Friday 23 June 2017

బొచ్చెలో బొమ్మరాయి

                                                                               అరవై సంవత్సరాల నాగమణి ఒక్కగానొక్క కోడలు పరమ గయ్యాళి.ఒక్క రోజు కూడా ఆరోగ్యం బాగుండకపోయినా పళ్ళెంలో అన్నం పెట్టి ఎరుగదు సరికదా!ఇంటెడు పని అంటే బట్టలు ఉతికి,గిన్నెలు తోమి ఇల్లు తుడిచి,వంట చేయడంతోసహా నాగమణి చెయ్యాల్సిందే.నాగమణి కోడలు మాత్రం ఊరు మీద బలాదూరుగా ఇంటింటికి తిరిగి కబుర్లు చెప్తూ ఉంటుంది.అయినా ఎవరితో చెప్పుకోకుండా నా కోడలు బంగారం అని చెప్పుకుంటుంది.ఇంటెడు చాకిరీ చేసి పెట్టినా కోడలు ఒకసారి నాగమణిపై కోపం వచ్చి అన్నం సరిగా పెట్టకుండా ఇంటి పైనున్న గదిలో నిర్బందించింది.దానితో ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మకు,తమ్ముళ్ళకు సమాచారం అందించి ఇక్కడే వుంటే మీ ఇంటి ఆడపడుచు ఎక్కువ రోజులు బ్రతకకపోవచ్చు.చిక్కి శల్యమైపోయింది.మీ ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో వెళ్ళి తీసుకుని వచ్చారు.ఒక పదిరోజులు గడిచేసరికి కాస్త ఓపిక వచ్చి అమ్మతో కలిసి మరదళ్ళపై పెత్తనం చేయడం మొదలు పెట్టింది.ఒక్కో తమ్ముడి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉంటే ఏమి మాట్లాడినా,ఏమి చేసినా మర్యాద కోసం ఓపిక పట్టారు.తర్వాత చిన్న మరదలు మీవంట చాలా రుచిగా ఉంటుంది అంటూ ఇద్దర్నీ వంటగదికి పరిమితం చేసింది.పెద్ద మరదలుకు సంస్కారం అడ్డువచ్చి తానే అన్నీవేళకు అందించడంతో పైత్యం ప్రకోపించి భోజనం చేసి తిన్న పళ్ళేలు కడగమని తెచ్చి చేతిలో పెట్టడం మొదలు పెట్టారు.ఒకరోజు పెద్ద కోడలు చెల్లెలు అక్క దగ్గరికి వచ్చింది.ఈ తతంగం అంత చూచి ఈరోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు వున్నారా?అని ఆశ్చర్యపోయి ఆమె కోడలు పళ్ళెం కడగడం మాట దేముడెరుగు కనీసం ఒక్క రోజైనా బొచ్చెలో బొమ్మరాయి కొట్టలేదు కానీ ఇక్కడ పళ్ళేలు కడగమనడం ఎంత వరకు సమంజసం?ఎవరి పళ్ళెం వాళ్ళు కడుక్కొనే రోజుల్లో నువ్వే వాళ్ళను కూర్చోబెట్టి అనవసరంగా నెత్తికెత్తుకుని నువ్వు హైరానా పడుతున్నావు?నువ్వు అనుకున్నట్లు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు.వాళ్ళల్లో మార్పు రాదు నువ్వే మారాలి అని నువ్వు ఒక వారం రోజులు ఎటైనా వెళితే నేను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా సరైన మార్గంలో పెడతాను టూ  అక్కకు జ్ఞానబోధ చేసింది.

No comments:

Post a Comment