Sunday, 4 July 2021

బోడ కాకర

                                                                                 కాకర కాయలు అనేక రకాలు ఉన్నాకూడా వర్షాకాలంలో కొద్ది రోజులు మాత్రమే  మనకు దొరికే కాయ బోడ కాకరకాయ లేదా ఆకాకర కాయ చాలా  ప్రత్యేకమైనది .దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం.జుట్టు రాలడం,తల నొప్పి తగ్గడంతో పాటు మధుమేహం,రక్తపోటు వంటివి అదుపులో ఉంటాయి.ఈ కాయలతో చేదు లేకుండా నువ్వులు,పల్లీలు,పుట్నాల పప్పుల పొడులు వేసి రకరకాల వంటలు చేయవచ్చు.చాలా రుచిగా కూడా ఉంటాయి.మరెన్నో  ఉపయోగాలు ఉన్న ఈ బోడ కాకరకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.కాయలే కాక ఆకులు,కాడలు,వేర్లు, పువ్వులు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.ఈ ఆకుల పసరు విష జంతువులు,పురుగులు కుట్టిన చోట వచ్చే వాపు,దురదలను తగ్గిస్తుంది.

Saturday, 12 June 2021

మతిమరుపు దరిచేరకుండా ......

                                                                    ప్రకృతి విపత్తులతో వచ్చే ఆర్ధిక ఇబ్బందులే కాక అధిక ఆలోచనలతో వచ్చే ఒత్తిడి కారణంగా వయసుతో  నిమిత్తం లేకుండా చాలామంది మతిమరుపు వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.చిన్నప్పటి నుండి పిల్లలకు ఏ పరిస్థితులను అయినా తట్టుకోనగలిగేలా స్థిరంగా ఆలోచించగలిగే విధంగా,దీనితోపాటు ఆర్ధిక నిర్వహణ కూడా పెద్దలు నేర్పించాలి.అంతే కాకుండా పిల్లలకు సమతులాహారంతోపాటు,సమయపాలనను ,ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటుచేసి పెద్దలు కూడా పాటిస్తూ ఉంటే ఎంత వయసు మీదపడినా ఆలోచనాశక్తి  తగ్గదని,మతిమరుపు రాదనీ పరిశోధనలు తెలియచేస్తున్నాయి.ఏభై సంవత్సరాలు వచ్చినాయంటే ఇంక ఏముంది మా వల్ల ఏమీ కాదు మేము ఏ పనీ చేయలేము విశ్రాంతి తీసుకోవడమే అని అనుకునే వాళ్ళకి మతిమరుపు త్వరగా వచ్చేస్తుందట.హుషారుగా ఉంటూ మేము ఇంకా చిన్నవాళ్ళమే ఏ పనైనా ఇట్టే చేయగలము అనుకునే వాళ్ళకి మతిమరుపు రాకుండా డెభై ఏళ్ళ వయసు వచ్చినా చివరి వరకూ చురుగ్గా ఉంటారట.అందువల్ల మనము అందరమూ హుషారుగా ఉంటూ చకచకా పనులు చేస్తూ ప్రకృతిని,పెద్దలను ప్రేమిస్తూ,గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మంచి మంచి అలవాట్లతో  ఉత్సాహంగా ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆపదలో ఉన్న వారికి చేతనైన  సహాయం చేస్తూ,శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ సంపూర్ణ  ఆరోగ్యంతో మతిమరుపు దరిచేరకుండా పూర్ణ ఆయుషుతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

Sunday, 21 February 2021

నా మాటే శాసనం

                                                                           డెబ్భై సంవత్సరాల రవీంద్ర గారు అంత నాకే తెలుసు అనుకుంటారు.నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అనుకుంటారు .దీనికి తోడు భార్య ఒక నెరజాణ.జ్ఞాని  అనబడే అజ్ఞాని.ఆమె చెప్పిందే వేదం అంటారు రవీంద్రగారు.భర్తను గుప్పెట్లో పెట్టుకుని ఆమెకు ఎవరిపై కోపం ఉంటే వాళ్ళను పోట్లాడమని తను రోట్లో రోటి పచ్చడి చెయ్యడం అలవాటు.వయసు పెరిగినా ఆమెలో ఆ చెడ్డ గుణం పోలేదు. పెద్దవాళ్ళనే  గౌరవంతో ఫోను చేసి మరీ తిట్టినా ఎవరూ ఎదురు చెప్పరు.పెద్దవాళ్ళను ఏమీ అనకూడదు కనుక ఎదురుగా ఏమీ అనలేక  తర్వాత చాటున అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటారు.అది వేరే విషయం.కాలం మారింది మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అని అర్ధం చేసుకోవడం లేదు.పెద్దవాళ్ళుగా మంచి సలహాలు ఇవ్వడం ఎవరికైనా బాగానే ఉంటుంది.ఒక్క రవీంద్ర గారే కాదు పెద్దవారు ఎవరైనా  ప్రతి విషయంలో తలదూర్చి నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అని అనుకోకూడదు.ఎవరికి వారికి వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలూ ఉంటాయి కదా!అందువలన పెద్దలు కూడా ఈ తరం వాళ్ళను అతిగా విసిగించి ఉన్న విలువ పోగొట్టుకోవటం కన్నా అడిగిన వాళ్ళకు సలహాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎదిగితే చివరి దశలో ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు.అప్పుడు అందరూ మనస్పూర్తిగా ఇష్టపడతారు.లేకపోతే వీళ్ళ గోల ఏమిటో?వీళ్ళు ఎప్పుడుపైకి పోతారురా బాబూ? అని కొంతమంది ఎదురు చూస్తుంటారు.కనుక ఈరోజుల్లో పెద్దలే కాదు ఎవరైనా వారి పరిధిలో వారు ఉండడం మంచిది.

జీవితం మన చేతిలోనే

                                                                 పునర్నవి  చిన్నప్పటి నుండి  అతిగా గారాబం చేయడంతో  మొండితనంతో పాటు గర్విష్టి అయింది.ఇంట్లో ఆడింది ఆట,పాడింది పాట కావడంతో అమ్మా నాన్నలకు మా చిట్టి (ముద్దు పేరు) చెప్పిందే వేదం అని డు డు బసవన్నలా తలలు ఊపడం అలవాటు అయిపోయింది.చదువుతోపాటు అదృష్టం కూడా  కలిసి రావడంతో వయసుతో పాటు మహా గర్వం కూడా పెరిగింది.తన స్వార్ధం తన ఎదుగుదల తప్ప వేరే ధ్యాస ఉండదు.ఈ క్రమంలో ఎవరినైనా అణగతొక్కేయ్యడానికి వెనకాడదు.పైకి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించడంతో మంచి అమ్మాయి అనుకుని బుట్టలో పడిపోతారు జనం.ఆమెలో ఉన్న ఇంకొక కోణం అర్ధం చేసుకునేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది.ఎప్పుడూ కాలం ఒకే రకంగా మనకు అనుకూలంగా ఉండదు కదా!అదృష్టం మన ముందు,మన వెన్నంటే ఉంటుందని విర్రవీగి కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుంటే ఆ తలుపు తట్టిన అదృష్టం ఒక్కొక్కసారి వెనక్కు వెళ్ళిపోతుంది. పునర్నవికి ఇప్పుడు  అదే పరిస్థితి ఎదురైంది.  ప్రేమించానంటే మా కూతురు తెలివిగలది కనుక మంచి అల్లుడు వెదకకుండా దొరికాడని అమ్మానాన్న మురిసిపోయారు.పెళ్ళై అత్తవారింటికి వెళ్ళినా నా ఇష్టం నాది నేను ఎప్పుడూ లేచినా ఏమి చేసినా మా ఇంట్లో ఏమీ అనరు అందరూ నేను  చెప్పినట్లు వింటారు మీరు కూడా విని డుడు బసవన్నల్లా తలలు ఊపాలి,నన్ను మా అమ్మా నాన్నలను సవరదీయాలి  అన్నట్లు ప్రవర్తిస్తుండడంతో అత్తింటి వారు సంస్కారవంతులు కావడంతో  కొడుకు ఇష్టపడ్డాడు కనుక మనసు బాధ పెట్టకూడదని,గొడవలు పడకూడదని తనే పద్దతులు తెలుసుకుంటుందిలే అని ఊరుకున్నారు.ఎన్నాళ్లున్నా ఆమెలో మార్పు రాలేదు.దానితో పునర్నవి అత్తింటి వారి మనసులో స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది.అదే అణకువతో ఉంటే ఆమె తలుపు తట్టిన అదృష్టాన్ని  సఫలీకృతం  చేసుకుని అందరి గుండెల్లో నిలిచిపోయేది.ఇది ఒక పునర్నవి విషయమే కాదు.ఈరోజుల్లో నూటికి అరవై మంది గొడవలు పడి విడాకుల వరకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంస్కారవంతులు కాకపోతే తల్లిదండ్రుల పెంపకాన్నే వేలెత్తి చూపుతారు.పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు దానితోపాటు చిన్నప్పటి నుండి బంధాలు,బాంధవ్యాల విలువలు క్రమశిక్షణ,సంస్కారం నేర్పితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.జీవితం అంటే భర్త,భార్య,పిల్లలు మాత్రమే కాదు. భర్త  తరపువారు,భార్య తరపువారు మనమంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతుంది.కుటుంబంతో సంతోషంగా ఉంటే ఆరోగ్యం,డబ్బు కూడా పుష్కలంగా ఉంటాయి.జీవితం ఆనందంగా ఉండాలన్నా,నిస్సారంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది.                           

Monday, 25 January 2021

జాతీయ పండుగ

                                                                 మన భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందరూ  కలిసి కట్టుగా ఉండడమే మన సంప్రదాయం.అందులో మన దేశానికి రెండు కళ్ళు రైతులు,సైనికులు .దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో  ప్రకృతి విపత్తుల వలన కానీ,మానవ తప్పిదాలవలన కానీ  వారికి సరైన  ప్రతిఫలం లభించడం లేదు. ఏది ఏమైనా ఇప్పటి నుండి అయినా  భగవంతుని దయవలన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ,భారతీయురాలిగా పుట్టినందుకు గర్విస్తూ,మన దేశాన్ని ప్రేమిస్తూ మన భారతీయులందరికీ జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.             

తామర గింజలు

                                                           తామర గింజలు మనకు ప్రకృతి ప్రసాదించిన పరమౌషధం అని ఈమధ్యనే  తెలిసింది.ఎప్పుడన్నా ఒకసారి వాడడమే కానీ వీటి ప్రయోజనాలు అంతగా తెలియక పోవడంతో వీటిని ఎక్కువగా వాడుకోము.కానీ వీటిలో ఎన్నో పోషకాలతోపాటు వయసు మీద పడనీయని ఎంజైమ్ పుష్కలంగా ఉండడంతో చర్మం మృదువుగా ఉంటుందట.నిద్రలేమిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుందని,రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును నియత్రణలో ఉంచుతుందని తెలిసింది.దీనిలో కాలరీలు తక్కువ వుండి పీచు ఎక్కువ ఉండడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడంతోపాటు చక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి  దోహదపడుతుంది.వీటిని నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు,కారం చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.ఫూల్ మఖానా అని పిలువబడే వీటిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగించుకోవచ్చు.

Tuesday, 12 January 2021

పెద్ద పండుగ శుభాకాంక్షలు

                                  సంక్రాంతి పండుగ అంటేనే మూడు  రోజుల పెద్ద పండుగ.భోగి,సంక్రాంతి,కనుమ.ఎన్నెన్నో పండుగ సంబరాలు.పిల్లలకు,పెద్దలకు కూడా ఎంతో హడావిడి.ఈ హడావిడిలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు పెద్ద పండుగ అయిన భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.