భవ్య ఇంటి చుట్టూ బోలెడంత అంటే చాలా ఖాళీ స్థలం ఉంది.దానిలో రకరకాల పువ్వుల మొక్కలతోపాటు కూరగాయలు,ఆకుకూరలు పెట్టింది.భవ్య వరుసకు చెల్లెలు గవ్య డాబాపై కూరగాయలు పెంచుకోవటం ఎలా?అని ఉద్యానవన శాఖవారు పెట్టిన తరగతులకు హాజరైతే వాళ్ళు రకరకాల నమునా కూరగాయలు,ఆకుకూరల విత్తనాలు ఇచ్చారు.వాటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో చాలా స్థలం ఉంది కదా! పెట్టమని భవ్యకు ఇచ్చింది.గవ్య వేరే ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా వాళ్ళు మొక్కలను కాపాడలేకపోయారు.భవ్య గింజలు భూమిలో పెట్టి మొక్కలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కాపాడింది.ఎలాగైతే కొన్ని రోజులు కాయలు బాగానే వచ్చాయి.చుట్టుపక్కల అందరికీ ఇచ్చింది.రుచి చాలా బాగుంది అని అందరు మెచ్చుకున్నారు కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.ఈమధ్య తెల్లారేసరికి పందిరికి వేళ్ళాడే కాయలు,క్రింద ఉన్న పిందలన్నీ కొరికి ముక్కలు చేసి ఉంటున్నాయి.ఉదయం తోటలోకి వెళ్తే అప్పుడే కొరికినట్లుగా తెల్లగా ముక్కలు క్రింద పడి ఉంటున్నాయి.రాత్రిపూట ఏ పందికొక్కులు,ఎలుకలు తింటున్నాయో లేదా తెల్లవారుఝామున ఉడుతలు కొరికేస్తున్నాయో తెలియక భవ్య బుర్ర బద్దలుకొట్టుకునేది కాక గవ్య బుర్ర అదేపనిగా తినడం మొదలెట్టింది.పైన వాటికి కవర్లు చుట్టి,క్రింద ఉన్న వాటిపై గమేళాలు,బక్కెట్లు బోర్లించి నానా తిప్పలు పడితే గాలి తగలక పిందెలు కుళ్ళిపోతున్నాయి.భవ్యకు ఏడుపు వచ్చినంత పనై దొంగ మొహంది ఏది వచ్చి తింటుందో కానీ నాకైతే ప్రాణం ఉసూరుమంటుంది.ఎన్ని విధాలుగా కాయల్ని కాపాడదామని ప్రయత్నించినా కాపాడలేక,తినేవాటిని నియంత్రించలేక విసుగొచ్చి మందు పెట్టి చంపెయ్యాలన్నంత కచ్చి పుడుతుంది. నాకు నిద్రలో కూడా అదే ధ్యాసగా ఉంటుంది అంటూ కంఠ శోషగా చెప్పింది..ఒకటి,అర అయితే ఊరుకోవచ్చు కానీ ఈరోజు ఒకటి కొంచెం కొరికి మళ్ళీ తర్వాతి రోజు పక్కది కొరుకుతుంది అని చెప్పింది.భవ్య.ఎలుక అయ్యుంటుంది బోను పెట్టు అని సలహా ఇచ్చింది గవ్య.ఒక చిన్న పకోడీ పెట్టి బోను పెడితే చిట్టెలుక పడింది అంటూ తెల్లారేపాటికి ఉత్సాహంగా గజదొంగను పట్టుకున్నానని చెప్పింది.చిన్న ప్రాణే కానీ పాపం భవ్యను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.
Friday, 21 December 2018
Tuesday, 18 December 2018
కేడి పెయ్య
హైమ ఒకరోజు ఇంట్లోకి వస్తూనే చాటంత మొహంతో ఎంతో సంతోషంగా అమ్మా!ఊరిలో ఉన్న మా ఆవుకు కేడి పెయ్య పుట్టిందని మా అత్త చరవాణిలో చెప్పింది అంది.కేడి పెయ్య అనే పదం మొదటిసారి వినడంతో అంటే ఏమిటి?అంది శ్రుతి.మగ దూడను కేడి పెయ్య అంటామని చెప్పింది హైమ.ఎవరైనా ఆవుకి కానీ,గేదేకి కానీ పెయ్య దూడ పుడితే సంతోషపడతారు కానీ విచిత్రంగా నువ్వు మాత్రం కేడి పెయ్య పుడితే సంతోషపడతావేంటి?అంది శ్రుతి.మా ఊరిలో అందరూ కేడి పెయ్య పుడితే సింహాద్రి అప్పన్న స్వామికి ఇస్తామని మొక్కుకుంటారు.మేము కూడా సింహాద్రి అప్పన్న స్వామికి కేడి పెయ్యను ఇస్తామని మొక్కుకున్నాము అని చెప్పింది హైమ.కేడి పెయ్య కొంచెం పెద్దయ్యాక స్వామికి మొక్కుబడి తీర్చేటప్పుడు కుటుంబం మొత్తం ఏ ఊరిలో ఉన్నా అందరము మా ఊరికి వెళ్ళిపెద్ద సంబరం చేసుకుంటాము.ఆరోజు కేడి పెయ్యతోసహా అందరము శుద్ధి స్నానాలు చేసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ కేడి పెయ్యను కూడా తిప్పి అక్కడ ఇచ్చేస్తే దేవస్థానం వాళ్ళు పెంచి పోషిస్తారని హైమ ఎంతో సంబరంగా శ్రుతికి చెప్పింది.
Monday, 10 December 2018
కసకస
ఆదిత్య రామ్ ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు.ఒకసారి నగరం నుండి ఊరికి వచ్చినప్పుడు పిన్నిని,బాబాయిని చూడడానికి వాళ్ళింటికి వెళ్ళాడు.భోజనానంతరం మాటల మధ్యలో ఏరా నాన్నా!నీ ఉద్యోగం ఎలా ఉంది?అని అడిగింది పిన్ని.బాగానే ఉంది అని చెప్పి మా మానేజరు మంచివాడే కానీ అప్పుడప్పుడు కాస్త తిక్క వస్తుంటుంది.అప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళను సతాయించుతూ ఉంటాడు.అప్పుడు అతన్ని ఏమీ అనలేము కదా!అందుకే ఎప్పుడైనా మా మానేజరుపై కోపం వస్తే రైతుబజారు నుండి కారట్,క్యాబేజ్ కొనుక్కొచ్చి ఆ కోపం తగ్గేవరకు కసకస వాటిని కోసి కూర వండుకుని స్నేహితులందరము కలిసి తింటాము.అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు పిన్ని అని ఆదిత్య రామ్ చెప్పాడు.అక్కడ ఉన్న వాళ్ళందరు ఒకటే నవ్వులు.ఇదేదో బాగానే ఉందే అంది పిన్ని.ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిపై కోపంతో విరుచుకు పడడం,వాళ్ళు బాధపడటం ఇవేమీ లేకుండా ఆ అసహనాన్ని కారట్,క్యాబేజ్ పై చూపించడం కాసేపటికి మామూలైపోవడం అన్న ఆదిత్య ఆలోచన నిజంగా బాగుంది.ఎవరికీ కష్టం,నష్టం లేని పని అని అక్కడ వింటున్న వారందరూ అనుకున్నారు.
Thursday, 6 December 2018
అరటి ఆకులో భోజనం
ఇంతకు ముందు రోజుల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు తప్పనిసరిగా నదీస్నానానికి వెళ్ళి అటునుండి అటే శివాలయానికి వెళ్ళి వత్తులు వెలిగించుకుని శివదర్శనం అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి సాయంత్రం మరల స్నానం చేసి శుచిగా వంట చేసుకుని పూజానంతరం నక్షత్ర,చంద్ర దర్శనం చేసుకుని తర్వాత తప్పనిసరిగా అరటి ఆకులో భోజనం చేసేవారు.రోజువారీ తినే పళ్ళేలలో రకరకాల ఆహారపదార్ధాలు తింటూ ఉంటారు కనుక ఉపవాసం ఉన్నప్పుడు అరటి ఆకులో భోజనం చేయడం మంచిదని పెద్దలు చెప్పేవారు.మాములుగా కూడా అరటి ఆకులో భోజనం చేయడం వలన ఆహారపదార్ధాల వేడికి ఆకులోని ఔషధ గుణాలు పదార్ధాలలో కలిసి ఆహారం మరింత రుచిగా ఉండడమే కాక జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని,ఆకలి కూడా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతుంది.అంతేకాక ప్రేగులలో ఉన్న చెడు క్రిములు నశిస్తాయని తద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమని పెద్దల ఉవాచ.
Friday, 23 November 2018
కార్తీక పున్నమి
ఏ పౌర్ణమి ప్రత్యేకత ఆ పౌర్ణమికే ఉన్నా అన్నింటిలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతే వేరు.తెల్లవారుఝామునే నిద్ర లేచి నదీస్నానానికి వెళ్లి అభిషేకాలు,పూజలు దానితోపాటు రోజంతా ఉపవాసం ఉండి నేతిబీరకాయ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని ఎలాగైనా సంపాదించి నేతి బీరకాయ పచ్చడి చేసి దానితోపాటు రకరకాల వంటలు చేసుకుని చలిమిడి,వడపప్పు,జామ కాయలతో గుడికి వెళ్లి ఆవునేతితో 366 వత్తులు వెలిగించి మారేడు,ఉసిరి,జమ్మి వృక్షాలను పూజించి ఇంటికి వచ్చి తులసికోట వద్ద దీపాలు పెట్టడం,ప్రత్యేకంగా ఈరోజున చంద్రుడిని వరిపిండితో ముగ్గు రూపంలో వేసి పసుపు,కుంకుమ,గంధం,పూలు అలంకరించి దీపాలు వెలిగించి వెండి గిన్నెలో పాయసం నివేదన పెట్టి పూజచేసే పద్ధతి,ఆ హడావిడి ఆ సంతోషం చెప్పనలవి కానిది.చంద్రుడు మంచి భర్తను మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు.అందుకే అందరూ నిండు మనసుతో,నిండు పున్నమిలో నిండుగా దీపాలు పెట్టి నిండు నూరేళ్ళు కార్తీక పున్నమి చంద్రుని దయవల్ల చల్లగా,ప్రశాంతంగా,సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు.
Wednesday, 21 November 2018
366 వత్తులు
పౌర్ణమి తిధి రెండు రోజులు రావడంతో 366 వత్తులు ఎప్పుడు వెలిగించాలి అనే సందిగ్ధత చాలామందిలో నెలకొంది.వత్తులు వెలిగించాలి అంటే ఉపవాసం ఉండి రాత్రి గల పౌర్ణమి అంటే గురువారం నాడు వెలిగించాలి.అభిషేకాలు చేయించుకోవాలి అంటే సూర్యోదయం పౌర్ణమి తిధి ఉన్నప్పుడు అంటే శుక్రవారం తెల్లవారుఝాము నుండి చేయించుకోవాలి అని పండితుల ఉవాచ.
Tuesday, 6 November 2018
Subscribe to:
Posts (Atom)
