.ఏదైనా తినడానికి పెట్టినా మొహమాటపడేది.రానురాను ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.ఆమె పని చేయడానికి వచ్చినట్లు కాకుండా బంధువుగా వచ్చినట్లు ప్రవర్తించ సాగింది.ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కానట్లుగా నటిస్తూ నేను చెయ్యలా? నన్ను రమ్మంటారా?అని అడగడం మొదలు పెట్టింది.భోజన సమయం వరకు వంట చెయ్యకుండా కాలక్షేపం చెయ్యడం సుహాసిని భర్త,పిల్లలు వచ్చేవరకు కూరగాయలు కోస్తున్నట్లు నటిస్తూ అమ్మా!మీరు కూర తాలింపు వేసెయ్యండి అనటం వండి పెడితే లొట్టలు వేస్తూ భారీగా తినడం పనిగా పెట్టుకుని ఒక నెలలోనే ఒళ్ళు చేసింది.ఇవన్నీ ఒక ఎత్తయితే ఇంట్లో ఎవరేమి మాట్లాడుకుంటున్నా పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడక్కడే తచ్చట్లాడుతూ గోడ పక్కన ఉండి వింటుంది.ఈ విషయం మొదట ఎవరూ గమనించలేదు.ఒకరోజు సుహాసిని,భర్త మాట్లాడుకుంటూ ఉండగా అడుగుల శబ్దంతో పాటు అక్కడే తచ్చట్లాడుతున్నట్లు అనిపించి బయటకు వచ్చేసరికి వేగంగా వెళ్ళిపోయింది.తెలిసిన ఆమె అని పనికి పెట్టుకుంటే పని చెయ్యకపోగా ఎదురు ఏకు మేకై కూర్చుంది. 

Friday 30 December 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                                                               నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,వారి కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ నూతన సంవత్సరంలో మీ,మా,మనందరి ఆశలు,ఆకాంక్షలు నెరవేరి,అన్నింటా విజయం సాధించాలని,సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబసభ్యులతో సరదాగా,సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 2017 ను స్వాగతిస్తూ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు.
                  

ప్రణతి ప్రణతి సాయి

                                                                      సాయి రాం
                                                            జయంతమ్మ మదిలో భావాలు

                                             తదేక దృష్టితో నిను గాంచినంత నాలో కలిగెను ఏదో వింత
                                    అపారమైన నీ కరుణ చూపుల కాంతి నాలోని అజ్ఞానపు చీకటిని బాపేను
                                                           నీ చిరునవ్వు మోములో ఎన్నెన్నో రూపాలు
                                                                   ఏమని వర్ణించను ఆదిత్య వర్ణాలు
                                                                    ఫకీరువు కాదు పరమాత్మవు నీవే
                                                            ప్రణతి ప్రణతి సాయి నీ పాద పద్మములకు "ప్ర "

రావాలని ...షిరిడీ రావాలని

                                                             సాయి రాం  -సాయి రాం
                                                            జయంతమ్మ మదిలో కోరిక
                                                       రావాలని ఉంది షిరిడీ రావాలని ఉంది
                                                    నిను చూచి నాలో బాధలన్నీ నీతో చెప్పాలని    
                                                          సాయి నీతో చెప్పాలని ఉంది      " రా "
                                                    పూజలు చేయలేనే ఏ ముడుపులు చెల్లించలేనే
                                                        శ్రద్ధ భక్తితో సేవలు చేసి నీ దరి చేరాలోయీ
                                                             సాయి నీతో ఉంటానోయీ     "  రా "
                                                        మనిషికి తృప్తి లేదే మనసులో శాంతి లేదే
                                                    నినుగాంచినంతనే మాకు ఏదో తెలియని ఆనందం
                                                                       సాయి ఎంతో సంతోషం     "రా"
                                                             

Thursday 29 December 2016

అన్న కాబోయి మొగుడు

                                                           మృదుల రాఖీ పండుగ రోజు ఇరుగింటిలో పొరుగింటిలో ఉన్న అబ్బాయిలు అందరికీ రాఖీ కట్టింది.అదే విధంగా ఎదురింటిలో ఉన్నప్రదీప్ కి రాఖీ కడదామని వెళ్తే సిగ్గుపడి పని ఉందని పారిపోయాడు.అయితే అనుకోకుండా మృదుల ఇంట్లో వాళ్ళు,ప్రదీప్ ఇంట్లో వాళ్ళు కలిసి వీళ్ళ ఇద్దరికీ పెళ్ళి కుదిర్చి ముహూర్తాలు పెట్టుకుని పిల్లలను అడిగితే మృదుల పరమ   గయ్యాళి అని ప్రదీప్,ప్రదీప్ ముంగి అని మృదుల తిట్టుకుని చివరకు ఎలాగయితే పెళ్ళికి ఒప్పుకున్నారు.మృదుల పెళ్ళి అయిన తర్వాత కోపం వచ్చినప్పుడల్లా అన్నకాబోయి మొగుడయ్యాడు అని అంటూ ఉంటుంది.

Wednesday 28 December 2016

గొర్రె

                                                                        ఇంతకు ముందు రోజుల్లో ఒక కార్యాలయంలోనో,ఒక సంస్థలోనో పనిచేసేవాళ్ళు ఆ సంస్థ యజమానిని ఎంతో గౌరవించేవారు.సుశీల ఒక పెద్ద ఆసుపత్రిలో ఆయా ఉద్యోగం చేస్తుంది.సుశీల చేసేది ఆయా ఉద్యోగమే అయినా ఆసుపత్రి అధిపతి కన్నా గర్వంగా ఉంటుంది.ఎవరినైనా,ఎంతటి వారినయినా లెక్కలేని విధంగా మాట్లాడుతుంది.తనే ఆసుపత్రిలో మొత్తం చక్రం తిప్పేటట్లు,ఆసుపత్రికి సర్వాధికారిణి అయినట్లు ఊహాలోకంలో విహరిస్తూ మా చైర్మన్ గొర్రె అని అందరితో చెబుతూ ఉంటుంది.ఆ చైర్మన్ చాలా తెలివి కలవాడు. అయినా ప్రతి చిన్నదీ తనే చూడలేడు కనుక కొన్నింటికి కొంత మందిపై ఆధారపడక తప్పదు కనుక కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాట వినటం పరిపాటి.గొర్రె కటిక వాడిని నమ్మినట్లు ఒకరో,ఇద్దరో మాట వింటాడు.ఆ ఇద్దరూ సమస్యలు ఆయన వరకు వెళ్ళనీయరు.అప్పుడప్పుడు వచ్చి మసి పూసి మారేడు కాయను చేసిన మాదిరిగా వాళ్ళు చేసే పైపై మెరుగులు నిజమని నమ్మి గొర్రె వలె వెళ్ళిపోతూ ఉంటాడు.నిజంగా గొర్రె అని సుశీల అంటుంది. 

Sunday 25 December 2016

జోలాలి జోలాలీ

                                                             ఓం శ్రీసాయిరాం
                                                          జయంతమ్మ లాలి పాట
                                           జోలాలీ జోలాలీ లాలీ శ్రీసాయిరామ లాలీ శ్రీసాయికృష్ణా
                                                 లాలీ బంగారు తండ్రీ లాలీ మముగన్న తండ్రీ   "జో"
                                                     పదునాల్గు భువనాలు పాలించు తండ్రీ              
                                                     మాకొరకు భువిపైకి దిగివచ్చినావు   2
                                                      శేషసాయి వలె శయనించినావని     2
                                                      నారదుడు తుంబరుడు లాలి పాడారు
                                                      ముక్కోటి దేవతలు మురిసిపోయారు 2   'జొ"                                                                                           సాయి బంగారు గుడి నీకు కట్టించలేను                                                                                                         ముత్యాల పందిళ్ళు వేయించలేను    2
                                                       నా హృదయ కమలాన నిను నిలుపుకోనా   2
                                                          క్షణమైన నీ స్మరణ నే మరువగలనా     2     "జో"


అడుగో చూడరో

                                                                    ఓం శ్రీ సాయిరాం
                                             
                                                   జయంతమ్మ భక్తితో ఆలపించిన సాయి కీర్తన

                                                        అడుగో చూడరో  అందరూ మొక్కరో(ఇష్టమైతే)
                                                         షిరిడీలో వెలసిన శ్రీ సాయినాధుని  "అ"
                                                  పదహారేళ్ళకు షిరిడీ చేరీ వేపచెట్టు కడ ధ్యానం చేసి   2
                                                         యోగిగ మారిన  శ్రీసాయినాధుడు  2        "అ"
                                                  మన పాపాలను భిక్షగ అడిగి జోలిలో వేసీ ధునిలో కాల్చీ 2
                                                          మోక్షమునిచ్చిన శ్రీసాయినాధుడు  2       "అ"
                                                          భజనలు చేసిన చిందులు వేయుచు
                                                           నీటితోనే జ్యోతులు వెలిగించుచు    2
                                                       చిన్ని బల్లపై ఊయలలూగే శ్రీసాయినాధుడు   2   "అ"

Thursday 22 December 2016

మా మొరాలించి

                                                    జయంతమ్మ మనసులో మొర
                                                          ఓం శ్రీసాయినాధాయనమః
                                                      మా మొరాలించి మమ్ము పాలించ
                                           నడిచి వచ్చావా సాయి మమ్ము దీవించ వచ్చావా సాయి "మా"
                                                 గణపయ్య రూపమున కదిలి వచ్చావని
                                                 ఉండ్రాళ్ళు నీ కొరకు చేసి ఉంచాను సాయి
                                                 విశ్వరూపము దాల్చి విష్ణువై వచ్చితివని
                                                  పూలన్నీ నీకొరకు కోసి ఉంచాను సాయి  "మా"
                                                  తాండవము చేయుచు శివుని వలె వచ్చావని
                                                    అభిషేకము చేయ అందరూ వచ్చారు
                                                   రామచంద్రునిలాగా వచ్చావనా తండ్రీ
                                                   పండ్లన్నీ కోసి పట్టుకొచ్చాను సాయి "మా"
                                                   చిన్ని కృష్ణుని వలె నడిచి వచ్చావని
                                                     వెన్న మీగడ తీసి ఉంచాను సాయి
                                                   తిరుమలేశుని వలె మా ఇంటికి వచ్చావు
                                                   లడ్డూ వడలు నీకు వడ్డించినాను      "మా"
                                                   షిరిడి వాసునిగా వచ్చి సిరులన్ని ఇచ్చావు
                                                   ఆత్మ ఒక్కటేగాక మరేమివ్వగలను  "మా"
                                                   

Wednesday 21 December 2016

నన్ను ముట్టకు

                                                      కరుణ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసింది.పిల్లలు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.కరుణకు జ్వరం రావటంతో భర్త ఆసుపత్రికి తీసుకొచ్చాడు.జ్వరతీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఆసుపత్రిలో తగ్గేవరకు ఉండాలని వైద్యులు చెప్పడంతో తప్పనిసరిగా ఉన్నారు.పాపం కరుణ జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతుందో ఏమి చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో భర్తను అతిగా విసిగించడం మొదలు పెట్టింది.ఆయన కూడా వయసు రీత్యా ఆమెను చూడటం కష్టంగా ఉండి ఆయాలు,నర్సుల సహాయం తీసుకుందామని అనుకుంటే కరుణ ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదు.ఏయ్ నన్ను ముట్టకు మళ్ళీ నేను స్నానం చెయ్యవలసి వస్తుంది అంటూ పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది.ఈలోగా దుస్తుల్లోనే తెలియకుండా అన్నీ అయిపోవడం మొదలు పెట్టేసరికి ఆమెకు కూడా భయం వేసింది.భర్త కూడా కరుణకు నచ్చచెప్పడంతో మెల్లగా మామూలు మనిషి అయింది.మందుల ప్రభావంతో క్రమంగా జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టింది.ఈలోగా కరుణ భర్తకు తల ప్రాణం తోకకు వచ్చింది.ఏది ఎలాగయినా త్వరగా కరుణ మళ్ళీ మామూలు మనిషి అవడంతో ఆయనకు సంతోషం.దూరాన ఉన్న పిల్లలకు సంతోషం.ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగితే అయినవాళ్ళందరికీ సంతోషం.             

Tuesday 20 December 2016

షిరిడీ నివాసా సాయి

                                                        జయంతమ్మ మదిలో సాయి
                                                              ఓం శ్రీసాయిరాం
                                       షిరిడీ నివాసా సాయి మా చింతలు తీర్చే సాయి  "షి"
                                      మా మదిలో వెలసిన సాయి మా ఇంట తిరుగును సాయి "షి"
                                      అంతట నీవే సాయి పరమాత్మవు నీవే సాయి "షి"
                                      రాముడు నీవే సాయి శ్రీకృష్ణుడు నీవే సాయి "షి"
                                      తల్లివి నీవే సాయి మా తండ్రివి నీవే సాయి "షి"
                                      వేదము నీవే సాయి గీతయు నీవే సాయి "షి"
                                      ఆత్మవు నీవే సాయి పురుషోత్తమ నీవే సాయి "షి"
                                      భక్తివి నీవే సాయి ముక్తివి నీవే సాయి "షి"
                                       పిలిచిన పలికే సాయి పరుగున వచ్చే సాయి "షి"
                                       నీ పదములపై సాయి మా మది నిలుపుము సాయి "షి"
                                   
                                              

Monday 19 December 2016

అధిక బరువు ఉంటే ఇవి తినాలి

                                                                                   అధిక బరువుతో బాధ పడేవాళ్ళు మూడు వంతులు ఆకుకూరలు,ఒక వంతు కూరగాయలు తింటే ఎక్కువ పోషక పదార్ధాలు ఉండి తక్కువ కేలరీలు ఉంటాయి.ఉదయం కాఫీ,టీ బదులు కూరగాయల రసం తీసుకుంటే మంచిది లేదా చిరు ధాన్యాలు దోరగా వేయించి మర పట్టించి అ పిండితో జావ తాగాలి.ఉదయం 8 గం.లకు 2,3 ఇడ్లీ తినాలి లేదా నూనె లేకుండా దోసె తినాలి.11 గంటలకు ఒక గుప్పెడు మొలకలు తినాలి.మధ్యాహ్న భోజనంలో పట్టు తక్కువ వేసిన బియ్యంతో వండిన అన్నం కొద్దిగా,ఒక పుల్కా,ఒక పెద్ద కప్పు కూర తక్కువ ఉప్పు కారంతో తినాలి.ఆకుకూరలో అయితే అసలు ఉప్పు వేయకపోయినా ఫర్వాలేదు,అంతగా తినలేకపోతే తక్కువ వేసుకోవాలి.4 గం.లకు సగం దానిమ్మ లేదా యాపిల్ తినాలి.చిన్న గ్లాసు రాగిజావ తాగొచ్చు.రాత్రిపూట భోజనం చేయకుండా ఒక కీరా,ఒక కప్పు అన్ని రకముల పండ్ల ముక్కలు,ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి.రోజు మొత్తంలో అప్పుడప్పుడు గోరు వెచ్చటి నీళ్ళు తాగాలి.మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగాలి.ఈ విధంగా పాటిస్తే క్రమేపీ బరువు తగ్గుతారు. 

Sunday 18 December 2016

అజీర్తి మాయం

                                                               ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కలు,చిటికెడు ఉప్పు వేసి 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేవరకు మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత దానిలో ఒక స్పూను తేనె వేసుకుని తాగాలి.ఇలా చేయడం వలన పొట్టలో ఉన్న సమస్యలతో పాటు అజీర్తి మాయం అవుతుంది.

Saturday 17 December 2016

సాయిబాబా మేలుకొలుపు

                                           జయంతమ్మ గారి సాయి మేలుకొలుపు                            
                                                            ఓం శ్రీ సాయిరాం

                                     " ప"     ఓం సాయి శ్రీ సాయి మేలుకోవయ్యా
                                                 సచ్చిదానంద సద్గురు సాయి మేలుకో     "ఓం"
                                      "చ"      త్రిమూర్తి రూపమున వెలిశావు తండ్రీ 
                                                  దత్త అవతారునిగా దర్శనము నిచ్చావు    "ఓం"
                                                  పూలన్నీ నీకొరకు వేచియున్నవి స్వామీ
                                                   ఆ భాగ్యమును(పూజ) నేను నోచనైతిని స్వామి     "ఓం"
                                                   ఏ చోట చూచినా నీరూపమే ప్రభూ
                                                    ఏ నోట విన్నా నీ నామమే స్వామీ            "ఓం"
                                                    మా ఆత్మలో నీవు క్రీడించుచున్నావు
                                                    అజ్ఞానమున మేము తెలియకున్నామయా   "ఓం"
                                                     నీబాటలో మమ్ము నడిపించు సాయి
                                                    నీసేవలో మాకు మార్గమ్మునీయి               "ఓం"
                                                    సంసారసంద్రమును ఈదలేకున్నాము
                                                    నీచేయి అందించి దరిచేర్చుమో సాయి        "ఓం"
                                                    యజ్ఞాలు తెలియవు యాగాలు తెలియవు
                                                    నీనామమే మాకు ఆనందమయము           "ఓం"
                                                    ధవళ వస్త్రములలో దర్శనమునొసగు
                                                    కాషాయధారివై కరుణించు స్వామీ              "ఓం"

శ్రీ సాయి శరణం

                                        జయంతమ్మ గారు ముందుగా శ్రీ సాయి గణేశ  ప్రార్ధన తో మొదలు పెట్టారు.
                                                       గణేశ శరణం శరణు గణేశ      "గ"
                                                      శరణం శరణం శ్రీ సాయి శరణం
                                                      శరణం శరణం శ్రీ హరి శరణం
                                                      శరణం శరణం శివశివ శరణం
                                                      శరణం శరణం చతుర్ముఖ శరణం
                                                      శరణం శరణం శ్రీరామ శరణం
                                                      శరణం శరణం శ్రీకృష్ణ శరణం
                                                      శరణం శరణం శ్రీనివాస శరణం
                                                      శరణం శరణం సాయిరామ శరణం
                                                      శరణం శరణం సాయికృష్ణ శరణం   "గ" 

Thursday 15 December 2016

సాయి సంకీర్తనా కుసుమాలు

                                                          జయంతమ్మ వయసు  అరవై సంవత్సరాల పైబడి ఉంటుంది.ఆవిడకు సాయి అంటే ఎంతో భక్తి.భర్త కానీ,పిల్లలు కానీ అటు  పుల్ల తీసి ఇటు పెట్టరు.వీళ్ళకు తోడు అత్తగారికి  సేవ చేయాలి.ఆవిడకు అన్ని పనులు ఎదురు చెయ్యాల్సిందే.ఏకాస్త అటూ ఇటూ అయినా తల్లీ కొడుకులు రాకాసుల్లా మీద పడినంత పని చేస్తారు.అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రప్పుడు మెలుకువగా ఉండి లైటు వేసినా నిద్ర వృధా అంటారని టేబుల్ లైటు దగ్గర కూర్చుని తన మనసులో బాబా అంటే ఎంత భక్తి మనసులో ఉన్నదో కాగితంపై అక్షర రూపంలో పెట్టి  సాయి సంకీర్తనా కుసుమాలు అని నామకరణం చేసింది.భర్త పదవీ విరమణ చేసిన తర్వాత భర్త ఇంట్లో ఉన్నంతసేపు ఆయన ఎదురుగా పని ఉన్నా లేకపోయినా నిలబడే  ఉండాలి.అందువల్ల ఆయన ఇంట్లో లేని సమయంలో వంటగదిలో పని చేసుకుంటూ తన శ్రావ్యమైన కంఠంతో గొంతెత్తి పాడుకునేది.ఆమె కూతురిలా భావించే నేను అమ్మా!మీరు చాలా చక్కగా పాడుతున్నారు అనగానే అసలు విషయం చెప్పేసింది.సాయి అంటే ఉన్న భక్తితో వ్రాసుకున్నాను అవి సాయికే అంకితము అంది. కావాలంటే నీకు కూడా ఇస్తాను అని చెప్పింది.మీరు ఎంతో కష్టపడి వ్రాసినవి కదా!అనగానే ఊరికే కాదు నీబ్లాగులో పెడితే సాయి అంటే ఇష్టమైన వాళ్ళు సంకీర్తన చేసుకుంటారు అని చెప్పింది.పెద్దావిడ అడిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయింది.జయంతమ్మ గారు సాయి అంటే ఎంతో భక్తితో వ్రాసుకున్నవి ఎంత ప్రయత్నించినా  బ్లాగులో పెట్టలేకపోయానే అని బాధ ఉన్నా ఆపనికి నేటికి మోక్షం కలిగింది.ఆమె పేరు మాత్రం మార్చి ఆమె భక్తితో వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమాలు యదాతధంగా మీ ముందుకు తెస్తున్నాను. 

Wednesday 14 December 2016

కోపంతో ముందడుగు

                                                                   లతాశ్రీ తెలివైనదే కానీ చదువంటే మాత్రం మహా బద్ధకం.చిన్నప్పుడు పుస్తకాలు తీసి చదవమంటే ఆమడ దూరం పరుగెత్తేది.ఎలాగోలా వచ్చే పరీక్షకు,పోయే పరీక్షకు నాలుగుసార్లు రాసి పదవ తరగతి అత్తెసరు మార్కులతో గట్టెక్కింది.తర్వాత పెళ్ళి,పిల్లలు.అత్తింటి వారికి ఆస్తులున్నావ్యాపారానికి డబ్బు దండిగా ఇవ్వలేదని కోపం వచ్చి ఫాషన్ డిజైనింగ్ చేసి తన బంగారం అమ్మేసి మరీ కొంతమంది పనివాళ్ళను పెట్టుకుని మగ్గం వర్కు,డిజైనర్ జాకెట్లు కుట్టించడం మొదలు పెట్టింది.భాష రాకపోయినా నానా తంటాలు పడి వేరే రాష్ట్రం నుండి పనివాళ్ళను పిలిపించి జాకెట్లు అందంగా కుట్టించడంతో తెలిసిన వాళ్ళు,బంధువులు,స్నేహితులు వరుసగా కుట్టించుకోవడం మొదలు పెట్టారు.ఆదాయం పెరగటంతో భర్త కూడా తన ఉద్యోగం వదిలేసి భార్యకు చేదోడువాడుగా ఉండటంతో ఉప్పాడ,మంగళగిరి,ధర్మవరం,కంచి,కలకత్తా,పోచంపల్లి,సూరత్ నుండి ఎక్కడ ఏవి ప్రత్యేకంగా దొరికుతాయో అక్కడికి వెళ్ళి అవి తెచ్చి చీరల దుకాణం పెట్టేసింది.ఆనాడు కోపంతో ముందడుగు వేయడంతో అప్పుడు ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే ఇప్పుడు పొగడ్తల జల్లు కురిపించి లతాశ్రీ స్వశక్తితో పైకి వచ్చిందని,రెండు దుకాణాలు పెట్టిందని ఆకాశానికి ఎత్తుతున్నారు. 

Tuesday 13 December 2016

జగత్కిలాడీలు

                                                                ఆశ్రిత వస్త్ర దుకాణాలకు,విందు భోజనాలకు వెళ్ళమని చెబితే 5 ని.ల్లో తయారైపోతుంది.ఇంట్లో వంట చెయ్యాలంటే మహా బద్దకం.డెబ్బై సంవత్సరాల వయసున్న అత్తగారు వంట చేస్తే తిని కూర్చుంటుంది.ఆశ్రితకు ఎదుటివాళ్ళ ఇళ్ళకు ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ముఖాన నవ్వు పులుముకుని వెళ్ళిపోతుంది.ఆమెకు అవసరం లేనప్పుడు ఎదుటివాళ్ళు ఎవరో తనకు పరిచయం లేనట్లు ప్రవర్తిస్తుంది.ఇదేమిటి?నిన్న గాక మొన్ననే కదా!మనింటికి భోజనానికి వచ్చింది అని విస్తుపోవటం ఎదుటి వారి వంతు అవుతుంది.భోజనం మాట దేముడెరుగు ఊరికే కూడా ఇంటికి ఎవరినీ రమ్మని పిలవదు.ఒకవేళ ఎవరైనా వచ్చినా మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చున్న చోట నుండి కదలకుండా ముళ్ళ మీద కూర్చున్న విధంగా ముఖం మాడ్చుకుని ఎప్పుడు వెళ్లిపోతార్రా బాబూ?అన్నట్లు వాళ్ళ ముఖంలోకి చూస్తూ కూర్చుంటుంది.ఆశ్రిత భర్త దగ్గరి బంధువులు విదేశాలలో ఉంటూ వాళ్ళ ఇంట్లో ఉండి స్వంత సంస్థను జాగ్రత్తగా కాపాడమంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అన్నం పెట్టిన చేతినే నరికేసిన చందంగా వాటినే కబ్జా చేసే స్థాయికి ఎదిగారు.విదేశాలనుండి సంవత్సరానికి ఒకసారి వచ్చే బంధువుల సొమ్ము పీకలదాకా తింటూనే సంస్థ బాగోగులు చూడటానికి నాలుగు రోజులు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తుంటేనే భోజనం పెట్టాలంటే బాధపడి నేనేమైనా వంటగత్తెనా?అందరికీ వండి వార్చటానికి అని రుసరుసలాడుతుంది.అసలు కారణం సంస్థలో ఉన్న లోటుపాట్లు తెలిసిపోతాయని సంస్థను డొల్ల చేసి డబ్బు తినేస్తున్నారు కనుక అవన్నీ బయటపడతాయని వాళ్ళు రావటం ఇష్టం లేదు.ఆశ్రిత,భర్త తామే స్వంత యజమానులమని గొప్పలు పోతున్నారు.మావల్లే మీసంస్థ బాగుంది అని వాళ్ళకు చెప్తే నిజమే కాబోలు అని సంతోష పడుతుంటారు.పాపం అసలు విషయం విదేశీ బంధువులకు తెలియదు కదా!గొర్రె కటికవాడిని నమ్మినట్లు వీళ్ళను నమ్ముతున్నారు.భార్యాభర్తలు ఇద్దరూ కిలాడీల్లో కూడా జగత్కిలాడీలు. 

Thursday 8 December 2016

పని దొంగ

                                                             అన్వేషిత ఈమధ్య వంటకు,ఇంట్లో పనికి ఒక పనికత్తెను పెట్టుకుంది.ఆమె పని చేసేకన్నా సొల్లు కబుర్లు చెప్పడంలో దిట్ట.అమ్మా!మీకు నేను చేసేవి నచ్చుతాయో నచ్చవోనని భయం వేస్తుంది అంటూ నాటకీయంగా మాట్లాడుతుంది.అందరూ భోజనానికి వచ్చే వేళ వరకు కాలక్షేపం చేసి అప్పుడు హడావిడి చేసి సగం పని అన్వేషిత చేసేలా చేస్తుంది.ఆమెను తెలిసిన వాళ్ళు పంపడంతో ఆమె చేసే పనులు నచ్చకపోయినా వద్దు అని చెప్పలేక పని చేయించుకోలేక అన్వేషిత సతమతమైపోతుంది.మనం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా పనిచేస్తుంది.ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి.దొంగ భయం లేదు.ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేస్తుంది  అని చెప్పడంతో పనిలో చేర్చుకుంది.అది అంతా సరే అనుకున్నా అసలు చేయాల్సిన పనులు చేయకుండా పని తప్పించుకుని యజమానులే పని చేసుకునేలా చేసే పెద్ద పని దొంగ.దొంగ బుద్ది ఉంటే ముందే జాగ్రత్త పడతాము.అంతే కానీ ఈపని దొంగను ఏ విధంగా దారిలోకి తీసుకురావాలో,వదిలించుకోవాలో అర్ధం కాక డబ్బు ఖర్చు అవడమే కాక పని సగం పైగా చేసుకోవాల్సి రావడంతో డబ్బూ పోయే శని పట్టే అని అన్వేషిత తల పట్టుకుంటుంది. 

Wednesday 7 December 2016

వారానికి ఒక్కటైనా....

                                                              కివి పండు న్యూజిలాండ్ లో దొరికే పండు అయినా ఇప్పుడు మన దేశంలో అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి.కివి అధిక పోషకాలు కలిగిన అద్భుతమైన పండు.నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్ సి,అరటి పండులో దొరికే పొటాషియం,పీచుపదార్ధం అన్నీ కలిపి ఒక్క కివి పండులో దొరుకుతాయి.అందరూ  అన్నిరకాల పండ్లు రోజూ తినటానికి ఇష్టపడక పోయినా ఒక కివి పండు తినడం వలన ఆస్తమా,శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.గుండె పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది.రక్త ప్రసరణ సజావుగా ఉంటుంది.కొలెస్టరాల్,మధుమేహం అదుపులో ఉంటాయి.రోజు తినడం వీలుపడక పోతే కనీసం వారానికి ఒక్కటైనా తినడం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.పండు కొనే ముందు చేతిలోకి తీసుకుని వేలితో నొక్కి చూచి కొంచెం మెత్తగా ఉన్న పండు ఎంచుకోవడం మేలు.రుచిగా ఉంటుంది.

Monday 5 December 2016

స్నేహితురాలి సలహా

                                                                      వాణి,రాణి చిన్ననాటి స్నేహితురాళ్ళు.వాణి భర్త ఉద్యోగరీత్యా వేరే దేశంలో ఉంటుంది.సంవత్సరానికి ఒకసారి వచ్చి అందరినీ పలకరించి వెళ్తూ ఉంటుంది.ఒకసారి రాణిని కూడా చూచి పోదామని వచ్చింది.రాణి కంప్యూటర్ సైన్సు చదువుకుని ఉద్యోగం చేసుకుంటుంది.ఒంట్లో నలతగా ఉండి నాలుగు రోజులు సెలవు పెట్టడంతో ఇంట్లోనే ఉంది.రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వలన నడుము,మెడ నొప్పి,చేతులు నొప్పి,కళ్ళు పొడిబారడం ఒకటేమిటి రకరకాల బాధలు చెప్పింది.రాణికి చిన్నప్పటి నుండి మందులు వేసుకోవాలంటే భయం.నీళ్ళు ఎక్కువ తాగితే మాటిమాటికి బాత్రూముకి  వెళ్ళాలని భయం.ఈ ఇబ్బందులు అన్నీ పోవడానికి ఏదయినా సలహా చెప్పు తల్లీ!అని వాణిని అడిగింది.ముందుగా నువ్వు అలవాట్లు మార్చుకుని నేను చెప్పే 15:15:15 సూత్రాన్నిపాటించు.అదెలాగంటే ఒక 15 సెకన్లు కంప్యూటర్ తెర వైపు చూడకు.కళ్ళు పొడిబారడం తగ్గుతుంది.ప్రతి 15 ని.లకు ఒకసారి లేచి మంచినీళ్ళు కొంచెం తాగి కంప్యూటర్ కు దూరంగా 15 అడుగులు వేస్తూ ఉండు.మద్య మద్యలో బొప్పాయి,జామ,ఒక నిమ్మజాతి పండు,కివి ఏదో ఒకటి పండ్ల ముక్కలు,దానిమ్మ గింజలు తింటూ ఉండు.ఆకుకూరలు,కూరగాయలతో సలాడ్లు,పిస్తా,బాదం,వాల్ నట్లు తింటూ ఉంటే పోషక పదార్ధాలు సరిపడా ఉండడంతో పాటు రక్తహీనత బారిన పడకుండా ఉంటావు.ఇంతకీ పెరుగు తినడం మాత్రం మర్చిపోవద్దు అని వాణి రాణికి సలహా ఇచ్చింది.నేను చెప్పిన విధంగా చేస్తే నీ ఇబ్బందులు చాలావరకు తగ్గటంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది అని చెప్పింది.

Sunday 4 December 2016

జిడ్డు ఆంటీ

                                                                 సౌదామిని ఎదుటివారి నుండి వివరాలు సేకరించాలనుకున్నా,తనకు ఏదైనా కష్టం వచ్చి చెప్పుకోవాలనుకున్నాతన డబ్బు ఖర్చు అవకుండా చరవాణి నుండి ఒకటి,రెండు రింగులు రానిచ్చి ఆపేస్తుంది.అవతలి వాళ్ళు వెంటనే తిరిగి ఆమెకు చెయ్యకపోతే పదేపదే మాట్లాడేవరకు చేస్తూనే ఉంటుంది.ఆ విషయం కుటుంబ సభ్యులందరికీ తెలిసినా తెలియనట్లుగా ఉంటారు.మా ఇంట్లో భర్త,ఇద్దరు కొడుకులు కలిసి ముగ్గురు సంపాదిస్తున్నారు.దీనితోపాటు మానాన్న వడ్డీ వ్యాపారం చేసి ఆ డబ్బంతా నాకే ఇస్తుంటాడు.మీ అందరి కన్నా నేనే గొప్ప అని పోకిళ్ళు పోతుంటుంది.అందుకని ఒళ్ళుమండి ఆమె స్నేహితురాలు కావాలని ఒక రింగు అవగానే తిరిగి చెయ్యకుండా వెంటనే మాట్లాడడం మొదలు పెట్టింది.తన డబ్బు అనేసరికి రెండు మాటలు మాట్లాడి తర్వాత మాట్లాడతాను అంటుంది.అదే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు వేరే రాష్ట్రం నుండి చేసినా కూడా ఒక్కొక్కసారి నాలుగు గంటలు మాట్లాడేది.ఫోను ఛార్జింగ్ పెట్టి మరీ మాట్లాడాల్సి వచ్చేది.ఇంకో చెడ్డ అలవాటు ఏమిటంటే తనకు పని లేనప్పుడు ఎదుటి వాళ్ళు పని ఉందని చెప్పినా కూడా వదిలేది కాదు.ఒకసారి పని ఉండి స్నేహితురాలు ఫోను చేసినప్పుడు కొడుకు మాట్లాడి ఒక నిమిషం అని చెప్పి అమ్మను పిలిచి జిడ్డు అంటీ చేసింది అని చెప్పడం స్నేహితురాలు చెవులారా విన్నది.గత పది సంవత్సరాలుగా లేని బాధ వాళ్ళకు ఒక నెల బిల్లు కట్టేసరికి తెలిసి వచ్చిందన్న మాట.మన డబ్బు అయితే ఒకటి ఎదుటివాళ్ళదయితే ఒకటి.స్నేహంలో కూడా స్వార్ధపు స్నేహం.ఇప్పటికయినా అసలు రంగు బయట పడింది.

Saturday 3 December 2016

ఆకాశం నుండి కొరమీనులు

                                                                        సాయి కాంత్ స్వంత పొలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు.చుట్టూరా పొలాలు,ఖాళీ స్థలాలే ఉన్నాయి.ఒక రోజు ఉన్నట్లుండి జోరున వర్షం పడింది.ఆ వర్షంతోపాటు ఆకాశం నుండి కొరమీనులు పొలాల్లో,ఖాళీ స్థలాల్లో ఉన్న నీళ్ళల్లో వచ్చి పడ్డాయి.విచిత్రం ఏమిటంటే వీళ్ళ పొలం ప్రక్కన తారు రోడ్డు ఉంది.మళ్ళీ ఆ తర్వాత పొలాలు ఉన్నాయి.చేపలు తారు రోడ్డు మీద పడలేదు.పొలాల్లో నీళ్ళల్లో మాత్రమే పడినాయి.ఇల్లు కట్టే పనివాళ్ళు నీళ్ళల్లో ఏవో ఎగురుతున్నాయి అని చూడటానికి వెళ్ళేసరికి చేపలు ఎగురుతున్నాయి.వాటిని పట్టుకుని ఒక గంపలో వేశారు.ఒక్కొక్కటి ముప్పావు కిలో నుండి ఒక కిలో వరకూ ఉన్నాయి.పనివాళ్ళు అందరూ తలా ఒక చేప సంతోషంగా ఇళ్ళకు పట్టుకుని వెళ్లారు.

Friday 2 December 2016

చర్మానికి చక్కని చాయ

                                                      ఒక స్పూను పెసర పిండి,ఒక స్పూను శనగ పిండి కలిపి దానిలో ఒక స్పూను పెరుగు,కొద్దిగా నిమ్మరసం,ఒక పావు స్పూను తేనె కలిపి శుభ్రంగా కడిగి,తడిగా ఉన్నముఖానికి రాయాలి.ఒక పావు గంట తర్వాత కొద్దిగా నీళ్ళు ఒక గిన్నెలో పెట్టుకుని మర్దన చేస్తున్నట్లుగా చేసి కడిగేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే చర్మానికి చక్కని చాయ వచ్చి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. 

Thursday 1 December 2016

హృదయాకారంలో ఆకులు

                                                  హృదయాకారంలో ఉండే ఆకులతో లేత ఊదా,తెలుపు కాడలతో,వంకాయ రంగు కాయలతో ఉండే తీగ బచ్చలి,కుదురు బచ్చలి జిగురుగా ఉంటుందని అందరూ ఇష్టపడరు.కానీ ఇందులో ఉండే ఈ జిగురు కొలెస్టరాల్ తగ్గించడంతో పాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.రక్తహీనతను,మతిమరుపును తగ్గిస్తుంది.గుండె జబ్బులు,కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.ఇవి కుండీలలో కూడా చక్కగా పెరుగుతాయి.వీటి  పండ్లు చూడచక్కగా ఉండి నొక్కగానే ఊదారంగు నీరు బయటకు వస్తుంది.పిల్లలు వీటిని కోసి రసం పిండి సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు.కనీసం వారానికి ఒకసారయినా పెద్దలు,పిల్లలు కూడా బచ్చలి కూర తినడం మంచిది.కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Wednesday 30 November 2016

ఆల్ ఇండియా రేడియో రాణి

                                                                                   సుదీప్తి పిన్నిని అందరూ ఆల్ ఇండియా రేడియో రాణి అని అంటారు.ఎందుకంటే ఆకాశ వాణి వార్తలు చదువుతున్నవారు రాణి అని రేడియోలో చెప్పినట్లు సుదీప్తి పిన్నికి ఒక వార్త తెలిసిందంటే ఆ వార్త ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ  తెలిసినట్లే.బంధువులలో ఎవరికి ఏమి జరిగినా మంచి అయినా,చెడు అయినా ఆ వార్త దేశ విదేశాలలో ఎక్కడున్నా బంధువులు,స్నేహితులు,ఇరుగు పొరుగున ఉన్న అందరికీ తెలియాలంటే ఆమెకు చరవాణి ద్వారా ఒక్క మాట తెలియచేస్తే చాలు.ఆమె పనిగట్టుకుని ఎంత దూరంలో ఉన్న వాళ్లకయినా వార్త చేరవేసే వరకు నిద్రపోదు.వార్త ఎవరికయినా చరవాణి ద్వారా చేరకపోతే అవసరమైతే స్వంత ఖర్చులు పెట్టుకుని మరీ వెళ్ళి చెప్పి వస్తుంది.అందుకే ముందుగా ఎటువంటి కబురు అయినా ఆల్ ఇండియా రేడియో రాణికి చెప్పి అందరికీ తెలియ చెప్పమని  చెప్తుంటారు. 

Tuesday 29 November 2016

పువ్వుల కోసం ఎగిరి....

                                                            కృష్ణ కుమారి తెల్లవారుఝామున పూజ కోసం పువ్వులు కోయడానికి ఇంటి ముందుకు వెళ్ళింది.ఒడి నిండా రకరకాల పువ్వులు కోసుకుని చిటారు కొమ్మన ఒక పువ్వుల గుత్తి అందంగా ఉందని దాన్ని అందుకోవడం కోసం ఒక్క ఎగురు ఎగిరింది.కొద్దిలో కొమ్మ అందలేదని ఈసారి ఎలాగయినా సరే కొమ్మను అందుకోవాలని  ఇంకాస్త పైకి ఎగిరింది.కొమ్మ అందకపోగా అదే వేగంతో నేల మీద పడిపోయింది.చేతి మీద శరీరం బరువు మొత్తం పడేసరికి చేతి ఎముక మూడు ముక్కలు అయింది.వామ్మో !నా చెయ్యి విరిగి పోయిందిరో దేముడో!అంటూ ఒక పొలికేక పెట్టేసరికి ఇంట్లో నిద్రపోయే వాళ్ళందరూ బయటకు పరుగెత్తుకుని వచ్చారు.వెంటనే అందరూ కలిసి కింద నుండి లేపి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.చేతి ఎముక మూడు చోట్ల విరిగింది ఎలా పడింది?అని వైద్యుడు అడిగితే కృష్ణ కుమారి భర్త పువ్వుల కోసం ఎగిరి క్రింద పడింది అని చెప్పాడు.పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా పువ్వుల కోసం ఎగిరి చెయ్యి విరగ్గొట్టుకుంది అని చెప్పడం మొదలెట్టాడు.పడి చెయ్యి విరిగిన బాధ కన్నా కృష్ణ కుమారికి  ఈ దెప్పిపొడుపుల గోల ఎక్కువైపోయింది.  

Monday 28 November 2016

చిరునవ్వు

                                                                           ఒక చిన్న చిరునవ్వు మన జీవితకాలాన్ని పెంచుతుంది అంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.ఎవరైనా చిరునవ్వుతో పలకరిస్తే మనసుకు హాయిగా ఉంటుంది.మనం కూడా అదే చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించడం అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతతతోపాటు గుండె జబ్బులను కూడా అరికట్టవచ్చు.వీలయినప్పుడల్లా నవ్వు తెప్పించే అంశాలను వినడం,చదవడం,చూడటం అలవాటు చేసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గి ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. 

Saturday 26 November 2016

సంధ్య వేళ

                                                                కల్పన సంధ్య వేళ తులసి మొక్క దగ్గర దీపం పెట్టి ఒక రెండు గంటల తర్వాత పూజా సామగ్రి తీసుకురావటానికి వెళ్ళింది.దీపం ఇంకా దేదీప్యమానంగా  వెలుగుతూనే ఉంది.మిగతావన్నీ తీసుకుని వెనుతిరుగుతుండగా ఎండి పోయిన వేపాకు వంపు తిరిగినట్లుగా ఉంటే వేపాకు అనుకుని నివేదన పెట్టిన కమలా ఫలంతోపాటుగా చేతితో పట్టుకుని లాగింది.అది చిన్నగా కదిలి దీపారాధన పళ్ళెం ముందుకు వచ్చింది.ఏంటా?అని పరీక్షగా చూచే సరికి ఎండు వేపాకు రంగులో ఉన్న బల్లి ఉంది.చీకట్లో ఎలా పడితే అలా వెళ్ళిపోయి  ఏది పడితే అది పట్టుకుంటే అదే బల్లి కనుక సరిపోయింది.ఏ తేలు పిల్లో అయితే ఒత్తిడి తగలగానే చేతిని కుట్టేసేది.అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉండేది.ఇంకా నయం లేచిన వేళ మంచిదయింది అనుకుంది కల్పన.

Tuesday 22 November 2016

చలికాలంలో చర్మం

                                                              చలికాలంలో మా సబ్బు వాడితే మీ చర్మం ఎంతో నునుపుగా ఉంటుంది అంటూ బుల్లితెరపై వచ్చే ప్రకటనలు చూచి మోసపోయి ఆ సబ్బులు కొనుక్కుని వాడుకున్నాఇంకా చర్మం కాంతి విహీనంగా,తెల్లగా పొట్టు రాలిపోతున్నట్లు ఉంటుంటే ఏమి చేయాలో తెలియక బాధపడిపోతూ ఉంటాము.దానికి బదులుగా మన ఇంట్లోనే సహజంగా వాడుకునే  పండ్లు,కూరగాయలు,పెరుగు,పాలు,కొబ్బరినూనె,తేనెతో ఒకదానితో ఒకటి కలిపి రకరకాల పూతలతో చర్మాన్ని నునుపుగా ఉండేలా చేయవచ్చు.అదెలా అంటే పాలపై ఉన్న పల్చటి మీగడ తీసి రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగితే చర్మం నునుపుగా ఉంటుంది.పెరుగు,తేనె కలిపి ఒకసారి,బాగా మగ్గిన అరటిపండు మెత్తగా చేసి ఒక స్పూనుతో తీసుకుని ఒక పావు స్పూను తేనె కలిపి మరొకసారి,కమలా రసం తేనె కలిపి ఇంకొకసారి పూతలా వేసి ఒక పది ని.లు ఉంచి కడిగేయాలి.అలా ఒక పది ని.లు రోజుకొకసారి చేస్తే చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుంది.అలాగే కారట్ తురిమి లేదా మిక్సీలో వేసి కొద్దిగా గుజ్జులో తేనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.రోజూ చలికాలంలో రాత్రి పడుకునే ముందు పెదవులకు మీగడ,నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకుంటే మృదువుగా ఉంటాయి.తేనె అప్పుడప్పుడు రాస్తే పెదవుల నలుపుదనం తగ్గుతుంది.  

Monday 21 November 2016

ఎల్లి బద్ద

                                                                      చెన్నమ్మ అత్తారింటికి కాపురానికి వెళ్ళినప్పుడు నాలుగు నిట్టాళ్ళ పాక ఉండేది.దాన్నేనాలుగు గదులుగా చేసి అత్త,బావ,చెన్నమ్మ,మరిది తలా ఒక గదిలో ఉండేవారు.కొన్నాళ్ళకు పాకకు ఉండే వెన్ను బద్ద  విరిగిపోయింది.చెన్నమ్మ మేనమామ వచ్చి వెన్ను బద్ద విరిగిన ఇంట్లో ఉంటే ఎవరో ఒకళ్ళ ప్రాణానికి ముప్పు వెంటనే తీసేసి మరొకటి వేయించుకోవాలి అని చెప్పాడు.ఆ విషయం చెన్నమ్మ అత్తతో చెప్పగానే గయ్,గయ్ మంటూ కోడలిపై ఒంటి కాలి మీద లేచి నువ్వు తెచ్చిన డబ్బు కట్టలు కట్టలు ఇక్కడ మూలుగుతూ ఉన్నదని ఎల్లి బద్ద కొత్తది వేయించమంటావా?ఎవరు చనిపోయినా సరే కొత్తది వేయించేది లేదు అంది.మంచిది కాదని తెలిసినా బిక్కుబిక్కు మంటూ అందరితోపాటు ఉంది చెన్నమ్మ.ఇంతలో రెండు నెలలకే చెన్నమ్మ మామ,బావ కూడా చనిపోయారు.మరిదికి కూడా జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నాడు.అప్పుడు కానీ చెన్నమ్మ అత్తలో మార్పూ రాలేదు.చెన్నమ్మను పిలిచి నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది.కొత్త ఎల్లి బద్ద కొనుక్కొచ్చి రేపు వేద్దాము అని చెప్పింది.ఆ మాట వినగానే చెన్నమ్మకు ఎక్కడి లేని ఉత్సాహము వచ్చి చిన్నపిల్లలా గెంతులు వేసినంత పని చేసింది.

Friday 18 November 2016

బొట్టు

                                              నుదుట గుండ్రని బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం.ఆడవాళ్ళు,మగవాళ్ళు పూర్వం నుదుట బొట్టు లేకుండా ఉండేవారు కాదు.మగవాళ్ళ మాట దేముడెరుగు నేడు చాలామంది ఆడవాళ్ళు కూడా నుదుట బొట్టు పెట్టుకోవడం లేదు.పెద్దవాళ్ళు చెప్పినా చాదస్తం అనుకునే రోజులు.కలికాలం కదా!ఎవరినీ ఏమీ అనకూడని రోజులు.ఎవరి ఇష్టం వారిదన్నట్లు చూసీ చూడకుండా వదిలేయడమే అని అనుకున్నా చూస్తూ వదిలేయలేము బొట్టు నుదుటికి అందం తీసుకురావడమే కాకుండా బొట్టు పెట్టుకుంటే ఎదుటి వారి దృష్టి ముందుగా కొట్టొచ్చినట్లు కనిపించే బొట్టుపై పడుతుంది.నరుడి కంటికి నల్లరాయి నుగ్గయి (బద్దలై)పోతుందని పెద్దల మాట.మన బంధువులైనా,స్నేహితులైనా,ఇరుగు పొరుగు,ఇంకా వేరే ఎవరైనా సరే ఒక్కొక్కరి చూపు ఒక్కొక్కలాగా ఉంటుంది.తెలిసీ తెలియకుండానే అసూయ ఉండవచ్చు.అందువల్ల నుదుట బొట్టు ఉంటే కొంతవరకు నర దృష్టి కొట్టుకు పోతుంది.అంతేకాక రెండు కనుబొమల మధ్య కుంకుమ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని లలాట భాగంలో  అంటే నుదుట బొట్టు పెట్టుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుందని పెద్దల ఉవాచ.

Thursday 17 November 2016

కళ్ళకు కట్టినట్లుగా

                                                   తొంభై సంవత్సరాల వయసు ఉన్నవకుళ పెద్దమ్మ చాలా తెలివి కలది.ఎంత దూరమైనా బస్సులో ఒక్కటే ప్రయాణం చేసి ఎవరు భోజనానికి పిలిచినా తరతమ భేదం లేకుండా వెళ్ళి వచ్చేది.అటువంటిది మోకాలు నొప్పిగా ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంటే కళ్ళు కనిపించకుండా పోయాయి.చాలా దగ్గరగా కొంచెం చూపు కనిపిస్తుంటుంది.అయినా విసుగు,విరామం లేకుండా బుల్లితెరపై వచ్చే ధారావాహికలన్నీ క్రమం తప్పకుండా చూస్తూ ఉంటుంది.చూడటమే కాకుండా ఎవరు ఇంటికి వచ్చినా,ఫోను చేసినా అమ్మాయ్!బుల్లి తెరపై ఈరోజు వచ్చిన ఫలానా ధారావాహిక చూశావా?అంటూ మొదలుపెట్టి తనకు నచ్చిన అన్నిధారావాహికలు అనర్గళంగా ఫలానా దాంట్లో అలా చేసింది ఇలా చేసింది అంటూ తిడుతూ,పొగుడుతూ చెపుతూ ఉంటుంది.కళ్ళు బాగా కనిపించే వాళ్ళన్నా అంత చక్కగా కళ్ళకు కట్టినట్లు వినసొంపుగా చెప్పలేరు.పైగా చెప్పే విధానం కూడా అక్షరం పొల్లు పోకుండా తనదైన శైలిలో చక్కగా చెపుతూ ఉంటుంది.ఇప్పుడు చూసినది కాసేపటికి మర్చిపోయే రోజులు.ఆమె జ్ఞాపక శక్తికి అందరూ అబ్బురపడతారు.

Wednesday 16 November 2016

చిటికెడు బెల్లం

                                                                             ముఖ్యమైన పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిటికెడు బెల్లం నోట్లో వేసుకుని వెళితే అనుకున్నపని పూర్తవుతుందని మన పూర్వీకుల నమ్మకం.అలాగే భోజనం తర్వాత కూడా చిన్న ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఉండవని చెబుతుంటారు.ఈ చలికాలంలో పంచదార బదులు బెల్లం వేసుకుంటే జలుబు,దగ్గు రాకుండా ఉంటాయని,వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పెద్దవాళ్ళు సూచిస్తారు.ఏ రూపంలో తిన్నా పల్లీలు తినగానే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే త్వరగా జీర్ణమవుతాయని తప్పకుండా తినాలని పిల్లలకు పెట్టి పెద్దవాళ్ళు కూడా తింటారు.పాయసంలో కూడా బెల్లం వేస్తే ఆ రుచే వేరు.అటుకులు,బెల్లం కలిపి పెడితే శ్రీ కృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి కూడా ఎంతో ఇష్టం.ఇక మనమెంత?పంచదార కన్నా బెల్లం తినడం ఎంతో శ్రేష్టం.బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి సహజమైన ఔషధం.బెల్లంతో చేసిన ఏ పదార్ధమైనా ఎంతో రుచిగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

Tuesday 15 November 2016

ఆరోగ్య పరిరక్షణ

                                                  ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తిని కడుపు నిండింది అని అనుకోకుండా కాస్త శ్రద్ధ పెట్టి పోషక విలువలతో కూడిన సమతులాహారం సమయానికి తీసుకుంటూ ఉండాలి.శరీరానికి తగినంత శ్రమ ఉండేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.పని తక్కువగా ఉందని అవసరానికి మించి నిద్రపోకుండా తగినంత నిద్ర పోతుండాలి.రోజూ కాసేపు వీలయితే ధ్యానం లేదా యోగా వంటివి చేస్తూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే 
ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడి సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.

Monday 14 November 2016

అయోమయం

                                             నాగార్జున కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది స్నేహితులతో కలిసి ఒక నాట్యప్రదర్శనలో పాల్గోవటానికి పేరు నమోదు చేసుకున్నాడు.నాట్యాన్ని అభ్యసించే క్రమంలో కొంతమంది ఒకవైపు ఒక రకం మరో కొంతమంది వేరొకవైపు మరోరకం నాట్యం చేయాలి.ఈ క్రమంలో చేసేటప్పుడు అందరూ కలిసి చేసినామద్యలో ఎవరి గ్రూపు వాళ్ళు విడిపోవాలి.నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా అయోమయం జగన్నాధం లాగా వేరే గ్రూపులో కలిసిపోయి మళ్ళీ నాలుక కరుచుకుని ఒక్కడే రంగస్థలంపై అటు నుండి ఇటు పరుగెత్తుకుని వస్తుంటాడు.అరె!అందరికి కనిపించేలా అడ్డంగా పరుగెత్తుకు రావద్దురా బాబూ!అంటే వినడు.వాడలా పరుగెత్తుకు రావటం అందరూ గొల్లుమంటు నవ్వడం అలవాటైపోయింది.చెప్పగా చెప్పగా ఎలాగైతే చివరకు సరిగ్గా చేసి స్నేహితుల పరువు,కళాశాల పరువు కూడా దక్కించి అందరి మన్నలు పొందాడు                            

Friday 11 November 2016

ఏడుపు

                                                                  ఈమధ్య పెంపుడు జంతువులను ఇంటికి తెచ్చి పెంచితే అవి చేసే చేష్టలు,చూపే ప్రేమతో చాలావరకు ఒత్తిడి దూరమైపోతుందని తద్వారా ప్రశాంతత దొరుకుతుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.అందుకే సావిత్రమ్మ కూడా ముద్దుగా,బొద్దుగా ఉన్న ఒక బుల్లి తెల్ల కుక్కపిల్లను తెచ్చుకుని పెంచుకుంటుంది.దాని చేష్టలతో మురిసిపోతూ ఉండగానే సావిత్రమ్మకు మనవడు పుట్టాడు.అందరూ కుక్క పిల్లను ఎవరో ఒకరికి పెంపకానికి ఇవ్వమన్నా నేను కావాలని తెచ్చుకున్నాను కనుక ఎవరికీ ఇవ్వను అని సావిత్రమ్మ తెగేసి చెప్పింది.సావిత్రమ్మ శాఖాహారి.మనవడు పుట్టక ముందు కుక్కపిల్ల కోడికూర తప్ప తినేది కాదు.రోజూ దానికోసం కూర కొనుక్కొచ్చి మరీ పెట్టేవాళ్ళు.దానికి తెచ్చిన కూర ఎవరైనా పట్టుకున్నా అరిచేది.ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళల్లో ఒక పిల్లాడు  కోడికూర వేస్తేనే అన్నం తింటానని మారాం చేయడం మొదలు పెట్టాడు.కుక్కపిల్లకు వేడిగా కూర తెచ్చారు కదా!అని కొంచెం కూర బాబుకు పెట్టింది.ఇంతలో కుక్కపిల్ల దానికి తెచ్చిన కూర పెట్టడం ఏమిటని ఒకటే ఏడుపు.ఆ పిల్లాడి పళ్ళెంలో ఉన్న కోడికూర తీసి దాని పళ్ళెంలో పెట్టేవరకు ఏడుపు ఆపలేదు.మిగతా వాళ్ళకు విచిత్రంగా అనిపించినా సావిత్రమ్మకు దాని తత్వం తెలుసు కనుక మారు మాట్లాడకుండా మళ్ళీ కూర తెప్పించి ఆ పిల్లాడికి పెట్టింది.

Thursday 10 November 2016

బరువు అదుపులో

                                                                             శరీర బరువు అదుపులో ఉండాలంటే వీలయినంత వరకు పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు తినడంతో పాటు అన్ని రకముల   ఆకుకూరలు,పండ్లు తింటూ ఉండాలి.ఏదో ఒక ఆకుకూర తోపాటు రెండు,మూడు రకముల కూరగాయలు కలిపి లేదా విడివిడిగా కానీ తప్పని సరిగా రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి.బెండ,దొండ,సొర,మునగ,చిక్కుడు,కాకర,బీర,ఉల్లిపాయ,పెద్దమిరప(కాప్సికం),పచ్చి బొప్పాయి కాయ తెల్ల ముల్లంగి,క్యాబేజీ,గుమ్మడి,కాలిఫ్లవర్,బూడిద గుమ్మడి,టొమాటో,వంకాయ మొదలగు వాటిలో పీచు ఎక్కువ ఉండటంతో బరువు పెరగకుండా ఉండటమే కాక అధిక బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.దుంప కూరలు తగ్గించాలి.ఆహారం ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం తీసుకోవడం మంచిది.

Wednesday 9 November 2016

శారీరక వ్యాయామం

                                           శారీరక వ్యాయామం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది.శరీరానికి చెమట పట్టేలా వేగంగా నడవడం,సైకిలు తొక్కడం,తోటపని చేయడం,పరుగెత్తడం వంటి వ్యాయామం ఎవరు చేయగలిగింది వారు రోజూ క్రమం తప్పకుండా చేయగలిగితే అనేక రోగాలను అరికట్టవచ్చు.ముఖ్యంగా మధుమేహం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.ఇవేమీ చేయలేనప్పుడు కనీసం కూర్చున్నచోటే చేతులు కాళ్ళు కదిలిస్తూ శరీరాన్ని వంచుతూ వ్యాయామం చేస్తే మంచిది.రోజు బుల్లితెరలో  ధారావాహికలు చూచేటప్పుడు కదలకుండా కూర్చునే బదులు ప్రకటనలు వచ్చిన సమయంలో లేచి అటూ ఇటూ తిరగడం,జాగింగ్ చేయడం చేస్తే కొంతలో కొంత శారీరక శ్రమ చేసినట్లవుతుంది.ఏ వయసు వారికయినా ఎంతో కొంత శారీరక శ్రమ చేస్తుంటే శరీరం ఎటు అంటే అటు తేలికగా వంగుతుంది.దాంతో ఊబకాయం రాకుండా ఉంటుంది. 

Tuesday 8 November 2016

మధుర స్మృతులు

                                                                         శారద,శ్రావణికి చరవాణి ద్వారా మధుర స్మృతులు అనే వీడియో పంపించింది.ఆ వీడియో చూడగానే శ్రావణికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక్కసారిగా తన మధురమైన బాల్యంలోకి వెళ్ళిపోయింది.కల్మషంలేని స్నేహం,ఆ ఆప్యాయతలు,అందరూ కలిసి కట్టుగా ఆటలు,అల్లరి పనులు,కోతి
కొమ్మచ్చి ఆటలు,తొక్కుడు బిళ్ళ,గోలీలాట,అందరూ బాదం చెట్ల దగ్గర చేరి పెద్ద కంకర రాయితో బాదం కాయలు కొట్టి పప్పులు తినటం,సీమ తుమ్మకాయలు కొయ్యటానికి పెద్ద వాసం తెచ్చి కొంకి కట్టి కష్టపడి కాయలు కోసి అందరూ పంచుకుని  తినడం,తాటి కాయలు కోయించి ముంజెలు తినడం,రేగు కాయలు,ఇంట్లో నుండి ఎవరూ చూడకుండా కారం,ఉప్పు తెచ్చి పుల్లటి ఉసిరి కాయలు తినడం,చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగటం,చెట్లు ఎక్కగలవా?గుట్టలు ఎక్కగలవా?అంటూ పోటితో చెట్లు ఎక్కి చిటారు కొమ్మకు చేరడం,అరమగ్గిన,చిలక్కొట్టిన జామకాయలు ఎవరి దొడ్లో ఉంటే వాళ్ళింట్లో పిల్లలందరూ పొలోమంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కాయలు దులిపెయ్యడం,పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్లు నంగనాచి తుంగ బుర్రల్లా కూర్చోవడం,పుస్తకాలు పట్టుకుని తెగ చదివేస్తున్నట్లు నటించడం వాళ్లటు వెళ్ళగానే ఒకళ్ళను చూచి ఒకళ్ళు ముసిముసి నవ్వుకోవడం అన్నీఒకదాని వెనుక ఒకటి సినిమా రీలులా గిర్రున తిరిగాయి.ఒకటే బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి అంటూ స్నేహితురాలు శారద పంపిన వీడియో చూసి అవి ఎన్నటికీ మరిచిపోలేని మధుర స్మృతులు అని శ్రావణి సంతోషంగా ముఖం పెట్టి చరవాణి ద్వారా సమాచారం పంపింది.

                           

Monday 7 November 2016

వెన్నంటే

                                                           లాలిత్య,లాస్య అక్క చెల్లెళ్ళు.లాలిత్య పెళ్ళయిన వెంటనే భర్తతో విదేశాలకు వెళ్ళింది.తర్వాత కొన్ని రోజులకు లాస్య పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది.లాస్య అప్పుడప్పుడు అక్క ఇంటికి వెళ్తూ ఉంటుంది.లాలిత్య ఒక కుక్కను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంది.లాస్య అక్క ఇంటికి వెళ్ళినప్పుడు అది లాస్య ఎక్కడికి వెళ్తే అక్కడకి వెళ్ళి లాస్య వైపే చూస్తూ ఎటూ కదలటం లేదు.వంటగదిలోకి వెళ్తే లాస్య బయటకు వచ్చేవరకు కాపలా కాస్తున్నట్లు అక్కడే కూర్చుంటుంది.లాస్యకు విసుగు వచ్చి అక్కా!మీ ఇంటికి నేను ఇంకొకసారి రాను.మీ కుక్క నా వెన్నంటే తిరుగుతూ నన్ను అనుమానంగా దొంగను చూచినట్లుగా చూస్తూ కాపలా కాస్తుంది అని చెప్పింది.అదేమీ కాదు నువ్వు రోజూ కనిపించవు కదా అందుకే ఆ విధంగా చేస్తుంది అని అక్క నచ్చచెప్పినా ఆ సమాధానం లాస్యకు అంతగా రుచించ లేదు.కుక్క చూపులో కూడా మార్పు లేదు.

Sunday 6 November 2016

కోటి సోమవారాలు

                                                      కార్తీకమాసం అంటేనే ఎంతో విశిష్టమైనది.అందులో ఈ సోమవారం మరీ ప్రత్యేకమైనది.కార్తీక మాసంలో సోమవారం,సప్తమి తిధి,శ్రవణానక్షత్రం మూడు కలిసి రావటం చాలా అరుదు.ఈరోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా మిగతా అన్ని రోజులకన్నాఎంతో మంచిది.ఈ సోమవారం శివుడికి ఇష్టమైన అభిషేకం చేయించినా,ఉపవాసం ఉన్నా కోటి సోమవారాలు చేసినంత ఫలితం.అందుకే దీన్ని కోటి సోమవారం అంటారు.ఈ కార్తీకమాసంలో వచ్చిన  ఐదు సోమవారాలు చేయలేకపోయినా ఈ ఒక్క సోమవారం చేయగలిగితే  కోటి సోమవారాల పుణ్యం మూట కట్టుకోవచ్చు.పైన చెప్పినట్లు ఏమీ చేయలేకపోయినా కనీసం దర్శనం చేసుకున్నాశుభప్రదం.
                                                   
                                                             
                                      

Saturday 5 November 2016

మూడు పేర్లు పిల్ల

                                                      విజయ లక్ష్మి కుమారి  ఊరిలో ఒక పెద్దాయన ఆయన వయసుకు తగిన పనులు ఏదో ఒకటి చేసుకోగలిగినా సోమరితనంగా ఊరికే రచ్చబండ దగ్గర కూర్చునేవాడు.తను ఖాళీగా కూర్చునేది కాక దారిలో వెళ్ళే వచ్చే వాళ్ళను పలకరించి అబ్బాయ్ కాసేపు వచ్చి కూర్చో అని పిలిచేవాడు.ఒకటి రెండుసార్లు వెళ్ళినా ఈయన ధోరణికి విసుగు వచ్చి వినపడనట్లు వెళ్తుంటే వచ్చేవరకు పెద్దగా అరచి పిలవడం మొదలు పెట్టాడు.ఈయన ధాటికి తట్టుకోలేక అందరూ వేరేదారిలో వెళ్ళటం మొదలు పెట్టారు.ఎవరూ ఈయన సొద వినటం లేదని ఆడుకునే పిల్లలను పిలిచి మీ అమ్మా నాన్నా పోట్లాడుకుంటారా?అంటూ చెత్త ప్రశ్నలు వేసేవాడు.ఒకరోజు విజయలక్ష్మికుమారి ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళను రచ్చబండ మీదుగా ఇంకొక చుట్టాలింటికి తీసుకుని వెళ్తూ పెద్దాయన కంట పడింది.వాళ్ళందరి ముందు మూడు పేర్లు పిల్లా!ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు అంటూ పిలిచాడు. చిన్నపిల్ల అయినా అసలే ఆమెకు రోషం ఎక్కువ.బంధువుల పిల్లలు నిన్నుఅలా పిలుస్తున్నాడు ఏమిటి?అంటూ దీర్ఘం తీశారు.అసలే కోపం వచ్చింది దానికి తోడు వాళ్ళు కూడా మాట్లాడేసరికి ముఖం కందగడ్డలా పెట్టి తాతా!నా పేరులో మూడు పేర్లు కలిసి ఉన్నంత మాత్రాన నువ్వు నన్ను మూడు పేర్లు పిల్ల అని పిలిచావంటే మాత్రం ఊరుకోను అంటూ గట్టిగా కొత్త వాళ్ళందరి ముందు అరిచేసరికి అవాక్కయ్యాడు.తాతా!వింటున్నావా?అంటూ చేతులు పట్టుకుని గట్టిగా మనిషిని ఊపేస్తూ సరే ఎప్పుడూ అనను అనేవరకు వదలలేదు.దాంతో పెద్దాయన కొత్తవాళ్ళు ఉన్నారని కిక్కురుమనకుండా అవతలకు వెళ్ళిపోయాడు.హమ్మయ్య!ఈ దెబ్బతో ఈయన బెడద వదిలింది లేకపోతే అందరినీ ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటూ ఊరిలో పిల్లలు అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Friday 4 November 2016

తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు

                                                         ఒకసారి శృతిలయ తాతయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.ఆ ఇంట్లో ఒకచోట తాడు కట్టి ఆ తాడుకు అరటిపళ్ళు వేలాడతీసి ఉన్నాయి.ఆ అరటిపళ్ళ మీద పొగాకు రంగు,నల్లటి చుక్కలు ఉన్నాయి.శృతిలయ వాటిని చూడగానే  ఛీ!పాడైపోయిన అరటిపళ్ళు అలా తాడుకు  వేలాడేసుకున్నారేమిటి తాతయ్యా?అని  అడిగింది.అరటిపళ్ళు పాడైపోలేదు.పసుపుగా ఉన్నప్పుడు కన్నా నల్లటి చుక్కలు వచ్చినప్పుడు తింటే వాటిలో పోషకాలు రెట్టింపు ఉండి ఆరోగ్యం బాగుంటుందని,అదీకాక అన్నీ సమంగా పండుతాయని అలా వేలాడదీశారు.బాగా పండిన పండు తింటే త్వరగా జీర్ణమవటమే కాక మలబద్దకం లేకుండా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది.నల్లటి మచ్చలు వచ్చిన పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంతో కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.రోజు ఒక అరటిపండు తింటే శరీరం కూడా నునుపుగా తయారై మెరుస్తూ ఉంటుంది.తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు విని శృతిలయ నేను కూడా అలాగే తింటానని తాతయ్యకు మాట ఇచ్చింది. మనందరమూ కూడా పసుపు రంగులో ఉన్నప్పుడు మాత్రమే తిని ఏమాత్రం మచ్చలు వచ్చినా చెత్తలో పడేస్తూ ఉంటాము.ఇప్పటి నుండి మనం కూడా బాగా మగ్గి అక్కడక్కడా మచ్చలు వచ్చిన అరటిపళ్ళు చెత్తలో పడేయకుండా  తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

Wednesday 2 November 2016

మొలకలు వస్తే .....

                                                    ఉల్లి,వెల్లుల్లి పాయలకు మొలకలు వస్తే వాటిలో సారం ఉండదని పైగా వాటిని తింటే కడుపులో నొప్పి వస్తుందని అపోహతో చెత్తలో పడేస్తూ ఉంటాము.లేత పాయలు,ముదిరిన పాయల కన్నా ఇలా మొలకలు వచ్చిన పాయల్లో గింజల మొలకల్లో ఉండే మెటాబొలైట్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇవి అద్భుత యాంటీ ఆక్సిడెంట్లు మాదిరిగా పనిచేసి గుండెకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.మాములుగానే వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కొలెస్టరాల్,బి.పిని అదుపులో ఉంచుతుంది.తాజాగా ఉల్లి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు.
గమనిక:ఉల్లి కాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక దేనిలో వేసినా రుచితో పాటు రకరకాల వంటలు చేసుకోవచ్చు.ఇష్టమైతే అవి నా పాత పోస్టుల్లో చూడవచ్చు.

Tuesday 1 November 2016

అమూల్యం

                                                                                    అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది.అటువంటి మహోత్కృష్టమైన ఈ జీవితంలో కాలం విలువ ఎంతో అమూల్యం.సోమరితనంతోను,అతి నిద్రతోను.అనవసరమైన సంభాషణలతోను,ఉపయోగం లేని పనులతోనూ కాలాన్ని వృధా చేయకూడదు.ప్రతి ఒక్కరూ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేస్తూ జీవిత లక్ష్యాలను చేరుకొనేందుకు పట్టుదలతో కృషి చెయ్యాలి.గడిచిపోయిన సమయం తిరిగి రాదు.కనుక దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అన్నట్లు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటూనే సేవాభావంతోపాటు మంచి ఆలోచనలతో పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలి.పర్యావరణ పరిరక్షణ చేయడం ద్వారా భూమాతను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు సమయం వృధా చెయ్యకుండా అమూల్యమైన కాలాన్నిఉపయోగించుకోవాలి.కాలాన్ని జయించిన వాడు కాలుడ్ని(మృత్యువును)జయించినట్లే అన్నది నానుడి.

ఓ కన్నేసి.....

                                                                    ప్రతి ఒక్కళ్ళు ఏభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంపై ఓ కన్నేసి  ఉంచాలి.ఊబకాయం పెరగకుండా జాగ్రత్త పడాలి.శరీరంలో జీవక్రియా వేగం తగ్గి కొవ్వు పెరగటంతో రకరకాల సమస్యలతోపాటు రక్తంలో చక్కర నిల్వలు పెరిగటంతో మధుమేహం వచ్చే అవకాశం ఉంది.అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తింటూ నిత్యం వ్యాయామం చేయటంతో చాలా వరకు సమస్యల నుండి గట్టెక్కవచ్చు.దీనితోపాటు ప్రతి సంవత్సరం తీరిక చేసుకుని అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే రాబోయే ఆపద నుండి బయట పడవచ్చు.

Saturday 29 October 2016

ఆనందంగా దీపావళి

అందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.


.











దీపావళి శుభాకాంక్షలు

                                                              నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు శుభప్రదమైన ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీ ఇంటికి శోభను,మీ జీవితాల్లో వెలుగులు నింపాలని,శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు. 

దివ్వె దివ్వె దీపావళి

                                                                               రూపావతి కొడుక్కి లేకలేక కూతురు పుట్టింది.పది నెలలు నిండాయి.ఇంతలో దీపావళి వచ్చింది.మొదటి దీపావళికి వాళ్ళ ఊరిలో చెరకు గడ పిలక కానీ గోంగూర మొక్క కానీ తెచ్చి ఆకులన్నీ తీసేసి చివరలో రెండు ఆకులు ఉంచి తెల్లటి నూతన వస్త్రము ముక్క తెచ్చి రెండు కొసలు కనిపించేలా చుట్టి నువ్వుల నూనెలో ముంచి రెండు కొసలను కలిపి వెలిగించి పసిపిల్లల చేతితో కలిపి పట్టుకుని "దివ్వె దివ్వె దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి"అంటూ మూడు సార్లు అటు ఇటు తిప్పించి వాకిట్లో గుమ్మం ముందు కొట్టి పిల్లను ఎత్తుకుని దాన్ని దాటి వెనక్కి తిరిగి చూడకుండా లోపలకు వెళ్ళి పిల్లకు కాళ్ళు చేతులు కడిగి తీపి నోట్లో పెట్టాలని పట్నం వచ్చినా ఆ సంప్రదాయం పాటించాలని ఒకటే హడావిడి.ఎలాగయితే అనుకున్న విధంగా చేయటానికి ఏర్పాట్లు చేసుకుని రేపటి దీపావళి కోసం ఎదురు చూస్తుంది.

Sunday 23 October 2016

ఒరేయ్ నర్సిగా ....

                                                                  నరేష్,నవ్య ఎదురెదురు ఇళ్ళల్లో ఉంటూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.పెద్దలకు అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలు ఇష్టపడ్డారు కదా అని పెళ్ళి చేశారు.ఇద్దరూ వేరే ఊరిలో కొత్త కాపురం పెట్టారు.మంచీచెడూ నేర్పిస్తుందని నరేష్ అమ్మమ్మను నాలుగు రోజులు తోడుగా ఉండమని పంపారు.అంతా  బాగానే వుంది కానీ నవ్య నరేష్ ను ఒరేయ్ నర్సిగా ఇటు రారా!అని పిలుస్తుంది.అది అమ్మమ్మకు నచ్చలేదు.ఎంతైనా భర్తను పట్టుకుని అలా పిలవటం ఏమి బాగుంటుంది అమ్మాయ్ అని అంది.ఒసేయ్ ముసలిదానా!నా మొగుడు నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను.మధ్యలో నీకు ఎందుకు?ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేసింది నవ్య.ఈ కాలం పిల్లల నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది.ఎంతమాట పడితే అంతమాట అనేస్తున్నారు.నాలుగు రోజులు ఉంటే నా పరువు పోయేటట్లుగా ఉంది.వెంటనే ఇంటికి వెళ్ళిపోవటం మంచిది అనుకుని అమ్మమ్మ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయింది.

Saturday 22 October 2016

నిద్ర లేవగానే ....

                                                                   నిద్ర లేవగానే దంతధావనంతోపాటు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల కాస్తోకూస్తో ఉన్న బద్ధకం వదిలిపోతుంది.కాసేపు ధ్యానం,ఇష్టమైతే పూజ,ప్రకృతిని చూస్తూ లేత సూర్య కిరణాలూ తగిలేలా నడవడం లేదా కూర్చుని ఇష్టమైన పుస్తకం చదవడం,మనసుకు నచ్చిన వారితో మాట్లాడటం వంటివి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.బాధ్యతలు ఉన్నవాళ్ళు ఒక అరగంట ముందు లేచి పై విధంగా చేస్తుంటే ఒత్తిడి లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు.  

Friday 21 October 2016

దోమ ప్రతాపం

                                                     ఒక దోమ కామాక్షిని హఠాత్తుగా పది రోజులు ఆసుపత్రి మంచంపై పడేలా చేసింది. ఒకరోజు కామాక్షిని డెంగ్యు దోమ కుట్టింది కాబోలు రెండు వారాల తర్వాత దాని ప్రతాపంతో కామక్షికి విపరీతమైన తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,జ్వరం వచ్చింది.బంధువులు ఇంటికి రావటంతో నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బడలిక వలన ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయానుకుని ఒక మాత్ర వేసుకుని నిద్రపోయేది.కామాక్షికి పాదంపై ఒక చిన్న పుట్టుమచ్చ మాదిరిగా కనపడితే ఏదో కాలికి గట్టిగా గుచ్చుకుని ఉంటుందిలే అనుకుని పట్టించుకోలేదు.నాలుగు రోజులకు ఒళ్ళు నొప్పులు,జ్వరం తగ్గిపోయింది.మళ్ళీ ఒక ఇరవై రోజులకు బంధువులు వచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే పని ఒత్తిడి వలన అనుకుంది.నాలుగు రోజులైనా తగ్గక పోయేసరికి వైద్యుని వద్దకు వెళ్ళింది.బి.పి. చాలా తక్కువగా ఉందని కళ్ళు తిరిగి క్రింద పడిపోయే అవకాశం ఉన్నందున అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఉండమన్నారు.అప్పటి నుండి ప్రత్యక్ష నరకం మొదలయింది.ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని రక్తం తీసుకోవడానికి సూదులతో పొడవడం,సెలైన్ తోపాటు ఇంజెక్షన్ లు పది రోజులకు కానీ ఇంటికి చేరలేదు.తెలిసి తెలిసి అద్దోయితం లాగ మొదటే వైద్యుని దగ్గరకు వెళ్తే ఈ తిప్పలు తప్పేవి.మొదట అశ్రద్ద చేయటం వలన వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళకపోవటంతో అన్ని లెవెల్స్ హెచ్చు స్థాయికి చేరాయి.అదృష్టం ఏమిటంటే ప్లేట్ లెట్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.ఆ పదిరోజులు నరకం తర్వాత సాధారణ స్థితికి రావటంతో కామాక్షి కొద్దిగా కుదుటపడింది.ఇంటికి వచ్చిన నెల రోజులకు కూడా  ఆ నీరసం వదలలేదు.అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళమని అందరికీ సలహాలిచ్చే కామాక్షికే ఊహించని పరిస్థితి ఎదురయింది.సాధ్యమైనంత వరకు పరిసరాలు శుభ్రంగా,నీరు నిల్వ లేకుండా చూడాలి.దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.కామాక్షి ఇంట్లో దోమలు ఒకటి,అరా తప్ప ఉండవు.కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు దోమ కుట్టిందో దాని ప్రతాపంతో కామాక్షిని ఒక ఊపు ఊపేసింది.దోమల కాలంలో శరీరం మొత్తం కప్పేలా దుస్తులు వేసుకోవడం మంచిది.ఏ దోమ వలన ఏ విష జ్వరం వచ్చి ఇబ్బంది పడాలో తెలియదు కదా!

దోమ కటాక్షం

                                                               శ్రావణ మాసంలో అందరినీ లక్ష్మీ దేవి కటాక్షిస్తే మీనాక్షిని
మాత్రం దోమ కటాక్షించింది.ఒకరోజు మీనాక్షిని డెంగ్యు దోమ కుట్టింది కాబోలు డెంగ్యు వైరస్ శరీరంలో ఉండటంతో రెండు వారాల తర్వాత దాని ప్రభావం బయటపడి విపరీతమైన తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,జ్వరం వచ్చింది.ఈలోగా కృష్ణా పుష్కరాలు రావటంతో ఒక పాతికమంది బంధువులు మూడురోజులు ఇంటికి రావటంతో నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బడలిక వలన ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయానుకుని ఒక మాత్ర వేసుకుని నిద్రపోయేది.డెంగ్యు జ్వరం వచ్చినప్పుడు చిన్న పుట్టుమచ్చ శరీరంపై ఎక్కడో ఒకచోట కనిపిస్తుందట.ఆవిషయం మీనాక్షికి తెలియదు.పాదంపై ఒక చిన్నమచ్చ కనపడితే ఏదో కాలికి గుచ్చుకుని ఉంటుందిలే అనుకుని పట్టించుకోలేదు.నాలుగు రోజులకు ఒళ్ళు నొప్పులు,జ్వరం తగ్గిపోయింది.మళ్ళీ ఒక ఇరవై రోజులకు ఆసుపత్రిలో ఉన్న బంధువులకు భోజనం పంపవలసి వచ్చింది.వాళ్ళ పని పూర్తయిన తర్వాత జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే పని ఒత్తిడి వలన అనుకుంది.నాలుగు రోజులైనా తగ్గక పోయేసరికి వైద్యుని వద్దకు వెళ్ళింది.వైద్యుని ఎదుటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయినంత పని అయింది.బి.పి. చాల తక్కువగా ఉందని క్రింద పడిపోయే అవకాశం ఉన్నందున అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఉండమన్నారు.అప్పటి నుండి ప్రత్యక్ష నరకం మొదలయింది.ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని రక్తం తీసుకోవడానికి సూదులతో పొడవడం,సెలైన్ తోపాటు ఇంజెక్షన్ లు పది రోజులకు కానీ ఇంటికి చేరలేదు.తెలిసి తెలిసి అద్దోయితం లాగ మొదటే వైద్యుని దగ్గరకు వెళ్తే ఈ తిప్పలు తప్పేవి.మొదట అశ్రద్ద చేయటం వలన వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళకపోవటంతో అన్ని లెవెల్స్ హెచ్చు స్థాయికి చేరాయి.అదృష్టం ఏమిటంటే ప్లేట్ లెట్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.ఆ పదిరోజులు నరకం తర్వాత సాధారణ స్థితికి రావటంతో మీనాక్షి కొద్దిగా కుదుటపడింది.ఇంటికి వచ్చిన పదిహేను రోజులకు కూడా  ఆ నీరసం వదలలేదు.అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళమని అందరికీ సలహాలిచ్చే మీనాక్షి కే ఊహించని వింత అనుభవం ఎదురయింది.ఇదంతా దోమ కటాక్షం.

Wednesday 19 October 2016

మంచి నీళ్ళతో రోజుని.....

                                                       కనీసం రెండు గ్లాసుల నీళ్ళతో రోజుని ప్రారంభిస్తే రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు.భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగటం అలవాటు చేసుకుంటే త్వరగా పొట్ట నిండిన భావన కలిగి ఆహరం తక్కువ తీసుకోవటంతో బరువు అదుపులో ఉండటమే కాక క్రమంగా బరువు కూడా తగ్గుతారు.

Sunday 16 October 2016

గులాబ్ జామ్ పెట్టలేదని......

                                                    సావిత్రమ్మ అక్క తెల్లగా,అందంగా,ఒళ్లంతా జుట్టుతో ముద్దుగా ఉన్న కుక్కపిల్లను తెచ్చి పెంచుకోమని చెల్లికి ఇచ్చింది.చిన్నప్పటి నుండి సావిత్రమ్మ అతి గారాబంగా పెంచడంతో ఒక పిల్ల మాదిరిగా అన్నీ అర్ధం చేసుకుని తిరిగి సైగలతో,అరుపులతో దాని భావాలను వ్యక్తపరుస్తుంటుంది.సావిత్రమ్మ రోజూ ఉద్యోగరీత్యా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటుంది.ఒకరోజు కోడలు సావిత్రమ్మ వెళ్ళిన తర్వాత గులాబ్ జామ్ చేసి దానికి పెట్టకుండా భర్తకు పెట్టి తను తినేసి కొన్ని వంటగదిలో వదిలేసింది.సాయంత్రం సావిత్రమ్మ రాగానే కుక్కపిల్ల చీర చెంగు పట్టుకుని వంటగదికి తీసుకెళ్ళి అరవటం మొదలు పెట్టింది.సావిత్రమ్మ కోడలుతో దానికి పెట్టకుండా ఏమి చేసుకుని తిన్నారు అమ్మాయ్?అని అడిగింది.మీ అబ్బాయి గులాబ్ జామ్ చెయ్యమని అడిగితే చేశాను అత్తయ్యా!అని నట్లు కొడుతూ చెప్పింది.చేసుకుంటే చేసుకున్నారు దానికి కూడా పెడితే తంటా ఉండేది కాదు కదా!ఇప్పుడు చూడు దొంగను పట్టించినట్లు నన్ను వంటగదికి తీసుకెళ్ళి మరీ గులాబ్ జామ్ పెట్టలేదని చెపుతుంది అంటూ మురిపెంగా సావిత్రమ్మ కుక్కపిల్లను భుజాన వేసుకుంది.

Saturday 15 October 2016

మాక్స్

                                                     మాక్స్ ఒక కుక్క పేరు.కుక్క అని ఎవరైనా అంటే దాన్ని పెంచే అమ్మ అసలు ఊరుకోదు.లోలిత,ఆమె భర్త పెళ్ళయిన కొత్తలో ఇప్పటి నుండి పిల్లలు ఎందుకులే?అని ఈలోగా కాలక్షేపానికి ఒక కుక్కను తెచ్చుకుని స్వంత కొడుకు కన్నా ప్రేమగా పెంచుకోవడం మొదలెట్టారు.లోలిత ఉద్యోగరీత్యా అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.లోలిత ఉన్నప్పుడు మాక్స్ సోఫా పైన,తివాచీల పైన పడుకోకుండా దానికి తర్ఫీదు ఇచ్చింది.లోలిత భర్త ఇంట్లో ఒక్కడే ఉండటంతో మరీ గారాబం చేసి టి.వి రిమోట్ నోటితో తీసుకుని సోఫా పైన కూర్చుని కాలితో నొక్కి దానికి నచ్చిన ఛానల్ పెట్టుకునేలా తర్ఫీదు ఇచ్చాడు.లోలిత ఇంటికి వెళ్ళినప్పుడు చూచి లబలబలాడుతూ సోఫాపై కూర్చోబెట్టి టి.వి చూడనివ్వడం ఏమిటి?అంటూ పైకి భర్తతో అన్నా స్నేహితుల దగ్గర మాత్రం కొడుకు అంటే మాక్స్ చక్కగా రిమోట్ తో టి.వి పెట్టుకుని చూస్తున్నాడని తెగ మురిసిపోతూ ముచ్చట్లు చెబుతుంది.హతవిధీ!

Wednesday 12 October 2016

మూడురోజులు దాటితే....

                                               జ్వరాల కాలం కనుక ఎవరికైనా జ్వరం వచ్చి మాత్ర వేసుకున్నా సరే మూడురోజుల వరకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి రక్తపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.వైద్యుని సలహా,సూచనల ప్రకారం మాత్రలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా బయట పడవచ్చు.అదే తగ్గిపోతుంది.ఈ జ్వరం నన్నేమి చేస్తుంది?అని అశ్రద్ధ చేయకుండా మూడురోజులు దాటితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్యం తీసుకోవాలి.కొన్ని జ్వరాలు కుటుంబంలో మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ముందే జాగ్రత్త పడటం అవసరం.

Monday 10 October 2016

దసరా శుభాకాంక్షలు

                                           బ్లాగ్ వీక్షకులకు,బ్లాగర్లకు,అందరికీ దసరా శుభాకాంక్షలు.

            
                                       


Thursday 22 September 2016

రోజూ టొమాటో రసం

                                                                      చర్మం రోజంతా తాజాగా ఉండాలంటే రోజూ ఉదయం అల్పహరంతో పాటు ఒక గ్లాసు టొమాటో రసంలో చిటికెడు ఉప్పు,చిటికెడు మిరియాల పొడి,కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.ఈ విధంగా చేస్తే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.దీనితో పాటు బరువు అదుపులో ఉండడమే కాక తక్కువ సమయంలో ఆరోగ్యంగా,అందంగా ఉన్న వయసు కన్నా చిన్నగా,యవ్వనంగా కనిపిస్తారు. 

Wednesday 21 September 2016

మొక్కల మధ్య కాసేపు

                                                             రోజూ కాసేపు మొక్కల మధ్య గడిపితే ఒత్తిడి మన దరిదాపులకు కూడా రాదు.మట్టి వాసన పీల్చుతూ,మొక్కల పచ్చదనం చూస్తూ అటూ ఇటూ ఏ ఆలోచనలు లేకుండా తిరుగుతూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.అందుకే ఇప్పుడు అందరూ ఇంటి పైనే రకరకాల ఆకులు పూలు,పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు అన్ని రకాలతో మిద్దె  తోటను పెంచుతున్నారు.రోజూ ఒక అరగంట సాధ్యమైనంతవరకు వీలు కల్పించుకుని తోట పని చేయగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది.బహుళ అంతస్తుల్లో కూడా వరండాలో,ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉన్న గాలిని సహజ సిద్దంగా శుద్ధి చేస్తాయి.కొన్ని మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.అటువంటి వాటిని ఎంచుకుని తెచ్చి పెంచితే పచ్చదనంతోపాటు ప్రయోజనం కూడా ఉంటుంది.

Monday 19 September 2016

ముసలి పిల్లలా?

                                                           రుక్మిణమ్మ ఇంటికి ఒకరోజు ఒక ముప్పై సంవత్సరాల యువతి మురికిగా చాలీ చాలని సగం చీర ముక్క ఒంటికి చుట్టుకుని పైన జాకెట్టు వేసుకోకుండా జుట్టు విరబోసుకుని  ఒక పిల్లను చంకన వేసుకుని అమ్మా!కట్టుకోవటానికి బట్టలు,తినడానికి తిండి,తాగటానికి బిడ్డకు పాలు లేవు ఇప్పించండి అంటూ పెద్ద గొంతుతో అరవడం మొదలు పెట్టింది.ఇంట్లో పని చేసుకుంటున్న రుక్మిణమ్మ కేకలు విని బయటకు వచ్చింది.ఆ వచ్చిన అమ్మాయి అవతారం చూడగానే రుక్మిణమ్మకు కోపం నషాళానికి అంటింది.అంతకు ముందు ఒకసారి ఒకామె ఇలాగే వస్తే నిజమే కాబోలు అనుకుని పాత చీరలు ఇచ్చి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించింది.తర్వాత రోజు మళ్ళీ అదే అవతారంలో కనిపించింది.అందుకే అంత కోపం.ఆ కోపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.ఏమైనా ముసలి పిల్లలా?(ముసలి వాళ్ళా?పిల్లలా?)ఆ అవతారం ఏమిటి?కష్టపడి పని చేసుకో!పని చేసుకుంటే అన్నీ అవే వస్తాయి.ముందు ఇక్కడి నుండి వెళ్ళు.కష్టపడకుండా ఒంటికి చిన్న గుడ్డపీలిక చుట్టుకుని అడుక్కోవడం నేర్చారు.నీలాంటి వాళ్ళకు నేను ఏమీ ఇవ్వను అంటూ విసుక్కుంది.జాలి పడుతుందని అనుకున్న పెద్దావిడ అంత గట్టి గట్టిగా చివాట్లు పెట్టేసరికి బిక్కచచ్చిపోయి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది.ఒక్క రుక్మిణమ్మ అన్నంత మాత్రాన వాళ్ళు మారరు.ఇక్కడ కాకపోతే ఇంకొకచోట ఈరోజు గడిచి పోయింది లెక్క.కొంతమంది నోరు తెరుచుకుని జాలితోనో,వంకరగానో  చూస్తూ డబ్బులు ఇస్తున్నంత కాలము అలాగే జీవనం సాగిపోతుంది.

వెన్నంటి

                                                                        ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొద్ది సేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే దానికి పరిష్కారం లభించినట్లుగానే ప్రతి ప్రశ్నకు సమాధానం,ప్రతి కష్టం వెనుక ఒక మంచి అవకాశం నీడలా వెన్నంటి ఉంటాయి.కొంత మందికి ముందు,కొంత మందికి ఆలస్యం అయినంత మాత్రాన నిరాశ పడవలసిన పని లేదు.తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Thursday 15 September 2016

మనసులో మాట

                                                                          ఈరోజుల్లో చాలా మంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నారు.చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా ఉంటున్నారు.ఈ విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకు మనపట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది.కనుక చెప్పేది చేసేది కూడా ఒకటే ఉండాలి.అలా చేయలేని వాళ్ళు నిశ్శబ్దంగా  ఉండటం మంచిది.ఇంకొంతమంది పైకి ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు.లోపల అంతా కుళ్ళు,కుతంత్రాలు.ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉంటేనే మాట్లాడాలి.అంతే కానీ నటించకూడదు.ఇంకొంత మంది ఎవరి మీదైనా కోపం వస్తే ఎదుటివారిది తప్పా?మనది తప్పా?అని విశ్లేషించుకోకుండా మనసులో పెట్టుకుని ఏదో కక్ష సాధిస్తున్నట్లు కనిపించినప్పుడల్లా సతాయిస్తూ ఉంటారు.కోపం వస్తే ఆ కొద్దిసేపు మాటలోనే కానీ మనసులో పెట్టుకోకూడదు.జీవితం ఎంతో విలువైనది.పిచ్చిపిచ్చి అపోహలతో జీవితాన్ని వృధా చేసుకోకూడదు.సుఖ సంతోషాలతో ఉండాలంటే మనసులో ఏదీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి.


పొట్ట చుట్టూ........

బరువు పెరిగినప్పుడు ముందుగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.ఇది తగ్గాలంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ క్రింది విధంగా జ్యూస్ చేసుకుని తాగాలి.
                                           నిమ్మకాయ -1
                                           తురిమిన అల్లం  - 1 టేబుల్ స్పూను
                                           కలబంద రసం - 1 టేబుల్ స్పూను
                                            దోసకాయ - 1
                                            కొత్తిమీర  - కొంచెం
                                            నీళ్ళు - 1/2 గ్లాసు
                                                  ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి వడకట్టి తాగితే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుక్రమంగా కరిగిపోతుంది.
                                           

Wednesday 14 September 2016

చేప ముళ్ళు

                                                                      సాగర్ ఒకరోజు పుస్తకం కోసం అలమరపై వెదుకుతుండగా మూడు చిన్నచిన్న మైనపు సంచుల్లో పసుపు కుంకుమ అద్దిన చేప తల నుండి తోక వరకు ఉన్న ముళ్ళు కనిపించాయి.అసలే సాగర్ కి అనుమానాలు ఎక్కువ.వాటి గురించి తెలిసిన వాళ్ళకు ఫోను చేస్తే నిన్ను దెబ్బ తీయడానికి చేతబడి చేశారు అని చెప్పి వాటిని ఎక్కడో ఒక చోట బయటపెట్టి ఉంచితే వచ్చి వాటిని పట్టుకెళ్ళి బాగు చేస్తామని చెప్పారు.దానికితోడు సాగర్ కాలుజారి  కిందపడటంతో ఆరు వారాలు మంచంపై నుండి కదలకుండా ముఖ్యమైన పనులకు మాత్రమే లేస్తూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఇంకేముంది?నాకు చేతబడి చేశారంటూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళల్లో కొంతమంది సాగర్ ను చూడటానికి వచ్చి తానంటే తందాన అంటూ అవును చేతబడి అయి ఉంటుంది.చేప ముళ్ళుతో పసుపు కుంకుమతో ఇంట్లో వేశారంటే అదే అంటూ మాట్లాడుతున్నారు.ఈరోజుల్లో కూడా చేతబడులు చేసేవాళ్ళు ఉన్నారంటే నమ్మటం,నమ్మకపోవటం తర్వాత సంగతి కానీ ప్రస్తుతం అందరికీ ఇదొక కాలక్షేపం అయిపోయింది.

Tuesday 13 September 2016

శాశ్వతం కాదని

                                                             
                                                              లక్ష్మీ దేవి  ఒక్క రోజులో వాడిపోయే కలువ పూవులోఎందుకు దర్శనం ఇస్తుందో తెలుసా?అంత లోతుగా ఆలోచించే తీరిక,ఓపిక మనందరికీ ఉండక పోవచ్చు.తెలిస్తే మనలో చాలా మంది డబ్బు కోసం అదేపనిగా వెంపర్లాడి తరతరాలు కూర్చుని తినేంత సంపాదించాలని అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళని కూడా లేకుండా వెన్నుపోటు పొడవటం,స్నేహితులను,కనిపించిన వాళ్ళను అడ్డంగా మోసగించడం,డబ్బు కోసం అవినీతికి పాల్పడడం చేయరు.ఎందు కంటే ధనం శాశ్వతం కాదని ఏదో ఒక రోజు మాయమై పోవచ్చని అంటే కలువ పూవులా ఈరోజు ఉంటుంది రేపు పోతుందని తెలియచెప్పడానికే లక్మీదేవి కలువ పువ్వులోదర్శనం ఇస్తుంది.జీవితం శాశ్వతం కాదు డబ్బు అంతకన్నాశాశ్వతం కాదు అన్న పరమార్ధం అర్ధం చేసుకుని సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ డబ్బే లోకంగా అడ్డదారులు తొక్కకుండా ఉండడం మంచిది.