Thursday 28 August 2014

మట్టి వినాయకుడు

                                   స్వప్నిక ఇంట్లో మూడుతరాల ముందునుండి మట్టి వినాయకుడినే పూజిస్తారు.వాళ్ళింట్లో చిన్నవాళ్ళు,పెద్దవాళ్ళు కూడా ఊరిలో ఉన్నా,సిటీలో ఉన్నా అదే పద్ధతి పాటిస్తారు.ఇప్పటికీ స్వప్నిక స్వంతఊరిలో అందరికీ ఒక కుటుంబం తరతరాలుగా మట్టితో విఘ్నేశ్వరులను తయారుచేసి ఇంటింటికీ వచ్చి ఇచ్చివెళ్ళే సంప్రదాయం కొనసాగుతుంది.కొంతమంది ముచ్చటపడి సహజరంగులద్దిన విగ్రహాలను తెచ్చుకున్నాముందుగా
ఊరిలో తయారుచేసిన మట్టివినాయకుడిని విధిగా పూజించిన తర్వాతే ఏదైనా చేస్తారు.1,3,5,9 రోజులు ఎవరివీలుని
బట్టి వాళ్ళు పూజలు చేసి తర్వాత మట్టి వినాయకుడ్నిపంటలు బాగా పండుతాయనే నమ్మకంతో పెద్దవాళ్ళు  పొలాల్లో పెట్టివస్తారు.21 రకాలపత్రి పారుదల నీళ్ళల్లో వదిలేస్తారు.ఊరిలో అయితే పెద్దవాళ్ళు పిల్లలకు ఏపత్రి ఏదని
తెలియటానికి పెరటిలో ఉన్నవి,బయటనుండి సేకరించి  ఇంటికి తీసుకురమ్మనేవాళ్ళు.పిల్లలు కూడా ఉత్సాహంగా
కాయలతోసహా కొమ్మలు తెచ్చేవాళ్ళు.వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా సందడే సందడి.సాయంత్రమైతే
ఆడవాళ్ళందరూ కలిసి ఒక ఇంటినుండి బయలుదేరి అందరి ఇళ్ళకు వెళ్ళి దైవదర్శనం చేసుకుని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు.వదినామరదళ్ళయితే పల్లేరుకాయలు(ముళ్ళుతేలికగా గుచ్చుకుంటాయి)నడిచేదారిలోవేసి దురదగుండాకు(తగిలితే దురద వస్తుంది) తెచ్చి ఒకరినొకరు ఆటపట్టించుకునేవాళ్ళు.
                                     ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తెచ్చి పూజించి నదుల్లో వదిలేస్తే నీళ్ళు కలుషితమవటమే కాక,చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అనారోగ్యాలబారిన పడుతున్నారు.కనుక పర్యావరణ పరిరక్షణ కోసం మనందరమూ మట్టి వినాయకుడిని పూజించి తరిద్దాం.ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో పూజ చేశామన్నది ముఖ్యం.అందుకని మనం కూడా మనవంతుగా మంచిపని కోసం ఒక చెయ్యేద్దాము.

  

No comments:

Post a Comment