Tuesday 24 February 2015

తోడుదొంగలు

                                                            నేహ,స్నేహ అక్కచెల్లెళ్ళు.ఇద్దరూ హైస్కూల్లో చదువుతున్నారు.వీళ్ళ అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా ఎవరిపనులకు వాళ్ళు వెళ్తుంటారు.నానమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది కనుక చరవాణి ఉంటుంది.అక్కచెల్లెళ్ళు పాఠశాలనుండి వచ్చినదగ్గరనుండి ఆపకుండా చరవాణితో స్నేహితులతో మాట్లాడటం మొదలుపెట్టారు.ఆవిషయం నాన్నకు అసలు తెలియదు.అమ్మకు తెలిసినా పట్టించుకోదు.ఆమె అత్తగారు ఎవరితో ఎంతసేపు మాట్లాడారో అని చరవాణిలో వెతుకుతుంది కానీ పిల్లలు ఏమిచేస్తున్నారో అనే ఆలోచన లేదు.ఒకరోజు ఎందుకో మెసేజ్ లు చూస్తుంటే పెద్ద అమ్మాయి స్నేహితురాలు నీ పుట్టినరోజుకు అన్నయ్యను పిలుస్తున్నావా?అంటూమెసేజ్ పంపింది.పెద్దమ్మాయిని అడిగితే తడబడింది.రేపటినుండి చరవాణి తీసుకుంటే ఊరుకోను అంటూ కోప్పడింది.ఇంతలో చిన్నమ్మాయి వచ్చిఅక్కను అడగటమేమిటి?ఆపిల్లకు టైపు చెయ్యటం రాక "అనన్య బదులు అన్నయ్య"అని పంపింది.ఈమాత్రం దానికి కోప్పడటమేమిటి అంటూ అమ్మమీద గయ్ మంటూ అరవటం మొదలెట్టింది.ముందు నువ్వునోరుముయ్యి ఇద్దరూ తోడుదొంగలు.నువ్వు వెనకేసుకురావాల్సిన అవసరమేమిటి?అంటూ మొదటిసారి తిట్టింది.ఇంతకీ వాళ్ళ నుండి అసలు విషయం రాబట్టలేకపోయింది.పదో తరగతి చదివే అమ్మాయికి టైపు చెయ్యటం రాదా?మొదటినుండి వదిలేసి ఇప్పుడు అనుకుని ప్రయోజనంఏమిటి?.తెలిసీ  తెలియని వయసు  పిల్లల ప్రవర్తన ఎలా వుంటుందో గమనించాల్సిన భాద్యత తల్లిదండ్రులది.ఈరోజుల్లో ఎంత డబ్బు కూడబెట్టి ఇచ్చామన్నది ముఖ్యం కాదు.పిల్లల్ని ఎంత మంచి పౌరులుగా,సంస్కారవంతులుగా తయారు చేశామన్నది ముఖ్యం.పిల్లలపై మరీ ఆంక్షలు పెట్టకుండా వాళ్ళని గమనిస్తుండాలి.     

No comments:

Post a Comment