Thursday, 28 July 2022

చేతనైనంత సహాయం

                                                              గురువారం అమావాస్య రావడంతో ఆషాడ అమావాస్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు వీలయినంతవరకు భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది.పారాయణ చేసుకోవడం కుదరకపోతే చరవాణి లో వింటూ ఎవరి పని వారు చేసుకోవచ్చు.ఈ రోజు దైవ సంబంధమైన శ్లోకాలు విన్నా చదివినా మామూలు రోజుల్లో కన్నా ఎన్నో రెట్లు ఫలితం ఉంటుందని పెద్దలు,పండితుల ఉవాచ.అమ్మవాస్య రోజు పెద్దలను తలుచుకుని ఒక కిలో బియ్యం,అర కిలో చొప్పున రెండు రకాల కూరగాయలు గుడిలో పూజారి గారికి ఇవ్వడం మంచిది.పూజారి గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా భోజనానికి  ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు ఇవ్వగలిగినంత మందికి ఇవ్వవచ్చు.ఈవిధంగా చేసినట్లు అయితే పితృదేవతలు సంతోషపడి మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఉంటారట.అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో రోజులుగా వాయిదా పడిన పనులతో పాటు పిల్లల పెళ్ళిళ్ళు కూడా త్వరగా పూర్తి అవుతాయట.పెద్దలు అనుభవంతో చెప్పడంతో  చాల మందికి తెలిసిన విషయమే అయినా దీన్ని ఆచరించడం వలన మంచి జరుగడమే  కాకుండా కొంతమందికి చేతనైనంత సహాయపడిన వాళ్ళము అవుతాము కదా! మనం ఎదుటివారికి ఎంత సహాయపడితే మనకు అంతకన్నా ఎక్కువ మానసిక ప్రశాంతత లభిస్తుంది.నెలలో ఒకరోజు మనకు వచ్చే ఆదాయంలో కొంచెం ఖర్చుపెట్టి ఈ పద్దతిని ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆచరిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు. 

Saturday, 16 July 2022

పిత్తకాయలు

                                                      పూర్వం రోజుల్లో బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరికి ఒకరు ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఇంటి ఆవరణలో కానీ ,చేలల్లో కానీ కాసిన పండ్లు ,కూరగాయలు తీసుకుని వెళ్ళేవారు.సూర్య ప్రకాష్,శేఖర్ మనస్తత్వాలు వేరయినా ఇద్దరూ మంచి స్నేహితులు.స్నేహితుని ఊరిలో పెళ్ళికి వెళ్తూ శేఖర్ కి ఒక గంప నిండా తన ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కాయలు పక్వానికి వచ్చిన వాటిని కోసి వరిగడ్డిలో పెట్టి మగ్గిన పండ్లను ఎంతో కష్టపడి స్నేహితుని కోసం ప్రేమగా  తీసుకుని వచ్చాడు.మా దొడ్లో మామిడి కాయలు చాలా తియ్యగా ఉండి రుచి బాగుంటుంది అని చెప్పాడు.శేఖర్ ఎవరికీ ఏమీ ఇవ్వడు.ఇచ్చిన వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటాడు.మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు?మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు?అనే మనస్తత్వం.సూర్య ప్రకాష్ వెళ్ళగానే పెట్టె మూత తీసి చూచి కాయలు చిన్నగా ఉన్నాయని భార్యాభర్తలు ఇద్దరూ ఇవి పిత్తకాయలు హిహి హి అన్నారు.అక్కడ  ఉన్న వారికి విషయం అర్ధం కాలేదు.అదేమిటి?మామిడి కాయలు కాదా? అని అడిగారు.మామిడి కాయలే కానీ చిన్న కాయలు వాటిని అలాగే అంటాము అన్నారు.చిన్న కాయలో,పెద్ద కాయలో ఎంతో ప్రేమతో తెచ్చాడు.అందుకు మనం సంతోషపడాలి కానీ విమర్శించకూడదు.ప్రేమ విలువ,మనుషుల విలువ తెలియని వాళ్ళకు ఏదైనా ఇవ్వకపోవడమే మంచిది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పిత్తకాయలు శేఖర్ వాళ్ళు తినరంట.తినకపోతే ఎవరో ఒకరికి తినేవాళ్ళకు ఇవ్వవచ్చు.కానీ గంపను అలా వదిలేస్తే ఎలుక  ఒకటి వచ్చి గంప నుండి రోజుకొక మామిడి కాయ తిని వెళ్తుందట.ఈ విషయాన్ని  ఇద్దరూ  అందరికీ గొప్పగా డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నారు.అందులో స్నేహితుని ప్రేమ,ఆప్యాయత చూడగలిగితే ఆ పని చేసేవాళ్ళు కాదు.తెలిసో తెలియకో దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చెయ్యకండి.చిన్న,పెద్ద అని  కాకుండా ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ముఖ్యం.అది అర్ధం చేసుకుంటే అందరికీ సంతోషం.

Thursday, 26 May 2022

ఉగ్గు గిన్నె - నేతి గిన్నె

                                    రామచంద్రయ్య గారు,సీతమ్మ గారు నడి వయసు దాటిన దంపతులు.ఆయన నవ్వకుండా ఎదుటివారిని నవ్విస్తూ వాళ్ళకు నచ్చినా నచ్చక పోయినా పిచ్చి జోకులు వేస్తుంటారు. పెద్దాయన కనుక నచ్చక పోయినా ఎవరూ ఏమీ అనరు.దానితో నోటికి మూత లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.ఆవిడ ఈయనకు పూర్తిగా వ్యతిరేకం.నెమ్మదిగా నిండు కుండ మాదిరిగా చిరునవ్వే సమాధానంగా హుందాగా ఉంటుంది.ఈ మధ్య ఒక పెళ్ళిలో కనిపించి మనవరాలిని పరిచయం చేసి అమెరికా వెళ్తుందని చెప్పి అమ్మ,అమ్మమ్మల చేతి వంట తింటుంటేనే సన్నగా ఉంది.రేపు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో? ఈ రోజుల్లో పిల్లలు ఉగ్గు గిన్నె - నేతి గిన్నె తిండేగా తినేది అనేశారు.ఆ తిండి ఎవరికీ సరిపోదు కదా!ఆ విధంగా ఉగ్గు గిన్నె-నేతి గిన్నెలను మర్చిపోకుండా అందరికీ గుర్తు చేశారన్నమాట.

Tuesday, 10 May 2022

మొదటి ముద్ద

                                                               ఈ రోజుల్లో చిన్నపెద్ద అనే తేడా లేకుండా మనలో చాలా మందికి ఆకలి మందగించడం లేదా పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించడం సర్వసాధారణం అయిపొయింది.దీనికి అంతటికి కారణం జీర్ణశక్తి మందగించడమే.మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పొడి తయారుచేసుకుని మొదటి ముద్దలో రోజూ తినడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.దీని కోసం మనం శొంఠీ పొడి ఒక చెంచా పిప్పళ్ళ పొడి ఒక చెంచా,దోరగా వేయించి చేసిన వాము పొడి ఒక చెంచా,కరక్కాయ పొడి ఒక చెంచా,సైంధవ లవణం ఒక చెంచా అన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుని రోజూ ఈ పొడి ఒక అర చెంచా,ఒక చెంచా మంచి నెయ్యి కలిపి మొదటి ముద్దలో తింటే ఎటువంటి ఆహారం తిన్నా త్వరగా  అరిగిపోతుంది.దీన్ని ఎవరైనా పది సంవత్సరాలు దాటిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాటించవచ్చు.

Monday, 2 May 2022

మళ్ళీ మళ్ళీ

                                                            గత రెండు మూడు సంవత్సరాల నుండి కరోనా పుణ్యమా అని ఒకరికొకరు కనిపించడం,మాట్లాడుకోవడం లాంటి వాటితోపాటు సంబంధ  బాంధవ్యాలు సరిగా లేకపోవడంతో మొహం వాచిపోయినట్లు కొన్నాళ్ళు అందరూ ఎంతో  ప్రేమ ఆప్యాయతలతో ఉన్నారు.పరిస్థితులు కొద్దిగా చక్కబడేసరికి కొంతమందికి మళ్ళీ తల పొగరు ఎక్కువై ఎదుటి వారంటే చులకన భావం,నిర్లక్ష్యం ఎక్కువైపోతున్నాయి.ఆకలి తీరిన తర్వాత అన్నాన్ని,అవసరం తీరిన తర్వాత మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తే ఆపద వచ్చినప్పుడు ఏదీ అక్కరకు రాదు.ఒక్కొక్కసారి ఎంత డబ్బు ఉన్నా తినడానికి ఏమీ దొరకని పరిస్థితి ఎదురు కావచ్చు.మనుషులు కూడా అంతే. ఆకలి,ఎదుటి వారితో అవసరం మళ్ళీ మళ్ళీ వస్తాయి.అప్పుడు ఏమనుకుని ఏమి ప్రయోజనం?చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది.

Tuesday, 26 April 2022

ఆపత్కాలంలో ........

                                                              ఎవరికైనా అవసరమైనప్పుడు ధన రూపేణా సహాయం చేస్తేనే  సహాయం చేసినట్లు కాదు.ఆపత్కాలంలో మంచి మనసుతో నాలుగు మంచి మాటలు చెప్పి ఎదుటి వారి మనసులో ఉన్న బాధను తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.ఒక్కొక్క సారి ఈ విధంగా చెప్పే వారు కూడా లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది వారితోపాటు కుటుంబాలని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు.కనుక ఆపత్కాలంలో ఏ చిన్న మాట సాయం చేసినా అది వారికి  ఎంతో ఉపయోగపడుతుంది.

Thursday, 21 April 2022

గులాబీ పొడి

                                                                   నాటు గులాబీ పువ్వులు రేకలు తీసి శుభ్రంగా కడిగి నీడలో ఒక పలుచటి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి.రెండు రోజులకు అవి బాగా ఎండిపోతాయి.ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి జల్లించి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఈ పొడితో మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.గులాబీ పొడిని సర్వ రోగ నివారిణిగా చెప్పవచ్చు. 

                                                                ఒక కప్పు మరిగించిన నీళ్ళల్లో ఒక 1/4 చెంచా గులాబీ రేకుల పొడి వేసి ఒక ని.ఆగి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపితే గులాబీ టీ తయారయినట్లే.దీన్ని రోజుకి ఒకసారి తీసుకుంటే ముఖ వర్చస్సు పెరగడమే కాక శరీరాన్ని కూడా శుద్ది చేస్తుంది.

                                                             కొద్దిగా చల్లారిన పాలల్లో సరిపడా గులాబీ పొడి కలిపి పెదవులపై రాస్తే పెదవులు పొడిబారటం తగ్గుతుంది.కొద్దిగా పాలు, మంచి గంధం పొడి,గులాబీ పొడి కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక 20 ని. తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మృదువుగా,మెత్తగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది.రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గులాబీ పొడి వేసుకుని  స్నానం  చేస్తే  చర్మం నిగనిగలాడడమే కాక చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా  ఉంటాయి.