Thursday 17 December 2020

ఇడ్నీ లో రాళ్ళు

                                                                        ధనమ్మ కొన్ని కొన్ని మాటలు స్పష్టంగా పలుకదు.నత్తి ఏమీ లేదు కానీ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఎవరైనా అలా కాదు ఇలా అని సరిచేద్దామని ప్రయత్నించినా నేను అంతే మాట్లాడుతాను అంటుంది.అందుకని ఎదుటివారే ఆమె మాట్లాడేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.కొంతమంది నవ్వుకుంటారు.ధాత్రి ఆమె ఏమి చెప్పినా  ఓపికగా వింటుంది.ఒకరోజు ధాత్రి టమోటాలు కూర వండడానికి ముక్కలు కోసుకుంటుండగా  ధనమ్మ  వచ్చింది.ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మాటల మధ్యలో మా అక్క కూతురు టమోటాలు తింటే ' ఇడ్నీ లో రాళ్ళు ' ఏర్పడతాయని ఎప్పుడన్నా టమోటా కూర వండితే నన్ను చంపెయ్యండే ! పోయేది నేనేగా మీకేంటి?టమోటాలు  వండ వద్దు అని అంటే వినరు అని గొడవ పెట్టుకుంటుందని  చెప్పింది.ఆమె చెప్పింది విని ధాత్రి ఆశ్చర్యపోయింది.తర్వాత నెమ్మదిగా తేరుకుని ఏమిటి ? మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ అదే చెప్పింది.కిడ్నీ లో రాళ్ళు పడతాయని చెప్పింది కాబోలు అని అర్ధం చేసుకుంది ధాత్రి.ఓసి నీ దుంప తెగ ( ఒకప్పటి ఊత పదం ) కిడ్నీ ని ఇడ్నీ చేసేశావన్న మాట అని ధాత్రి మనసులో నవ్వుకుంది.పైకి అందరిలా నవ్వితే బాధ పడుతుంది కదా!  తెలిసో తెలియకో ఎదుటి వారిని సాధ్యమైనంతవరకు బాధ పెట్టకూడదు అని ధాత్రి ఉద్దేశ్యం.

Friday 20 November 2020

అనుభూతుల సమ్మేళనం

                                                                    మొన్నామధ్య ఒక పెద్దాయన కలిసినప్పుడు మాటల సందర్భంలో ఏమిటర్రా!ఇలా యంత్రాల్లా తయారయిపోతున్నారు.ఎంతసేపూ ప్రక్కన మనిషి ఉన్నా పట్టించుకోకుండా చరవాణి చూడడమో,బుల్లి తెర లో వచ్చే ధారావాహిక చూస్తూ దానిలో నటించే వాళ్ళు నవ్వితే  నవ్వడం,ఏడిస్తే మీరు ఏడవడం తప్ప నిజంగా ఏడుపు వస్తే ఏడవలేరు.నవ్వు వస్తే నవ్వలేరు.ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయం.యాంత్రికంగా జీవితం గడిపేస్తున్నార్రా! మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా.జీవితం అంటే మనకోసం మనం సంతోషంగా బ్రతకాలి.ఇరుగు పొరుగుతోనూ,నలుగురితో కలిసి మెలసి ఉండాలి.ఎవరికి ఏ ఆపద వచ్చినా సాధ్యమైనంత వరకు మాటసాయం కానీ ఆర్ధికంగా కానీ  సహాయం చేయాలి.చేయలేకపోతే చేసేవాళ్ళకు సమాచారం చెప్పాలి.ఇంతెందుకు?ఇంట్లో సభ్యులు అందరూ ఒకచోట కూర్చుని ఏనాడైనా  కబుర్లు చెప్పుకున్నారా ? అందరూ ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కదరా! మనసు విప్పి కబుర్లు చెప్పుకుని హాయిగా నవ్వుకుంటుంటే బంధాలు బలపడడమేకాక మానసికంగా మాటల్లో  చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది.ఆ అనుభూతి కలగాలంటే మీకు కొంచెం సమయం పడుతుందిలే .ప్రయత్నిస్తే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు.ఇప్పటి నుండి అయినా ఈ యాంత్రిక జీవనానికి స్వస్తి పలికి ప్రకృతికి దగ్గరగా ఉండండి.జీవితం అంటే యాంత్రికం కాదు.అది ఒక అనుభూతుల సమ్మేళనం అని గుర్తించండి.ప్రతి చిన్న విషయాన్నీ మనసుతో ఆస్వాదిస్తూ,మమతతో ఉంటూ చిన్ననాడు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏ  అనారోగ్యాలు దరిచేరవు.ఇప్పటి నుండి మనకెందుకులే అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనండి.మానసికంగా శారీరకంగా చక్కటి ఆరోగ్యం స్వంతమవుతుంది.   

Saturday 14 November 2020

దివ్య కాంతుల దీపావళి

                                                పిల్లలు,పెద్దలు ఎంతగానో ఎదురు చూస్తున్న దివ్య కాంతుల దీపావళి రానే వచ్చేసింది. నేటి నుండి అయినా ఇప్పటి వరకు ఉన్న చీకట్లు అన్నీ పూర్తిగా తొలగిపోయి అందరి జీవితాల్లో శ్రీ మహాలక్ష్మి వెలుగులు నింపాలని,అందరూ సుఖ సంతోషాలతో,సకల  సిరిసంపదలతో,శారీరకంగా మానసికంగా ఉరుకులు పరుగులు లేని    ప్రశాంత జీవన విధానంతో ,  సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ  నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ఏదేశంలో స్థిరపడినా మన మూలాలు మర్చిపోకుండా వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా సంప్రదాయాలు పాటిస్తూ పండుగలు జరుపుకుంటున్న మన వారందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.



  

Thursday 5 November 2020

లక్షల చెట్లు

                                                                          ఒక చిన్న ప్రాణి ఉడుత వలన సంవత్సరానికి కొన్ని లక్షల  చెట్లు పెరుగుతాయన్న విషయం మనం కలలోనైనా ఊహించగలమా ? నిజానికి నేను కూడా మొదట ఈ విషయం వినగానే చాలా ఆశ్చర్యపోయాను.ఉడుత మనకు చేసే మేలు దాని  మతిమరుపు వలన చెట్లు పెరుగుతాయన్న విషయం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వలన తెలుసు.కానీ కొన్ని లక్షల చెట్లు పెరగడానికి ఉడుత దోహదపడుతుందన్న విషయం ఒక టి.వి లో వచ్చే కార్యక్రమం ద్వారా తెలిసింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఉడుత ఆహారం సేకరించే సమయంలో తర్వాత తినొచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్ని గింజలను భూమిలో చిన్న చిన్న గుంటలు తవ్వి దాచిపెడుతుంటుంది.తర్వాత వాటిని ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది.వర్షం వచ్చినప్పుడు ఆ గింజలు మొలకెత్తుతాయి. ఈ క్రమంలో ఉడుతలన్నీ 365 రోజులు రోజూ అదే పని చేయడంతో సంవత్సరం తిరిగేటప్పటికి  కొన్ని లక్షల చెట్లు పెరుగుతాయట.ఎంత ఆశ్చర్యం.నిజంగా పర్యావరణానికి ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వాటి ద్వారా మొలకెత్తి ఎవరూ పెంచి పెద్ద చేయక పోయినా భగవంతుని దయ వలన వట వృక్షాలై మనకు ఎంతో మేలు చేసే చెట్లకు,మనకు ప్రత్యక్షంగా కనిపించకుండా వీటన్నింటినీ పరోక్షంగా చేస్తూ మనల్ని కాపాడుతున్న భగవంతునికి  మనందరం ఎంతో రుణపడి ఉన్నాము.ఎవరైనా మనకు ఏ చిన్న సహాయం చేసినా ,మేలు చేసినా ధన్యవాదాలు తెలియచెయడం మన పెద్దలు నేర్పిన సంస్కారం.అలాగే మనందరికీ ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వృక్షాలకు,మనందరినీ చల్లగా కాపాడే భగవంతునికి మీ మా తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 

మతిమరుపు

                                                                      ఈ రోజుల్లో చాలామందికి మతిమరుపు అనేది పెద్ద సమస్య అయిపోయింది.రంజిత కూడా అదే కోవలోకి వస్తుంది.ఏ వస్తువు అయినా అవసరమైనప్పుడు  ఉపయోగపడుతుందని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది.కానీ అవసరమైనప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మర్చిపోవడంతో అది కనిపించకుండా పోయిన సందర్భాలెన్నో.మళ్ళీ క్రొత్త వస్తువు కొనుక్కోవడం కొన్నాళ్ళ  తర్వాత పాతది కనిపించినప్పుడు అయ్యో !ఎదురుగానే పెట్టి ఊరంతా వెతుక్కున్నాను అని బాధ పడిపోవడం పరిపాటి అయిపోయింది.ఒకసారి కళ్ళజోడు కనిపించలేదని ఇల్లంతా వెదికి ఉసూరుమంటూ కూర్చుంది. భర్త  కార్యాలయం నుండి వచ్చిన తర్వాత కళ్ళజోడు విషయం చెప్పింది.అదేంటి?నీ ముఖానే ఉందిగా !అనేసరికి అవాక్కయ్యింది.అప్పటివరకు పడిన శ్రమ అంతా మర్చిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుని పడీపడీ నవ్వేసింది.వెనుకటికి చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది నా పరిస్థితి అనుకుంది రంజిత.

                                                 ఎవరికైనా ఇలా మతిమరుపు వస్తుంది అని సందేహం వచ్చినప్పుడు చిన్నప్పటినుండి మన జీవితంలో జరిగిన మంచి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ,మనసారా నవ్వుకుంటూ,నవ్వు తెప్పించే సంఘటనలను నలుగురితో పంచుకుంటూ మనసును ఉల్లాసంగా ఉంచేందుకు  ప్రయత్నిస్తే మతిమరుపు అనేది మనజోలికి రాకుండా ఉంటుంది.

కోపం

                                                                        విహిత  బహు కోపిష్టి.ముక్కు మీద కోపం ఉంటుంది.ప్రతి చిన్నదానికి అందరి మీద అరుస్తూ ఉంటుంది.ఏ చిన్న తప్పు చేసినా ఎదుటివారిని చీల్చి చెండాడినంత పని చేస్తుంది.దానితో ఎదుటివారు బిక్క చచ్చిపోవల్సిందే.అయితే మిగతా విషయాల్లో విహిత చాలా మంచిది.ఎదుటి వారి కష్టం,బాధ చూచి అసలు తట్టుకోలేదు.వెంటనే ఇదిగో నేనున్నానంటూ ఆగమేఘాలమీద వారికి  సహాయం చేస్తుంది.ఎంత మంచితనం ఉన్నా కోపం ఎక్కువ ఉండడంతో అందరికీ విహిత అంటే భయం.చనువుగా మాట్లాడలేరు.ఒకసారి విహిత ఇంటికి మనవరాలిని చూచి పోదామని అమ్మమ్మ వచ్చింది.రెండు రోజులు విహితను గమనించిన తర్వాత మనవరాలిలో ఉన్న కోపం అనే దుర్గుణాన్ని ఎలాగయినా పోగొట్టాలని ఖాళీగా ఉన్నప్పుడు ఆ కబురు ఈ కబురు చెబుతూ ఈ రోజు కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది అమ్మా!తినలేకపోయాను.కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము.అలాగని కాస్త తక్కువైనా తినలేము కదా! అలాగే మనకున్న కోపం కూడా ఉప్పులాంటిదే.ఎక్కువ అయితే ఎంత మంచితనం ఉన్నా విలువ ఉండదు.తక్కువ అయితే మర్యాద ఉండదు.కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ఉప్పులా అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలని సున్నితంగా తెలియచేసింది అమ్మమ్మ.అమ్మమ్మ చెప్పిన విధానానికి విహిత మారు మాట్లాడలేకపోయింది.ఇది విన్న విహిత కొద్దిసేపు నిశ్శబ్ధంగా కూర్చుని తర్వాత నెమ్మదిగా నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అమ్మమ్మా అని చెప్పింది.చెప్పే రీతిలో నచ్చే విధంగా చెప్తే ఎంతటి  మొండివారైనా తప్పకుండా మాట వింటారు.

Saturday 24 October 2020

విజయదశమి శుభాకాంక్షలు

                                                        విజయ దశమి లోనే విజయం ఉంది.గత ఎనిమిది మాసాలుగా మనం అందరమూ కూడా భయాందోళనల మధ్య అశాంతితో ఎన్నో సమస్యలతో సతమతమైనా సాయిబాబా మరియు అమ్మవారి  దయ వలన వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగాము.ఇక ముందు కూడా అంతకన్నా ఎక్కువ ఆత్మస్థైర్యంతో,మానసిక,శారీరక ధృడత్వంతోపాటు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే బుద్ధి కుశలతను,మనశ్శాంతితోపాటు మనందరికీ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించమని అమ్మను,బాబాను మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన తెలుగువారందరికీ,నా తోటి బ్లాగర్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.సర్వేజనా సుఖినోభవంతు.

                                         


                             
                       
                                                     

                  

                    


                                                                 

Tuesday 20 October 2020

ప్రేయస్సు - శ్రేయస్సు

                                                             మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు నచ్చిన విధంగా భగవంతుడిని ఎన్నో రకరకాల కోరికలు కోరుకుని అవి తీర్చమని విసిగిస్తూ ఉంటాము.అందులో కొన్ని ధర్మబద్ధమైనవి,కొన్ని స్వార్ధపూరితమైనవి కూడా ఉంటాయి.ఏది ఏమైనా ఈ విధంగా ప్రియమైన వాటిని కావాలనుకోవడాన్నే ప్రేయస్సు అంటారు.కానీ భగవంతుడు ధర్మబద్ధమైనవి,మనకు ఏది అవసరమో, ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాడు.దీనినే శ్రేయస్సు అంటారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్న చందాన మనకు నచ్చినా నచ్చకపోయినా ఏది జరిగినా మన మంచికే అనుకుని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తూ మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడి ప్రశాంతంగా జీవించడం అలవరచుకోగలిగితే జీవితం ఆనందదాయకంగా  ఉంటుంది.

Monday 19 October 2020

నిర్మల తటాకం

                                                          పెద్దలకు నా నమస్కారం.పిన్నలకు నా శుభాశ్సీసులు.పండుగకు ఇల్లు శుభ్రం చేసుకోవడం అయిపోయిందా అండీ ?నవరాత్రి,విజయదశమి సందర్భంగా అమ్మవారి పూజలతో హడావిడిగా ఉన్నారా ? ప్రత్యక్షంగా పూజలు చేయలేని వారు మనసులో నైనా  ప్రార్ధించవచ్చు.దీనికి సమయ నియమం లేదు.మనకు ఎన్ని పనులున్నా ఆ పనులు చేసుకుంటూనే మనసులో అమ్మవారిని తలచుకోవచ్చు.దీనితో మానసిక ఒత్తిడులన్నీ తొలగిపోయి మనసులో ప్రశాంతత గూడు కట్టుకుంటుంది.ఎటువంటి మానసిక ఆందోళన లేకపోవడంతో మనసు నిర్మల తటాకం అవుతుంది.మనకోసం మాత్రమే  కాకుండా సమస్త మానవాళి కోసం  సర్వేజనా సుఖినోభవంతు అంటూ రాగద్వేషాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం ప్రార్ధించడం చాలా మంచిది.అప్పుడు మన మనసులు కూడా మంచితనంతో, ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి.  మనసారా ప్రార్ధిస్తే ఎలాంటి సమస్యలు అయినా ఇట్టే తొలగిపోతాయని,సమస్యకు సరైన పరిష్కార మార్గం లభిస్తుందని మన పెద్దల మాట.ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏవిధంగా పూజ చేసినా అమ్మవారి కృపాకరుణాకటాక్షవీక్షణాలు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రి ,విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

Friday 16 October 2020

అనుకోని అతిథి

                                                                            ఒకరోజు మధ్యాహ్నం యుతిక హాలులో సోఫాలో కూర్చుని ప్రక్కన  ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా స్నేహితురాలితో చరవాణి లో బాతాఖానీ కొడుతోంది.చిన్ననాటి కబుర్లతో పాటు పాత స్నేహితురాళ్ళు,కొత్త స్నేహితురాళ్ళ  గురించి గుక్క తిప్పుకోకుండా  రెండు గంటలపాటు సంభాషణ అలా అలా సాగిపోయింది.ఈ లోపు ప్రధాన ద్వారపు మెష్  తలుపు తీసి ఉండడంతో ఒక ఉడుత హడావిడిగా లోపలికి వచ్చి క్రింద పడిన గింజలు ఏరుకుని తిని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనే వెతుకులాటలో యుతిక కూర్చున్న సోఫా క్రిందికి వచ్చినప్పుడు అనుకోకుండా ఉడుత తోక యుతిక చీరకు తగలడంతో ఏమి వచ్చిందో ? అని కంగారుపడి యుతిక సంభాషణ ఆపి క్రిందకు చూసేసరికి ఉడుత తోక కనబడింది.మళ్ళీ ఫోను చేస్తాను అని స్నేహితురాలికి చెప్పి ఎటు వెళ్లిందో చూద్దామనుకుంటే కన్ను మూసి తెరిచే లోపే ప్రక్కింటి చెట్టు మీద పరుగెత్తుతూ కనిపించింది.ఇంతకీ అదెలా వెళ్ళింది అంటే వాకిలి ముందున్న  వేప చెట్టు కొమ్మలు యుతిక వరండాలోకి రావడంతో వాటి మీదుగా ప్రక్కింట్లో ఉన్నచెట్టుమీదికి దూకిందన్నమాట.రోజూ యుతిక తులసి మొక్కకు పూజ చేసి లోపలకు రావడం ఆలస్యం ప్రసాదం,అక్షింతలు తినడం ఉడుత దినచర్య.మొదట్లో యుతిక పిట్టలు తింటున్నాయేమో అని  అనుకుంది.ఒకరోజు యుతిక కాపలా కాసి మరీ ఈ విషయాన్ని కనిపెట్టింది.ఇంతకుముందు చరవాణి లో సంభాషణ ఆగిపోయింది కదా! మళ్ళీ చేసి స్నేహితురాలికి మా ఇంటికి ఈరోజు ఒక అనుకోని అతిథి వచ్చిందోచ్  అంటూ  కాసేపు ఉడుత కబుర్లు చెప్పింది. 

               

Saturday 10 October 2020

నేను ఏడుస్తా

                                                చిత్రాంజలి పేరుకు తగ్గట్లే చిత్ర విచిత్ర మనస్తత్వంతో ఎదుటి వారిని అయోమయంలోను,సంకట పరిస్థితిలోనూ పడేస్తుంటుంది.ఒక్కోసారి ఇంట్లో వాళ్ళతో  ప్రేమగా మాట్లాడుతుంది.ఒక్కొక్కసారి చిటపటలాడుతూ ఉంటుంది.ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు.మాములుగా మాట్లాడినా కూడా ఏదో తనను తిట్టేశారని కళ్ళు నులుముకుంటూ పెద్ద పెద్ద శోకాలు పెట్టి ఏడుస్తుంటుంది.చిత్రాంజలి పెళ్ళై అత్తవారింటికి వచ్చిన క్రొత్తలో ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉండేది.పాతిక ఏళ్ళు దాటినా చిన్న పిల్లల కన్నా కనాకష్టంగా మొండిగా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేది.పైగా ఎదుటి వారి మీద ఉన్నవి లేనివి కల్పించి నిజమనుకునేలాగ కథలు అల్లి చెప్పేది.అత్తారింట్లో వాళ్ళు సహనం కలవారు కనుక మన ఆడపిల్ల అయినా పరాయి ఆడపిల్ల అయినా ఒకటే అనుకుని ఎవరితో చెప్పకుండా  పోనీలే తల్లి లేని పిల్ల అని కడుపులో పెట్టుకుని చూచుకున్నారు.కాలక్రమంలో ఇద్దరు బిడ్డల తల్లయింది.అయినా ఆమెలో మార్పు రాలేదు.కూతురు పుట్టగానే ఆడపడుచు కొడుకు నాలుగేళ్ళ ఆస్కార్ కిచ్చి పెళ్ళి చేస్తానని ఆడపడుచుని మాట ఇవ్వమంది.పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో? అదీ కాక మేనరికాలు చేసుకోకూడదు కదా!అంది ఆడపడుచు సాకేతిక.దాంతో చిత్రాంజలికి కోపం వచ్చి ఆస్కార్ ని అన్నయ్య అని పిలిపించడం మొదలు పెట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్ళి వయసుకి వచ్చారు. చిత్రాంజలి మనసులో మాత్రం ఆస్కార్ కి ఎలాగైనా కూతుర్నిఇచ్చి చెయ్యాలనే పిచ్చి ఆలోచన ఉండడంతో తన కుటిల బుద్ధితో ఆస్కార్ కి వచ్చిన పెళ్ళి సంబంధాలను చెడగొట్టడం మొదలు పెట్టింది.ఇంతలో అనుకోకుండా ఆస్కార్ కి పెళ్ళి కుదిరింది.చిత్రాంజలి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక  అప్పుడే ఆస్కార్ పెళ్ళికి ఏమి తొందర?అంటూ నేలపై చతికిలపడి క్రింద కూర్చుని ఏడ్చి తిట్టుకుంది.ఇంట్లో వాళ్ళకు అలవాటైపోయింది కనుక ఎవరూ పట్టించుకోలేదు.పెళ్ళిలో కూడా  నేను ఏడుస్తా అని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం మొదలెట్టింది చిత్రాంజలి.నువ్వు ఎందుకు ఏడవడం?అని కూతురు అడిగితే ఏమో నేను ఏడుస్తా అంతే అంది.పాతిక ఏళ్ళ నుండి ఆమెతో ఇబ్బందులు పడి ఉండడంతో విగిపోయి ఏడ్చుకో తల్లీ !ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన  నీ ఏడుపు ఊరందరికీ తెలిసి నీ వీపుకు తాటాకులు కడతారు అనుకుని చిత్రాంజలి అజ్ఞానానికి,మూర్ఖత్వానికి ఆడపడుచు సాకేతిక మనసులోనే తిట్టుకుంది.

Friday 9 October 2020

ఆపద్భాందవి

                                                                   సాయి సౌమ్య పేరుకి తగ్గట్లుగానే సౌమ్యంగా ఉంటుంది.దీనికి తోడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ని.ల్లో నొప్పించక  తానొవ్వక అనట్లు తనదైన శైలిలో పరిష్కార మార్గం సూచిస్తూ ఉంటుంది.స్నేహితుల్లో,బంధువుల్లో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా,మనసుకు బాధ అనిపించినా చరవాణి ద్వారా వాళ్ళ బాధ తగ్గేవరకు గంటలు గంటలు సాయి సౌమ్య చెవి నొప్పి పుట్టేవరకు చెప్పి ఆ బాధ,ఆ ఇబ్బంది తొలగిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు.ఎక్కడైనా కనిపించినా పలకరు.మళ్ళీ ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం సాయి సౌమ్య మాత్రమే కనపడుతుంది.ఎందుకంటే ఈరోజుల్లో ఎవరి గొడవ వాళ్ళదే కదా!ఎవరూ ఎవరి గురించి పట్టించుకోరు.అది వారి బుద్ది లోపం అని సరిపెట్టుకుంటుంది సాయి సౌమ్య.ఇది ఇలా ఉండగా సాయి సౌమ్య పనివాళ్ళే కాక  ఇరుగుపొరుగు పనివాళ్ళు,కూరగాయలు,ఆకుకూరలు,పళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఏ అవసరం వచ్చినా,ఏ సమస్య వచ్చినా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మా!మీరే మాకు సహాయం  చేయాలి,సలహా చెప్పాలి అంటూ వస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది కలిగినా,ఎంతో సౌమ్యంగా ఉండే సాయి సౌమ్య కే విసుగు అనిపించినా పోనీలే ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా?అనుకుని తనకు సాధ్యమైనంత వరకు మాట సాయం కానీ,డబ్బు సాయం కానీ చేస్తూ ఉంటుంది.ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎటువంటి  ఇబ్బంది కలుగకుండా చూచుకుంటూనే ఎదుటివారికి సహాయం చేస్తుంటుంది.అందుకే సాయి సౌమ్యను కుటుంబ సభ్యులు 'ఆపద్భాందవి' అంటూ  ముద్దుగా పిలుచుకొంటారు.స్నేహితురాళ్ళు  మన ఆపద్భాందవి ఉండగా మన కేల చింత?అంటూ ఉంటారు.సాయి సౌమ్య ఎవరు ఏమనుకున్నా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది.                                     

Thursday 8 October 2020

కోడలు వస్తోందోచ్

                                              ఇంద్ర నీల ఉన్నట్లుండి  ఒకరోజు స్నేహితురాళ్ళను,దగ్గర బంధువులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది.ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంత అకస్మాత్తుగా ఇంద్ర నీల అందరినీ ఎందుకు పిలిచి ఉంటుందబ్బా ! అని రకరకాల ఉహాగానాలు చెయ్యడం మొదలెట్టారు.వచ్చిన అతిధులందరికీ అల్పాహారం,పండ్ల రసాలు ఇచ్చిన తర్వాత కాసేపటికి ఇంద్ర నీల మాకు కోడలు వస్తోందోచ్ అని ప్రకటించింది.అంతకు ముందు వరకు గలగల మాట్లాడుతున్న వారందరూ ఒక్కసారిగా మాటలు ఆపేశారు.కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.ఈ వార్త వినగానే కొంతమంది ముఖాలు నల్లగా అట్టు మాడినట్లు మాడిపోయాయి.స్నేహితుల్లో,బంధువుల్లో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని  ఇంద్ర నీల ఇంటికి కోడలిగా పంపితే బాగుంటుంది అనే  ఆలోచనతో ఉండడంతో ఎవరికీ నోట మాట రాలేదు.కాసేపటికి కొంత మంది తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభినందనలు తెలిపారు.కొంత మంది మూతి మూడు వంకరలు త్రిప్పుతూ కోడలు వస్తుందని సంబరపడడం కాదు.కోడలు వచ్చిన తర్వాత కానీ తెలియదు.ముక్కు ముఖం తెలియనిదాన్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుందనేది? అని ఇంద్ర నీలకు వినిపించేలా చిన్నగా  గుసగుసలాడడం  మొదలు పెట్టారు.ఇవన్నీ విన్న ఇంద్ర నీల మనం మన పిల్లలతో పాటు వచ్చే కోడలితో కూడా అంతే ప్రేమగా ఉంటే కోడలు కూడా మనతో అంతకన్నా ఎక్కువ ప్రేమతో కూడిన గౌరవంతో ఉంటుంది.ఈ తర్కం తెలిసిన అత్తాకోడళ్ళ అనుబంధం అపురూపంగా ఉంటుంది.అత్త ఒక రాక్షసి,కోడలు ఒక గడసరి అనే అపోహలు తొలగించుకుని అందరూ ఒకరికొకరు ప్రేమభావంతో మెలగడం అందరికీ శ్రేయోదాయకం.అప్పుడు అందరి ఇళ్ళు ప్రశాంత నిలయాలే అవుతాయి అని చెప్పింది ఇంద్ర నీల.అవును ఇంద్ర నీల చెప్పిన తర్కం చాలా బాగుంది అంటూ చాలామంది తమ మద్దతు తెలిపారు.అందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉంటే  మమతానురాగాలు పెరిగి అనుబంధాలు బలపడతాయి అనుకున్నారు.మొదటే ఈ విధంగా అనుకుని ఉంటే ఇంద్ర నీలకు ఇంతసేపు  చెప్పాల్సిన పని ఉండేది కాదు.పోనీలే ఇప్పటికయినా అర్ధం అయినందుకు సంతోషం అనుకుంది మనసులో ఇంద్రనీల.

Tuesday 6 October 2020

పంచ కళ్యాణి

                                                            శ్రీర్జిత్ కి రకరకాల జంతువులను,పక్షులను పెంచడం అంటే మహా సరదా.చిన్నప్పటినుండి కుక్క పిల్లల్ని పెంచుకుందామని ఏడ్చేవాడు.15 సంవత్సరాలు వచ్చేటప్పటికి స్నేహితుని ఇంట్లో కుక్క పిల్లల్ని పెట్టిందని తెలిసి ఒకదాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు.అది ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉండేసరికి పెద్దవాళ్ళు కూడా ఏమి మాట్లాడలేక పోయారు.అలా శ్రీర్జిత్ వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల కుక్కలు,కోళ్ళు,ఆవులు,ఎద్దులు, కుందేళ్ళు పెంచడం  మొదలు పెట్టాడు.తాజాగా ఇంటిలో ఎవరికీ చెప్పకుండా 'పంచ కళ్యాణి ' అని ఒక గుర్రం కొని ఇంటికి తెచ్చాడు.దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పిల్లలందరు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు.మొదటి రోజు పోనీలే అని కాసేపు గుర్రంపై  ఎక్కించి రహదారిలో అటునుండి ఇటు చివరకు ఒకసారి తిప్పారు.దానితో ఊరిలో పిల్లలు అందరూ శ్రీర్జిత్ ఇంటి ముందు వరుస కట్టారు. వీటన్నింటి బాగోగులు చూడడానికి ఐదారుగురు పనివాళ్ళు,గిత్తలు,ఎద్దులు అంటే ఉన్న మోజుతో  వచ్చి కొంతమంది ఉచిత సేవలు చేసి వెళ్ళేవాళ్ళు.మాములుగానే  వాకిలి నిండా ఎప్పుడూ జనంతో  కిటకిటలాడుతూ ఉంటుంది.ఇప్పుడు పంచ కళ్యాణి పుణ్యమా అని  దాన్ని చూడడం కోసం పిల్లలు,వాళ్ళని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్ళడానికి పెద్దలు రావడంతో వాకిలితోపాటు రహదారి కూడా నిండి పోతుంది.ఎవరైనా పెద్దవాళ్ళు వీటన్నింటినీ పెంచడం,ఇంటి నిండా ఎప్పుడూ జనాలు ఈ తలనొప్పులు ఎందుకు శ్రీర్జిత్ ? అంటే నాకు మూగజీవాలను పెంచడం ఎంతో ఇష్టం.నా ఈ అభిరుచి నాకు ఎంతో సంతృప్తితోపాటు ఆనందాన్నిస్తుంది అని చెప్తూ ఉంటాడు శ్రీర్జిత్.                

Monday 5 October 2020

బుజ్జమ్మ

                                                                 చారుహ్య అమ్మతో కాసేపు కబుర్లు చెప్పి వద్దామని పుట్టింటికి వెళ్ళింది.ఇంతలో ఆడపడుచు రావటం చూచి తోటలో పువ్వులు కోస్తున్న మరదలు అనూహ్య బుజ్జమ్మా ఒకసారి ఇలారా ఎవరొచ్చారో చూడు అంటూ మురిపెంగా పిలిచింది.నాకు తెలియకుండా ఈ బుజ్జిమ్మ ఎవరా?అని చారుహ్య ఆసక్తితో చూస్తుంది.పరుగెత్తుకుంటూ సగం ఈకలు లేని కోడిపిల్ల వచ్చింది.దాన్ని ఎంతో అపురూపంగా ఎత్తుకుని పది పిల్లలకి ఇదొక్కటే బ్రతికింది ఒదినా! ఇది కూడా మొదట బాగుంది.తర్వాత ఒకరోజు పిల్లి నోట కరుచుకుంది.వెంటనే చూచి వదిలించాము.పాపం చచ్చి బ్రతికినంత పనయింది.అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం అని చెప్పింది.నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనుకే తిరుగుతుంది అని ఒడిలో కూర్చోబెట్టుకుని గింజలు అరచేతిలో పోసుకుని దాని ముందు పెట్టింది.ఒక్కో గింజ ఏరుకుని బుజ్జమ్మ తింటుంటే అనూహ్య ఆనందానికి అవధులు లేవు.ముఖం పున్నమి చంద్రుని వలే వెలిగిపోతోంది.ఇంటికి ఎవరు వచ్చినా కూడా  సరిగా పలకరించకుండా,ఎవరైనా చిన్న పిల్లలు కనిపించినా ముద్దు చేయని  అనూహ్య ఈకలు లేని ఒక కోడిపిల్లని చంకనెత్తుకుని మురిసిపోవడం చూచి చారుహ్య విస్తుపోయింది. 

Tuesday 29 September 2020

నలకువ

                                      కౌముది ఇంట్లో సత్యవతి పని చేస్తుంటుంది.వయసు రీత్యా పెద్దది కావడంతో సత్యవతి మంచి చెడు సలహాలు ఇస్తూ ఉంటుంది.ఒక రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా రేపు త్వరగా వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళు.నేను బంధువుల ఇంటికి పలకరించడానికి వెళ్ళాలి.మొన్న ఒకాయన కాలం చేశారు కదా అనగానే అమ్మా! రేపు ఆదివారం,ఎల్లుండి సోమవారం,ఆ తర్వాత మంగళ వారం కనుక అటువంటి చోటుకు వెళ్ళకూడదు అని ఖరా ఖండిగా చెప్పి బుధ వారం వెళ్లి రండి  అని సలహా చెప్పింది.అవునా!మంగళ వారం,శుక్ర వారం వెళ్ళకూడదు అంటారు అని తెలుసు కానీ మిగతా రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు? అంది కౌముది.మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళకూడదు.అలా వెళ్తే ' నలకువ ' అని చెప్పారు అంది.నలకువ అంటే అర్ధం ఏమిటి? అంటే ఏమో అమ్మా! నాకూ తెలియదు.వెళ్ళడం మంచిది కాదు అని అనుకుంటున్నాను అంతే అంది.సత్యవతికి అంతకు మించి ఏమీ తెలియదు కనుక ఒక్క మాట కూడా మాట్లాడదు.నలకువ అంటే అర్ధం ఏమిటో ? అని సందేహం మనసుని తొలిచేస్తున్నా మెళుకువ కి వ్యతిరేకార్ధం నలకువ అనేమో అని ఊహించుకుని కౌముది అంతటితో ఆ చర్చా కార్యక్రమం ముగించింది.  

Monday 28 September 2020

కారపు వెన్న ఉండలు

 కొద్ధిగా కరిగించిన వెన్న  - 4 చెంచాలు 

పొడి బియ్యపు పిండి - 1 కప్పు 

మినప గుళ్ళు  - 2 చెంచాలు

కొబ్బరి తురుము - 1 పెద్ద చెంచా 

నువ్వులు - 1 పెద్ద చెంచా 

ఉప్పు - రుచికి సరిపడా 

పచ్చి కారం - 1/2 చెంచా 

నూనె - వేయించడానికి సరిపడా 

                                                   పొయ్యి వెలిగించి మందపాటి బాండీలో బియ్యప్పిండి వేసి వేయించుకోవాలి.మినప గుళ్ళు వేయించి పొడి చేసుకుని ఈ రెండు కలిపి ఒకసారి జల్లించుకోవాలి.నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి అన్నిటిని కలిపి అవసరమైనన్ని నీళ్ళు పోసి గట్టిగా ముద్ద చేయాలి.దీనిని పది ని.లు నాననిచ్చి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి.బాండీలో నూనె పోసి వేడెక్కాక కొన్ని కొన్ని వేసుకుని బంగారు గోధుమ వర్ణం లో వేయించి తీయాలి.కరకలాడే రుచికరమైన కారపు వెన్న ఉండలు తయారైనట్లే.

 చిట్టి చిట్కా : వెన్న పూస కొద్దిగా కరిగించి పిండిలో కలపాలి.లేదంటే ఒక్కొక్కసారి వెన్న ఉండలు నూనెలో పగిలిపోతాయి.నాకు ఒకసారి అలాగే జరిగింది.అప్పటి నుండి వెన్న కొద్దిగా కరిగించి కలపడం వలన వెన్న ఉండలు చక్కగా పగలకుండా వస్తున్నాయి.

నూనె,తీపి లేని కాకరకాయ కారం

                                                         ఒక కిలో తాజా కాకరకాయలు తీసుకుని ఉప్పు,పసుపు వేసి శుభ్రంగా కడిగి చక్రాల్లా ముక్కలు కోసి గల గలలాడేలా ఎండలో పెట్టాలి.నేను ఒక 8 గంటలు డీహైడ్రేటర్(పండ్లు,ఆకుకూరలు,కూరగాయల లోని తేమ లాగేసి ఎండి పోయేలా  చేసే పరికరం) లో పెట్టాను.ఏ కూరగాయ పెట్టినా ఒక కిలోకి 200 గ్రా. లు వస్తాయి. 

తయారీ విధానం :

ఎండిన కాకరకాయ ముక్కలు - 200 గ్రా. 

ఎండు మిర్చి - 15 

నువ్వులు - 1 పెద్ద చెంచా 

మినప గుళ్ళు - 1 పెద్ద చెంచా 

పచ్చి శనగ పప్పు - 1 పెద్ద చెంచా 

ధనియాలు - ఒక పెద్ద చెంచా

జీరా - ఒక పెద్ద చెంచా 

మెంతులు  - ఒక 1/4 చెంచా 

వెల్లుల్లి - 1 పెద్దది

ఉప్పు - రుచికి సరిపడా 

                                                          పొయ్యి వెలిగించి మందపాటి బాణాలి పెట్టి వెల్లుల్లి తప్ప అన్నీ నూనె లేకుండా తక్కువ మంటపై రంగు వచ్చే వరకు విడివిడిగా వేయించుకోవాలి.కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పప్పులు,ధనియాలు,జీరా,మెంతులు వేసి పొడి చేసిన తర్వాత ఎండు మిర్చి వేసి పొడి చేసిన తర్వాత నువ్వులు వెయ్యాలి.ఈ పొడిని ఒక పళ్ళెంలో వేసి ప్రక్కన పెట్టుకోవాలి.కాకరకాయ ముక్కలు,ఉప్పు వేసి  పొడి  చేసి వెల్లుల్లి రెబ్బలు వెయ్యాలి.దీనిలోప్రక్కన పెట్టుకున్న పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వెయ్యాలి.అంతే మంచి సువాసనతో నోరూరించే నూనె,తీపి లేకుండా చేసే కాకరకాయ పొడి తయారయినట్లే.దీనిని వేడి వేడి అన్నంలో కానీ,ఇడ్లి,దోసె పై కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.అసలు చేదు ఉండదు.ఇది నేను తయారు చేసే పద్ధతి.నువ్వుల బదులు పల్లీలు లేదా రెండు కూడా వేసుకోవచ్చు.ఎవరికి నచ్చిన రీతిలో వారు చేసుకోవచ్చు.ఒకసారి ప్రయత్నించి చూడండి. 

గమనిక :చింత పండు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.నేను వెయ్యలేదు.అయినా చేదు లేకుండా  చాలా బాగుంది.కాకరకాయ కారం రుచికి రుచి ఆరోగ్యానికి ఎంతో మంచిది.రోజూ ఒక చెంచా అయినా తినడం మంచిది.

Thursday 10 September 2020

తగిన గుణపాఠం

                                                     మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఒకరోజు హిమ పని వత్తిడిలో ఉండగా పొరుగింటి నుండి పెద్ద పెద్ద కేకలు వినిపించగా ఏమి జరిగిందోనని అటు చూడగా అక్కడ ఒక పెద్దావిడ నిలబడి కంగారుగా ఏదో చెప్తుంది.ఇంటావిడ అదేమీ వినిపించుకోకుండా అసలు  నువ్వు మెట్లు ఎక్కి పైకి రావడమేమిటి ? వెళ్ళిపొమ్మని కేకలు వేయడం మొదలెట్టింది.తర్వాత పది ని.లకు హిమ ఇంటి గంట మ్రోగింది.హిమ భర్త వెళ్ళగా ఒక పెద్దావిడ వాళ్ళాయన కళ్ళు తిరిగి పడిపోయాడని ఆసుపత్రిలో కూతుర్ని ఉంచి వచ్చానని ఏదైనా సహాయం చెయ్యమని అడిగింది.ఒక వంద రూపాయలు ఇచ్చి పంపించు అని చెప్తే హిమ ఇచ్చి వచ్చింది.హిమ ఇంటి పై అంతస్తుల్లో ఉన్న ఇళ్ళకు వెళ్ళవద్దు.పైకి వెళ్ళకూడదు అని చెప్పినా వినకుండా డబ్బు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అడిగితే పోయేదేముంది అంటూ  వాళ్ళను కూడా అడుగుతాను అంటూ ఆయాసపడుతూ పైకి వెళ్ళింది.హిమ పనిమనిషి రోజాకు రోజూ వేడివేడిగా అన్నం కూరలు ఇచ్చే అలవాటు.ఆరోజు కూరలు ఇచ్చింది కానీ అన్నం పెట్టి ఇద్దామనుకునేలోపు ఏదో చిరునామా కోసం చరవాణికి భర్త ఫోను చెయ్యడంతో ఆ విషయం మర్చిపోయింది.రోజా వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పింది కానీ హిమకు గుర్తులేదు.భర్త ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేద్దామని చూచినప్పుడు అయ్యో రోజాకి ఈరోజు అన్నం పెట్టడం మర్చిపోయాను అని నొచ్చుకుని కొడుకును పంపమని ఫోను చేస్తే ఫోను కలవలేదు.సరే సమయానికి పెద్దావిడ వచ్చింది కదా!అని భోజనం ఇవ్వనా?అని అడిగితే సంతోషంగా తీసుకెళ్ళి ముసలాయనకు పెడతానని చెప్పడంతో అన్నీ  చక్కగా డబ్బాలో సర్ది ఇంట్లో రెండు రకాల పండ్లు ఉంటే అవి కూడా ఒక సంచిలో సర్ది ఇచ్చింది.మీ ఋణం ఎలా తీర్చుకోవాలి ? అంటూనే అద్దె ఇల్లా ?స్వంత ఇల్లా ?అద్దె ఎంత ? ప్రశ్న,సమాధానం కూడా తనే చెప్పుకుని 10,20,30 వేలా తనలో తనే అమ్మో అంత డబ్బు కట్టగల్గుతున్నారా? ?అని  ఆరాలు మొదలెట్టింది.ఆపదలో ఉన్నానంటే తలా ఒక వంద ఇచ్చిన డబ్బులు,ఒక పూట భోజనము చేతిలో కనపడేసరికి ఉబ్బితబ్బిబ్బై ఎవరితో ఏమి మాట్లాడుతుందో కూడా తెలియకుండా మాట్లాడేసరికి అంతకు ముందు ఆమె తీరుకు ఇప్పటి మాట తీరుకు హిమ ఆశ్చర్యపోయింది.ఇంతలోనే ఎంత మార్పు అని మదిలో అనుకుని హిమ ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం పెట్టి వెళ్ళమని సైగ చేసి తలుపు వేసి లోపలకు వచ్చింది.చిన్నబోయిన మోముతో లోపలకు వచ్చిన హిమను ఏమి జరిగిందని భర్త అడిగితే విషయం చెప్పగానే కనపడిన వాళ్ళందరిని చూచి జాలిపడితే ఇలాగే ఉంటుంది.ఏదో డబ్బు సహాయం చేశావు.ఊరుకోకుండా పిలిచి వేడివేడిగా భోజనం ఇచ్చినందుకు తగిన గుణపాఠం చెప్పింది.భవిష్యత్తులో ఇటువంటి పనులు చెయ్యకూడదని గుర్తుపెట్టుకోదగిన అనుభవం ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి అన్నారు. 

Saturday 5 September 2020

నమస్సుమాంజలి

                                                  గురువు అంటే జ్ఞానాన్ని పంచేవారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారే కాకుండా మానవతా విలువలు,లోకం పోకడ,మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పే ప్రతి ఒక్కరూ గురువులే.పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లి.తర్వాత తండ్రి.తర్వాత పెద్దలు,మిగిలినవారు.పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు వచ్చేటప్పటికి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులది.మంచి పౌరులుగా తయారవడానికి మన వెనుక ఇంతమంది కృషి ఉండబట్టే మనం సమాజంలో మనగలుగుతున్నాము.అది గుర్తు పెట్టుకుని మనం ఈ ఒక్కరోజే అని కాకుండా ప్రతి రోజు జీవితంలో వీళ్ళందరినీ మరువకూడదు.గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్  పర బ్రహ్మ తస్త్మై శ్రీ గురవే నమః అంటూ గురు పూజోత్సవం సందర్భంగా నాకు మంచి బుద్ధులు నేర్పించిన నా తల్లిదండ్రులకు,పెద్దలకు, విద్యను నేర్పిన ఉపాద్యాయులకు,ఆధ్యాత్మిక విలువలను నేర్పే  గురువులకు నమస్సుమాంజలి.నా బ్లాగ్ వీక్షకుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.  

Tuesday 25 August 2020

హడావిడిగత్తె

                                                       మాన్సి ఏ పని చేసినా త్వరత్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో హడావిడి పడుతూ ఉంటుంది.ఎప్పుడూ సక్రమంగానే చేస్తుంది.ఒక్కొక్కసారి ఆ హడావిడిలో వంట చేసేటప్పుడు ఒకటి చెయ్యబోతే ఇంకొకటి అవుతుంది.మళ్ళీ దాన్ని వృధా కాకుండా ఏదో ఒకటి చేసి ఆ పదార్ధాన్ని రుచిగా తయారు చేస్తుంది.అది వేరే విషయం అనుకోండి.ఈరోజు కూడా అలాగే చేసింది.ముడి గోధుమ రవ్వ ఉప్మా  చేద్దామని మొదలు పెట్టింది.అన్నీ సిద్దం చేసుకుని పొయ్యి మీద బాండీ పెట్టి తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చి మిర్చి,అల్లం ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మూతపెట్టి రవ్వ తీసుకునే  లోపు ఎవరో పిలిస్తే వెళ్ళింది.మళ్ళీ వచ్చి నీళ్ళు పోసి మూతపెట్టింది.నీళ్ళు మరుగుతుండగా గ్యాస్ బండ వచ్చింది.ఈ క్రమంలో సరుకుల సంచిలో నుండి ఒక పొట్లం తీసి ఒక కప్పు నీళ్ళల్లో పోసి వేరే పనిమీద వెళ్ళింది వచ్చేసరికి మెత్తగా ఉడక వలసింది  పోయి ఎలా పోసినది అలాగే  నీళ్ళల్లో మరుగుతుంది.హడావిడిలో నీళ్ళు ఎక్కువ పోశానేమో అనుకుని బొంబాయి రవ్వ కాస్త పోసింది.అయినా గట్టిపడలేదు.అప్పుడు రెండు గుప్పెళ్ళు అటుకులు కడిగి పోసింది.ఇంకా పలుచగానే ఉండడంతో మంట పెద్దది చేసి కాస్త దగ్గరపడిన తర్వాత పొయ్యి కట్టేసింది. భర్తకు పెట్టింది.అయన నోట్లో పెట్టుకుని ఇదేమిటి గట్టిగా నమలవలసి వస్తుంది.నువ్వుల రుచిగా ఉంది.నువ్వుల ఉప్మా చేసావా ఏమిటి ? అనగానే మాన్సి తెల్లబోయి గోధుమ రవ్వ వేసాను కదా! అని రుచి చూసింది.అది నిజంగానే నువ్వుల ఉప్మా.రుచిగానే ఉంది కానీ నువ్వులు వేడి అని ఎవరూ ఉప్మా చేసుకోరు.సరేలే వేరే పదార్ధం చేసే  సమయం లేదు కనుక ఈరోజుకి తినండి మజ్జిగ తాగితే వేడి తగ్గిపోతుందని ఇంట్లో వాళ్ళకు సర్ది చెప్పింది మాన్సి.రుచి బాగుందంటూ ఒకరు,మనసులో తిట్టుకుంటూ ఒకరు తిన్నారు.పని మనిషి అయితే మీరు ఏమి చేసినా బాగుంటుంది అమ్మా అంటూ  లొట్టలేస్తూ తినేసింది.ఏ మాటకామాటే కానీ నిజంగానే రుచిగా ఉంది.అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్లు గోధుమ రవ్వ ఉప్మా బదులు నువ్వుల ఉప్మా అయింది.మాన్సి  కూడా నువ్వుల లడ్డు చెయ్యడమే కానీ  ఉప్మా ఎప్పుడూ చెయ్యలేదు.అందుకే చిన్నప్పుడు మాన్సి  ని స్నేహితులు హడావిడిగత్తె అని ఆట పట్టించే వాళ్ళు.  పై సంఘటన తలచుకుని మాన్సి తను చేసిన పనికి తనే గుర్తొచ్చినప్పుడల్లా  రోజంతా నవ్వుకుంటూనే ఉంది.                                    

Wednesday 12 August 2020

జవ్వ గోధుమ రవ్వ అటుకుల పాయసం

 జవ్వ గోధుమ రవ్వ  - 1 కప్పు 

అటుకులు  - 1/2 కప్పు 

  పాలు - 1 1/2 కప్పు  

నీళ్ళు  -  3 కప్పులు 

 బెల్లం  - 1  కప్పు 

 పంచదార - 1/2 కప్పు 

 నెయ్యి - 3  చెంచాలు 

జీడిపప్పు  - చిన్న ముక్కలు 2 చెంచాలు 

ఎండు ద్రాక్ష  -  8 

యాలకుల పొడి  - 1/4 చెంచా  

                                                        ముందుగా పొయ్యి వెలిగించి బాణాలి పెట్టి వేడెక్కాక 1 1/2 చెంచా నెయ్యి వేసి జవ్వ గోధుమ రవ్వ వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.దాన్ని ఒక గిన్నెలో పోసి అదే బాణలిలో అటుకులు వేయించాలి.వీటిని కూడా ఒక చిన్న గిన్నెలో పోసి అదే బాణాలిలో బెల్లం,పంచదార వేసి కొంచెం నీళ్ళు పోసి కరిగాక వడపోసి ప్రక్కన పెట్టుకోవాలి.అదే బాణలిలో పాలు,మిగిలిన నీళ్ళు పోసి మరిగాక రవ్వ వేసి బాగా ఉడికించాలి.కొంచెం రవ్వ మెత్తగా ఉడికాక వేయించిన అటుకులు వేసి ఉడికాక నేతిలో  వేయించుకున్న  జీడిపప్పు,ఎండు ద్రాక్ష యాలకుల పొడి వేసి బాగా కలిపి పొయ్యి కట్టేసి దింపేయాలి.అంతే ఎంతో మధురమైన జవ్వ గోధుమ రవ్వ అటుకుల పాయసం తయారయినట్లే.

సూచన : ఈ పాయసం మరీ దగ్గరగా అయ్యేవరకు ఉంచితే గట్టిపడుతుంది కనుక కొంచెం దగ్గర పడుతున్నప్పుడే తీసేస్తే తినడానికి చాలా రుచిగా బాగుంటుంది.రవ్వ గట్టిగా అయిపోతుంది కనుకే మనం అటుకులు వేస్తే బిగుసుకోకుండా ఉంటుంది.నెయ్యి కానీ తీపి కానీ ఎక్కవ తినేవాళ్ళు మీకు అవసరమైనంత వేసుకోవచ్చు.

                                                           

Tuesday 7 July 2020

రజాయిలో అక్కీ

                                       అఖిల్ మూడేళ్ళ బాబు.అక్కీ ముద్దు పేరు.అందంగా ముద్దుముద్దుగా మాటలు చెప్తూ ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తుంటాడు.దానికి తోడు అల్లరి,ఆటలు ఎక్కువ.రోజంతా అమ్మకి  వాడితోనే సరిపోతుంది.అమెరికాలో ఉండడంతో అక్కీకి అమ్మానాన్నే లోకం.ప్రపంచ వ్యాప్తంగా నిర్భంద సమయంలో ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో నుండి పనిచేయడంతో అక్కీ  బాగా అల్లరి చేస్తుంటే అక్కీ అమ్మ దివ్య కోప్పడింది.దానితో వాడికి కోపం వచ్చింది.అమ్మేమో కార్యాలయం పనిలో పడి అక్కీని గమనించలేదు.వాడి సంగతి ఒక అరగంట మర్చిపోయింది.కాసేపటికి అక్కీ ఎక్కడ ఉన్నాడో?ఏమి చేస్తున్నాడో ? అని కంగారుపడి అక్కీ అమ్మ దివ్య ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు.మోటారు వాహనాలు పెట్టే గది తలుపు తెరిచి ఉండడంతో బయటికి వెళ్ళాడేమోనని చుట్టుప్రక్కల అంతా వెతికినా కనపడకపోయేసరికి అమ్మ ఒకటే ఏడుపు.స్నేహితులు అందరూ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చారు.అందరూ కలిసి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. సి సి టి.వి పుటేజిలో చూస్తే అక్కీ బయటకు వెళ్ళినట్లు కనిపించలేదు.అందువల్ల ఇంట్లోనే ఉండి ఉండవచ్చని నిర్ధారించుకుని ఇల్లంతా వెతుకుతుంటే పడకగదిలో మంచం మీద మందంగా ఉన్న రజాయి (కంఫర్టర్) లో దూరి నిండా ముసుగు వేసుకుని నిద్రపోతున్నాడు.మొట్టమొదటే వాళ్ళ నాన్న రజాయిని లాగి చూచినా ఆ కంగారులో చిన్నవాడు కదా!కనిపించలేదు.అందరూ రెండు గంటలు నానా హైరానా పడి వెతికి అమ్మ క్రింద పడి పొర్లి పొర్లి ఏడ్చిన తర్వాత చిట్ట చివరకు ఇంట్లోనే ఉండడంతో అందరూ సంతోషించారు.అక్కీ ఎందుకు ఇలా చేశావు? అని అడిగితే నువ్వు తిట్టావు అందుకే కోపం వచ్చి నిద్రపోయాను అని చెప్పడంతో వేలెడంత లేడు.వీడికి అప్పుడే కోపం అంటూ అంతవరకు పడిన కంగారు మర్చిపోయి తేలిక పడిన మనసుతో హాయిగా నవ్వుకున్నారు. 

Monday 6 July 2020

భలేగున్నవు సాయి

                                                              మహా అయితే గురు పౌర్ణిమ సందర్భంగా వీలయితే గుడికి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటాము.సహజంగా ఇంట్లో పూజ చేసుకుంటాము.ఇంకా చెయ్యగలిగితే  రక రకాల పిండి వంటలు చేసి నివేదన పెడతాము.కానీ నిన్న గురు పౌర్ణమి మాత్రం నా జీవితంలో మర్చిపోలేనిది.ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావడమే కానీ హారతులు అంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టగూడదు అనే ఉద్దేశ్యంతో   ఆ సమయంలో వెళితే గంట పడుతుంది అని తప్పించుకునేదాన్ని.ఈమధ్య నిర్భంద కాలంలో ప్రవచనాలు వినడంతో  సాయి హారతుల వలన మన కర్మలు తొలగుతాయని తెలిసింది.కరోనా సమయంలో రక్షణ కోసం పౌర్ణమి,అమావాస్య తిధుల్లో చేసుకోవలసిన పూజలు,హోమాలు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్లో సాయి సర్వస్వం లైవ్ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోమనడంతో నచ్చి ఆచరించడం జరిగింది.దీనితో సమయపాలన,క్రమశిక్షణ అలవడింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సాయి సర్వస్వం వాళ్ళదే ద్వారకామాయి టి.వి ద్వారా లైవ్ లో నిన్నటి గురుపుజోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించడంతో చక్కగా పనులు చేసుకుంటూనే అన్ని హారతులు,అభిషేకాలు,స్వర్ణ పుష్పాలతో స్వర్ణ పాదుకల పూజ,యంత్ర పూజ,బాబా అష్టోత్తర శతనామావళి,సాయంత్రం నక్షత్ర హారతి,సాయికి పూలాభిషేకమ్ అన్ని చక్కగా చూడడం జరిగింది.ఇంతకీ విశేషం ఏమిటంటే మిగతా అన్ని సేవల్లో ఇంతకు ముందు పాల్గొన్నా కానీ ఐదు రకాల కేరళ పంచ వాయిద్యాలతో ఇరవై ఏడు రకాల నక్షత్ర హారతులు చూడడం,గురూజీ హారతులు ఇచ్చే విధానం అత్యంత అధ్భుతం.చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఒళ్ళంతా పులకించిపోయింది.భలేగున్నవు సాయి అంటూ పాట పడుతూ చేసే పూలాభిషేకం ఎంతో మధురం.ఆ పాట అంటే నాకూ చాలా ఇష్టం.ఏడు రోజులు ఏడు రకాల పువ్వులు తెస్తాం అంటూ లయబద్దంగా పాడుతూ ఉంటే    వింటూ బాబాను చూస్తూ భలేగున్నవు సాయి అనుకుంటూ ఆనందోత్సాహాలలో తేలియాడుతూ మానసికంగా చిన్నపిల్లలా గంతులు వేసినంత ఆనందం కలిగింది.సాయి అనుగ్రహం లేనిదే ఆయన దర్శనానికి కూడా వెళ్ళలేమని మనకు అనుభవమే కదా!టి.వి ఎక్కువగా  చూడని నేను నిజంగా సాయి అనుగ్రహంతోనే  ఈరోజు కుదురుగా కూర్చుని చూడగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ సాయికి,గ్రాండ్ మాష్టర్ సాయికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. 

Friday 3 July 2020

దెబ్బ మీద దెబ్బ

                                                                          సీత కష్టాలు సీతవి.పీత కష్టాలు పీతవి అన్నట్లు ఈ నిర్భంధ సమయంలో (లాక్ డౌన్) అందరికీ చిన్నవో,పెద్దవో ఏదో ఒక ఇబ్బందులు ఎదురౌతూనే ఉన్నాయి.అందులో కష్టపడి పని చేసుకునే జానకి అప్పోసప్పో చేసయినా కూతురు జమున పెళ్ళి ఘనంగా చేయాలని చేసింది.పెళ్ళి  బాగా జరిగిందని అందరూ సంతోషపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని ఎదురు దెబ్బ తగిలి బొక్క బోర్లా పడిపోయింది.దొరికిన చోటల్లా అప్పులు చేసి మంచి సంబంధం ఉద్యోగస్తుడయితే  పిల్ల సుఖపడుతుందని చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళి చేసింది.పెళ్ళయిన తెల్లారి నుండే మీ వాళ్ళందరిని వదిలెయ్యాలి లేకపోతే నీకు విడాకులు ఇస్తానంటూ పాట పాడడం మొదలెట్టాడు.మా వాళ్ళను వదిలెయ్యడం ఏమిటి?అని ఎదురు ప్రశ్న వేస్తే కొట్టడం మొదలెట్టాడు.దీనికి తోడు మద్యపానం,ధూమపానం,గంజాయి బిళ్ళలు తీసుకోవడం దీనివల్ల నరాల బలహీనత,అవయవాలు పనిచేయకపోవడంతో  దానికోసం మందులు వాడడం ఇవ్వన్నీ  తెలియకుండా కప్పి పుచ్చుకోవడానికి జమునను కొట్టడం,బూతులు తిట్టడం పరిపాటి అయిపోయింది.జమున తెలివిగలది కనుక కొట్టిన దెబ్బలు ఫోటో తీసి,బూతులు తిట్టినప్పుడు రికార్డ్ చేసి చరవాణిలో రహస్య ఫైలులో దాచి పెట్టినది.దరిద్రుడికి 64 కళలు అన్నట్లు చరవాణి తనిఖీ చేయడంతో ఎందుకైనా మంచిదని శ్రేయోభిలాషికి,అన్నయ్యకు అన్ని ఆధారాలు పంపింది.వాడిలో లోపం కప్పి పుచ్చుకోవడానికి మీ అమ్మాయి సంసారానికి పనికి రాదు అని జానకి వాళ్ళకు,బంధువులకు అబద్దాలు చెప్పడం మొదలెట్టాడు.ఎవరిలో లోపం ఉందో వెళ్ళి ఆసుపత్రిలో తేల్చుకుందాము అని జమున గట్టిగా అనడంతో వీరావేశంతో కొట్టి చరవాణి లాక్కుని నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది.జానకి,భర్త ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు మీ అమ్మా,నాన్న కూడా ఊరిలో లేరు  నిన్ను చంపేస్తే  ఏమి చేస్తావు?అంటూ తాగి వెకిలిగా మాట్లాడడంతో ప్రాణభయంతో తెలిసినవాళ్ళకు చంపేస్తున్నాడని సమాచారం అందించడంతో జమున అన్నయ్య ఆగమేఘాలమీద వెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా పెళ్ళయిన వారంలోపే జరిగింది.పెళ్ళి మాట దేముడెరుగు కూతురు బతికుంటే చాలు అనుకుని పంచాయితీ పెట్టి విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.అన్ని ఆధారాలు ఉండడంతో తప్పు ఒప్పుకుని నష్టపరిహారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.కూతురికి పెళ్ళి చేసి లేని కష్టాలు కొని తెచ్చుకున్నామనే బాధలో ఉండగానే  జానకి కొడుకు రోషన్ కు కడుపునొప్పి వచ్చి అప్పటికప్పుడు శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది.కరోనా గోలతో 40,000 /- కడితేనే వైద్యం అనడంతో మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది.ఏమంటా ఈ పెళ్ళి చేశామో దెబ్బ మీద దెబ్బ అని జానకి లబోదిబోమని ఏడవడం మొదలెట్టింది.ఏడవకు జానకి కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో  ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కుంటే అవే కాలానుగుణంగా సర్దుకుంటాయి అని అందరు చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది.

Wednesday 1 July 2020

సర్వేజనా సుఖినోభవంతు

                                     అందరికి నమస్తే.చాలా రోజుల తర్వాత తెలుగు వారి బ్లాగుకు స్వాగతం.ఈ కరోనా హంగామాతో అందరు ఇంటికే పరిమితమైనా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండి ఉంటారని ఆశిస్తున్నాను.అందరూ ఎవరికి తోచినది వారు చేసే ఉండి ఉంటారు.కాకపోతే నేను ఉడతా భక్తిగా ఏమి చేశానంటే? ఇన్ని రోజులు నేను నాకు  సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందిస్తూ మేము,మీరు,మన అందరితోపాటు సర్వేజనా సుఖినోభవంతు,సమస్తా లోకా సుఖినోభవంతు అంటూ అందరూ బాగుండాలని సూర్యోదయానికి,సూర్యాస్తమయానికి ముందుగా దీపాలు వెలిగించి పూజలు,పారాయణాలు చేస్తూ భగవంతుని ప్రార్ధించడం దినచర్యలో భాగం అయిపోయింది.దీనితో ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది.కళ్ళు మూసి తెరిచినట్లుగా నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి.అకస్మాత్తుగా రోజువారీ  అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.ఏ పని చేయాలని అనిపించేది కాదు.ఆ తర్వాత మనసుకు ఒక్కసారిగా స్తబ్దత ఆవరించినట్లు రోజంతా నిద్ర.అలసటతో శరీరమంతా బద్ధకం.ఒక పది రోజులు గడిచిపోయినాయి.ఎందుకు ఇలా ?దీని నుండి ఎలాగైనా బయటపడాలని బాబాకి నమస్కారం చేసుకుని చరవాణి చేతిలోకి తీసుకుని సానుకూల దృక్పధం అని నొక్కగానే సాయి సర్వస్వంలో  బాబా సానుకూల దృక్పధం చైతన్య క్రియ చూచి ఆచరించడంతో ఆశ్చర్యంగా మనసుకు  ఆవరించిన స్తబ్దత ఒక్కసారిగా దుమ్ము దులిపినట్లు తొలగిపోయింది.ఇది నిజంగా మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.మనకు సహాయం చేసినవారికి ధన్యవాదములు తెలియచేయడం  మన సంస్కారం.బాబాకు,సాయి సర్వస్వం వారికి ధన్యవాదములు.రోజూ మీ అందరితో ఎన్నెన్నో ఊసులు,కొత్తకొత్త కబుర్లు చెప్పాలని ప్రయత్నించడం బద్దకంతో అక్కడ నుండి వెళ్ళిపోవడం నిజంగా నాకే విచిత్రంగా ఉండేది.ఇక ముందు వీలయినప్పుడల్లా తప్పకుండా కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను.మరి ఎప్పటిలా నా కబుర్లు ఆసక్తిగా చదువుతారు కదూ.       

Friday 28 February 2020

వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే

                                                            వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక ....... నీతిపరుడు మహిలో సుమతీ అని చిన్నప్పుడు సుమతీ శతకంలో నేర్చుకున్నాము కదా ! ఈ రోజుల్లో  చాలామంది  అడిగినా అడగకపోయినా అనేక రకాల మాటలు నిజమైనా అబద్దమైనా నిజమే అన్నట్లు మాట్లాడుతుంటారు.అవన్నీ విన్న వెంటనే ఆవేశపడి నిర్ణయాలు  తీసుకోవటం లేదా నీ సోది ఆపు అన్నట్లుగా ప్రవర్తించకూడదు.అది మంచి పద్ధతి కాదు.దానివల్ల  ఒక్కొక్కసారి కొన్ని లేనిపోని  సమస్యలు రావచ్చు. అటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా సాలోచనగా అన్నీ విని అందులో నిజమెంత ? అబద్దమెంత ? అందులో మనకు పనికి వచ్చేది ఎంత ?ఒకవేళ ఏమైనా ఉంటే మనకు తోచిన విధంగా దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే నిజమైన తెలివితేటలు కలవాళ్ళు.ఇంకా కొంత మంది పెద్దవాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.అందులో కొన్ని మనకు ఉపయోగపడే విధంగా కూడా ఉండొచ్చు.అందుకే ఎవరు చెప్పినా మనకు ఇబ్బంది కలగనంత వరకు వినడంలో తప్పు లేదు.ముఖ్యంగా మన మంచి కోరే పెద్దవాళ్ళు చెప్పినవి చాదస్తం అనుకోకుండా ఓపికగా కొద్దిసేపు వినడం వలన  లాభమే కానీ నష్టం వాటిల్లదు.

Thursday 20 February 2020

మహా శివరాత్రి

                                                                        మహా శివరాత్రి రోజు చేసే అభిషేకాలకు,పూజలకు విశేష ఫలితం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.శివుడు భక్త సులభుడు కనుక అవేమీ చేయకపోయినా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా లేదా ఒక మారేడు దళము పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసినా  కోరిన కోర్కెలు వెంటనే తీర్చేస్వామి.అసలు భక్తి ఉన్నా లేకపోయినా సంవత్సరమంతా పూజలు చేయకపోయినా ఈరోజు ఏ విధంగా పూజించినా అప్రయత్నంగా ఉపవాసము,జాగరణ చేసినా కోటి జన్మల పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణేతిహాసాలు తెలియచేస్తున్నాయి.కనుక ఎవరి వీలును బట్టి వాళ్ళు ఈ పర్వదినాన్ని సంతోషంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని,పార్వతీ పరమేశ్వరుల దయవల్ల అందరూఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగ్ వీక్షకులకు ,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మరియు మీ కుటుంబసభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.  
        
                                                     

Tuesday 14 January 2020

మకర సంక్రాంతి

                                                                      మకర సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవిరకరకాలముగ్గులు,గొబ్బెమ్మలు,హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, కోడిపందేలు, గాలిపటాలు, చెరుకు గడలు, రేగిపళ్ళు, తేగలు, నువ్వులతో చేసిన అరిసెలు, రకరకాల పిండి వంటలు ఒకటేమిటి నెల రోజులు సందడే సందడి. తెల్లవారుఝామున లేచి ఆకాశంలో చుక్కలు ఉండగానే తులసి మొక్క  వద్ద తిరుప్పావై పాసురాలు చదువుతూ చేసే పూజలు ఒక ఎత్తైతే చివరగా గోదాదేవి రంగనాధుల కళ్యాణం, గోపూజలతో ముగుస్తాయి. ముఖ్యంగా ఈ చివరి మూడు రోజుల పండుగ మరీ ప్రత్యేకం. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పెద్దవాళ్ళతో స్వంత ఊరిలో సరదాగా గడపడం కోసం పిల్లలు ఎంత దూరంలో ఉన్నా సరే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు వారందరికీ, పిల్లలకు, పెద్దలకు, నా బ్లాగు వీక్షకులకు, తోటిబ్లాగర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భోగి, మకరసంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనందరికీ భోగి భోగ భాగ్యాలను, మకర సంక్రాంతి సుఖ సంతోషాలను, కనుమ కష్టాలను తొలగించి కమ్మని అనుభూతులను మిగల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.