Monday, 28 September 2020

నూనె,తీపి లేని కాకరకాయ కారం

                                                         ఒక కిలో తాజా కాకరకాయలు తీసుకుని ఉప్పు,పసుపు వేసి శుభ్రంగా కడిగి చక్రాల్లా ముక్కలు కోసి గల గలలాడేలా ఎండలో పెట్టాలి.నేను ఒక 8 గంటలు డీహైడ్రేటర్(పండ్లు,ఆకుకూరలు,కూరగాయల లోని తేమ లాగేసి ఎండి పోయేలా  చేసే పరికరం) లో పెట్టాను.ఏ కూరగాయ పెట్టినా ఒక కిలోకి 200 గ్రా. లు వస్తాయి. 

తయారీ విధానం :

ఎండిన కాకరకాయ ముక్కలు - 200 గ్రా. 

ఎండు మిర్చి - 15 

నువ్వులు - 1 పెద్ద చెంచా 

మినప గుళ్ళు - 1 పెద్ద చెంచా 

పచ్చి శనగ పప్పు - 1 పెద్ద చెంచా 

ధనియాలు - ఒక పెద్ద చెంచా

జీరా - ఒక పెద్ద చెంచా 

మెంతులు  - ఒక 1/4 చెంచా 

వెల్లుల్లి - 1 పెద్దది

ఉప్పు - రుచికి సరిపడా 

                                                          పొయ్యి వెలిగించి మందపాటి బాణాలి పెట్టి వెల్లుల్లి తప్ప అన్నీ నూనె లేకుండా తక్కువ మంటపై రంగు వచ్చే వరకు విడివిడిగా వేయించుకోవాలి.కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పప్పులు,ధనియాలు,జీరా,మెంతులు వేసి పొడి చేసిన తర్వాత ఎండు మిర్చి వేసి పొడి చేసిన తర్వాత నువ్వులు వెయ్యాలి.ఈ పొడిని ఒక పళ్ళెంలో వేసి ప్రక్కన పెట్టుకోవాలి.కాకరకాయ ముక్కలు,ఉప్పు వేసి  పొడి  చేసి వెల్లుల్లి రెబ్బలు వెయ్యాలి.దీనిలోప్రక్కన పెట్టుకున్న పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వెయ్యాలి.అంతే మంచి సువాసనతో నోరూరించే నూనె,తీపి లేకుండా చేసే కాకరకాయ పొడి తయారయినట్లే.దీనిని వేడి వేడి అన్నంలో కానీ,ఇడ్లి,దోసె పై కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.అసలు చేదు ఉండదు.ఇది నేను తయారు చేసే పద్ధతి.నువ్వుల బదులు పల్లీలు లేదా రెండు కూడా వేసుకోవచ్చు.ఎవరికి నచ్చిన రీతిలో వారు చేసుకోవచ్చు.ఒకసారి ప్రయత్నించి చూడండి. 

గమనిక :చింత పండు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.నేను వెయ్యలేదు.అయినా చేదు లేకుండా  చాలా బాగుంది.కాకరకాయ కారం రుచికి రుచి ఆరోగ్యానికి ఎంతో మంచిది.రోజూ ఒక చెంచా అయినా తినడం మంచిది.

Thursday, 10 September 2020

తగిన గుణపాఠం

                                                     మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఒకరోజు హిమ పని వత్తిడిలో ఉండగా పొరుగింటి నుండి పెద్ద పెద్ద కేకలు వినిపించగా ఏమి జరిగిందోనని అటు చూడగా అక్కడ ఒక పెద్దావిడ నిలబడి కంగారుగా ఏదో చెప్తుంది.ఇంటావిడ అదేమీ వినిపించుకోకుండా అసలు  నువ్వు మెట్లు ఎక్కి పైకి రావడమేమిటి ? వెళ్ళిపొమ్మని కేకలు వేయడం మొదలెట్టింది.తర్వాత పది ని.లకు హిమ ఇంటి గంట మ్రోగింది.హిమ భర్త వెళ్ళగా ఒక పెద్దావిడ వాళ్ళాయన కళ్ళు తిరిగి పడిపోయాడని ఆసుపత్రిలో కూతుర్ని ఉంచి వచ్చానని ఏదైనా సహాయం చెయ్యమని అడిగింది.ఒక వంద రూపాయలు ఇచ్చి పంపించు అని చెప్తే హిమ ఇచ్చి వచ్చింది.హిమ ఇంటి పై అంతస్తుల్లో ఉన్న ఇళ్ళకు వెళ్ళవద్దు.పైకి వెళ్ళకూడదు అని చెప్పినా వినకుండా డబ్బు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అడిగితే పోయేదేముంది అంటూ  వాళ్ళను కూడా అడుగుతాను అంటూ ఆయాసపడుతూ పైకి వెళ్ళింది.హిమ పనిమనిషి రోజాకు రోజూ వేడివేడిగా అన్నం కూరలు ఇచ్చే అలవాటు.ఆరోజు కూరలు ఇచ్చింది కానీ అన్నం పెట్టి ఇద్దామనుకునేలోపు ఏదో చిరునామా కోసం చరవాణికి భర్త ఫోను చెయ్యడంతో ఆ విషయం మర్చిపోయింది.రోజా వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పింది కానీ హిమకు గుర్తులేదు.భర్త ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేద్దామని చూచినప్పుడు అయ్యో రోజాకి ఈరోజు అన్నం పెట్టడం మర్చిపోయాను అని నొచ్చుకుని కొడుకును పంపమని ఫోను చేస్తే ఫోను కలవలేదు.సరే సమయానికి పెద్దావిడ వచ్చింది కదా!అని భోజనం ఇవ్వనా?అని అడిగితే సంతోషంగా తీసుకెళ్ళి ముసలాయనకు పెడతానని చెప్పడంతో అన్నీ  చక్కగా డబ్బాలో సర్ది ఇంట్లో రెండు రకాల పండ్లు ఉంటే అవి కూడా ఒక సంచిలో సర్ది ఇచ్చింది.మీ ఋణం ఎలా తీర్చుకోవాలి ? అంటూనే అద్దె ఇల్లా ?స్వంత ఇల్లా ?అద్దె ఎంత ? ప్రశ్న,సమాధానం కూడా తనే చెప్పుకుని 10,20,30 వేలా తనలో తనే అమ్మో అంత డబ్బు కట్టగల్గుతున్నారా? ?అని  ఆరాలు మొదలెట్టింది.ఆపదలో ఉన్నానంటే తలా ఒక వంద ఇచ్చిన డబ్బులు,ఒక పూట భోజనము చేతిలో కనపడేసరికి ఉబ్బితబ్బిబ్బై ఎవరితో ఏమి మాట్లాడుతుందో కూడా తెలియకుండా మాట్లాడేసరికి అంతకు ముందు ఆమె తీరుకు ఇప్పటి మాట తీరుకు హిమ ఆశ్చర్యపోయింది.ఇంతలోనే ఎంత మార్పు అని మదిలో అనుకుని హిమ ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం పెట్టి వెళ్ళమని సైగ చేసి తలుపు వేసి లోపలకు వచ్చింది.చిన్నబోయిన మోముతో లోపలకు వచ్చిన హిమను ఏమి జరిగిందని భర్త అడిగితే విషయం చెప్పగానే కనపడిన వాళ్ళందరిని చూచి జాలిపడితే ఇలాగే ఉంటుంది.ఏదో డబ్బు సహాయం చేశావు.ఊరుకోకుండా పిలిచి వేడివేడిగా భోజనం ఇచ్చినందుకు తగిన గుణపాఠం చెప్పింది.భవిష్యత్తులో ఇటువంటి పనులు చెయ్యకూడదని గుర్తుపెట్టుకోదగిన అనుభవం ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి అన్నారు. 

Saturday, 5 September 2020

నమస్సుమాంజలి

                                                  గురువు అంటే జ్ఞానాన్ని పంచేవారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారే కాకుండా మానవతా విలువలు,లోకం పోకడ,మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పే ప్రతి ఒక్కరూ గురువులే.పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లి.తర్వాత తండ్రి.తర్వాత పెద్దలు,మిగిలినవారు.పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు వచ్చేటప్పటికి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులది.మంచి పౌరులుగా తయారవడానికి మన వెనుక ఇంతమంది కృషి ఉండబట్టే మనం సమాజంలో మనగలుగుతున్నాము.అది గుర్తు పెట్టుకుని మనం ఈ ఒక్కరోజే అని కాకుండా ప్రతి రోజు జీవితంలో వీళ్ళందరినీ మరువకూడదు.గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్  పర బ్రహ్మ తస్త్మై శ్రీ గురవే నమః అంటూ గురు పూజోత్సవం సందర్భంగా నాకు మంచి బుద్ధులు నేర్పించిన నా తల్లిదండ్రులకు,పెద్దలకు, విద్యను నేర్పిన ఉపాద్యాయులకు,ఆధ్యాత్మిక విలువలను నేర్పే  గురువులకు నమస్సుమాంజలి.నా బ్లాగ్ వీక్షకుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.  

Tuesday, 25 August 2020

హడావిడిగత్తె

                                                       మాన్సి ఏ పని చేసినా త్వరత్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో హడావిడి పడుతూ ఉంటుంది.ఎప్పుడూ సక్రమంగానే చేస్తుంది.ఒక్కొక్కసారి ఆ హడావిడిలో వంట చేసేటప్పుడు ఒకటి చెయ్యబోతే ఇంకొకటి అవుతుంది.మళ్ళీ దాన్ని వృధా కాకుండా ఏదో ఒకటి చేసి ఆ పదార్ధాన్ని రుచిగా తయారు చేస్తుంది.అది వేరే విషయం అనుకోండి.ఈరోజు కూడా అలాగే చేసింది.ముడి గోధుమ రవ్వ ఉప్మా  చేద్దామని మొదలు పెట్టింది.అన్నీ సిద్దం చేసుకుని పొయ్యి మీద బాండీ పెట్టి తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చి మిర్చి,అల్లం ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మూతపెట్టి రవ్వ తీసుకునే  లోపు ఎవరో పిలిస్తే వెళ్ళింది.మళ్ళీ వచ్చి నీళ్ళు పోసి మూతపెట్టింది.నీళ్ళు మరుగుతుండగా గ్యాస్ బండ వచ్చింది.ఈ క్రమంలో సరుకుల సంచిలో నుండి ఒక పొట్లం తీసి ఒక కప్పు నీళ్ళల్లో పోసి వేరే పనిమీద వెళ్ళింది వచ్చేసరికి మెత్తగా ఉడక వలసింది  పోయి ఎలా పోసినది అలాగే  నీళ్ళల్లో మరుగుతుంది.హడావిడిలో నీళ్ళు ఎక్కువ పోశానేమో అనుకుని బొంబాయి రవ్వ కాస్త పోసింది.అయినా గట్టిపడలేదు.అప్పుడు రెండు గుప్పెళ్ళు అటుకులు కడిగి పోసింది.ఇంకా పలుచగానే ఉండడంతో మంట పెద్దది చేసి కాస్త దగ్గరపడిన తర్వాత పొయ్యి కట్టేసింది. భర్తకు పెట్టింది.అయన నోట్లో పెట్టుకుని ఇదేమిటి గట్టిగా నమలవలసి వస్తుంది.నువ్వుల రుచిగా ఉంది.నువ్వుల ఉప్మా చేసావా ఏమిటి ? అనగానే మాన్సి తెల్లబోయి గోధుమ రవ్వ వేసాను కదా! అని రుచి చూసింది.అది నిజంగానే నువ్వుల ఉప్మా.రుచిగానే ఉంది కానీ నువ్వులు వేడి అని ఎవరూ ఉప్మా చేసుకోరు.సరేలే వేరే పదార్ధం చేసే  సమయం లేదు కనుక ఈరోజుకి తినండి మజ్జిగ తాగితే వేడి తగ్గిపోతుందని ఇంట్లో వాళ్ళకు సర్ది చెప్పింది మాన్సి.రుచి బాగుందంటూ ఒకరు,మనసులో తిట్టుకుంటూ ఒకరు తిన్నారు.పని మనిషి అయితే మీరు ఏమి చేసినా బాగుంటుంది అమ్మా అంటూ  లొట్టలేస్తూ తినేసింది.ఏ మాటకామాటే కానీ నిజంగానే రుచిగా ఉంది.అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్లు గోధుమ రవ్వ ఉప్మా బదులు నువ్వుల ఉప్మా అయింది.మాన్సి  కూడా నువ్వుల లడ్డు చెయ్యడమే కానీ  ఉప్మా ఎప్పుడూ చెయ్యలేదు.అందుకే చిన్నప్పుడు మాన్సి  ని స్నేహితులు హడావిడిగత్తె అని ఆట పట్టించే వాళ్ళు.  పై సంఘటన తలచుకుని మాన్సి తను చేసిన పనికి తనే గుర్తొచ్చినప్పుడల్లా  రోజంతా నవ్వుకుంటూనే ఉంది.                                    

Wednesday, 12 August 2020

జవ్వ గోధుమ రవ్వ అటుకుల పాయసం

 జవ్వ గోధుమ రవ్వ  - 1 కప్పు 

అటుకులు  - 1/2 కప్పు 

  పాలు - 1 1/2 కప్పు  

నీళ్ళు  -  3 కప్పులు 

 బెల్లం  - 1  కప్పు 

 పంచదార - 1/2 కప్పు 

 నెయ్యి - 3  చెంచాలు 

జీడిపప్పు  - చిన్న ముక్కలు 2 చెంచాలు 

ఎండు ద్రాక్ష  -  8 

యాలకుల పొడి  - 1/4 చెంచా  

                                                        ముందుగా పొయ్యి వెలిగించి బాణాలి పెట్టి వేడెక్కాక 1 1/2 చెంచా నెయ్యి వేసి జవ్వ గోధుమ రవ్వ వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.దాన్ని ఒక గిన్నెలో పోసి అదే బాణలిలో అటుకులు వేయించాలి.వీటిని కూడా ఒక చిన్న గిన్నెలో పోసి అదే బాణాలిలో బెల్లం,పంచదార వేసి కొంచెం నీళ్ళు పోసి కరిగాక వడపోసి ప్రక్కన పెట్టుకోవాలి.అదే బాణలిలో పాలు,మిగిలిన నీళ్ళు పోసి మరిగాక రవ్వ వేసి బాగా ఉడికించాలి.కొంచెం రవ్వ మెత్తగా ఉడికాక వేయించిన అటుకులు వేసి ఉడికాక నేతిలో  వేయించుకున్న  జీడిపప్పు,ఎండు ద్రాక్ష యాలకుల పొడి వేసి బాగా కలిపి పొయ్యి కట్టేసి దింపేయాలి.అంతే ఎంతో మధురమైన జవ్వ గోధుమ రవ్వ అటుకుల పాయసం తయారయినట్లే.

సూచన : ఈ పాయసం మరీ దగ్గరగా అయ్యేవరకు ఉంచితే గట్టిపడుతుంది కనుక కొంచెం దగ్గర పడుతున్నప్పుడే తీసేస్తే తినడానికి చాలా రుచిగా బాగుంటుంది.రవ్వ గట్టిగా అయిపోతుంది కనుకే మనం అటుకులు వేస్తే బిగుసుకోకుండా ఉంటుంది.నెయ్యి కానీ తీపి కానీ ఎక్కవ తినేవాళ్ళు మీకు అవసరమైనంత వేసుకోవచ్చు.

                                                           

Tuesday, 7 July 2020

రజాయిలో అక్కీ

                                       అఖిల్ మూడేళ్ళ బాబు.అక్కీ ముద్దు పేరు.అందంగా ముద్దుముద్దుగా మాటలు చెప్తూ ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తుంటాడు.దానికి తోడు అల్లరి,ఆటలు ఎక్కువ.రోజంతా అమ్మకి  వాడితోనే సరిపోతుంది.అమెరికాలో ఉండడంతో అక్కీకి అమ్మానాన్నే లోకం.ప్రపంచ వ్యాప్తంగా నిర్భంద సమయంలో ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో నుండి పనిచేయడంతో అక్కీ  బాగా అల్లరి చేస్తుంటే అక్కీ అమ్మ దివ్య కోప్పడింది.దానితో వాడికి కోపం వచ్చింది.అమ్మేమో కార్యాలయం పనిలో పడి అక్కీని గమనించలేదు.వాడి సంగతి ఒక అరగంట మర్చిపోయింది.కాసేపటికి అక్కీ ఎక్కడ ఉన్నాడో?ఏమి చేస్తున్నాడో ? అని కంగారుపడి అక్కీ అమ్మ దివ్య ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు.మోటారు వాహనాలు పెట్టే గది తలుపు తెరిచి ఉండడంతో బయటికి వెళ్ళాడేమోనని చుట్టుప్రక్కల అంతా వెతికినా కనపడకపోయేసరికి అమ్మ ఒకటే ఏడుపు.స్నేహితులు అందరూ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చారు.అందరూ కలిసి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. సి సి టి.వి పుటేజిలో చూస్తే అక్కీ బయటకు వెళ్ళినట్లు కనిపించలేదు.అందువల్ల ఇంట్లోనే ఉండి ఉండవచ్చని నిర్ధారించుకుని ఇల్లంతా వెతుకుతుంటే పడకగదిలో మంచం మీద మందంగా ఉన్న రజాయి (కంఫర్టర్) లో దూరి నిండా ముసుగు వేసుకుని నిద్రపోతున్నాడు.మొట్టమొదటే వాళ్ళ నాన్న రజాయిని లాగి చూచినా ఆ కంగారులో చిన్నవాడు కదా!కనిపించలేదు.అందరూ రెండు గంటలు నానా హైరానా పడి వెతికి అమ్మ క్రింద పడి పొర్లి పొర్లి ఏడ్చిన తర్వాత చిట్ట చివరకు ఇంట్లోనే ఉండడంతో అందరూ సంతోషించారు.అక్కీ ఎందుకు ఇలా చేశావు? అని అడిగితే నువ్వు తిట్టావు అందుకే కోపం వచ్చి నిద్రపోయాను అని చెప్పడంతో వేలెడంత లేడు.వీడికి అప్పుడే కోపం అంటూ అంతవరకు పడిన కంగారు మర్చిపోయి తేలిక పడిన మనసుతో హాయిగా నవ్వుకున్నారు. 

Monday, 6 July 2020

భలేగున్నవు సాయి

                                                              మహా అయితే గురు పౌర్ణిమ సందర్భంగా వీలయితే గుడికి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటాము.సహజంగా ఇంట్లో పూజ చేసుకుంటాము.ఇంకా చెయ్యగలిగితే  రక రకాల పిండి వంటలు చేసి నివేదన పెడతాము.కానీ నిన్న గురు పౌర్ణమి మాత్రం నా జీవితంలో మర్చిపోలేనిది.ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావడమే కానీ హారతులు అంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టగూడదు అనే ఉద్దేశ్యంతో   ఆ సమయంలో వెళితే గంట పడుతుంది అని తప్పించుకునేదాన్ని.ఈమధ్య నిర్భంద కాలంలో ప్రవచనాలు వినడంతో  సాయి హారతుల వలన మన కర్మలు తొలగుతాయని తెలిసింది.కరోనా సమయంలో రక్షణ కోసం పౌర్ణమి,అమావాస్య తిధుల్లో చేసుకోవలసిన పూజలు,హోమాలు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్లో సాయి సర్వస్వం లైవ్ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోమనడంతో నచ్చి ఆచరించడం జరిగింది.దీనితో సమయపాలన,క్రమశిక్షణ అలవడింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సాయి సర్వస్వం వాళ్ళదే ద్వారకామాయి టి.వి ద్వారా లైవ్ లో నిన్నటి గురుపుజోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించడంతో చక్కగా పనులు చేసుకుంటూనే అన్ని హారతులు,అభిషేకాలు,స్వర్ణ పుష్పాలతో స్వర్ణ పాదుకల పూజ,యంత్ర పూజ,బాబా అష్టోత్తర శతనామావళి,సాయంత్రం నక్షత్ర హారతి,సాయికి పూలాభిషేకమ్ అన్ని చక్కగా చూడడం జరిగింది.ఇంతకీ విశేషం ఏమిటంటే మిగతా అన్ని సేవల్లో ఇంతకు ముందు పాల్గొన్నా కానీ ఐదు రకాల కేరళ పంచ వాయిద్యాలతో ఇరవై ఏడు రకాల నక్షత్ర హారతులు చూడడం,గురూజీ హారతులు ఇచ్చే విధానం అత్యంత అధ్భుతం.చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఒళ్ళంతా పులకించిపోయింది.భలేగున్నవు సాయి అంటూ పాట పడుతూ చేసే పూలాభిషేకం ఎంతో మధురం.ఆ పాట అంటే నాకూ చాలా ఇష్టం.ఏడు రోజులు ఏడు రకాల పువ్వులు తెస్తాం అంటూ లయబద్దంగా పాడుతూ ఉంటే    వింటూ బాబాను చూస్తూ భలేగున్నవు సాయి అనుకుంటూ ఆనందోత్సాహాలలో తేలియాడుతూ మానసికంగా చిన్నపిల్లలా గంతులు వేసినంత ఆనందం కలిగింది.సాయి అనుగ్రహం లేనిదే ఆయన దర్శనానికి కూడా వెళ్ళలేమని మనకు అనుభవమే కదా!టి.వి ఎక్కువగా  చూడని నేను నిజంగా సాయి అనుగ్రహంతోనే  ఈరోజు కుదురుగా కూర్చుని చూడగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ సాయికి,గ్రాండ్ మాష్టర్ సాయికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను.