Wednesday 31 December 2014

ఒక్క 30 ని.లు

                            ఈ నూతన సంవత్సరం సందర్భంగానయినా ఉదయం,సాయంత్రం ఒక్క 30 ని.లు చొప్పున ఎవరికి వీలయిన సమయంలో వాళ్ళు తమకోసం తాము సమయం కేటాయించుకుని వ్యాయామం చేయాలనే దృఢసంకల్పంతో ఒక 30 ని.లు నడక,ఒక 30 ని.లు ఇతర వ్యాయామం చేయాలని,ఈసంకల్పాన్ని,నిర్విఘ్నంగా కొనసాగించాలని,తద్వారా ధృడంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.క్రమం తప్పకుండా వేగంగా నడవటం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాక,మేలుచేసే కొలెస్టరాల్ పెరిగి,పరోక్షంగా గుండెపనితీరు మెరుగుపడుతుంది.శరీరం వేగంగా కదలటం వల్ల పక్షవాతం దరిచేరదు.మధుమేహం,ఉబ్బసం,కాన్సర్ల ప్రభావం తగ్గుతుంది.నడక వల్ల బరువు తగ్గటమేకాక ఎముకల సాంద్రత పెరిగి ఆస్టియోపొరాసిస్,కీళ్ళనొప్పులు వంటివి దరిచేరవు.   

2015 - నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                  కొంగ్రొత్త ఆశలతో,కోటి దివ్వెల వెలుగుతో నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్ననాబ్లాగ్
వీక్షకులకు,నాతోటి బ్లాగర్లకు నూతనసంవత్సర శుభాకాంక్షలు.ఈ 2015లో అందరికీ తమ ఆశలకు,ఆశయాలకు అనుగుణంగా సంపూర్ణ విజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
                                                                                                       

Tuesday 30 December 2014

తేమ కోల్పోయి చర్మం కళ,కాంతి లేకుంటే.......

                                                             ఒక స్పూను  పెరుగు,ఒక స్పూను మెంతు పొడి.1/2 స్పూను తేనె కలిపి
ముఖానికి రాసుకుని 15 ని.లు తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.తేమ కోల్పోయిన చర్మం తిరిగి తాజాగా కళకళలాడుతూ కాంతివంతంగా మారుతుంది. 

Monday 29 December 2014

అందంగా,ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే.......

                      ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో మెత్తగా చేసుకుని దానిలో 1/4 కప్పు పెరుగు వేసి ఒకసారి త్రిప్పాలి.అప్పుడు చిక్కటి పేస్ట్ తయారౌతుంది.ఒక 15 ని.లు నాననిచ్చి ఈమిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ కాప్
పెట్టుకోవాలి.20 ని.లు తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే జుట్టు అందంగా,     ఆరోగ్యంగా  పెరుగుతుంది.చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

Sunday 28 December 2014

తాజాగా .......

                                      తరచూ చల్లని నీళ్ళతో ముఖం కడుగుతూ ఉంటే తాజాగా ఉంటుంది.చర్మం మెరుస్తూ
కాంతివంతంగా ఉంటుంది.

మునగాకుతో ఆవిరి కుడుములు

బియ్యం రవ్వ - 2 కప్పులు
 నీళ్ళు - 5 కప్పు
 మునగాకు - మూడు కప్పులు
 ఉప్పు - 1 1/2 స్పూనులు
 పెసరపప్పు - 5 స్పూనులు
 శనగపప్పు - 5 స్పూనులు
  పచ్చి కొబ్బరి - 5 స్పూనులు
  జీరా - 2 స్పూనులు
  నూనె- 2 స్పూనులు
   ఆవాలు - 1/2 స్పూను
   కరివేపాకు - కొంచెం
                                                    బాండీలో నూనె వేసి ఆవాలు,జీరా,కరివేపాకు వేసి వేగనివ్వాలి.అందులో శనగపప్పు,పెసరపప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి,మునగాకు వేసి అటుఇటు తిప్పి నీళ్ళు,ఉప్పు వేసి మూత పెట్టాలి.పొంగు వచ్చిన తర్వాత రవ్వ వేయాలి.ఉండ కట్టకుండా త్రిప్పాలి.సన్నని మంటపై 5 ని.లు మగ్గనివ్వాలి.బాగా రవ్వ దగ్గరపడిన తర్వాత చల్లార్చి కుడుముల్లాగా చేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి,ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి 10 ని.లు ఆవిరిపై వండితే రుచికరమైన మునగాకు ఆవిరి కుడుములు తయారవుతాయి.నచ్చిన చట్నీతో తినవచ్చు.  

చేమ ఆకు పప్పు

                                                       చేమదుంపలు కొనుక్కొచ్చి ఒక్కొక్కసారి వండటానికి వీలుపడకపోతే వాటిని   నిల్వఉన్నాయనో,ఎండిపోయినాయనో బయట పడేస్తుంటాము.అలా పడేయకుండా వాటిని భూమిలో పెడితే చక్కగా మొక్కలు వచ్చి ఆకులు అందంగా ఉంటాయి.ఈ మొక్కలు అందంగానూ ఉంటాయి.ఈఆకులు పప్పులో వేసుకుంటే చాలా  రుచిగా ఉండటమే కాక ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి.ఒకకప్పు కందిపప్పులోఒకఉల్లిపాయ,మూడు పచ్చిమిర్చి,రెండు చేమ ఆకులు,ఒక టొమాటో,కొద్దిగా చింతపండు చేర్చికారం,ఉప్పు, సరిపడా నీళ్ళుపోసి కుక్కర్లో మెత్తగా ఉడికాక కరివేపాకు,కొత్తిమీర,వెల్లుల్లి రెబ్బలు,తాలింపు దినుసులు వేసి కొంచెం నెయ్యి,కొంచెం నూనెతో తాలింపు పెడితే చాలా రుచిగా ఉంటుంది.
                     కొద్దిరోజుల తర్వాత భూమిలో చేమదుంపలు తయారవుతాయి.కుండీలో కూడా పెట్టుకోవచ్చు.

Saturday 27 December 2014

పిత్త పరిగెలు

                                           వసుమతీ దేవి గారి ఇంట్లో వంటమనిషి ఒకరోజు ఆలస్యంగా వచ్చింది.అమ్మా!ఈరోజు
కొంచెం ఆలస్యమైంది ఏమీ అనుకోకండి.మా ఆయన పిత్తపరిగెలు తెచ్చాడు.అవి బాగుచేసి కూర వండి వచ్చేసరికి ఆలస్యమైందిఅని చెప్పింది.చిటికెలో మీకు వంట చేస్తాను అలా కూర్చుని కబుర్లు చెప్పండి అనగానే పిత్తపరిగెలు అంటే ఏమిటో చెప్పు?అన్నారు.అంటే చిన్నచిన్న పిల్ల చేపల్నిమేము పిత్తపరిగెలు అంటాము.వాటిని శుభ్రం చేసి పులుసు పెట్టాను.మాఆయనకు అవంటే చాలా ఇష్టం.మేము ముల్లు తీయకుండా అన్నంలో కలిపి నమిలేస్తాము అంది.ముల్లుతోపాటు నమిలేస్తే గుచ్చుకుంటుంది కదా!అంటే వాటిని ముల్లుతోసహా తింటేనే రుచిగా  ఉంటుంది.అలవాటైతే గుచ్చుకోవు.మాకు చిన్నతనం నుండి అలవాటైపోయింది అని లొట్టలేస్తూ చెప్పింది.  

తానంటే తందానా

                                          సౌరబ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నపిల్లలు ఎప్పుడన్నా పొద్దెక్కి నిద్రలేస్తే బారెడు పొద్దేక్కేదాకా నిద్రపోవటమేమిటి?అసలు పొద్దుపోయేదాకా సినిమాలు చూడటమేమిటి?అని రంకె లేసేవాడు.తన పిల్లలు పెద్దయ్యేసరికి వాళ్ళు తానంటే తందానా అనటం మొదలుపెట్టాడు.ఏసినిమా సీడీ కావాలంటే అది తెచ్చివ్వటం వాళ్ళు తెల్లవారుఝాము 4 గం.ల వరకూ సినిమాలు చూడటం,తర్వాత రోజు 12 గం.లకు నిద్రలేస్తున్నా అదేమని అడగకుండా చూసీచూడనట్లుగా ఊరుకోవటం అలవాటైపోయింది.అన్నపిల్లలేమో కొంచెం ఆలస్యమైనా మమ్మల్నైతే మాట్లాడేవాడు ఇప్పుడు తనపిల్లలు 12 గం.ల వరకూ పడుకున్నా ఏమీ అనటంలేదు.తనకో న్యాయం ఎదుటివాళ్ళకో న్యాయమా? అలా ఊరుకోవటానికి వీల్లేదు అంటూ వాళ్ళనాన్న దగ్గర సణగటం మొదలెట్టారు.వాళ్ళ నాన్నేమో ఎవరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.గిల్లికజ్జాలు ఎందుకు?అలా అనటం వల్ల మీకు మంచే జరిగింది కదా! ఇక ఆవిషయం వదిలేసి మీ భవిష్యత్ ప్రణాళికలు గురించి ఆలోచించండి అని చెప్పారు.

శీతాకాలంలో వెల్లుల్లి

                                 శీతాకాలంలో వెల్లుల్లి ఎంత వాడితే అంత మంచిది.జలుబు,దగ్గు దరిచేరకుండాఉంటుంది.
ఒక స్పూను తేనెలో ఒక వెల్లుల్లి రెబ్బని ముంచి నమిలి తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.వెల్లుల్లి రెబ్బ పైపొట్టు
తీసి వేడివేడి అన్నంలో పెట్టి కొంచెంసేపు తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది.రక్తపోటు నియంత్రణలో వుంటుంది. 

Friday 26 December 2014

ఒత్తిడి తీవ్రంగా ఉంటే ..........

                                           ప్రతిచిన్నదానికి అరిచేయడం,చిరాకు పడటం,ఏచిన్నశబ్ధమైనా అతిగా స్పందించటం,
బాగా అలిసిపోవటం,తలచు తలనొప్పి,మెడ,వీపు నొప్పులు,వికారంగా వుండటం,పొట్టలో అసౌకర్యం,ప్రతి చిన్నదానికి అతిగా బాధపడటం,ఇలాంటివన్నీ ఒత్తిడికి గురవుతున్నామన్నదానికి సంకేతాలు.వీటిని ముందే గుర్తించి ఒత్తిడి తీవ్రరూపం దాల్చకముందే దానినుండి బయటపడగలగాలి.అదెలాగంటే కాసేపు పచ్చటి చెట్ల మధ్య తిరుగుతూ మనకు ఇష్టమైన సంగీతం వినడం,నవ్వు తెప్పించే సినిమాలు చూడటం,ఇష్టమైన పుస్తకం చదవటం,పొద్దున్నే వ్యాయామం చేయటం,ఇష్టమైన స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పటం,పిల్లలతో సరదాగా గడపటం,ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవటం లాంటి పనులు చేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి నుండి బయటపడగల్గుతాము. 

Thursday 25 December 2014

ఆరాలగత్తె

                              జయంతికి ఆరాలు తీయటం వెన్నతో పెట్టిన విద్య.ప్రక్కింటి విషయాలు,ఎదురింటి విషయాలు,
అన్నీ ఈమెకే కావాలి.మళ్ళీ అవితీసుకెళ్ళి కనిపించిన వాళ్లకల్లా చెప్పనిదే హాయిగా నిద్ర పట్టదు.ఒకరోజు ఎదురింటికి క్రొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది.పది సంవత్సరాల క్రితం కొద్దిపాటి ముఖ పరిచయం.వాళ్ళింటికి వెళ్ళి మీకెంత పొలం ఉంది?అది ఎంత రేటు చేస్తుంది?మీ వారేమి చేస్తున్నారు?మీపిల్లలు ఏమి చదువుతున్నారు?ఎన్నో యక్ష ప్రశ్నలు వేసి ఒక గంట సమయం వృధా చేసింది.ఈమె సంగతి తెలుసు కనుక వాళ్ళు వివరాలు ఏమీ చెప్పలేదనుకోండి అది వేరే విషయం.మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా వేరే ఇంటికి వెళ్ళింది.వాళ్ళు మాకూ బాగా తెలుసు వాళ్ళఇంటివిషయాలన్నీ  నాకు తెలుసుఅని నోటికి వచ్చినట్లు ఏకరువు పెట్టుద్దన్న మాట.అందరి ఇళ్ళకు వెళ్ళి తన పిల్లలు గొప్పవాళ్ళని చెప్పుకోవటం అలవాటయిపోయింది.అమ్మో ఆరాలగత్తె వస్తుంది.ఈమెతో జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది పని 
 ఉన్నట్లు తప్పుకుంటారు.తప్పించుకోవటానికి వీలుపడని వాళ్ళుఆమె వాగ్ధాటికి బలైపోతుంటారు.   

సంపెంగ పువ్వులు (స్వీట్)

                    గోధుమ పిండి - 3 కప్పులు
                    బొంబాయి రవ్వ - 1 కప్పు
                     పంచదార -8 కప్పులు
                      డాల్డా - 1 కప్పు
                       నూనె -  వేయించడానికి సరిపడా
                            గోధుమ పిండి,బొంబాయి రవ్వ జల్లించి దానిలో డాల్డా వేసి కలిపి అవసరమైనన్ని నీళ్ళు పోసి పిండి గట్టిగా కలపాలి.తడి వస్త్రం కప్పి ఒక అరగంట నాననివ్వాలి.తర్వాత కొంచెం పిండి తీసుకుని మొగ్గలాగా చేసి
దాన్ని గీతలు పెట్టి సంపెంగ పువ్వు రేకల్లా చేయాలి.కొన్ని చేసి ఒక ప్లేటులో పెట్టుకుని కాగే నూనెలో వేసి ఎర్రగా
కరకరలాడేలా వేయించాలి.అన్నీ ఇలాగే చేయాలి.1,2 ఆకారం రాకపోయినా అచ్చు సంపెంగ పువ్వు లాగా ఉంటాయి.
పంచదారలోనీళ్ళు పోసి తీగపాకం రానిచ్చి వీటన్నింటిని వేసి త్రిప్పాలి.తిప్పిన తర్వాత ఒకపెద్ద ప్లేటులో పోస్తే ఆరిపోయి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి.
గమనిక :ఈ పువ్వులు చెయ్యటం కుదరకపోతే కొంచే పిండిని చపాతీలాగా చేసి చాకుతో గీతలు పెట్టి అటుచివర,ఇటుచివర మెలిత్రిప్పి నూనెలో వేయించి పాకం పట్టాలి.. 

Wednesday 24 December 2014

చక్కటి వ్యాయామం

                                            రోజూ ఉదయం,సాయంత్రం నీరెండలో పచ్చటి చెట్లమద్య నడవటం,తోటపని చేయడం
చక్కటి వ్యాయామం.పచ్చటి చెట్ల మధ్య గడపటం వల్ల మనసు కెంతో ప్రశాంతంగా ఉండటమే కాక,ఉదయం సాయంత్రం నీరెండలో పని చేయటం వల్ల శరీరానికి విటమిన్ "డి" లభిస్తుంది.దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.స్వచ్చమైనగాలి,ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.అదీకాకమొక్కలకు నీళ్ళు పట్టటం,ఎండిన ఆకులు తీసేయడం,ఎప్పటికప్పుడు మొక్కలను కత్తిరించడంవంటి పనులు చేయటం వల్ల కాలొరీలు ఖర్చయి అధిక బరువు తగ్గుతారు. మనం పెంచుకున్న మొక్కలు,చెట్లు పువ్వులు పండ్లు ఇస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది.సంతోషమే సగం బలం.సంతోషంగా ఉంటూ ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఉంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. 

Tuesday 23 December 2014

దగ్గుకి ఔషధం

                                అల్లం పదిచిన్నచిన్న ముక్కలు తీసుకుని 3 కప్పుల నీటిలో ఇరవై ని.లు మరిగించాలి.కాస్త చల్లారాక ఒక స్పూను తేనె కలపాలి.దీనిలో ఒక నిమ్మకాయ రసం పిండాలి.బాగా ఘాటుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కలపాలి.రెండు పూటలు దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.ఇది దగ్గుకి మంచి ఔషధం.

తాగితే మనిషి ప్రవర్తన

                                              సరస్వతి భర్త ముఠా మేస్త్రి.సాయంత్రం రోజూ తాగేసి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు.పిల్లలమొహాలు చూచి ఎన్ని భాధలు పెట్టినా ఓర్చుకునేది.ఒకసారి బాగా తాగి ఇంటికి వచ్చి సరస్వతిని నానా మాటలు అని,కొట్టి ఆమైకంలో ఏమి చేస్తున్నాడో కూడా ఒళ్ళు తెలియని స్థితిలో చెయ్యి పట్టుకుని ముంజేతిని మెలితిప్పేశాడు.సరస్వతికి మొదట ఏమీ అర్ధం కాలేదు.ముంజేయి వేలాడిపోయిండి.ఎదిరించడానికి తగిన శక్తి లేక ఏడవటం మొదలుపెట్టింది.కాసేపటికి తలకెక్కిన మత్తు దిగి భార్య చెయ్యి వాచిపోయేసరికి మందుబిళ్ళ తెచ్చి వేశాడు.తర్వాత రోజు వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.ఎముక విరిగి లోపల నుజ్జు నుజ్జు అయింది.వెంటనే అయితే ఏమైనా చేయగలిగేవాళ్లము.ఇప్పుడు ఏమీ చేయలేము అని చెప్పారు.పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నాఇంకా అర్ధం చేసుకోకుండా తాగి కొట్టడం, పిచ్చిచేష్టలు ఎక్కువయ్యాయని విసుగొచ్చికన్నవారింటికి వెళ్ళిపోయి నాటు వైద్యం చేయించుకుంది.ఎముక సరిగ్గా అతకక ఇప్పటికీ పని ఎక్కువైతే నొప్పివస్తుంటుంది.భార్య దగ్గరకు వెళ్ళి బ్రతిమాలి,ఇంక తాగనని ఒట్లు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు.వచ్చింది కానీ సరస్వతి భర్తకు అన్నం కూడా పెట్టకుండా మాట్లాడటం మానేసింది.ఒక నెల పెద్దగా మార్పు లేదు కానీ తర్వాత తనంతట తానే తాగటం మానేశాడు.భార్యాబిడ్డలను బాగా చూచుకుంటాడని నమ్మకం కుదిరిన తర్వాత సరస్వతి మామూలైంది.అసలు మారతాడనుకోలేదు. నాచెయ్యి విరిచేస్తే కానీ మాఆయనకు జ్ఞానోదయమవలేదు.తాగితే మనిషి ప్రవర్తన ఎలాగుంటుందో నాకు మాఆయన సినిమా చూపించాడు అని సరస్వతి తెలిసినవాళ్ళకు చెప్తూఉంటుంది.          

Monday 22 December 2014

సతీ సమేతంగా

                                                    సతీసమేతంగా ఎక్కడకు వెళ్ళినా బాగానే ఉంటుంది.కానీ కొన్ని సందర్భాలలో ఇరువురికీ ఇబ్బందికరంగా ఉంటుంది.ఈమధ్య శంకర్ ప్రతిదానికి అవసరం ఉన్నా లేకున్నా భార్యను వెంటబెట్టుకుని
వెళ్ళటం మొదలుపెట్టాడు.అమ్మను తీసుకు వెళ్ళాల్సిన చోటుకు కూడా అమ్మను తీసుకెళ్ళకుండా,అమ్మపుట్టింటి వారింటికి కూడా భార్యను వెంటేసుకుని వెళ్తుంటే అమ్మను తీసుకురాలేదేంటి?అని ఎవరైనా అడిగితే అమ్మ రాలేనంది అని కథలు చెప్పటమో,మాట దాటవేయటమో చేస్తున్నాడు.అదేంటి శంకర్ అమ్మని,పిల్లల్ని తీసుకురాకుండా  మీ ఇద్దరే రావటమేమిటి? నువ్వేమీ మొయ్యాల్సిన అవసరం లేదుగా కారులో వస్తూ కూడా లింగు,లిటుకు అంటూ ఇద్దరూ వచ్చారు.ఇప్పుడే వెళ్ళి తీసుకురా?అని ఒక పెద్దావిడ చివాట్లేసింది.తర్వాత చచ్చినట్లు ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాడు.ముందే తీసుకెళ్తే బాగుండేది కదా! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే భార్యకు వాళ్ళిద్దరే వెళ్ళాలనే వింతకోరిక పుట్టిందట.అది భర్తగా శంకర్ శిరసావహిస్తున్నాడు.వెళ్ళాలనుకుంటే ఒక పదిరోజులు వాళ్ళిద్దరే ఎక్కడైనా గడిపిరావచ్చు.ఇదేమి వింత కోరికో?అని పెద్దావిడ అందరికీ పనిగట్టుకుని చెప్పింది.  

చలికాలంలో చర్మంపొడిబారకుండా..........

                                       పెరుగు మీద మీగడ తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు,కాళ్ళకు,వీలైతే శరీరమంతా చర్మం లోపలకు ఇంకే విధంగా సాయంత్రం కానీ,రాత్రికానీ రాయాలి.ఒకసారి రాసినతరవాత మళ్ళీ ఇంకొకసారి పైపైన చర్మం పైన రుద్దితే పూర్తిగా లోపలకు ఇంకుతుంది.తర్వాత శనగపిండితో స్నానం చేస్తే జిడ్డు లేకుండా ఉంటుంది.ఇలా చేయడం వల్ల చర్మం ఉదయానికి మెత్తగా,మృదువుగా అవుతుంది.కనీసం వారానికి 2 సార్లన్నా ఇలా చేయగలిగితే చలికాలంలో  చర్మం పొడి బారకుండా ఉంటుంది.
గమనిక : పెరుగు మీద మీగడ ఎంత మంచిదయితే చర్మం అంత మృదువుగా ఉంటుంది.

రోగనిరోధశక్తి పెరగాలంటే......

                                           తరచూ ఎన్నో పోషక విలువలు కలిగిన మినప్పప్పుతో చేసిన పిండివంటలు తినటంవల్ల క్రమంగా వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.ఈపప్పులో ఇనుము ఎక్కువగా ఉండటంవల్ల దీనితో తయారు చేసిన ఏ పదార్ధం తిన్నా తక్షణ శక్తి వస్తుంది.

Sunday 21 December 2014

మొటిమలు రాకుండా ఉండాలంటే ......

                      ఒక టేబుల్  స్పూను పచ్చిపాలు తీసుకుని,ఒక టీ స్పూను తేనె,చిటికెడు పసుపు తీసుకుని బాగా కలిపి దీన్ని మునివేళ్ళతో ముఖానికి,మెడకు రాయాలి.ఆరాక కడిగేయాలి.వారానికి 3 సార్లు ఈ పాక్ వెయ్యటంవల్ల
మొటిమలు రాకుండా ఉంటాయి.దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది.అదేమిటంటే పచ్చిపాలు కలపటం వల్ల
ముఖం మీద ముడతలు కూడా రాకుండా ఉంటాయి.

వంశపారంపర్యం

                                                         పిల్లలు తల్లిదండ్రుల నుండి,తాతముత్తాతల నుండి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిపాస్తులకు వారసులమై భోగభాగ్యాలను అనుభవించాలని కోరుకుంటున్నారు. కానీ వశపారంపర్యంగా వచ్చే
వ్యాధులు కూడా అనుభవించాల్సిందే అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఈరోజుల్లోఆస్తిపాస్తులంత తేలిగ్గా వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయి.ఇంతకు ముందు తెలిసేదికాదు ఇప్పుడు పెద్దలకు ఫలానా వ్యాధి ఉంది కనుక తమకు కూడా రావచ్చు అన్న అవగాహన ఏర్పడుతుంది.వైద్యులు కూడా ఈవ్యాధి మీపూర్వీకులు ఇచ్చిన బహుమతి అని జోక్ చేస్తున్నారు.ఎవరైనా ఇది నాకే రావాలా? అని తిట్టుకుంటే ఒరే ఆస్తులు తినగా లేనిది రోగం వస్తే అంత బాధ పడటమెందుకురా?అని పెద్దవాళ్ళు కూడా చివాట్లు పెడుతున్నారు.ఇదండీ ప్రస్తుతం వంశపారంపర్యాల గోల.

బుగ్గలు జారినట్లు లేకుండా ఉండాలంటే.......


                       కొంత వయసు వచ్చిన తర్వాత బుగ్గలు క్రిందికి జారినట్లుగా ఉంటాయి.అలా లేకుండా చర్మం బిగుతుగా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొన,చిటికెడు పసుపు,4 చుక్కల నిమ్మరసం మిక్సీలో వేసి బాగా నురగ వచ్చేలా చేయాలి.ముందుగా ముఖాన్నిశుభ్రంగా కడిగి ఫేస్ పాక్ బ్రష్షుతో ఆరగా ఆరగా 3సార్లు వేసి టిష్యూపేపరు అతికించాలి.మళ్ళీ టిష్యూపేపరుపై 2 సార్లు వేయాలి.చర్మం లోపలకు ఇంకాలంటే 20 ని.లు తప్పనిసరిగా ఉంచాలి.టిష్యూ పేపరు అంటించటం వల్ల తేలికగా వచ్చేస్తుంది.తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి.చల్లటి నీటితో కడిగితే వాసన వస్తుంది.ఈవిధంగా మొదట్లో వారానికి 3 సార్లు చేస్తే ఫేషియల్ చేయించినట్లుగా ఉంటుంది.తర్వాత వారానికి ఒకసారి చేస్తే బుగ్గలు జారినట్లుగా లేకుండా చర్మం బిగుతుగా మారి ముఖం అందంగా ఉంటుంది.     

Saturday 20 December 2014

చర్మానికి చక్కని రంగు

                                                    టేబుల్ స్పూను తేనెకు 1/2 స్పూను నిమ్మరసం,1/4 స్పూను పసుపు కలిపి ముఖానికి,మెడకు పట్టించాలి.ఆరాక కడిగేయాలి.ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ ,మచ్చలు లేకుండా చర్మం చక్కని రంగుతో నిగారింపుగా కాంతులీనుతూ ఉంటుంది.

జీర్ణాశయం శుభ్రపడాలంటే.........

                                            చిన్నకప్పు మినప్పప్పుకు ఒక గ్లాసు నీళ్ళు చేర్చి పప్పు ఉడికించి నీటిని వార్చి గోరువెచ్చగా అయినతర్వాత ఆనీటిని త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది.జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం.

Friday 19 December 2014

పెసరపిండి చక్రాలు

ఛాయ(పొట్టు లేనిది) పెసరపప్పు పిండి - 250 గ్రా.
బియ్యం పిండి - 400 గ్రా.
నూనె - తగినంత
వెన్న- 60 గ్రా.
కారం - 1 స్పూను
వాము పొడి - 3/4 స్పూను ఉప్పు -తగినంత
కరివేపాకు రసం -సగం కన్నా తక్కువ కప్పు
నీళ్ళు - తగినన్ని
బేకింగ్ పౌడర్ - చిటికెడు
                                               పెసర పిండి,బియ్యం పిండి కలిపి దానిలో ఉప్పు,కారం,వాము పొడి,కరివేపాకు రసం,బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి నీళ్ళు పోసి బాగా కలిపి గట్టి ముద్ద చేయాలి.ఒక గంటసేపటి వరకు తడి వస్త్రం కప్పి ఉంచాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత చక్రాల గిద్దలలో పిండి పెట్టి కారప్పూస వత్తుకుని బగరు రంగులోకి వచ్చేవరకు వేయించి తీస్తే ఛాయ పెసర పిండితో చక్రాలు రెడీ.

Thursday 18 December 2014

ఇడ్లీ - రకరకాలు

                             పిల్లలు ఇడ్లీ తినటానికి ఇష్టపడరు.ఈవిషయంలో నిర్మొహమాటంగా వద్దు అని చెప్పేస్తుం టారు.
అందుకే కొన్నిరకాల ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసుకుందాము.మామూలు ఇడ్లీ అయితే మినప్పప్పు- 1,ఇడ్లీరవ్వ-2
వేస్తాము.ఈపిండి తోనే రకరకాలు చెయ్యొచ్చు.అదెలాగంటే మామూలు గానే ఇడ్లీ వండేయాలి.
1)ఇడ్లీని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఉప్పు,సంబారుకారం(ఇంత ముందు పోస్ట్ లో ఎలా చేసుకోవాలో ఉంది) వేసి ఇడ్లీ ముక్కలు వేసి వేయించాలి.
2)మనకు అవసరమైనన్ని ఇడ్లీలను చిన్నగా చేతితో పొడిగా చేయాలి.స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి తాలింపు వేసి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేయించి కారట్ తురుమువేసి 2 ని.లు వేయించి ఇడ్లీలు పొడి వేసి సరిపడా ఉప్పు వేసి ,కొద్దిగా నిమ్మరసం కలపాలి.నిమ్మరసం నచ్చకపోతే ఉల్లి ముక్కలతోపాటు,టొమాటో ముక్కలు వేసుకోవచ్చు.ఇడ్లీ ఉప్మా రెడీ.
3 )ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి,కొత్తిమీర తరుగు కలిపి ఇడ్లీ వేస్తే కొత్తిమీర ఇడ్లీ తయారౌతుంది.
4)ఇడ్లీ పిండిలో కారట్ తురుము వేసి ఇడ్లీ వేస్తే కారట్ ఇడ్లీ రెడీ.
5)చిన్నపిల్లలకు కొద్దిగా పంచదార,నెయ్యి అద్ది పెట్టవచ్చు.
6)కొద్దిగా సంబారు కారం,వేడి నెయ్యి కలిపి వేడిగా ఇడ్లీ తింటే చాల రుచిగా ఉంటుంది.
7)ఇవే కాక 1-  మినప్పప్పు,2 - జొన్నరవ్వ వేసి జొన్నరవ్వ ఇడ్లీ వెయ్యవచ్చు.మినప్పప్పు 4 గా లు నానబెట్టి మిక్సీలో వేసి రుబ్బి పిండిలో 10 ని.లు నానబెట్టి కడిగిన జొన్నరవ్వను కలిపి రాత్రిపూట పులవనిచ్చి ఉదయం  ఇడ్లీ పిండి మాదిరిగానే ఇడ్లీ వేసుకుని వేడిగా మన ఇష్టం వచ్చిన చట్నీతో తినవచ్చు.
చిట్కా :ఇడ్లీ పిండి మిగిలితే వృధాగా పడేయకుండా కొంచెం మైదా కలిపి ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి నూనెలో పునుగులు వేసుకుంటే మెత్తగా,రుచిగా ఉంటాయి.ఇష్టమైతే కొంచే బొంబాయి రవ్వ వేస్తే కరకరలాడుతాయి.



































Wednesday 17 December 2014

పులిహోర పిండి

బియ్యపు రవ్వ -1 కప్పు
నీళ్ళు - 2 కప్పులు
ఉప్పు - తగినంత
మామిడి కోరు (లేక)చింతపండు పులుసు (లేక)నిమ్మరసం
తాలింపుకు:ఆవాలు,మినప్పప్పు,జీడిపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి,ఎండు మిర్చి
                                         ఒకగిన్నెలో నీపోసి మరిగించి ఉప్పు,బియ్యపు రవ్వ ఉడకబెట్టాలి.తర్వాత తాలింపు పెట్టి దినుసులు వేసి వేగాక పచ్చి మిర్చి,కరివేపాకు వేసి మామిడి కోరు అయితే కొంచెం వేయించాలి.చింతపండు పులుసు  అయితే చిక్కగా ఉడకబెడతాము కనుక తాలింపులో ఒకసారి త్రిప్పి ఉడికించిన రవ్వలో కలిపి వేయవచ్చు.        నిమ్మరసం అయితే ఉడికించిన రవ్వలో కలిపి తాలింపు వేసుకోవచ్చు.ఏరకంగా చేసినా బాగుంటుంది. 

Tuesday 16 December 2014

ఉసిరి - పచ్చిమిర్చి

                                  ఉసిరికాయలు - 1 డబ్బా
                                  పచ్చిమిర్చి - 1/4 కే.జి
                                  ఉప్పు - కొంచెం తక్కువ కప్పు
                                   పసుపు - కొంచెం
                                    జీరా పొడి,మెంతు పొడి కలిపి - 1 కప్పు
                                                          ఉసిరికాయలు కడిగి,తడి లేకుండా తుడిచి ఆరనివ్వాలి.ఉసిరికాయల్ని
పొడవు ముక్కలుగా చేయాలి.జీరా,మెంతులు వేయించి పొడి చేయాలి.పచ్చిమిర్చి నిలువుగా చీల్చాలి.ఇవన్నీ కలిపి మూడురోజులు రోజూ కలుపుతూ ఉంటే పాడవకుండా ఉంటుంది.పచ్చి మిర్చి కి పులుపు పట్టి రుచిగా ఉంటుంది.ఉసిరి ముక్కలకు కారం పట్టి ముక్క బాగుంటుంది.ఇష్టమైన వాళ్ళు కొంచెం నూనె కలుపుకోవచ్చు.

భూమ్మీద నూకలుండి బ్రతకటం

                             యశోధర్ గారు పెద్ద పేరుమోసిన వైద్యుడు.డెబ్బై సవత్సరాల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటారు.ఆయన హస్తవాసి అంటే ఉన్న నమ్మకంతో ఇప్పటికీ ఆయన ఆసుపత్రి కిటకిటలాడి పోతుంటుంది.ఒకరోజు స్నేహితుడిని పరామర్శించటానికి వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న దారి నుండి వస్తున్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.ముందు మాములుదే అనుకున్నాఅధిక చెమటలు పట్టేసరికి గుండె నొప్పి లక్షణాలని అర్ధం చేసుకుని
వెంటనే ఆసుపత్రికి ఫోనుచేసి వాహనాన్ని పంపమని కారులోనే పడుకున్నారు.ఇంతలో ఎవరో అటుగా వెళ్తుంటే సొమ్మసిల్లకుండా నీళ్ళు అడిగి త్రాగారు.అడపాదడపా తప్ప ఆదారిలో వాహనాలు కూడా రావు.వెంటనే ఫోను చేసినా రోగుల్ని తీసుకెళ్ళే వాహనం రావటానికి గంట పట్టింది.ఆసుపత్రికి వెళ్లేసరికి ఒక్క 5 ని.లు ఆలస్యమైతే వైద్యులు వెళ్ళి పోయేవాళ్ళు.వెంటనే పరీక్షలన్నీ చేసి అత్యవసరంగా గుండెకు వెళ్ళే రక్తనాళం మూసుకుపోయిందని ఆపరేషను చేయటంవల్ల బ్రతికారు.5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి తీవ్ర గుండెనొప్పి వచ్చింది.మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేయవలసి వచ్చింది.ఇంతకీ ఆయనకు ముందస్తుగా ఏ లక్షణాలు బయటపడలేదు.అదీ ఆయన వైద్యుడు కనుక తీవ్ర గుండేనొప్పి అని తెలుసుకోగలిగారు.సామాన్యులు అది తెలుసుకోలేరు కనుక చనిపోయేవాళ్ళు.ఆరోగ్యంగా ఉన్నా ప్రతి సంవత్సరం ఆరోగ్యపరీక్షలు చేయించుకోవటం తప్ప వేరే దారిలేదు.ఎంత వైద్యులైనా 5 ని.లు ఆలస్యమైనా  ప్రాణం పోయేది.ఆయనకు భూమ్మీద ఇంకా నూకలుండి సమయానికి వైద్యం అంది బ్రతకటం జరిగింది.      

Monday 15 December 2014

కేటుగాడు

                                       కిట్టు పెద్ద కేటుగాడు.అందర్నీ ఏదోరకంగా మోసంచేసి ఎలాగైతే రెండంతస్తుల ఇల్లు కట్టాడు.క్రింద అమ్మానాన్నా,మొదటిదానిలో కిట్టు,రెండవదానిలో కొడుకు ఉంటారు.కిట్టుని మించిన కేటుగాడు కొడుకు.అమ్మ,భార్యఏదైనా పని చేయమన్నప్పుడు పైన ఉన్నప్పుడు భార్య మాట విన్నట్లుగా భార్య చెప్పినదే వేదంలా చేస్తాడు.క్రిందికి వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట విన్నట్లుగా అమ్మ మాట జవ దాటని వాడిలాగా నటిస్తాడు.ఇద్దరి దగ్గర మంచివాడిననిపించుకోవటానికి ఎన్ని వేషాలు వెయ్యాలో అన్ని వేషాలు వేస్తాడు.చివరికి ఇద్దరి మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు.ఏదో ఒకసారైతే ఎవరైనా సర్దుకోగలరు కానీ ఎల్లప్పుడూ సర్దుకోలేరు కదా!అందుకే ఇద్దరూ కలిసి కిట్టుని కేటుగాడని అర్ధం  చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. 

Sunday 14 December 2014

మనుసు

                                    రాజ్యశ్రీ కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది.ఆఊరిలో కొన్నిపదాలు వేరేగా పలుకుతారు.
అది చలికాలం.అత్తగారింట్లో తెల్లవారుఝామునే అందరూ లేచే అలవాటు.అందరూ ఎవరిపనులు వాళ్ళు హడావిడిగా  చేసుకుంటుంటే తను నిద్రపోవటం బాగుండదని తప్పనిసరిగా లేచి వరండాలోకి వచ్చింది.ఇంతలో వాళ్ళ అత్తగారు కనిపించి ఆరుబయట బాగా మనుసు పడుతోంది కానీ ఇప్పటినుండి మనుసులో ఎందుకు తిరగటం?కాసేపు పడుకో అన్నారు.రాజ్యశ్రీకి మొదట మనుసు పడటమేమిటో అర్ధం కాలేదు.అడగటం బాగుండదు కదా!అందుకని ఆరుబయట మనుసు పడుతుంది అంటే మంచు కురుస్తోంది కాబోలు అని అర్ధం చేసుకుంది.తర్వాత భర్తనడిగి తన తన సందేహాన్ని నివృత్తి చేసుకుంది.

Saturday 13 December 2014

టన్ను బరువు

                                                మాన్య ఈమధ్యనే ఇల్లు కట్టుకుని క్రొత్త ఇంట్లోకి వచ్చింది.ఇంటినిండా ఎక్కడనుండి  వస్తున్నాయో కానీ ఎటు చూసినా అన్నీ నల్లచీమలే.ఏవస్తువు పెట్టినా నిమిషాల్లో చుట్టుముట్టేస్తున్నాయి.తీపి వస్తువులైతే సెకన్లలో వచ్చేస్తాయి.ఈచీమలేంటో విచిత్రంగా కాళ్ళు పైకి లేపి వేగంగా నడుస్తున్నాయి.మాన్య తులసి మొక్కకు పూజచేసి మిశ్రీబిళ్ళలు అంటే పటికబెల్లం చిప్స్ పెట్టడం అలవాటు.పెట్టినవి నిమిషాల్లో మాయమై పోతున్నాయి.ఖాళీ ప్లేటు ఉంటుంది.ఇది ఎలా సాధ్యం?అని ఒకరోజు అక్కడే కూర్చుంది.తన ముందే చీమల దండు లాగా వచ్చి4,5చీమలు కలిసి ఒక్కొక్క బిళ్ళను టన్ను బరువు లాగుతున్నట్లుగా వేగంగా లాక్కెళ్ళి ఒక్కొక్కదాన్ని నీళ్ళు వెళ్ళటానికి పెట్టిన రంద్రంలో భద్రపరిచినాయి.వాటిని చూస్తే మాన్యకు ముచ్చటేసింది.అంత చిన్న చీమలు అంతపెద్ద బిళ్ళను తమ శక్తికి మించి మోసుకెళ్ళి ముందుచూపుతో దాచుకున్నాయంటే మనం వాటిని చూచి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉందనిపించింది.రూపాయి ఉంటే ఏదో ఒకటి అవసరం లేకపోయినా అనవసరంగా కొని ఖర్చుపెట్టేస్తాం.వాటిలాగా పూర్తిగా కాకపోయినా కొంతైనా పొదుపుగా దాచుకుంటే భవిష్యత్తులో కొన్ని మంచిపనులు చేయటానికి ఉపయోగపడతాయని అనిపించింది..  

కొర్ర కిచిడీ

కొర్ర బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1/2 కప్పు
కందిపప్పు లేదా ఎర్రపప్పు - 1/2 కప్పు
కారట్ ముక్కలు  - 1/2 కప్పు
తరిగిన బీన్స్-1/2 కప్పు
ఉల్లిపాయ - 1
మిర్చి - 2
పాలకూర - 1 కట్ట
పల్లీలు - 10 గ్రా.
ఉప్పు - తగినంత
ఆవాలు - 1 టీ స్పూను
జీరా - 1 టీ స్పూను
కరివేపాకు - కొంచెం నీళ్ళు - 6 కప్పులు (1:3)
                                                                కొర్రబియ్యం అరగంట నానబెట్టాలి.కారట్,బీన్స్,ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.పాలకూర తరగాలి.బాండీలో నూనె వేసి కాగిన తర్వాతపల్లీలు,ఆవాలు,జీరా,కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.ఆతర్వాత కారట్,బీన్స్ వేసికోమ్చెం మగ్గిన తర్వాత పాలకూర వేయాలి.1ని.తర్వాత 6కప్పుల నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి కడిగి నానబెట్టిన కొర్రబియ్యం,పప్పులువేసి ఉడికించాలి.ఇగిరిన తర్వాత దించేయాలి.టొమాటో రసంతో తింటే రుచిగా ఉంటుంది. 

Friday 12 December 2014

బుడతడు

                                        తాన్య కొడుకు మూడు సంవత్సరాల బుడతడు.వాడికి ఎన్ని తెలివితేటలో.అన్ని పనులు ఒక పుట్టలో పెడితే వెయ్యి పుట్టల్లోకి వచ్చేట్లుగా చేస్తుంటాడు.వయసుని మించి మాట్లాడుతుంటాడు.ఇటీవలే వాడికి ఒక చెల్లి పుట్టింది.వాడికి ఒక్కడికే చెల్లి ఉన్నట్లు ఎవరినీ దగ్గరికి రానీయడు.ఈ ఇద్దరితో సతమతమైపోతూ తన గురించితాను పట్టించుకోవటానికి కుదరటం లేదని  తాన్య పార్లర్ నుండి ఇంటికి ఒకమనిషిని పిలిపించుకుంది.ఏపని చేసినా ఎందుకు?ఏమిటి ?అంటూ యక్ష ప్రశ్నలు వేస్తుంటాడు.అలాగే అడుగుతుంటే ఫేస్ పాక్ వేయించుకోవటానికి ఒకామెను రమ్మన్నానని చెప్పింది.ఆమె ఒక 1/2 గం.కు వచ్చింది.ఆమె ఎవరూ ?ఏంటి?అని చెప్పకుండానే అమ్మా!పేస్ ప్యాక్ ఆంటీ వచ్చిందోచ్ అంటూ కేకలు పెట్టి వచ్చేవరకు ఊపిరాడనివ్వలేదు.బుడతడికి ఫేస్ పాక్ అంటే  అర్ధం తెలిసినట్లుగా హడావిడి చేశాడు వాడికి ఫలానా అని చెప్పక్కర లేదు తెలివి గలవాడు అని వాడి నానమ్మ తెగ సంబరపడుతుంది.















/?   

Thursday 11 December 2014

జొన్న సూప్

                            శీతాకాలంలో సాయంత్రం వేడివేడిగా సూప్ తయారుచేసుకుని త్రాగితే బాగుంటుంది.దీనిలో మిరియాలపొడి వేస్తాం కనుక చలిలో కఫం పేరుకోకుండా  ఉంటుంది.ఎప్పుడూ ఒకేరకం ప్రయత్నించే కన్నా
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకుంటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందుతాయి.సరే,జొన్న సూప్ కి ఏమేమి కావాలో,ఎలా తయారు చేయాలో చూద్దామా?
                         జొన్నపిండి - 100 గ్రా.
                         పాలకూర - 1 కట్ట
                        బాదం పప్పు-  10 గ్రా.
                       పెసర పప్పు - 20 గ్రా.
                        మిరియాలపొడి - తగినంత
                         ఉప్పు - తగినంత
                         నీళ్ళు - 3/4 లీ.
                                                      పాలకూరను ఉడికించి మిక్సీలో వేసుకోవాలి.బాదం,పెసరపప్పు పొడి చేయాలి.ఒక గిన్నెలో పాలకూర రసం.బాదం,పెసరపొడులను జొన్నపిండి,తగినంత నీళ్ళు పోసి కలిపి మరిగించాలి.
3 పొంగులు రానిచ్చి ఉప్పు,మిరియాల పొడి వేసి బౌల్ లోకి తీసుకోవాలి.పైన కొంచెం కొత్తిమీర అలంకరించి సర్వ్ చెయ్యాలి. అంతే జొన్న సూప్ రెడీ.ఇది చాల రుచికర మైనది,బలవర్ధక మైనది.

పేలగాయి

                                         షమ్మీ కి 14 సంవత్సరాలు.స్కూలులో స్నేహితులతో మాట్లాడినట్లుగానే ఇంట్లో కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.ఏదైనా ఇంట్లో వాళ్ళు అడిగినా తురుతుగా సమాధానం చెప్తుంది.అక్కను కూడా చెలకొట్టనివ్వటంలేదు.ఎవ్వరినైనా పెద్దంతరం,చిన్నంతరం లేకుండా మాట్లాడేస్తుంది.ఏంటి?ఆరకంగా ఏదంటే అది   మాట్లాడుతున్నావు పేలగాయి పిల్ల మాదిరిగా అని వాళ్ళఅమ్మ అంటే హైపర్ టెన్షన్ అమ్మా!అర్ధం చేసుకో అంటుంది.
ఆమాటకు అర్ధమే సరిగ్గా తెలియదు కానీ ఏంటో ఈకాలం పిల్లలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకుంది.

నైలాన్ పూల్

                                      కరేబియన్ దీవుల్లో టొబాగో అనే దీవి ఒకటి.దీవి అంటేనే చుట్టూ నీళ్ళు ఉండి  మధ్యలో
భూమి ఉంటుంది.టొబాగో చాలా అందమైన దీవి.చూడటానికి వచ్చే పోయే యాత్రికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.దీవి అందాలను తిలకించడానికి యాత్రికులు క్రూజ్ లో వెళ్తుంటారు.సకల సౌకర్యాలతో విలాసవంతమైన   క్రూజ్ లో దీవి అందాలను తిలకించడం మర్చిపోలేని అనుభూతి.దీవి చుట్టూ ఉండే సముద్రంలో నైలాన్ పూల్ ఉంది. దీన్ని చూడటానికి ప్రత్యేకంగా వెళ్తుంటారు.నడి సముద్రంలో నైలాన్ పూల్  ఒక మీటరున్నర లోతు ఉంటుంది.చుట్టూ నీలంరంగు సముద్రపు నీరు ఉంటే ఇక్కడ మాత్రం నీళ్ళు నలుపుగా ఉంటాయి.ఇక్కడ వేడిగాలులు వీస్తుంటాయి.ఈ వేడి గాలులకు చూడటానికి వెళ్ళిన వాళ్ళుకూడా నల్లబడతారు.కర్రపట్టుకుని నడిచేవాళ్ళు కూడా దూకేసి ఈనీళ్ళల్లో ఈదుతుంటారు.ఇంకొక విచిత్రమేమిటంటే ఇక్కడి ఇసుకను శరీరానికి బుగ్గలకు రాసుకుంటే భార్యాభర్తలైతే కలకాలం ప్రేమగా కలిసిమెలిసి ఉంటారని,ప్రేమికులైతే పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారని స్థానికుల నమ్మకం. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళుతప్పనిసరిగా ఈ ఇసుకను ఒంటికి రాసుకుంటారు. 

Wednesday 10 December 2014

పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని ....

                                                           సౌరబ్ పొలాలు కొనుక్కోవటానికి వెళ్తూ చూడటానికి తమ్ముడిని కూడా రమ్మన్నాడు.తమ్ముడు ఇంకో ఇద్దరు తన శ్రేయోభిలాషులను వెంట తీసుకొచ్చాడు.సౌరబ్ భార్య పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్లుగా వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్తున్నారేమిటి?అంది.సౌరబ్ అదే సందేహాన్నివ్యక్తపరిస్తే సౌరబ్ తమ్ముడు వాళ్ళు చాలా మంచివాళ్ళు.మన మంచికోరతారు అని చెప్పాడు.సరే చూద్దామని వీళ్ళుకూడా ఏమీ మాట్లాడలేదు.పొలం చాలా బాగుందని నలుగురూ అనుకున్నారు.పొలం అతను మానాన్నగారిని కూడా పిలిపించి రేపు మాట్లడుకుందామని చెప్పాడు.ఆతర్వాతరోజు సౌరబ్ పొలం అతన్ని సంప్రదిస్తే మీతోవచ్చిన ఇద్దరూ ఈరోజు ఉదయమే వచ్చారని చెప్పాడు.మావాళ్ళేఅని సౌరబ్ చెప్పాడు కానీ బేరం చెడగొట్టడానికివెళ్ళారని ఊహించలేదు.మా నాన్న ఊరు నుండి రాలేదు మీకు ఏవిషయం రెండు రోజుల తర్వాత చెప్తానని చెప్పాడు.నిజమే కాబోలని రెండు రోజుల తర్వాత అడిగితే ఇంకా ఎక్కువ రేటు వస్తుందని ఇప్పుడు అమ్మొద్దని అనుకుంటున్నామని చెప్పాడు.ఇంతకీ విషయమేమిటంటే తమ్ముడి శ్రేయోభిలాషులు వెళ్ళికొన్నిరోజుల తర్వాతైతే నీకు ఇంకా రేటు ఎక్కువ వస్తుంది అనీ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పారని తెలిసింది.తమ్ముడికి నీతోపాటు తీసుకొచ్చిన వాళ్ళు బేరం చెడగొట్టారని చెప్పగానే నమ్మలేదు.వాళ్ళు అలా చేయరు అని సర్దిచెప్పి వెంటనే వాళ్ళను మీరెందుకు అక్కడకు వెళ్ళారని 100 కి.మీ ప్రయాణించి అక్కడకు వెళ్ళాల్సిన అవసరమేమిటి?అని అడిగితే నట్లు కొట్టి సరిగా సమాధానం చెప్పకుండా దాటేశారు.తమ్ముడికి అర్ధమైనా అర్ధంకానట్లునటించి మొదట ఒప్పుకోకపోయినా మీరు చెప్పినది   నిజమేనని ఒప్పుకోక తప్పలేదు. 

అనుకరణ - హితవు

                                       రామసుందర్,సోమసుందర్ అన్నదమ్ములు.రామసుందర్ అన్నయ్య సోమసుందర్.
రామసుందర్ కి స్వార్ధం పాళ్ళు ఎక్కువ.ప్రతిచిన్న విషయానికి అన్నను అనుసరిస్తూ ఉంటాడు.ఎందుకంటే అన్న
కన్నా తను,తన కుటుంబమే పైచేయిగా ఉండాలని దుర్భుద్ధితో ఆవిధంగా చేస్తుంటాడు.అన్న పిల్లలు ఏమి చదివితే తన పిల్లలు కూడా అదే చదవాలనుకుంటాడు.అంతే తప్ప తనకంటూ ఒక ప్రణాళిక ఉండదు.తన పిల్లలు అసలు చదవగలరా?లేదా?అనే ఆలోచన ఉండదు.గుడ్డిగా అనుసరిస్తాడు.చదవటమో,ఊరుకోవటమో అన్నది తర్వాత విషయం.సోమసుందర్ ఇలాటి విషయాలేమీ పట్టించుకోడు.తనపని ఏదో తను చేసుకోవటం తప్ప.వీళ్ళింట్లో ఏ నగ,వస్తువు కొంటే అది తర్వాతి రోజు వాళ్ళింట్లో ఉండాల్సిందే.ఎవరైనా మనల్ని అనుసరిస్తున్నారంటే సంతోషమే కానీ ప్రతి చిన్న విషయానికీ అనుకరించటమంటే మహా చెడ్డ చిరాకు.అన్నను అనుకరిస్తున్నట్లు తెలియకుండా తనే క్రొత్తగా చేసినట్లుగా వెధవ బిల్డప్పులు ఇస్తుంటాడు.ఇలా ప్రతిదీ కాపీ కొట్టడంతో సోమసుందరానికి విసుగుతో కూడిన  కోపమొచ్చింది.ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం లేకుండా ప్రయోజనం లేకుండా పోయింది.ఈవిధంగా కార్బన్ పేపరులాగా కాపీ కొట్టడం మంచి పద్ధతి కాదు.స్వతంత్రంగా ఏపనైనా  నీకు చేతనైనట్లుగా చేసుకోవటం నేర్చుకో  నన్ను,మరెవరినైనా  అనుకరించటం మానుకోమని హితవు చెప్పాడు.  
  

Tuesday 9 December 2014

స్వోత్కర్ష

                                              భువనేశ్వరికి అత్తింట్లో అందరూ తమగురించి తాము గొప్పగా చెప్పుకుంటూ ఎదుటి వారిని మీకేమీ తెలియదు మాకు అన్నీ తెలుసు.మేము ఏపనైనా చేయగలము ఆమంత్రి తెలుసు ఈ మంత్రి మేము ఎంత చెబితే అంత అంటూ చెప్పింది చెప్పకుండా స్వోత్కర్ష చెప్తూనే ఉంటారు.పిల్లాడి మొదలు పెద్దవాళ్ళ వరకూ అదే పని.ఇంతకు ముందు కన్నవారింటి వైపు ఆవిధంగా చెప్పేవాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు.ఇప్పుడు కొత్తగా ఒకాయన మొదలు పెట్టాడు.మీకేమీ మాట్లాడటము చేతకాదు.నేనొక్కడినే మీఅందరికన్నా తెలివిగలవాడిని అంటూ   ప్రగల్భాలు మొదలు పెట్టాడు.ఇంతకు ముందు ఒకవైపే అనుకుంటే ఇప్పుడు రెండోవైపు కూడా స్వోత్కర్ష(సెల్ఫ్ డబ్బా)మొదలెట్టారు అని భువనేశ్వరి తల పట్టుకుంటుంది.ఇంతకీ అక్కడ పనులయ్యేది ఏమీ ఉండదు గొప్పలు చెప్పుకోవటం తప్ప.చాటుకు వెళ్ళి అమ్మపుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు వీడి గొప్పలు వీడూ అని నవ్వుకోవటము మినహా ఉపయోగం ఉండదు.                      

గోరింటాకు ఎర్రగా పండాలంటే.....

                                                   గోరింటాకు పెట్టుకునే ముందు చేతికి జామాయిల్ అంటే యూకలిప్టస్ ఆయిల్ రాసుకుంటే ఎర్రగా పండుతుంది.ఒకవేళ ఇది లేకపోతే పెట్టుకున్న తర్వాత నిమ్మరసం,పంచదార కలిపి ఆరగా ఆరగా అద్దితే ఎర్రగా పండుతుంది.

నీకన్నా మీచెల్లెలే బాగుంది

                               లూసీ,జూలీ అక్క చెల్లెళ్ళు.హైస్కూలులో చదువుకుంటున్నారు.ఒకరోజు ఖాళీ సమయంలో లూసీ,స్నేహితురాలు రోజీ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.అప్పుడు రోజీ నీకన్నా మీచెల్లెలే బాగుంటుంది అనేసింది.స్నేహితురాలు దగ్గర ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చి నానమ్మ దగ్గరకు వెళ్ళి నానమ్మా!నేను బాగున్నానా?లేదా?చెప్పు రోజీ నీకన్నానీచేల్లెలే బాగుంది అంటుంది.అదే బాగుందా?నిజంగా చెప్పు అని అడిగింది.
ఇద్దరు బాగానే ఉన్నారంటే వినదు.ఇంతలో చెల్లి వచ్చింది.నువ్వుచేప్పవే మనిద్దరిలో ఎవరు బాగున్నారో?అంది .
ఏమో నాకు తెలియదు అని నానమ్మానువ్వే చెప్పు అని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చెరొకచెవి దగ్గర చేరి జోరీగల్లాగా
రొద మొదలెట్టారు.చివరకు నానమ్మకు విసుగొచ్చి అందానికి కొలబద్ద ఉండదు.ఎవరి అందం వారిది.ఒకరితో ఒకరు
పోల్చుకోవాల్సిన అవసరం లేదు.ఇద్దరూ బాగానే వున్నారు.ఇక ఈ సంభాషణ ఇంతటితో ఆపేయండి అని చెప్పింది.
స్నేహితురాలు ఏమైనా బాధ పడుతుందనే ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడిన మాట ఇంత గందరగోళం
సృష్టించింది.అందుకే మాట్లాడేముందే ఆలోచించి మాట్లాడాలి.మాటే కదా అనుకుంటే అదే ఒక్కొక్కసారి పెద్దపెద్ద గొడవలకు దారితీస్తుంది. 

తల వెంట్రుకలకు పోషణ

                                          పావుకప్పు ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేయటంవల్ల పొడిబారిన వెంట్రుకలకు పోషణ లభించి అందంగా కనిపిస్తుంది.  

Sunday 7 December 2014

మొటిమల మచ్చలు పోవాలంటే......

                                               ముఖం మీద మొటిమలు తగ్గి మచ్చలు ఉన్నప్పుడు చిక్కటి కొబ్బరిపాలు ఒక స్పూను,గులాబీనీళ్ళు ఒక స్పూను,నిమ్మరసం ఒక స్పూను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి.
ఇలా రోజుకొకసారి చేస్తే క్రమంగా తగ్గిపోతాయి. 

Saturday 6 December 2014

నానీ నోరుముయ్యి

                                         ఈశ్వరమ్మకు ఇద్దరు కొడుకులు.చిన్నకొడుక్కి ఇద్దరు పిల్లలు.పెద్దకొడుక్కి పెళ్ళయి పది సంవత్సరాలయినా పిల్లలు లేరు.కనిపించిన దేముడి కల్లా మొక్కారు.లేకలేక లోకాయ్ పుట్టినట్లు ఎట్టకేలకు ఒక కొడుకు పుట్టాడు.వాడిని  అతి గారాబంతో పెంచటంవల్ల వాడు మొండిగా తయారయ్యాడు.ఇంతలో ఇంకొక పిల్లవాడు పుట్టాడు.రామలక్ష్మణుల లాగా ఇద్దరు పుట్టారు అని సంబరపడ్డారు.పెద్దాడి మొండితనానికి విసుగొచ్చి చిన్న వాడిని మాములుగా పెంచారు.పెద్దవాడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు.ఎవరినీ లెక్క చేయడు.చిన్నవాడిని కూడా కొడుతూ ఉంటాడు.ఉదయాన్నే స్కూలుకు వెళ్ళాలంటే పెద్ద హడావిడి.చుట్టుప్రక్కల అందరికీ వాళ్ళ అల్లరి అలవాటయిపోయింది .అల్లరి చెయ్యకండిరా అని నాయనమ్మ చెబితే "నానీ నువ్వు నోరుముయ్యి" అంటూ ఉంటాడు.ఏమి చేస్తాము?అతి గారాబం వల్ల ఏదోఒకటి అంటూ ఉంటాడు.అందుకని నోరు మూసుకుని ఒక మూల కూర్చుంటాను అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది.

Friday 5 December 2014

పాదాలు నొప్పులు,అలసట తగ్గటానికి .........

                          మనం రోజంతా హడావిడిగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటాము.మనశరీరం బరువు
మొత్తం కాళ్ళతోపాటు పాదాలపై పడుతుంటుంది.కనుక కాళ్ళ నొప్పులతో పాటు,పాదాల నొప్పులు వస్తుంటాయి.
అందుకని మనకు వీలయినప్పుడు ఏదోఒక సమయంలో పాదాలకు విశ్రాంతినిచ్చికుర్చీలో కూర్చుని రెండు చిన్న
ప్లాస్టిక్ టబ్ లేదా బకెట్ లు తీసుకోవాలి.పాదాలు మునిగేలాగా ఒకదానిలో గోరువెచ్చనినీళ్ళు,ఒకదానిలోమామూలు నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో చారెడు ఉప్పు వేసి పాదాలు మునిగేలా పెట్టాలి.ఒక 5 ని.ల తర్వాత తీసేసి మాములు నీళ్ళల్లో ఒక 5 ని.లు పెట్టాలి.ఇలా మార్చిమార్చి రెండుసార్లు చేయాలి.ఇలాచేస్తే పాదాలకు అలసట లేకుండా,నొప్పులు తగ్గిపోతాయి.పాదాలనొప్పులు వచ్చిన తర్వాత ఇబ్బందిపడేకన్నారాకముందు నుండే ఇలా చేస్తుంటే పాదాలనొప్పులు రాకుండా ఉంటాయి.దీనిలో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. పది ని.లు ఉప్పునీళ్ళల్లో నానటంవల్ల పాదాలు పైన,అడుగున కూడా శుభ్రపడి పగుళ్ళు రాకుండా ఉంటాయి.        

మహర్దశ

సువర్ణాభరణాలను ధరిస్తే ఆయుర్వృద్ధి.
చక్కటి దుస్తులు ధరిస్తే తేజస్సు.
ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం.
ఎప్పుడూ ఆనందంగా ఉంటే లక్ష్మీప్రదం.
పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం.
ఒకరికి సహాయపడితే క్షేమం.
తృప్తి ఉంటే నిత్య యవ్వనం.
నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం.
మధురంగా మాట్లాడితే మంగళకరం.
మితంగా భుజిస్తే చక్కని రూపం.
                     ఇవన్నీ పాటిస్తే మహర్దశ మన సొంతం.

ఫ్లాస్కు తేలికగా శుభ్రంచేయాలంటే .....

                        ఉప్పుకలిపిన గోరువెచ్చటి నీటితో కడిగితే బాగా శుభ్రపడుతుంది.ఫ్లాస్కు తడిలేకుండా ఆరబెట్టి మూతపెట్టినా కూడా  అదొక రకమైన వాసన వస్తుంటుంది.అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా పంచదార వేసి మూతపెడితే వాసన రాకుండా ఉంటుంది.

చేతికి గాజులు వేసేటప్పుడు,తీసేటప్పుడు ......

                                చేతికి గాజులు వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే చేతికి కొంచెం సబ్బు లేదా  క్రీమ్ రాసి వేసుకుంటే తేలికగా వేసుకోవచ్చు.చేతి గాజులు తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఒక క్యారీ బాగ్ చేతికి తొడిగి లేదా పౌడరు రాసి ఆతర్వాత గాజులు నెమ్మదిగా తీస్తే సులువుగా వస్తాయి.

ముత్యాల నగలు - జాగ్రత్తలు

                                 ముత్యాల నగలు అంటే స్త్రీలందరికీ ఎంతో ఇష్టం.వీటిని భద్రపరిచేటప్పుడు,ధరించినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రంగు మారే ప్రమాదముంది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ముత్యాలతో చేసిన నగలను ధరించిన తర్వాత వాటిని పొడివస్త్రంతో తుడిచి పలుచని వస్త్రంలో చుట్టి పొందికగా భద్రపరచాలి. ముత్యాల నగలను గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టకూడదు.సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉంచాలి.అధిక చెమట కూడా ముత్యాల మెరుపుని తగ్గిస్తుంది.అందుకని మరీ ఎండలో వీటిని ధరించక పోవడమే మంచిది.తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎల్లకాలం మన్నికగా ఉంటాయి.

Thursday 4 December 2014

బిస్కట్లు,కేకులు ఓవెన్ లో చెయ్యాలంటే.........

                             బిస్కట్లు,కేకులు ఓవెన్లో చేసుకుంటే ఉష్ణోగ్రత సరిపడా ముందే పెట్టుకుంటాము కనుక తేలికగా ఉంటుంది. మైక్రో ఓవెన్ కన్వెన్షన్ మోడ్ అయితే వండుకోవటానికి,బిస్కట్లు,కేకులు తయారు చేసుకోవచ్చు.మైక్రో ఓవెన్ సోలో అయితే వండుకోవటానికి,వేడిచేసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది.గ్రిల్ అయితే బిస్కట్లు,కేకులకు, గ్రిల్డ్ రకాలకు పనిచేస్తుంది.  

చెక్కవస్తువులను శు భ్రం చేయాలంటే .......

                                       చెక్క బొమ్మలను,గోడలకు వేలాడదీసే చెక్క తైలవర్ణ చిత్రాలు,చెక్క వస్తువులు వేటినైనా శుభ్రం చేయాలంటే వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడిస్తే మరకలు మాయమై,దుమ్ము,ధూళి లేకుండా చక్కగా మెరుస్తుంటాయి.

సిద్దాంతుల పిచ్చి

                                    సమర్ ఎక్కడ కొత్త సిద్ధాంతి ఉన్నాడంటే అక్కడ ప్రత్యక్షమైపోతాడు.కనిపించిన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించానని ఆపని చెయ్యమన్నారు,ఈపని చెయ్యవద్దన్నారని చెప్తుంటాడు.వాళ్ళు ఎంత డబ్బుఇవ్వమంటే అంత డబ్బు ఇచ్చేస్తుంటాడు.వాళ్ళ చుట్టూ తిరిగి డబ్బు వృధాచేస్తుంటాడు.అరిచి గీపెట్టినా ఎంత 
అవసరమైనా ఎవరికీ పైసా కూడా ఇవ్వడు.అటువంటిది ఎవరైనా ఎందుకు వాళ్ళ చుట్టూ తిరగటం? అని అంటే తనకి వాళ్ళ కబుర్లు వినటం సరదా అని,కాసేపు కాలక్షేపమని చెప్తుంటాడు.మనిషికొక పిచ్చి. 

పెత్తనం

                                                యశోవర్ధన్ అందరిమీద పెత్తనం చలాయిద్దామనుకుంటాడు.అందరూ నామాటే
వినాలనుకునే మనస్తత్వం.తన తప్పున్నా కూడా ఎదుటివాళ్ళదే  తప్పని వాదిస్తుంటాడు.తన విషయాలన్నీభార్యకి మాత్రమే చెప్పి మిగతావాళ్ళ దగ్గర రహస్యంగా ఉంచుతాడు.ఎదుటివాళ్ళ విషయాలన్నీ కూపీ లాగుతున్నట్లుగా
ఆరాలు అడుగుతాడు.ఇంతకీ చిత్రాతిచిత్రమైన విషయమేమిటంటే ఇతను అందరి మీద పెత్తనం చేద్దామనుకుంటే
ఇతనిమీద  అతని భార్య పెత్తనం చేస్తుంటుంది.భార్య నంది అంటే నంది అనాల్సిందే.లేకపోతే ప్రళయం సృష్టిస్తుంది.

చేతులు,పాదాలు పొడిబారితే ........

                                 చలికాలంలో చేతులు,పాదాలు పొడిబారి తెల్లగా అవుతుంటాయి.అలా పొడిబారకుండా
ఉండాలంటే తేనె,ఏదైనా అందుబాటులో ఉన్న నూనె,నిమ్మరసం ఒక్కొక్క స్పూను చొప్పున తీసుకుని అన్నీబాగా
కలిపి చేతులకు,పాదాలకు,మోచేతులకు,మొకాలినుండి పాదాలవరకు రాసి పది ని.ల తర్వాత కడిగేస్తే పొడిబారి
చర్మం పొట్టు లేవకుండా,పగలకుండా ఉంటుంది. 

Wednesday 3 December 2014

ముఖంపై ఉన్న ముడతలు మాయమవ్వాలంటే........

                     అరస్పూను నిమ్మరసం,కోడిగ్రుడ్డు తెల్లసొన కొంచెం,బరకగా చేసిన బాదంపొడి కొంచెం అన్నీకలిపి
ముఖానికి పాక్ వేయాలి.ఇరవై ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి.
గమనిక:తెల్లసొన కలిపినప్పుడు చల్లటి నీటితో కడగకూడదు.వాసన వస్తుంది.అందుకని తప్పనిసరిగా గోరువెచ్చటి నీటితోనే కడగాలి.

మృదుత్వం కోల్పోయిన మోచేతులకు ......

                                                 మృదుత్వం కోల్పోయి మోచేతులు గరుకుగా ఉంటే నిమ్మచెక్కతో మోచేతులు రుద్దాలి.ఇలా రోజూ చేస్తూఉంటే క్రమంగా గరుకుదనంతో పాటు,నలుపుదనం పోయి మృదువుగా తయారయి చర్మం రంగులో కలిసిపోతుంది.

వారానికోసారి....

                                 అరకప్పు కొబ్బరిపాలలో ఒక పెద్ద నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి ఆరాక తలస్నానం చేయాలి.వారానికోసారి  ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
                                             వారానికోసారి ఉప్పులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పళ్ళు రుద్దితే పళ్ళు తెల్లగా మిలమిల మెరుస్తుంటాయి.

కార్పెట్ పై దుమ్ము వాసన పోవాలంటే ......

 కార్పెట్ పై దుమ్ము,ధూళి బాగా పేరుకుపోయి వాసన వస్తుంటే రాత్రిపూట సోడాఉప్పు కార్పెట్ పై చల్లి ఉదయం
వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే దుమ్ము వాసన పూర్తిగా పోతుంది.

వెనిగర్

                           వంటింటి సింక్ మనం ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత చెడ్డ వాసన వస్తుంటుంది.నాన్ వెజ్ అయితే మరీ వస్తుంది.ఉల్లిపాయలు,చేపలు,చికెన్,కోడిగ్రుడ్డు ఇలాంటివి వాడిన పాత్రలు కడిగినప్పుడు వంటింట్లో సింక్ అంతా అదోరకమైన చెడ్డ వాసన వస్తుంటుంది.ఇటువంటప్పుడు ఒక అరకప్పు వెనిగర్ ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి సింక్ దగ్గర పెడితే అది  చెడ్డ వాసనను పీల్చుకుంటుంది.

వంటిట్లో మంచి వాసన

    వంటిల్లు ఎంత శుభ్రం చేసినాఎంతో కొంత అదోరకమైన జిడ్డు వాసన వస్తుంటుంది.మంచి వాసనరావాలంటే ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళుపోసి కొద్దిగా దాల్చినచెక్క,ఎండిన నారింజ తొక్క కానీ కమలాతొక్క కానీ వేసి  నీళ్ళు మరిగిస్తే ఆవాసన వంటిల్లంతా వ్యాపించి వంటింట్లో ఉన్న జిడ్డువాసన,మరే ఇతర వాసనలున్నా పీల్చుకుంటుంది.అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వంటింట్లో అడుగుపెట్టగానే సువాసన వస్తుంటుంది. 

Tuesday 2 December 2014

ఏమో అక్కా

                                            రూపాలీ ఇంట్లో చిన్నాచితక పనులు చేయటానికి ఒక కుర్రాడు ఉంటాడు.ఒక అరగంట ఏదైనా పని చేస్తే 2 గం.లు మళ్ళీ కనిపించడు.అత్యవసరమై ఏదైనా చెయ్యాలన్నా పిలిచినా ఉలకడు పలకడు.పోనీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అని అడిగితే సమాధానం చెప్పడు.ఒకరోజు రూపాలీ కూతురు ఇంద్రనీల పుస్తకము అవసరమై కొట్టు నుండి తెప్పించుకుందామంటే 2 గంటలైనా ఇంటికి రాలేదు ఇంద్రనీలది ఉడుకు రక్తం కదా వాడికోసం 2 గంటలు ఎదురుచూచి విసుగొచ్చి వాడు రాగానే అరవటం మొదలుపెట్టింది.ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?అంటే సమాధానం చెప్పలేదు.ఆపిల్లకు పిచ్చి కోపమొచ్చి నేను ఇక్కడెందుకు కూర్చున్నాననుకున్నావు ?
పిచ్చెక్కి కూర్చున్నాననుకున్నావా?అనేసరికి ఏమో అక్కా !నాకు తెలియదు అన్నాడు?ఇంద్ర నీల తెల్లబోయి అంటే  పిచ్చెక్కిందేమో అనేకదా అర్ధం.మరీ ఆటగా ఉంది నీకు అనేసరికి సిగ్గుపడి ఒక్కసారి పెద్దగా నవ్వేశాడు.అంతకన్నా   చేసేదేముంది వాడితోపాటు అందరూ నవ్వేశారు.










భారతీయ చీరకట్టు

                  భారతీయ సంప్రదాయమైన చీరకట్టు అంటే వీదేశాలలో ఉన్న ఆడవాళ్లకు కూడా ఎంతో ఇష్టం.దేదీప్య
విదేశాలకు వెళ్ళిన మొదట్లో దీపావళి పండుగ వచ్చింది.వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎక్కువమంది తెలుగువాళ్ళు లేరు.
దీపావళి రోజు సాయంత్రమయ్యేసరికి స్త్రీలందరూ చీర కట్టుకోవటం అంతగా రాకపోయినా అందరూ చీరలు కట్టుకుని ఒకచోట సమావేశమయ్యారు.ఒకపెద్దావిడ చీర చుట్టుకున్నట్లుగా కట్టుకుంది.దేదీప్య కనిపించేసరికి చీర బాగా కట్టుకున్నానా?అని అడిగింది.నువ్వు చీర కట్టుకున్న విధానం బాగుంది.నాకు కూడా నేర్పించమని అడిగింది.సరేనని నేర్పించింది.మాకూ భారతీయ సంప్రదాయాలంటే చాలా ఇష్టం.గణేష్ ని కూడా ఇంట్లో పెట్టుకుంటాము.దీపావళికి తప్పనిసరిగా అందరమూ చీరలు కట్టుకుంటాము.మీ స్వ్వీట్లంటే  మాకు చాలా ఇష్టం అని చెప్పింది.ఈ విషయం
విన్న దేదీప్యకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగింది.            

Monday 1 December 2014

వేపకాయంత వెర్రి

                               వనజాక్షికి వేపకాయంత వెర్రి ఉంది.వాళ్ళింట్లో పనిచేసే వాళ్ళను ఇంకెక్కడా పని చేయనివ్వదు.
వేరే పనివాళ్ళతో మాట్లాడనివ్వదు.పోనీ తగినంత జీతం ఇస్తుందా అంటే ఇవ్వదు.వేరేవాళ్ళ ఇంట్లో పనిచేస్తే నీకు నీరసం వస్తుంది.మాఇంట్లో పనిచేసే శక్తి ఉండదు అందుకని ఎక్కడా పని చేయవద్దు అని వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మాట్లాడుతుంది.ఆమె మనుమరాలికి కూడా కొడుకు పుట్టి జేజమ్మ అయినా ఎవరైనా పిన్ని, ఆంటీ,అమ్మమ్మ అని అన్నారంటే వాళ్ళ పని అయిపోయినట్లే.పెద్ద తగువు పెట్టుకుంటుంది.నన్ను ఆంటీ,అమ్మమ్మ అనటమేమిటి? పిల్లలైనా వనజాక్షీ అని పేరు పెట్టి పిలవాలి కానీ అని పెద్ద నోరు పెట్టుకుని అరుస్తుంటుంది. ఆమె నోటికి దడిచి ఎవరూ ఆమె జోలికి వెళ్లరు.ఆమె అంతట ఆమె మాట్లాడితేనే ఆచితూచి మాట్లాడతారు. 

కేక్ తయారీలో ......

     కేక్ తయారు చేసేటప్పుడు విధిగా పాటించవలసిన చిట్కా ఏమిటంటే మైదా వేయకముందు బాగా బీట్ చేయాలి కానీ మైదా వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదు.మైదా పూర్తిగా కలిసేంతవరకు మాత్రమే కలపాలి.తెలియక మైదా వేసిన తర్వాత కూడా బాగా బీట్ చేస్తుంటాము.అలా చేయటం వలన కేక్ గట్టిగా వస్తుంది.బటర్ కూడా క్రీమీగా  ఉండాలి కానీ ఆయిలీగా ఉండ కూడదు.కేక్ మెత్తగా స్పాంజి లాగా రావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.                    

Sunday 30 November 2014

కనుబొమలు ఒత్తుగా రావాలంటే ......

                          ఆముదము (కాస్టర్ ఆయిల్ ) రాత్రిపూట  అప్లై చేస్తే కనుబొమలు ఒత్తుగా వస్తాయి .

ప్రచారకర్త

                            పంకజం అందరికన్నా తనకే ఎక్కువ భక్తి ఉందని దైవం గురించి తనకే ఎక్కువ తెలుసని పోజులు కొడుతుంది.ఎక్కడ పారాయణాలు ఉంటే అక్కడికి వెళ్ళి పారాయణ చేసి వస్తుంటుంది.అంతవరకు బానే ఉంది కానీ
అక్కడకు వెళ్ళి వాళ్ళగురించి వీళ్ళకు,వీళ్ళ గురించి వాళ్ళకు చాడీలు చెప్పడమే ఎక్కువ చేస్తుంటుంది.దైవం గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే పారాయణ చేసినందుకు కాలంతోపాటు పుస్తకసారాన్నిసద్వినియోగం             చేసుకున్నట్లవుతుంది.అంతేకానీ సమయాన్ని వృధా చేసుకోవటమే కాక,దైవాన్ని దిక్కరించి ఏపని చేయకూడదని పుస్తకాలలో చెప్తున్నారో అదేపని చేసి చాడీల ప్రచారకర్త లాగాతెలిసి కొన్ని,తెలియక కొన్నిఊహించుకుని ప్రచారం చేస్తుంటుంది.               

వ్యంగ్యోక్తులు

                                                 ఈరోజుల్లో మంచిగా మాట్లాడే వాళ్ళకన్నా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.ఫలానా వాళ్ళు మాస్నేహితులని అందరి దగ్గర గొప్పలు పోతుంటారు.ఎదుటికి వచ్చేసరికి ఈర్ష్య,అసూయ
అనుకోవాలో మరేమని అనుకోవాలో తెలియదు కానీ ఏదో ఒకటి వ్యంగ్యంగా కుంటి మాటలు మాట్లాడుతుంటారు.
అలా మాట్లాడటం వాళ్ళకు తప్పుగా అనిపించదేమో కానీ ఎదుటివారికి ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనే
ఉండదు.కొంతమందికి ఏదిపడితే అది ఎదుటివాళ్ళను మాట్లాడి,తిరిగి వాళ్ళతో అనిపించుకోవటం అలవాటు.అది
 అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.అది అర్ధం చేసుకోకుండా ఎదుటివారి మనోభావాలను పట్టించుకోకుండా వ్యంగ్యోక్తులు విసురుతుంటారు.మనం మాట్లాడినా ఎదుటివాళ్ళ నుండి సమాధానం రావటం లేదంటే ఆసంభాషణ అంతటితో వదిలేయాలని అర్ధం.కొంతమంది అర్ధం అయినా కానట్లుగా నటించి వాళ్ళకు తెలిసిందే వేదంలా అది ఒప్పైనా,తప్పైనా నోటికొచ్చింది మాట్లాడేస్తారు.ఎదుటి వాళ్ళ మనసు బాధపడితే వీళ్ళు మనసులో సంతోషపడుతుంటారు.
   

చెంపలపై చిన్నచిన్న వెంట్రుకలు ఉంటే.......

                         హార్మోన్ల పనితీరులో తేడా వలన కానీ,మరే ఇతర కారాణాల వలన కానీ చెంపలపై చిన్నచిన్న వెంట్రుకలు వస్తూ ఉంటాయి.అటువంటప్పుడు వారానికి రెండుసార్లు శనగ పిండి -  1 స్పూను,పసుపు - 1/2 స్పూను,పెరుగు - 1 స్పూను కలిపి ముఖానికి పట్టించాలి.ఆరిపోయిన తర్వాత నిదానంగా చెంపలు పైవైపుకు రుద్దుతుంటే అవి దానితోపాటు వచ్చేస్తాయి.పై పెదవి,నుదురు కూడా అలాగే చేయాలి.ఈవిధంగా చేస్తూ ఉంటే
క్రమంగా ఉన్నవి పోయి ఇక రాకుండా ఉంటాయి.

పెదవులు పొడిబారకుండా

                                 ఎర్రగులాబీ రేకలను పాలతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి పెదవులకు అప్లై చేసి అరగంట ఉంచితే పెదవులు పొడిబారవు.కనీసం వారానికి రెండుసార్లైనా ఈవిధంగా చేయాలి.రోజూ చేస్తే నెలలో పెదవులు ఎర్రగా మామూలుగా అవుతాయి. 

ముఖం అంతా ఒకే రంగులో ఉండాలంటే ......

                     ముఖం మీద ఏ మచ్చలు లేకుండా ఒకే రంగులో ఉండాలంటే బంగాళదుంపను సగానికి కట్ చేసి దానితో ముఖం మీద మసాజ్ చేయాలి.బంగాళదుంప రసం కంటి క్రింది నలుపును కూడా తగ్గిస్తుంది.ఈవిధంగా వారానికి మూడుసార్లు చొప్పున 15 ని.లు చేయాలి.తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.వీలయినప్పుడల్లా కలబంద రసం ముఖానికి రాసి 20 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుగుతూ ఉంటే ముఖం మీద ఏ మచ్చలు లేకుండా చర్మం నున్నగా  నిగనిగలాడుతూ అందంగా మెరిసి పోతుంటుంది. 

పిగ్మెంటేషన్ పోవాలంటే ........

                            ముఖం మీద వచ్చే లేత బ్రౌన్ మచ్చలు పోవటానికి కలబంద రసం రాయాలి.ముదురు రంగు
మచ్చలు పోవాలంటే కలబంద రసంలో నిమ్మరసం కలిపి రాయాలి.15 ని.లు ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.రోజు రాస్తూ ఉంటే మచ్చ తొలగిపోయి క్రమంగా చర్మం రంగులో కలిసిపోతుంది.

ఓవెన్ లో అప్పడం కరకరలాడాలంటే .......

                                        అప్పడం నీళ్ళతో తడిపి 1 ని. ఒకవైపు,1 ని. మరోవైపు పెట్టాలి.ప్లేటులో నాలుగు అప్పడాలు పెట్టవచ్చు.అప్పటికప్పుడు కరకరలాడుతూ నూనె లేకుండా,మాడిపోకుండా బాగుంటాయి.

Saturday 29 November 2014

ఓవెన్ శుభ్రం చేసే విధానం

                           ఒక పెద్ద బొరోసిల్ బౌల్ లో సగానికి నీళ్ళుపోసి ఒక పెద్ద నిమ్మకాయ పిండి స్టీమ్ బటన్ ఉంటే నొక్కాలి.లేకపోతే 15 ని.లు స్టార్ట్ బటన్ నొక్కాలి.చల్లారి పోయిన తర్వాత మెత్తటి పొడిబట్టతో తుడవాలి.10 గం.లు
వాడకూడదు.అంటే రాత్రిపూట శుభ్రం చేసుకుంటే ఉదయం వాడుకోవచ్చు.రాత్రంతా ఓవెన్ తలుపు తెరిచి ఉంచాలి. ఓవెన్ లో మాంసాహారం ఎక్కువగా చేసుకునేవాళ్ళు 2,3 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి.  

ఏకచత్రాధిపత్యం

                                     శ్రీనాధుడు ఒక విచిత్రమైన వ్యక్తి.నేనే అందరికన్నా తెలివి కలవాడిని అందరూ శుంఠలు అని అతని అభిప్రాయం.అదే అభిప్రాయాన్నిఎదుటివాళ్ళ దగ్గర వ్యక్తపరుస్తుంటాడు.అందరూ వచ్చి తనను సలహాలు
అడిగి అవి పాటించటం వల్లే వృద్ధిలోకి వస్తున్నారని అందరి దగ్గర డబ్బాలు కొట్టుకుంటాడు.భార్య,పిల్లలు ఇతని మాట వినకపోయినా అది కప్పిపెట్టి అక్కచెల్లెళ్ళు.అన్నదమ్ములు,మేనమామ చివరకు అమ్మ,నాన్న కూడా తన మాటే వినాలని మొండి పట్టుదలకు పోతుంటాడు.నేనైతే మీ ఆస్తులు బాగా వృద్ధిలోకి తెచ్చేవాడిని మీకు చేతకాక అలాగే ఉన్నారు అంటాడు.అందరూ కష్టపడి సంపాదించి తనదగ్గర పెడితే తను కష్టపడకుండా కూర్చుని తిని అందరి ఆస్తులమీద పెత్తనం చలాయించుతూ ఏకచత్రాధిపత్యం వహించి ఆ డబ్బంతా తనదేఅని అది తన గొప్పతనమేనని అందరి దగ్గర పోకిళ్ళు పోతూ విర్రవీగొచ్చని కనిపిస్తే చాలు సతాయిస్తుంటాడు.ఇతని సతాయింపులు తట్టుకోలేక స్వంత అక్కచెల్లెళ్ళు కూడా వేరే దారిలో నుండి ఇతని కంట పడకుండా తప్పించుకుని వెళ్ళిపోతుంటారు. 

రాగి రొట్టె

రాగి పిండి - 1 కప్పు
ఉల్లి కాడ ముక్కలు - 4 టీ స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 4 టీ స్పూన్లు
పచ్చి మిర్చి  -2
కారట్ తురుము - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
నెయ్యి లేదా నూనె - రొట్టె కాల్చటానికి సరిపడా
                                           ఒకగిన్నెలో రాగిపిండి,వేసి ఉల్లి కాడల ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,కారట్ తురుము,పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పువేసి నీళ్ళుపోస్తూ చపాతీపిండిలాగా గట్టిగా కలపాలి.10 ని.లు నాననిచ్చి ఏదైనా పొడి పిండి  వేసి చపాతీలాగా చేసి నాన్ స్టిక్ పెనంపై రెండు వైపులా నెయ్యి కానీ,నూనె కానీ వేసి గోధుమ రంగు చుక్కలు వచ్చేవరకు కాల్చాలి.  

కొర్రబియ్యం దోశ

కొర్రబియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
శనగపప్పు - 2 టీ స్పూన్లు
మెంతులు - 1 టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - దోశకు సరిపడా
                     కొర్రబియ్యం 6 గం.లు నానబెట్టుకోవాలి.మినప్పప్పు,శనగపప్పు,మెంతులు 4 గం.లు నానబెట్టాలి.
మినప్పప్పు,శనగపప్పు,మెంతులు కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బిన తర్వాత కొర్రబియ్యం,ఉప్పు వేసి రుబ్బాలి.
అప్పటికప్పుడయినా దోస వేసుకోవచ్చులేదా ఒకపూట పులవనివ్వవచ్చు.ఈపిండి వారం రోజులైనా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటుంది.కొర్రపిండి అయినా 1కి 2 వేసుకోవాలి.
గమనిక :కొర్రబియ్యం ఏదోఒక రూపంలో తింటే బరువు తగ్గుతారు.

ఎండకు రంగు మారిన చర్మానికి చిట్కా

ఆపిల్ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ - 4 టేబుల్ స్పూన్లు
ఓట్స్ పొడి - 1 స్పూను
                   వేసవి కాలంలో ఎండకు ముఖం,చేతులు,మెడ పైన చర్మం రంగు మారుతుంటుంది.అటువంటప్పుడు ఆపిల్ చెక్కు తీసి మెత్తగా ఉడికించాలి.మెత్తటి పేస్ట్,రోజ్ వాటర్ కలిపి ముఖం పైన,చేతులు,మెడ ఎక్కడ రంగు మారితే అక్కడ రాయాలి.15-20 ని.లు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చర్మం మాములు రంగులోకి వస్తుంది.ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.

తలలో పేలు బెడద వదలాలంటే ..........

                                                    మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎప్పుడో ఒకసారైనా పిల్లలకు తలలో పేలు పడుతూ ఉంటాయి.అటువంటప్పుడు ఈ క్రింది విధంగా వారానికి ఒకసారి చొప్పున ఒక నెల రోజులు చేస్తే తలలో పడిన పేలు బెడద వదిలిపోతుంది.

                         వేప పొడి - 2 టేబుల్ స్పూన్లు
                         తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
                                  ఈ రెండింటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ళకు(స్కాల్ప్ కి)పట్టించాలి.40 ని.ల తర్వాత ముందు నీళ్ళతో కడిగేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయించాలి.








కాకరకాయ చిప్స్

కాకరకాయలు - 1/4 కే.జి
పుదీనా ఆకులు - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
నిమ్మకాయ - 1
మిరియాలపొడి - కొంచెం
                                         కాకరకాయల్ని కడిగి చక్రాల్లా తరగాలి.ఒకగిన్నెలో నిమ్మరసం పిండి దానిలో ఉప్పు కలపాలి.కాకరకాయ ముక్కల్ని నిమ్మరసంలో ముంచి తీసి ఒకగంట ఎండలో ఎండనివ్వాలి.అలా ఎండిన ముక్కల్ని
కాగిన నూనెలో వేసి బాగా వేయించాలి.కరివేపాకు,పుదీనా ఆకుల్ని కరకరలాడేలావేయించాలి.వీటిని వేయించిన కాకరకాయ ముక్కలపై వేసి కొంచెం మిరియాలపొడిచల్లాలి.కావాలనుకుంటే కొంచెం ఉప్పు చల్లుకోవచ్చులేదా అంతకు ముందే వేశాము కనుక అలాగే తినవచ్చు.
చిట్కా :ఏడాదంతా నిల్వ ఉండాలంటే కాకరకాయముక్కలు బాగా ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత డబ్బాలో పోసి
ఎప్పుడంటే అప్పుడు వేయించుకోవచ్చు.
                               

Wednesday 26 November 2014

ఈల వేయనిదే..........

                           మంగ తాయారు రాజీ వాళ్ళింట్లో బట్టలు ఉతకటానికి వస్తుంటుంది.పెద్దగా  ఈల వేస్తూ బట్టలు
ఉతుకుతూ ఉంటే వీధి మొత్తం వినిపిస్తుంది.మొదట్లో రాజీ విచిత్రంగా చూస్తుంటే మంగ తాయారు నేను ఈల వేయనిదే పని చేయలేనమ్మా! ఏమీ అనుకోవద్దు.చిన్నప్పటి నుండి అలవాటయిపోయింది అని సిగ్గుపడుతూ చెప్పింది.

ఆవకాయ పచ్చడి వృధా కాకుండా .......

          ఆవకాయ పచ్చడిలో ముక్కలు అయిపోయిన తర్వాత పచ్చడి మిగిలి పోతే వృధాగా పారేస్తుంటాము కదా.
అలా వృధాగా పారేయకుండా దొండకాయ ముక్కలు వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది.అదెలాగంటే
దొండకాయలు కడిగి తుడిచి ఆరబెట్టి సన్నగా పొడవుగా తరిగి ఆవకాయ పచ్చడిలో కలపాలి.ఇది 15 రోజుల వరకూ
కరకరలాడుతూ బాగుంటుంది.
                                                 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి ఆవకాయ పచ్చడిలో కలపవచ్చు.ఇది మూడు రోజుల తర్వాత నుండి తినాలి. పచ్చిమిర్చికి ఉప్పు,కారం,పులుపు పట్టి రుచిగా ఉంటుంది.
                          ఇదేవిధంగా కారట్,చిలకడ దుంప కూడా కలపవచ్చు.ఇవి ఒక వారం రోజులు బాగుంటాయి.
గమనిక:ఏది కలిపినా కడిగి,తుడిచి ముక్కలు కోసి ఆరబెట్టిన తర్వాత మాత్రమే కలపాలి.

Tuesday 25 November 2014

బిర్యానీ మంచి వాసన రావాలంటే......

బియ్యం - 1 కే.జి 
ధనియాల పొడి - 20 గ్రా.
గరం మసాలాపొడి - 10 గ్రా. 
జాజికాయ,జాపత్రి,అనాసపువ్వు - 15 గ్రా.
బిర్యానీ పువ్వు - 1
మరాఠీ మొగ్గ - 2
షాజీర - కొంచెం 
కొత్తిమీర - 2 కట్టలు 
పుదీనా - 2 కట్టలు 
పెరుగు - 1 కప్పు 
                                      1 కే.జి. బియ్యానికి పై విధంగా కొలతలు వేస్తే మంచి సువాసన వస్తుంది.
                       

కాకరకాయ నిల్వ పచ్చడి

కాకరకాయలు - 1/2 కే.జి
కళ్ళు ఉప్పు - 1 కప్పు
కారం - 1 కప్పు
పసుపు - 1/4 స్పూను
మెంతుపిండి - 1 స్పూను
నూనె - 1/4 కే.జి
చింతపండు -100 గ్రా.
వెల్లుల్లి పాయలు -2
                                         కాకరకాయలు కడిగి,పొడివస్త్రంతో తుడిచి కొంచెంసేపు ఆరబెట్టి గుండ్రని ముక్కలు కోయాలి.ముక్కలకు పసుపు,ఉప్పు పట్టించి ఒకగంట ఉంచితే నీరు వస్తుంది.ముక్కలు పిండి ప్రక్కన పెట్టాలి.ముక్కలు పిండగా వచ్చిన నీటిలో చింతపండు నానబెట్టాలి.ఒకగంట తర్వాత చింతపండు నలిగిన తర్వాత  కారం,మెంతు పిండి వేసి ఒకసారి త్రిప్పి తీసేయాలి.వెల్లుల్లి పాయలు మిక్సీలో వేసిమొత్తం పొడిగిన్నెలో వేసి కలిపి తాలింపు పెట్టాలి.ఇది 20 రోజుల వరకూ నిల్వ ఉంటుంది.  


Monday 24 November 2014

పిల్లలకు చిన్నప్పటి నుండే......

                               పిల్లలకు చిన్నప్పటి నుండే మగపిల్లలైనా,ఆడపిల్లలైనా ఎవరిపై  ఆధారపడకుండా తమపనులు తాము చేసుకునేలా అలవాటు చేయాలి.ఈరోజుల్లో తల్లీ,తండ్రీ ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి.ఉదయం పాఠశాలకు వెళ్ళాలంటే పిల్లలున్న ఇంట్లో పెద్ద హంగామా.ఇంతకు ముందు రోజుల్లో నానమ్మ,తాతయ్య లేకపోతే అమ్మమ్మ ,తాతయ్య ఎవరో ఒకరు ఉండేవాళ్ళు.ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాలలో ఉండటం లేకపోతే అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడక పోవటం,ఏకారణమైనా అన్నిపనులు ఎవరికి వారే చేసుకోవాల్సిన పరిస్థితి.అందుకని పిల్లలకు వాళ్ళ పుస్తకాలు వాళ్ళే సర్దుకోవటం,బూట్లు వేసుకోవటం,బట్టలు వేసుకోవటం లాంటి చిన్నచిన్నపనులు చేసుకోవటం అలవాటు చేస్తే అమ్మ వచ్చిచేస్తుందనో,నాన్న వచ్చిచేస్తాడనో ఎదురు చూడకుండా ఉంటారు.తర్వాత నిదానంగావాళ్ళ పనులు చేసుకోవటమే కాక అమ్మకు,నాన్నకు చిన్నచిన్నపనుల్లో  సహాయపడటం అలవాటవుతుంది.మనమే మన పనులు మనం చేసుకోము. ఇక పిల్లలకు ఏమి నేర్పుతాము అనుకోకుండా ముందు మనపద్దతులు మార్చుకుని పిల్లలకు మంచి పద్దతులు నేర్చుకునేలా చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు మనకు కూడా మంచిది.కొంచెం పెద్దయిన దగ్గరనుండి హాస్టళ్ళలో ఉండక తప్పని పరిస్థితి.ఒకేసారి ఇబ్బందిపడకుండా ఉండటమేకాక  ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకోవటానికి అలవాటుపడతారు.

ఇళ్ళ మధ్యలో పులిపిల్లలు

                                                                   ప్రీతిక నివసించే ప్రాంతంలో ఒక వర్గానికి చెందినవారు ఎక్కువమంది ఉండేవారు.అక్కడ ఇళ్ళమధ్యలో పులిపిల్లలు తిరుగుతున్నాయా? అనిపించేలా బలంగా,చారలతో పులిపిల్లల ఆకారంలో కనిపించేవి.ప్రీతిక వెళ్ళిన మొదట్లో వరండాలోకి వెళ్లేసరికి పెద్ద కళ్ళతో చూస్తూ నిలబడి ఉంది.ఇదేమిటి పులిపిల్ల ఇంటిముందు నిలబడింది?అని పరీక్షగా చూడగా బెదురూ లేకుండా అలాగే చూస్తూ నిలబడింది.ఇంతకీ అదేమిటనుకున్నారు? పెద్ద పిల్లి.తర్వాత పనిమనిషి చెప్పినదేమిటంటే ఆప్రాంతంలో మాంసాహారము ఎక్కువగా తినేవాళ్ళు ఉండటం వలన  పిల్లులు కూడా అదే తిండి కష్టపడకుండా తినటం వల్ల తెగ బలిసి పులిపిల్లల్లా నిగనిగ లాడుతూ తయారయ్యాయని తన భాషలో చెప్పింది.పిల్లులు అరవటం కూడా పిల్లలు పెద్దగా ఏడ్చినట్లుగా అరిచేవి.










చుట్టం చూపుగా .....

                            వారిజ భర్త బదిలీ కారణంగా ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్లవలసి వచ్చింది.అక్కడ  పావురాలు తప్ప వేరే ఏ పక్షీ కనిపించేదికాదు.అక్కడ మూడు సంవత్సరాలు ఉంటే ఏడాదికి రెండుసార్లు చొప్పున మూడు సంవత్సరాలలో ఆరుసార్లు మాత్రమే చుట్టం చూపుగా ఒక కాకి కావుకావు మంటూనేను వచ్చానని అరుస్తూ  ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్ళేది.ఎక్కడా ఆగేది కాదు.ఇన్నాళ్ళకు కాకి కనిపించిది కదా అనుకునే లోపు మాయమై పోయేది.

Sunday 23 November 2014

దోసకాయ నిల్వ పచ్చడి

గట్టి దోసకాయలు - 1/2 కే.జి
కారం - 1 కప్పు
నూనె - 1/4 కే.జి
కళ్ళు ఉప్పు - 1 కప్పు
 పసుపు - 1/4 స్పూను
చింతపండు - 100 గ్రా.
మెంతులు,ఆవాలు కలిపి 1/4 కప్పు కన్నా తక్కువ
వెల్లుల్లి - 1 పాయ
                                                 దోసకాయలు చెక్కు తీసి గింజలు తీసేయాలి.మధ్యరకం ముక్కలు కోసి ఉప్పు,పసుపు కలిపి కొంచెంసేపు ఉంచితే నీరు వస్తుంది.నీరు పిండి ముక్కలు ప్రక్కన పెట్టుకుని అదే నీటిలో చింతపండు నానబెట్టి మెత్తగా రుబ్బి కారం,మెంతుపిండి,ఆవపిండి( వేయించి పొడి చేయాలి) కలపాలి.వెల్లుల్లి మెత్తగా దంచి కలిపి తాలింపు పెట్టుకోవాలి.ఇది 20 రోజులవరకు తాజాగా ఉండి చాలా రుచిగా ఉంటుంది.ముక్క రుచిగా ఉండాలంటే మూడవరోజువరకు ఆగాల్సిందే.ఈ మూడు రోజులు రోజుకొకసారి మొత్తం కలిసేలాగా పొడిగరిటెతో త్రిప్పాలి.

కట్టు పొంగలి

బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 150 గ్రా.
నెయ్యి - 50 గ్రా.
జీరా - కొంచెం
ఎండు మిర్చి - 2
కరివేపాకు - కొంచెం
జీడిపప్పు - కొంచెం
నీళ్ళు - 1 కి 3
                                        గిన్నెలో నెయ్యివేసి కాగిన తర్వాత ఎండు మిర్చి,జీరా,కరివేపాకు,జీడిపప్పు వేసి వేయించాలి.బియ్యం పెసరపప్పు కడిగి నీళ్ళు వంచి తాలింపులో వేసి 2 ని.లు వేయించాలి.బియ్యం,పెసరపప్పు ముందే కొలిచి ఒకటికి  మూడు నీళ్ళు పోసిపొంగు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి ఉడికించాలి.ఇగిరిన తర్వాత దించేయాలి.  

Saturday 22 November 2014

దోసెలు - రకరకాలు

1)   బియ్యం - 2 కప్పులు
   పెసరపప్పు - 3/4 కప్పు
   మినప్పప్పు - 1/4 కప్పు
   మెంతులు - కొంచెం
ఉప్పు - సరిపడా
                                                            వీటన్నింటినీ 5 గం లు నానబెట్టి గరిటె జారుగా,మెత్తగా పిండి రుబ్బి దోసె వెయ్యాలి.ముందుగా నూనె వెయ్యకుండా దోసె వేసి చివరలో నూనె చుట్టూ,మద్యలో అక్కడక్కడవెయ్యాలి.దోసె వెయ్యగానే ఉల్లి,పచ్చిమిర్చి,కొత్తిమీర,టొమాటో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైనవెయ్యాలి.ఆవిరికి పైన మూత పెట్టాలి.కాలిన తర్వాత దోసెను చుట్టలా మడవాలి.పచ్చి మిర్చి అల్లం చట్నీతో తింటే బాగుంటుంది.

2)      బియ్యం - 4 కప్పులు ,మినప్పప్పు - 1/2 కప్పు,పెసరపప్పు - 1/4 కప్పు,పచ్చి శనగపప్పు - 1/4 కప్పు,మెంతులు - 1 స్పూను అన్నీకలిపి నానబెట్టి మెత్తగా రుబ్బి6 గం.లు తర్వాత దోసె వేసుకుంటే దోసె బంగారు వర్ణంలో కంటికింపుగా ఉంటుంది.
    
3)బియ్యం -2 కప్పులు,మినప్పప్పు - 1 కప్పు,మెంతులు - 1 స్పూను,అన్నీ నానబెట్టి మెత్తగా రుబ్బి ఒకపూట పులవనిచ్చి పిండి పొంగిన తర్వాత దోసె వేసుకుంటే బాగుంటుంది.

4)బియ్యం -1 కప్పు,మినప్పప్పు - 1 కప్పు కలిపి నానబెట్టి మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బి ఉల్లి,పచ్చి మిర్చి ముక్కలు వేసి 5,6 గం.లు తర్వాత పెనంపై నూనె వేసి పిండిని చేతితో గుండ్రంగా,కొంచెం మందంగా దోసె వెయ్యాలి.పైన మూతపెట్టి కాలిన తర్వాత రెండోవైపు తిరగెయ్యాలి.
    
    5 ) బియ్యం - 3 కప్పులు
       మినప్పప్పు - 1 కప్పు
       మెంతులు - కొంచెం 
       టొమాటోలు - 2
       కొత్తిమీర - 1 కట్ట
      కరివేపాకు - కొంచెం
      ఉప్పు - సరిపడా
      జీరా - కొంచెం  
పప్పులు,బియ్యం,మెంతులు నానబెట్టి మెత్తగా రుబ్బి టొమాటో,పచ్చిమిర్చి,కొత్తమీర,కరివేపాకు,ఉప్పువేసి రుబ్బాలి.అప్పటికప్పుడు దోసె వేసుకోవచ్చు.

మసాలా దోసె

మినప్పప్పు - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1
ఉప్పుడు బియ్యప్పిండి - 1
మెంతులు - 1 స్పూను
ఉప్పు - సరిపడా
                                         మినప్పప్పు,మెంతులు 5 గం.లు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి దానిలో బియ్యప్పిండి,ఉప్పుడు బియ్యప్పిండి,ఉప్పు సరిపడా కలిపి దోసెలు పొయ్యాలి.బంగాళదుంప మసాలా కూర చేసి
దోసెపై పలుచగా పరిచి దోసెను ఒకసారి మడిచి,మరలా మడిచి ప్లేటులో పెట్టి కొబ్బరి,అల్లం లేదా పల్లీల చట్నీతో
తింటే బాగుంటుంది. 

ఆపాల దోసె

బియ్యం - 1
ఉప్పుడు బియ్యం - 1
మినప్పప్పు - 1/4
ఉప్పు -  సరిపడా
                                బియ్యం,ఉప్పుడు బియ్యం,మినప్పప్పు అన్నీ కలిపి 4 గం.లు నానబెట్టి,మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.దోసె పలుచగా పోసి,ఒక వైపునే మూతపెట్టి కాల్చాలి.

వాము పొడి - కారప్పూస

శనగ పిండి  - 1 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
వాము  - సరిపడా
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
                                                        శనగపిండి,బియ్యప్పిండి జల్లించుకుని వాము నలిగీ నలగకుండా దంచి నూనె కాచి దానిలో పోసి ఉప్పుఅన్నీ కలిపి పిండిలో వేసి సరిపడా నీళ్ళతో కలిపి కారప్పూస గిద్దలతో కాగిన నూనెలో చుట్లుగా వత్తి ఇటు అటు త్రిప్పి బంగారు వర్ణంలోకి రాగానే తీసి పేపరు మీద పెట్టాలి.కొంచెం ఆరిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి.వాము వాసనతో కారప్పూస కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

శనగ పప్పు రొట్టె

బియ్యప్పిండి - 1 గ్లాసు
 పచ్చి శనగ పప్పు - 1 గ్లాసు
పచ్చి మిర్చి - 4
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం - చిన్న ముక్క
నూనె - 1/4 కే.జి
                              పచ్చి శనగపప్పు 2 గం.లు నానబెట్టాలి.2 గ్లాసుల నీళ్ళు పోసి,ఉప్పు వేసి మరగనిచ్చి దించాలి. శనగ పప్పు వడకట్టి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు,బియ్యప్పిండి వేసి వేడినీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ చపాతీ పిండి లాగా ముద్దగా కలుపుకోవాలి.ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి దానిపై ఈముద్దను రొట్టె మాదిరిగా తట్టాలి.పెనంపై కొంచెం నూనె పోసి రొట్టెను వేసి మూత పెట్టి  కాసేపయ్యాక తిరగవేసి మరికాస్త నూనె వెయ్యాలి.ఎర్రగా కాలిన తర్వాత తియ్యాలి.

చక్రాలు - రకాలు


పుట్నాల పప్పు(చట్నీ పప్పు) - 1 డబ్బా
బియ్యప్పిండి  - 4 డబ్బాలు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
                                            బియ్యం,పుట్నాలపప్పు మరపట్టించి జల్లించి,ఉప్పు,కారం,తగినన్ని నీళ్ళు పోసి కలిపి చక్రాల గిద్దలకు నూనె రాసి నూనె సరిపడా పోసి కాగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో వత్తి బంగారు రంగులో కరకరలాడేలా వేయించుకోవాలి.

బియ్యప్పిండి - 1 డబ్బా
మజ్జిగ - కలపటానికి సరిపడా
ఉప్పు - కొంచెం
కారం - కొంచెం
వాము - కొంచెం
                                  బియ్యప్పిండిలో మజ్జిగ పోసి సరిపడా ఉప్పు,కారం,వాము అన్నీ కలిపి కాగుతున్న నూనెలో గిద్దలతో వత్తాలి.మంచి రంగువచ్చినప్పుడు తీసి ఒక పేపర్ మీద  వేయాలి.

Friday 21 November 2014

అభినందనీయం

                                                      శశాంక్,శర్మిష్ట భార్యాభర్తలు.ఇద్దరూ వైద్యులు.ఇద్దరూ వేరువేరు ప్రాంతాలలో చదువుకున్నారు.శశాంక్ వివాహానికి ముందే విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు.శర్మిష్ట వేరే దేశంలో చదువుకుంటుండగా ఇరువైపుల పెద్దలు వీరిఇద్దరికి ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేశారు.శర్మిష్ట తన
చదువు పూర్తవగానే శశాంక్ పనిచేసే దేశానికి వెళ్ళింది.శర్మిష్ట వెళ్ళినతర్వాత ఒక సంవత్సరంవరకు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు.అనుకోకుండా చాలారోజుల తర్వాత శశాంక్ పనిచేసే ఆసుపత్రి నుండి పిలుపు వచ్చింది.కానీ అక్కడి సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో శశాంక్ భార్య శర్మిష్ట అన్నవిషయం తెలిసి ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో  పనిచేయకూదడనే నిబంధన కారణంగా శర్మిష్టకు ఉద్యోగం ఇవ్వలేమని తేల్చిచెప్పారు.బయటకు రాగానే శశాంక్ తో
పాటు పనిచేసే వైద్యురాలితో ఇంతముందే శశాంక్ ఇక్కడ పనిచేస్తున్నాడు కనుక తనకు ఉద్యోగం ఇవ్వమన్నారని బాధపడుతూ చెప్పింది.ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య బాధపడటంతో శశాంక్ భార్య మీదఉన్న అమితమైన  ప్రేమతో తను ఉద్యోగానికి రాజీనామా చేసి ఆఉద్యోగాన్నితన భార్య శర్మిష్టకు ఇవ్వమని యాజమాన్యాన్ని కోరాడు.భార్యకన్నా భర్త పైమెట్టు మీద  ఉండాలని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నఈరోజుల్లో భార్యకోసం ఉద్యోగాలు దొరకని రోజుల్లో చేస్తున్న ఉద్యోగాన్నివదిలేయటం నిజంగా అభినందించదగ్గ విషయం.
  

ఉల్లిపాయల రొట్టె

 కటిక బియ్యప్పిండి (కడిగకుండా పట్టించినది) - 1 కప్పు 
ఉప్పు - తగినంత 
వేరుసెనగ పప్పు(పల్లీలు ) - కొంచెం 
చట్నీ పప్పు (పుట్నాలు లేదా వేయించిన శనగ పప్పు) - కొంచెం
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - కొంచెం 
 నూనె - కొంచెం 
  పచ్చి మిర్చి - 2

                                   పచ్చి మిర్చి ఉప్పు కలిపి మెత్తగా మిక్సీలో వెయ్యాలి.పప్పులు బరకగా ఉండేలా మిక్సీలో వెయ్యాలి.ఉల్లిపాయ,కొత్తిమీర సన్నగా తరగాలి.ఇవన్నీ పిండిలో కలిపి పచ్చి నూనె కొంచెం వేసి కలపాలి.నీళ్ళు పోసి 
మరీ గట్టిగ కాకుండా కలుపుకోవాలి.పెనం మీద నూనె వేసి తర్వాత పిండిని వేసి చేతితో తట్టాలి.(సరిచేయాలి)చివర్లో నూనె వేసి మూత పెట్టాలి.ఇది అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే రుచిగా ఉంటుంది.అప్పుడుకప్పుడు కలిపి వేసుకోవచ్చు.

ఇడ్లీ పొడి

మినప్పప్పు  - 1 కప్పు
పచ్చి శనగపప్పు  - 1 కప్పు
ధనియాలు - 1 కప్పు
నువ్వులు - 1 స్పూను
ఎండు మిర్చి - 10
ఉప్పు - తగినంత
నూనె - 1 స్పూను
                                            ఒకస్పూను నూనె వేసి పప్పులు వేయించాలి.నువ్వులు,ధనియాలు విడివిడిగా వేయించాలి.ఎండు మిర్చి కూడా వేయించాలి.పప్పులు మిక్సీలో వేసి మెత్తగా పొడి చెయ్యాలి.ధనియాలు మెత్తగా పొడి చెయ్యాలి.ఎండుమిర్చి,నువ్వులు కలిపి మెత్తగా పొడి చేసుకుని,ఉప్పు సరిపడా వేసి మొత్తం కలిపి ఒకసారి మిక్సీలో వేసుకోవాలి.ఇది ఇడ్లీతో తింటే బాగుంటుంది.ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు.లేకపోతే వేసుకోకపోయినా తినవచ్చు.

Thursday 20 November 2014

రాములోరిని దర్శించే విధానంబెట్టిదనిన....

                                 జ్వాల గుళ్ళో సమారాధనకు మేనత్త కబురుచేస్తే వెళ్ళింది.అక్కడ శివాలయంతో పాటు రామాలయనికి తీసుకెళ్ళారు.ఎప్పుడైనా రామాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా రాములవారిని దర్శనం చేసుకోకూడదని చెప్పారు.ముందుగాఎదురుగా ఉన్నఅంజనేయస్వామిని దర్శనం చేసుకుని తర్వాత అమ్మ సీతమ్మను,ఆతర్వాత తమ్ముడైన లక్ష్మణుడిని,చివరగా రాములవారిని దర్శనం చేసుకోవాలని చెప్పారు.ఎక్కడైనా రాములోరిని దర్శించే విధానం ఇదేనని,దర్శనం చేసుకోవాలంటే వీరందరి అనుమతి తీసుకోవాలని అప్పుడే ఫలితం ఉంటుందని చెప్పారు.జ్వాలకు ఇదంతా తెలియదు కనుక చెంపలు వేసుకుని  ఇక ముందు రామాలయంకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఇదే విధంగా దర్శనం చేసుకోవాలని అనుకుంది. 

నిమ్మ పూరీలు

మైదా - 1 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - వేయించడానికి సరిపడా
వెన్న - కొంచెం
ఉప్పు - కొంచెం
నిమ్మకాయ - 1
                                                     మైదాలో వెన్న,ఉప్పు,నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకుని ఒక గంట నాననివ్వాలి.పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకంరానివ్వాలి.తర్వాత నిమ్మరసం పోయాలి.పూరీలు వండిన తర్వాత పంచదార పాకంలో వెయ్యాలి.చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.

కొబ్బరి,రవ్వ,శనగ పిండితో బర్ఫీ

కొబ్బరి తురుము - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
శనగ పిండి - 1 కప్పు
 పంచదార - 3 1/2 కప్పులు
నెయ్యి - తగినంత
                                                      కొబ్బరి,రవ్వ,శనగ పిండి వేరు వేరుగా నేతితో వేయించుకోవాలి.పంచదారలో నీళ్ళుపోసి స్టవ్ పై పెట్టి పాకం నీళ్ళల్లో వేసి దగ్గరకు చేర్చితే ఉండ అవ్వగానే అన్నీ రెడీగా పెట్టుకుని ముందుగా కొబ్బరి,రవ్వ,శనగ పిండి వరుసగా వేసి బాగా త్రిప్పాలి.పాకం బుడగలుగా పైకి పొంగు వచ్చినిలబడినప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో వెంటనే పోసి మనకు నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.  

బొంబాయి రవ్వ ఇడ్లీ

బొంబాయి రవ్వ - 1 పెద్ద కప్పు
సేమ్య - 100 గ్రా.
జీడిపప్పు - 50 గ్రా.
పచ్చి కొబ్బరి - 1 చిప్ప
పచ్చిమిరపకాయలు - 10
నెయ్యి - తగినంత
 ఉప్పు - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
కరివేపాకు - కొంచెం
                                              రవ్వ,జీడిపప్పు,సేమ్యా,పచ్చిమిరపకాయ ముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,కొబ్బరి తురుము, అన్నీ వేరువేరుగా కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి.ఇడ్లీ పెట్టేముందు అన్నీవేసి తగినంత ఉప్పు,నీరు పోసి
కలుపుకోవాలి.ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి పెడితే ఇడ్లీ తేలికగా వస్తుంది.ఇష్టమైన వాళ్ళు నీరు బదులు తగినంత
గిలకొట్టిన పెరుగు కలుపుకోవచ్చు.

పాల పూరీలు

పాలు - 1/2 లీ
మైదా - 1/4 కే.జి
 యాలకులు - 3
నెయ్యి - 1/4 కే.జి
వెన్న - 1/2 కప్పు
 పంచదార - 1/2 కప్పు
                               మైదాలో వెన్న వేసి పూరీల పిండిలాగా కలుపుకోవాలి.పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.పంచదార,యాలకులపొడి వేసి త్రిప్పాలి.పిండిని చిన్నచిన్న పూరీల మాదిరి వత్తి నేతిలో వేయించి
మరుగుతున్న పాలల్లో వెయ్యాలి.పూరీలు అన్నీ వేసిన తర్వాత గిన్నెను దించాలి.ఇది కృష్ణుడికి ఇష్టమైన స్వీటు.

Wednesday 19 November 2014

పాదంపై నిలబడి ఎత్తుకోమని ....

                                  ప్రమీల,రెండేళ్ళ కూతురు యోగ్యతను తీసుకుని విదేశం నుండి అమ్మను చూడటానికి స్వదేశానికి వచ్చింది.దగ్గరి బంధువులైన సురేంద్ర,భార్య శృతిని తీసుకుని యోగ్యత,ప్రమీలను చూడటానికి వాళ్ళింటికి వెళ్ళాడు.క్రొత్త కనుక వీళ్ళను చూడగానే ప్రమీల చంకనెక్కి యోగ్యత ఏడుపుమొదలెట్టింది.కొంచెంసేపటితర్వాత
సురేంద్ర నిలబడి ఫోను మాట్లాడుతుండగా యోగ్యత వెళ్ళి సురేంద్ర పాదంపై రెండు కాళ్ళు పెట్టి నిలబడి కాలు పట్టుకుని వదలటంలేదు.సురేంద్రకు అర్ధంకాక నిదానంగా విడిపించుకున్నాడు.మళ్ళీ రెండవసారి కూడా అలాగే చేసేసరికి ఏమి చేయాలో తెలియక నిదానంగా రెండడుగులు వేస్తే తను అలాగే పాదంపై నిలబడి కాలు పట్టుకునే ఉంది.ఎత్తుకోమంటుందని అర్ధమై యోగ్యతను ఎత్తుకున్నాడు.అప్పుడు నవ్వుతూ సంతోషంగా వచ్చీరాని భాషతో,సైగలు చేస్తూ అంకూ,అంకూ
 అంటూ ముద్దుముద్దుగా కబుర్లు చెప్పటం మొదలెట్టింది.అంతకు ముందెప్పుడు చూడకపోయినా ఒడిలో కూర్చుని పండు తినమని ఇవ్వటం,మంచినీళ్ళు త్రాగమని సైగ చెయ్యటం చేసింది.సురేంద్రకు చిన్నపిల్లలను సరిగా ఎత్తుకోవటం అలవాటు లేదు.అయినా కాసేపు ఎలాగో ఎత్తుకున్నాడు.సురేంద్ర ఇంటికి వెళ్ళటానికి లేస్తే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది.ప్రమీల బుజ్జగించి సురేంద్ర దగ్గరనుండి తీసుకుంది.ఎవ్వరి దగ్గరకు వెళ్ళటంలేదు.మీదగ్గరే ఇంత సమయం కూర్చుని కబుర్లు చెప్పింది అని ప్రమీల చెప్పింది.          
   

Tuesday 18 November 2014

అమ్మమ్మ కరివేపాకు కారం

పచ్చి శనగపప్పు  - 2 కప్పులు
మినప్పప్పు  - 1 కప్పు
జీలకర్ర  - చారెడు
కళ్ళు ఉప్పు (క్రిస్టల్ సాల్ట్ )  - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
ఎండు మిర్చి - గుప్పెడు
చింతపండు - నిమ్మకాయంత  
కరివేపాకు - 4 గుప్పెళ్ళు
నెయ్యి - 4 స్పూనులు
                                            ముందుగా మినప్పప్పు,శనగపప్పు కడిగి ఒక వస్త్రంలో ఆరబోయాలి.వేరువేరుగా నేతిలో అన్నీ వేయించుకోవాలి.శనగపప్పు మిక్సీలో వేసి తీసి జల్లించాలి.మినప్పప్పు కూడా మిక్సీలో వేసిన తర్వాత జల్లించాలి.నేతితో వేయించిన ఎండు మిర్చిమిక్సీలో వేసి నలిగిన తర్వాత జల్లించగా మిగిలిన నూక కూడావేసి మెత్తగా  చెయ్యాలి.వెల్లుల్లి,చింతపండుఉప్పు,జీలకర్ర కూడా మిక్సీలో వెయ్యాలి.కరివేపాకు ఎక్కువ నూనె వేసి నాన్ స్టిక్ పాన్ లో వేయించాలి.కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా నలిగిన తర్వాత అన్నీ ఒకగిన్నెలో వేసి కలిపి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్సీలో వెయ్యాలి.ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొంచెం వెయ్యాలి.అంతే ఘుమఘుమలాడే
అమ్మమ్మ చెప్పిన కరివేపాకు కారం రెడీ.ఇది ఇడ్లీ,దోసె,వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది.ఒకసారి కష్టపడితే నెల,నెలాపదిహేను రోజులవరకు నిల్వ ఉంటుంది.గాలి చొరబడని సీసాలో అయితే వాసనపోకుండా అయిపోయే వరకూ మంచి వాసన వస్తుంటుంది.

నల్లగా(కా)రం

ధనియాలు - 1 కప్పు
మినప్పప్పు - 1/2 కప్పు
జీరా - 1/2 కప్పు కన్నా తక్కువ
వెల్లుల్లి పాయలు - 4
ఉప్పు - 1 కప్పు
కరివేపాకు - గుప్పెడు
చింతపండు - నారింజకాయంత
ఎండు మిర్చి - గుప్పెడు
                                                    ధనియాలు,మినప్పప్పు నెయ్యితో వేయించాలి.ఎండు మిర్చి నూనె లేకుండా వేయించాలి.కరివేపాకు కొద్దిగా నూనెతో  వేయించుకోవాలి.ధనియాలు,మినప్పప్పు విడివిడిగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.ఎండు మిర్చి,జీరా మిక్సీలో మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లికూడా వెయ్యాలి. కరివేపాకు విడిగా,మెత్తగా పొడి చేసుకోవాలి.చింతపండు,ఉప్పు కూడా వేసి నలిగిన తర్వాత అన్నీ వేసి కలపాలి.అంతే నల్లగారం రెడీ.ఇది వేడి అన్నంలో,ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. 

ఆణీ - అతుకులు

                          రాజీ అప్పుడప్పుడు పని ఉండి బయటకు వెళ్తూ తన రెండున్నరేళ్ళ కొడుకును స్నేహితురాలు
వందన ఇంట్లో వదిలి వెళ్తుంది.అందుకని వందన,ఆమె భర్తను ఆణీ,అంకూ(ఆంటీ,అంకుల్) అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.వీళ్ళంటే వాడికి చాలా ఇష్టం.వీళ్ళు కూడా వాడు ఎంత అల్లరి చేసినా ఏమీ అనకుండా ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు.ఒకరోజు వీళ్ళింటికి వచ్చినప్పుడు వందన అటుకులు పెట్టింది.రెండు రోజుల తర్వాత వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్ళటం ఇష్టంలేక "ఆణీ అతుకులు" ఇవ్వమని పేచీ పెట్టుకుని కూర్చున్నాడు.సమయానికి అవి ఇంట్లో లేవు.రేపు తెప్పిస్తాను అని చెప్పినా వినకుండా మొండిగా ఇంటికి వెళ్లనని మారాం చేస్తూ ఏడవటం మొదలు పెట్టాడు.చేసేదేముంది?కొట్టుకి పంపించి అటుకులు తెప్పించి ఇచ్చేవరకూ కదలలేదు,ఏడుపు ఆపలేదు.వాళ్ళమ్మ బలవంతాన ఎత్తుకుని తీసుకెళదామంటే ఎత్తుకుంటే సాగుతున్నాడు.అటుకులు తిన్న తర్వాత కానీ ఇంటికి వెళ్ళలేదు.  

ఒక్కరోజులో అన్నవరం

                                             కాంచనమాలకు దైవ భక్తి ఎక్కువ. ప్రతి సంవత్సరం భర్త,కొడుకుతో కలిసి అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకుంటానని మ్రొక్కుకుంది.ఆమె భర్త బహు జాగరూకుడు.ముందురోజు వెళ్తే వసతి,భోజనం ఖర్చులు దండగ అని ఒక్క రోజులో వెళ్ళి వచ్చేద్దామంటాడు.ఉదయం ఊరిలో మొదటి బస్సు 5 గం.లకు ఎక్కించి  రైల్వే స్టేషనుకు తీసుకెళ్ళి హడావిడిగా రైలెక్కిస్తాడు. అన్నవరం స్టేషనులో దిగి అక్కడినుండి ఆటో ఎక్కితే డబ్బులు ఖర్చు అని బస్సెక్కించి కొండకు చేరుకొని,అక్కడ సత్యన్నారాయణ వ్రతం చేసుకుని,దర్శనం అయ్యాక,భోజనం చేసి మళ్ళీ హడావిడిగా ఎక్కడా ఒక్క నిమిషం నిలబడనీయకుండా మరల బస్సులో కొండదింపి రైలేక్కిస్తాడు.మరల రైలు దిగగానే బస్సు ఎక్కించి ఊరికి తీసుకెళ్తాడు.ముందే రిజర్వేషను చేస్తాడు కనుక కూర్చుని రావటంవల్ల బడలిక తెలియదు కానీ లేకపోతే 600కి.మీ ఒక్కరోజులో ప్రయాణించటం చాలా కష్టం.మా ఆయన హడావిడి ప్రయాణం అయినా భగవంతుని దయవల్ల 60 ఏళ్ల వయసులో కూడా వెళ్ళి రాగలుగుతున్నాము అని కాంచనమాల తన మనసులోని మాటను  స్నేహితులతో,బంధువులతో ముచ్చటగా చెప్తూ ఉంటుంది.  

Monday 17 November 2014

పెసర మొలకలతో సలాడ్

           పెసలు - 100 గ్రా.
           కారట్ - 1
           కొత్తిమీర - కొంచెం
           మిరియాల పొడి -1/4 స్పూను
           నిమ్మరసం - కొంచెం
           ఉప్పు  - సరిపడా
           చక్కర - 1/2 స్పూను
                                              పెసలు 5 గం.లు నానబెట్టి పలుచటి వస్త్రంలోమూటకట్టాలి.24గం.లు ఉంచితే మొలకలు వస్తాయి.వీటిని ఒక గిన్నెలో వేసి తురిమిన కారట్,కొత్తిమీర మిరియాలపొడి నిమ్మరసం,ఉప్పు,చక్కర కలిపితే చక్కటి సలాడ్ తయారవుతుంది.
                                               ఇష్టమైన వాళ్ళు పైన చెప్పిన వాటితో పాటుఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ,రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు.కొంచెం నూనెతో తాలింపు వేసుకోవచ్చు.ఇది కూడా బానే వుంటుంది.

Sunday 16 November 2014

ఐదు నిమిషాలు

                                                   వ్యాయామం చేయటం ఆరోగ్యానికి మంచిది.అందులో ఎక్కువ మంది నడకకు ప్రాముఖ్యత ఇస్తారు.నిదానంగా నడిచినకన్నా వేగంగా నడవటం(బ్రిస్క్ వాక్) వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
రోజూ నడక,ఇంకేదైనా వ్యాయామం చేసినా దానితోపాటు రోజుకొక ఐదు నిముషాలు పరురుగెత్తలిగితే ఎక్కువ ఫలితం ఉంటుంది.మోకాళ్ళ పనితీరు మెరుగై కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి.జీవితకాలం ఐదేళ్ళు పెరుగుతుంది.పరుగు వల్ల ఊబకాయం,మధుమేహం,గుండె జబ్బులు,రక్తపోటు,పక్షవాతం,కాన్సర్ వ్యాధులు రాకుండాఉంటాయి.ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు ఐదు నిముషాలు కేటాయించి పరుగెత్తగలిగితే ఎంతో మేలు .


రోజుకో పండు

                               రోజుకో పండు తింటే  వైద్యునితో పనిలేదని అంటారు.దీనిలో ఉన్న పోషకాల వల్ల అనారోగ్యం దరిచేరదు.ఎన్నో రకాల వ్యాధుల్ని నివారించవచ్చని నానుడి.మధుమేహం దరిచేరదు.దీన్ని తొక్కతో తినటంవల్ల
కాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల అల్జీమర్స్ ని నిరోధించవచ్చు.
ఇంతకీ ఈపండు ఏమిటంటే "ఆపిల్".

Friday 14 November 2014

కందిపప్పు పచ్చడి

కందిపప్పు - 1 కప్పు
ఎండు మిర్చి - 10
చింతపండు - కొంచెం
ఉప్పు - సరిపడా
వెల్లుల్లి పాయ - 1
నూనె - తగినంత
                            బాండీలో కొంచెం నూనె వేసి ఎండు మిర్చి,వేయించి,ప్రక్కన పెట్టుకోవాలి.తర్వాత కందిపప్పు వేయించాలి.చింతపండు నీళ్ళల్లో నానబెట్టాలి.కందిపప్పు,మిర్చి మిక్సీలో పొడి చేశాక చింతపండు,ఉప్పు,వేసి
చివరలో వెల్లుల్లి వేయాలి.ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం నూనెతోతాలింపుపెట్టాలి.కరివేపాకు,కొత్తిమీర  కూడా వేసుకుంటే మంచి సువాసనతో రుచిగా వుంటుంది.                                 

సొజ్జ

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 1/2 కప్పు
ఎండు మిర్చి - 3
ఆవాలు,జీరా - 1 స్పూను చొప్పున
నీళ్ళు  - 7 1/2 కప్పులు(1 కి 3 నీళ్ళు)
నూనె - 1/ 2 కప్పు
ఉప్పు - తగినంత
                                 బియ్యం,పెసరపప్పు నూనె లేకుండా వేయించుకోవాలి.ఒక గిన్నెలో నూనె వేసి స్టవ్ మీద పెట్టి కాగాక ఆవాలు,జీరా వేసి తాలింపు పెట్టి,నీళ్ళు పోసి మరిగాక  మొదట పెసరపప్పు వేసి కొద్దిగా ఉడికాక
ఉప్పు,బియ్యం వేసి మూత పెట్టాలి.ఉడికాక చివర్లో కొంచెం కరివేపాకు వేసి కలపాలి.దీన్ని రసంతో తింటే బాగుంటుంది.

లక్ష బిల్వార్చన

                                       బిల్వం అంటే మారేడు దళం.శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.భక్తితోఒక్క మారేడు దళం సమర్పించినా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు.శివుడు భక్తసులభుడు.కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజ
చేయటం ఎంతో మంచిది.శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఎంత ప్రత్యేకమో బిల్వార్చన అంటే మారేడు దళాలతోఅర్చన చేయటం కూడాఅంతే ప్రత్యేకం.లక్ష బిల్వదళాలు సమకూర్చటం ఎంత కష్టమో,మరల ఒక్కొక్క దళం అంటే మూడు ఆకులు కలిసి ఉన్నవి,మంచిగాఉన్నవాటిని మాత్రమే ఏరటం కూడా అంతే కష్టం.ఎంతోమంది భక్తులు భక్తి భావంతో శ్రమపడి ఇవన్నీసమకుర్చుతారు.అమృత ఊరిలో పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది.ఈగుడిలో నాగేంద్రుడు రాత్రిపూట శివలింగాన్ని చుట్టుకుని ఉంటాడు.కోరిన కోర్కెలు తప్పక నెరవేర్చే ఈస్వామి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. పాతిక సంవత్సరాల క్రితం నుండే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం స్వామికి లక్షబిల్వార్చన,అమ్మవారికి లక్ష కుంకుమార్చన  కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఎంతోమంది బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య లక్ష బిల్వార్చన కార్యక్రమం తెల్లవారుఝామున 3గం.ల నుండి సాయంత్రం వరకూ దిగ్విజయంగా కన్నులపండువగా జరుగుతుంది.భక్తజన సందోహంతో ఆప్రాంతం కిటకిటలాడిపోతుంది.శివనామ స్మరణతో ఆప్రాంతమంతా మార్మోగిపోతుంది.101జంటలు(దంపతులు)పూజలో పాల్గొంటారు.చుట్టుప్రక్కల నుండి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు.ఈ గుడిలోకార్తీకమాసంలో ప్రతిరోజూ తెల్లవారుఝామున 3 గం.లనుండే రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి.భక్తులు తెల్లవారుఝాము నుండే వచ్చి నిత్యాదీపారాధన చేస్తుంటారు.   లక్షఒత్తులు,కోటి ఒత్తులు వెలిగించడానికి చుట్టుప్రక్కలవాళ్ళు వస్తుంటారు.కార్తీకమాసం చివరివారంలో ఒకరోజు అన్నసమారాధన విందు భోజనాల కన్నా ఘనంగా నిర్వహిస్తారు.ఈకార్యక్రమానికి కూడా చుట్టుప్రక్కల ఊళ్ళనుండి స్వామి ప్రసాదం తీసుకోవటం అదృష్టంగా భావించి స్వీకరిస్తారు.    

Thursday 13 November 2014

మెడ చుట్టూ నలుపు పోవటానికి.....

ఒకస్పూను శనగ పిండి,2 స్పూనుల పాలు,చిటికెడు పసుపు,కొద్దిగా నిమ్మరసం కలిపి మెడ చుట్టూ పలుచగా రాసి ఒక 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.ఇలా వారానికి 2,3 సార్లు చేస్తుంటే క్రమంగా  మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గిపోయి శరీరఛాయతో సమంగా ఉండి నునుపుగా,అందంగా మెరిసిపోతూ ఉంటుంది.

రవ్వ దోసె

బియ్యప్పిండి - 2
మైదా పిండి - 1
బొంబాయి రవ్వ - 1
ఉప్పు - తగినంత
అల్లం - చిన్నముక్క
 పచ్చిమిర్చి- 3
జీడిపప్పు - కొద్దిగా
కారట్ తురుము - ఇష్టమైతే
                                               అల్లం,పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి.పై పిండిలన్నీ కలిపి అల్లం,పచ్చిమిర్చి పేస్ట్,జీడిపప్పు ముక్కలు అన్నీ కలిపి అప్పటికప్పుడు వేసుకోవచ్చు.పిండి పలుచగా కలిపితే దోసె పలుచగా వస్తుంది.నూనె బ్రష్ తో రాస్తే సరిపోతుంది.

బుడ్డిగాడు

                               సురేంద్ర,నాగేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు.బాబు,పాప.భార్యభార్తలిద్దరూ కష్టపడే తత్వం కలవాళ్ళు.ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నారు.వాళ్ళు కష్టపడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి గురించి కలలుకంటూ మంచిస్కూల్లో చేర్పించారు.వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు.
వీళ్ళ కుటుంబాన్ని చూచి అందరూ ముచ్చటపడేవారు.పాప హైస్కూల్లో చదువుతుండగా స్కూల్లో ఏదో గొడవ జరిగిందని తెలిసీ తెలియనితనంతో ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.ఆబాధ తట్టుకోలేక,ఆఅమ్మాయి జ్ఞాపకాలు మర్చిపోలేక ఆఇంటిని వదిలి సిటీకి మకాం మార్చారు.ఎక్కడికి వెళ్ళినా ఎలా మరచిపోగలరు?నాగేశ్వరి మానసికంగా కృంగిపోయి నాపిల్లను తెచ్చివ్వండి అంటూ ఏడవటం లేదా తెచ్చివ్వలేకపోతే ఎలాగైనా నేను మళ్ళీ ఆడపిల్లను కనవలసిందేనని పట్టుబట్టి ఎవరు చెప్పినా వినకుండా 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరల రీకెనలైజేషన్(పిల్లలు పుట్టకుండా చేయిచుకుని తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవటం అన్నమాట) చేయించుకుని అదే ఆడపిల్ల మళ్ళీ తన కడుపున పుడుతుందనే పిచ్చి నమ్మకంతో చివరకు మళ్ళీ మగబిడ్డకు జన్మనిచ్చింది.పిల్ల బ్రతికుండగా నేను మపిల్లాడినయితే బాగుండేది అనేది కనుక మగబిడ్డ రూపంలో పుట్టిందని సరిపెట్టుకుని అపురూపంగా పెంచుకుంటూ పాత జ్ఞాపకాలను కొంతవరకు తరిమి కొట్టింది.వాడిని బుడ్డిగాడు అని ముద్దుగా పిలిచేది.వాడు పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నా,పెళ్లీడు కొచ్చినాబుడ్డిగాడు అని పిలుస్తుంది. కొద్దిసేపు కనిపించకపోయినా మా బుడ్డిగాడు ఏమి చేస్తున్నాడో?అంటూ మితిమీరిన ప్రేమతో బుడ్డిగాడి గురించి తెగ  బాధపడిపోతుంటుంది.ఈ ఉదంతం గురించి తెలిసు కనుక బుడ్డిగాడు అంటూ ఎప్పుడూ కలవరిచినా,వాడి ముచ్చట్లు చెప్పినా ఎవరూ విసుక్కోరు.   

Wednesday 12 November 2014

బచ్చలికూర పచ్చడి

బచ్చలి కూర - 5 కట్టలు
ఎండు మిర్చి - 15
చింతపండు - చిన్న నిమ్మకాయంత
పసుపు - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె - 1 గరిటెడు
తాలింపు దినుసులు - 1 స్పూను
కరివేపాకు - కొంచెం
కొత్తిమీర - కొంచెం
వెల్లుల్లి పాయ - 1
                              బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు దోరగా వేయించుకుని వెల్లుల్లి,కరివేపాకు,కొత్తిమీర వేసి వేగాక ఒకగిన్నెలోకి తీసి కొంచెం నూనెలో ఎండు మిర్చివేయించుకోవాలి.అవి కూడాతీసి ప్రక్కనపెట్టుకుని,తరిగిన బచ్చలికూర వేసి నీరు ఇగిరే వరకూ వేయించాలి.ఎండు మిర్చి,మిక్సీలో వేసి కొద్దిగా నలిగిన తర్వాత వెల్లుల్లి,జీరా వేసి నలిగిన తర్వాత బచ్చలికూర,నానబెట్టిన చింతపండు వేసి కొంచెం నలగనివ్వాలి.పోపు వేసినా గిన్నెలో ఇది కూడా వేసి కలపాలి.ఇక రుచికరమైన బచ్చలికూర పచ్చడి సిద్దమైనట్లే.ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.

చుక్కకూర పచ్చడి

చుక్కకూర  - 5 కట్టలు
ఎండు మిర్చి - 15
ఉప్పు - తగినంత
వెల్లుల్లి పాయ  - 1
జీరా - 1/2 స్పూను
తాలింపు దినుసులు - 1 స్పూను
 నూనె - 1 గరిటెడు
కరివేపాకు - కొంచెం
కొత్తిమీర - కొంచెం
పసుపు - 1/4 టీ స్పూను
                                    బాండీలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులు వేసి దోరగా వేయించి వెల్లుల్లి ముక్కలు కొంచెం వేసి,కరివేపాకు,కొత్తిమీర వేసి వేగాక ప్రక్కన పెట్టుకోవాలి.అదే నూనెలో ఎండు మిర్చిదోరగా వేయించుకుని
తీసి ఒక ప్లేటులో పెట్టాలి.తరిగిన చుక్కకూర,ఉప్పు,పసుపువేసి నీరు ఇగరనివ్వాలి.ముందుగా వెల్లుల్లి,జీరా,          
 ఎండుమిర్చి, మిక్సీలో వేసి మెత్తగా నలిగిన తర్వాత చుక్కకూర వేసి అది కూడా నలిగిన తర్వాత తాలింపు వేసిన గిన్నెలో వేసి కలుపుకోవాలి.పుల్లపుల్లగా నోరూరించే చుక్కకూర పచ్చడి రెడీ.