Friday 21 October 2016

దోమ కటాక్షం

                                                               శ్రావణ మాసంలో అందరినీ లక్ష్మీ దేవి కటాక్షిస్తే మీనాక్షిని
మాత్రం దోమ కటాక్షించింది.ఒకరోజు మీనాక్షిని డెంగ్యు దోమ కుట్టింది కాబోలు డెంగ్యు వైరస్ శరీరంలో ఉండటంతో రెండు వారాల తర్వాత దాని ప్రభావం బయటపడి విపరీతమైన తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,జ్వరం వచ్చింది.ఈలోగా కృష్ణా పుష్కరాలు రావటంతో ఒక పాతికమంది బంధువులు మూడురోజులు ఇంటికి రావటంతో నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బడలిక వలన ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయానుకుని ఒక మాత్ర వేసుకుని నిద్రపోయేది.డెంగ్యు జ్వరం వచ్చినప్పుడు చిన్న పుట్టుమచ్చ శరీరంపై ఎక్కడో ఒకచోట కనిపిస్తుందట.ఆవిషయం మీనాక్షికి తెలియదు.పాదంపై ఒక చిన్నమచ్చ కనపడితే ఏదో కాలికి గుచ్చుకుని ఉంటుందిలే అనుకుని పట్టించుకోలేదు.నాలుగు రోజులకు ఒళ్ళు నొప్పులు,జ్వరం తగ్గిపోయింది.మళ్ళీ ఒక ఇరవై రోజులకు ఆసుపత్రిలో ఉన్న బంధువులకు భోజనం పంపవలసి వచ్చింది.వాళ్ళ పని పూర్తయిన తర్వాత జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే పని ఒత్తిడి వలన అనుకుంది.నాలుగు రోజులైనా తగ్గక పోయేసరికి వైద్యుని వద్దకు వెళ్ళింది.వైద్యుని ఎదుటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయినంత పని అయింది.బి.పి. చాల తక్కువగా ఉందని క్రింద పడిపోయే అవకాశం ఉన్నందున అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఉండమన్నారు.అప్పటి నుండి ప్రత్యక్ష నరకం మొదలయింది.ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని రక్తం తీసుకోవడానికి సూదులతో పొడవడం,సెలైన్ తోపాటు ఇంజెక్షన్ లు పది రోజులకు కానీ ఇంటికి చేరలేదు.తెలిసి తెలిసి అద్దోయితం లాగ మొదటే వైద్యుని దగ్గరకు వెళ్తే ఈ తిప్పలు తప్పేవి.మొదట అశ్రద్ద చేయటం వలన వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళకపోవటంతో అన్ని లెవెల్స్ హెచ్చు స్థాయికి చేరాయి.అదృష్టం ఏమిటంటే ప్లేట్ లెట్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.ఆ పదిరోజులు నరకం తర్వాత సాధారణ స్థితికి రావటంతో మీనాక్షి కొద్దిగా కుదుటపడింది.ఇంటికి వచ్చిన పదిహేను రోజులకు కూడా  ఆ నీరసం వదలలేదు.అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళమని అందరికీ సలహాలిచ్చే మీనాక్షి కే ఊహించని వింత అనుభవం ఎదురయింది.ఇదంతా దోమ కటాక్షం.

No comments:

Post a Comment